1. బాబా కృపతో కాలేజీలో సీటు - అందరికీ ఆరోగ్యం
2. స్మృతిమాత్ర ప్రసన్నులు బాబా
3. డబ్బుల విషయంలో స్పష్టత వచ్చేలా చేసిన బాబా
బాబా కృపతో కాలేజీలో సీటు - అందరికీ ఆరోగ్యం
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక చిన్న సాయిభక్తురాలిని. నేను రోజూ ఈ బ్లాగులో వచ్చే అనుభవాలు చదువుతూ ఉంటాను. ఈ బ్లాగ్ వలన నేను బాబాకి చాలా దగ్గరయ్యాను. బ్లాగులో వచ్చే బాబా సందేశాల వలన నాకు బాబాపై విశ్వాసం, నమ్మకం పెరిగాయి. బాబా నా జీవితంలోకి వచ్చిన తరువాత ఎన్నో అద్భుతాలు చేశారు. వాటిని పంచుకోవడం ఇది రెండవ సారి.
మొదటి అనుభవం: నేను నా మొదటి అనుభవంలో నా ఎంసెట్ పరీక్ష మరియు నాకు వచ్చిన సీట్ గురించి చెప్పుకున్నాను. కానీ మొదటి రౌండు కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ కొన్ని కారణాల వలన నాకు నచ్చకపోవడంతో నేను రెండవ రౌండు కౌన్సిలింగ్ కోసం ఎదురుచూసాను. కొన్నిరోజులకు రెండవ రౌండు కౌన్సిలింగ్ తేదీలు వెలువడగానే నేను ఆప్షన్స్ పెట్టుకున్నాను. "ఆ రౌండులోనైనా నాకు నచ్చిన కోర్సుతో మంచి కాలేజీలో సీటు రావాల"ని బాబాను ఎంతగానో వేడుకుని, "గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాను బాబా" అని మ్రొక్కుకున్నాను. అలా నేను బాబాను వేడుకున్నంతనే బాబా తమ మహిమ చూపించారు. నేను కోరుకున్నట్లు మంచి కాలేజీలో నాకు సీటు వచ్చింది. నేను సంతోషంగా గురువారంనాడు బాబా గుడికి వెళ్ళి మ్రొక్కు తీర్చుకున్నాను.
రెండవ అనుభవం: 2021, అక్టోబరు నెలలో మా ఇంట్లో అందరికీ జలుబు, జ్వరం, దగ్గు వచ్చాయి. మేము ఇంట్లోనే పారాసెటమాల్ టాబ్లెట్, జలుబు టాబ్లెట్ మరియు దగ్గు సిరప్ వేసుకున్నాము. జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్లీ వచ్చింది. దాంతో మా ఇంట్లోవాళ్ళు మా ఇంటికి దగ్గరలో ఉండే ఆర్ఎంపీ డాక్టరుని సంప్రదించారు. ఆ డాక్టరు తగ్గడానికి కొన్ని మందులిచ్చారు. కానీ తగ్గలేదు. అప్పుడు మేము బాబా మీద నమ్మకముంచి రోజూ బాబా ఊదీ పెట్టుకోవడం, మరికొంత ఊదీ నోట్లో వేసుకోవడం, మరికొంత ఊదీ నీళ్లలో వేసుకుని తాగడం చేసాము. అలా చేయడం వలన మా ఆరోగ్యాలు కాస్త మెరుగయ్యాయి. తరువాత నవంబర్ 3వ తేదీన మా నాన్నగారు ఊరికి వెళ్లారు. అదేరోజు మా అన్నయ్యకి జ్వరమొచ్చి తీవ్రంగా వాంతులయ్యాయి. ఏమి తిన్నా వాంతి అయిపోతుండేది. ఊరు వెళ్లిన నాన్న అక్కడ రెండు రోజులు ఉండి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి రాగానే ఆయనకి బాగా జ్వరం వచ్చింది. రోజులు గడిచే కొద్దీ దగ్గు, జలుబు బాగా ఎక్కువయ్యాయి. దాంతో మళ్ళీ ఆర్.ఎంపీ డాక్టర్ దగ్గరకి వెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోయింది. మా ఇంట్లోవాళ్ల పరిస్థితి చూసి ఎందుకిలా అందరూ అనారోగ్యం పాలవుతున్నారని నాకు చాలా ఏడుపొచ్చి, "బాబా! అందరి ఆరోగ్యాలు బాగయ్యేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. వేడుకున్నంతనే బాబా మాపై కాస్త కరుణించి మా పరిస్థితి కాస్త మెరుగుయ్యేలా చేశారు. తరువాత మా అమ్మ, అన్నయ్య కలిసి వేరే డాక్టరు దగ్గరకి వెళ్ళారు. ఆయన వ్రాసిన మందులతో అమ్మకి, అన్నయ్యకి నయమైంది. ఇదంతా బాబా వలనే సాధ్యమైందని నా నమ్మకం. "ఎప్పుడూ నాతోనే ఉంటూ నన్ను, నా కుటుంబాన్ని మంచిగా చూసుకోండి బాబా. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను. నా మనసులో ఉన్న కోరికను తీర్చండి బాబా. తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
స్మృతిమాత్ర ప్రసన్నులు బాబా
ఓం శ్రీసాయినాథాయనమః!!! సాయిబంధువులందరికీ సాయితండ్రి ఆశీస్సులు ఎల్లవేళలా పరిపూర్ణంగా ఉండాలని బాబాను ప్రార్ధిస్తున్నాను. నాపేరు అనురాధ. నేను హైదరాబాదు నివాసిని. నాకు సర్వమూ బాబా తండ్రే. ఆయన ప్రసాదించిన ఎన్నో అనుభవాలను ఇంతకుముందు మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. 2020వ సంవత్సరంలో నేను 'సాయికృప' అనే గ్రూపులో సభ్యురాలిగా ఉండేదాన్ని. 2021లో సాయికృప గ్రూపులోని భక్తులను బాబాకు అతి చేరువ చేస్తున్న 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు గురించి నేను తెలుసుకున్నాను. అప్పటినుండి బ్లాగు ద్వారా బాబాతో భక్తులకు ఉండే అనుబంధాన్ని చదవడమనేది బాబా ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. 2021, ఏప్రిల్ చివరి వారంలో నాకు కరోనా లక్షణాలైన వాసన, రుచి తెలియకపోవడం, నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించాయి. విపరీతమైన నీరసం కారణంగా వృత్తిరిత్యా టీచరునైన నాకు ఆన్లైన్ క్లాసులు తీసుకోవడం చాలా కష్టంగా అనిపించేది. పై లక్షణాలను నిర్లక్ష్యం చేసిన కారణంగా నా స్నేహితురాలి కుటుంబం మొత్తం ఆర్థికంగా, శారీరకంగా మానసికంగా కృంగి పోవటం నేను చూసాను. అందుచేత నా స్నేహితురాలి సలహామేరకు నేను ఐసోలేషన్లోకి వెళ్లిపోయాను. కాని కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల నా బందువులు, స్నేహితులు పడ్డ ఇబ్బందిని మరియు కరోనా రక్కసి ప్రభావానికి లోనై మా అక్క కుటుంబం అనుభవించిన అత్యంత కష్టాన్ని చూసి ఉన్నందువల్ల నేను తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాను. ఇంకా నా వల్ల నా కుటుంబం కూడా కరోనా ప్రభావానికి గురవుతుందేమోనన్న భయంతో నేను నరకాన్ని అనుభవించాను. ఆ సమయంలో 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో బాబాతో భక్తులకున్న అనుభవాలు చదవడం మానసికంగా నాకు చాలా బలాన్నిచ్చింది. ఆ రోజు బ్లాగులో ఒక భక్తురాలు తనకు వచ్చిన ఇబ్బందిని బాబా ఊదీ సేవించి అధిగమించగలిగానని పంచుకున్నారు. అది చదివిన నేను ఉన్నపళంగా మనఃస్పూర్తిగా బాబాను, "బాబా! ఈ కరోనా రక్కసి నుండి నన్ను రక్షించు తండ్రి. ఇంకా నా కుటుంబం దీని ప్రభావానికి గురికాకుండా చూడు తండ్రి" అని వేడుకున్నాను. ఆపై బాబా ఊదీని నీళ్లలో వేసుకుని త్రాగుతూ చాలా స్వల్పంగా మాత్రలు వాడి 12 రోజుల తర్వాత గురువారం నాడు కరోనా టెస్టుకు వెళ్లాను. నా సాయినాథుని దయవల్ల నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. "తండ్రి సాయినాథా! మీరు స్మృతిమాత్ర ప్రసన్నులు. మీ బిడ్డల బాధలను తీర్చడంలో సదా సిద్దంగా ఉంటావు తండ్రీ. కానీ మీ బిడ్డలమైన మేము మాటిచ్చిన చిన్న పనిని చేయలేని స్థితిలో ఉన్నాము. నువ్వు అపార కరుణాసముద్రుడవు తండ్రి. మమ్ము తండ్రికి తగ్గ బిడ్డలుగా మార్చి, మీ మార్గంలో నడిపించండి దేవా!"
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
డబ్బుల విషయంలో స్పష్టత వచ్చేలా చేసిన బాబా
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు హేమ. మేము విజయవాడ నివాసులం. ఒకసారి మావారు తన ఆఫీసులో పనిచేసే ఒకతనికి కొంత డబ్బిచ్చారు. అతను ఆ డబ్బులు తిరిగి మావారికి గూగుల్ పే ద్వారా పంపించారు. అయితే మావారు ఆ డబ్బులు నా అకౌంటుకి పంపారు అనుకుని బ్యాలెన్స్ చెక్ చేస్తే, అందులో ఆ డబ్బులు వచ్చినట్లు కనపడలేదు. ఆ డబ్బులు పంపిన అతనికి ఫోన్ చేస్తుంటే, అతను తన ఆరోగ్యం బాగాలేక ఫోన్ లిఫ్ట్ చేసేవారు కాదు. మావారేమో ఆ డబ్బుల గురించే ఆలోచిస్తూ వర్రీ అవ్వసాగారు. ఆ రాత్రి నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! ఆ డబ్బుల విషయం తెలిసేలా చేయండి" అని చెప్పుకున్నాను. అంతే, బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయం అతను తనంతట తానే మావారికి ఫోన్ చేసి మాట్లాడి డబ్బులు మావారి అకౌంటుకే గూగుల్ పే చేసినట్లు చెప్పారు. అలా బాబా సమస్యని పరిష్కరించి నా కోరిక తీర్చారు. బాబా దయ మన అందరి మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా".
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
