1. అన్ని రూపాలలో ఉన్నది తామేనని నిదర్శనమిచ్చిన బాబా
2. బాబాతో తొలి అనుభవం
3. ఆటంకం లేకుండా చూసిన బాబా
అన్ని రూపాలలో ఉన్నది తామేనని నిదర్శనమిచ్చిన బాబా
నా పేరు మౌనిక. నేను ఒకసారి కొన్ని కారణాల వల్ల బాబాకి, ఇతర దేవుళ్ళకి పూజ వంటివి సరిగా చేసేదాన్ని కాదు. తర్వాత బాబా దయవల్ల మళ్ళీ దేవుడి మీద ఆసక్తి కలిగి కొద్దిరోజుల నుంచి ఇష్టంగా పూజ చేస్తూ 2021, నవంబరు 20, శనివారం నుంచి నేను శ్రీవెంకటేశ్వరస్వామి సప్తశనివారవ్రతం ప్రారంభించాను. వ్రతం చేసినంతనే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అదే రోజు ఎప్పుడూ లేనిది మావారు, "రేపు మనం ఎప్పుడూ వెళ్లే బాబా గుడికి వెళ్దాం" అని అన్నారు. నేను ఆయన మాట అంతగా నమ్మలేకపోయాను. ఎందుకంటే, అదివరకు కూడా ఇలా వెళ్ళాలి అనుకోవటం, వెళ్లకుండా ఉండటం జరిగింది. కానీ మరుసటిరోజు ఆదివారంనాడు మావారు నన్ను బాబా గుడికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆంజనేయస్వామికి పూజ చేస్తుంటే చూశాను. ఇంకా పూజారిగారు నాకు కొన్ని మంచి మాటలు చెప్పారు. ఇవన్నీ నాకు చాలా సంతోషాన్నిచ్చాయి.
మేము మా పెళ్ళైన కొత్తలో తిరుమల వెళ్ళినప్పుడు అక్కడినుంచి 'వెంకటేశ్వరస్వామి, అమ్మవార్లు' కలిసి ఉన్న ఫోటో ఒకటి తెచ్చుకున్నాము. కానీ ఎందుకనో పూజించుకునేందుకు అనువుగా ఆ ఫోటోను అమర్చుకోలేకపోయాము. నేను ఎప్పుడూ ఆ ఫోటోను అమర్చమని మావారిని అడగటం, ఆయన చేయిస్తానులే అనటం ఇలా రోజులు గడిచిపోతుండేవి. కానీ 2021, నవంబరు 25, గురువారంనాడు స్వయంగా మావారే ఆ ఫొటోను ఇంట్లో అమర్చటానికి ప్రయత్నించారు. అప్పుడు ఆయనకి ఫొటో ఎక్కడ పెడితే ఎటువంటి ఇబ్బంది ఉంటుందో అర్ధమై, మరుసటిరోజు ఏకంగా స్వామివారి ఫోటోను పూజగదిలో పెట్టారు. నాకెంతో సంతోషంగా అనిపించింది. మరుసటిరోజు నేను వ్రతంలో భాగంగా పూజ చేసుకుంటుంటే, ఎందుకనో నా మనసుకి, 'నేను బాబాని సరిగా పట్టించుకోకుండా ఇతరత్రా పూజల మీద ఆసక్తి చూపిస్తున్నానా?' అని అనిపించింది. అప్పుడు నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. అదేమిటంటే, నేను బాబాకి దగ్గరైన తొలిరోజుల్లో ఒకసారి “సుబ్రహ్మణ్యస్వామికి పూజ చేసుకోవాలా, లేక బాబాకి పూజచేసుకోవాలా?” అనే సందిగ్ధంలో పడ్డాను. అప్పుడు నాకు కలలో సుబ్రహ్మణ్యస్వామి గుడిలో స్వామితోపాటు బాబా కూడా దర్శనమిచ్చి వారిరువురూ ఒకటేనని నిదర్శననిచ్చారు. దాంతో ఇప్పుడు కూడా బాబానే ఆ వెంకటేశ్వరస్వామి రూపంలో నా పూజలు అందుకుంటున్నారని నా మనసుని సమాధానపరుచుకున్నాను. కానీ, బాబాకి మన మనసు ఎలా ఆలోచిస్తూ ఉంటుందో తెలుసు. ఆయన ఈసారి కూడా 'అన్ని రూపాలలో ఉన్నది నేనే' అని నిదర్శనం ఇచ్చారు. అయితే ఈసారి కలలో కాకుండా నేరుగా ప్రత్యక్ష అనుభవమిచ్చారు. ఎలా అంటే, నేను పూజ పూర్తిచేసాక వ్రతకథ చదవటానికి వ్రతకథల పి.డి.ఎఫ్ ఓపెన్ చేస్తే, 'శ్రీసాయి సచ్చరిత్ర' అని కనిపించింది. పొరపాటున నేను సచ్చరిత్రకు సంబంధించిన వేరే పి.డి.ఎఫ్ ఓపెన్ చేశానేమో అనుకుని మళ్ళీ వ్రతకథల పి.డి.ఎఫ్ ఓపెన్ చేశాను. ఈసారి కూడా 'శ్రీసాయి సచ్చరిత్ర' అనే కనిపించింది. ఇదేమిటి అనుకుంటూనే కాస్త కిందకు మూవ్ చేస్తే, అక్కడ శ్రీ వెంకటేశ్వరస్వామి వ్రతకథలు ఉన్నాయి. మొదటి పేజీ మాత్రం శ్రీసాయి సచ్చరిత్ర అనే ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరూ దాన్ని నమ్మరేమో, నేను భ్రమపడ్డానని అనుకుంటారేమోననిపించి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. దానిని ఈ క్రింద జతచేస్తున్నాను, చూడండి.
ఇప్పుడు ఈ అనుభవం వ్రాశాక అదే పి.డి.ఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తే క్రింది విధంగా ఓపెన్ అయింది. ఇది కూడా చూడండి.
బాబా చేసిన అద్భుతం చూశారా! ఆయన తమ భక్తులకోసం ఎంతటి లీల చేశారో! చివరిగా, ఇప్పుడే(అనుభవం వ్రాయడం పూర్తవుతూనే) ఒక గ్రూపులో కనిపించిన ఈ క్రింది మెసేజ్ ద్వారా కూడా సర్వ దేవతా రూపాలలో ఉన్నది తామేనని బాబా నిదర్శనమిచ్చారు.
మొత్తానికి, ఈ అనుభవం ద్వారా నేను ఏ పూజలు చేసినా అవన్నీ స్వీకరించి నన్ను అనుగ్రహిస్తున్నది తామేనని తెలియజేసి బాబా నన్ను ఎంతగానో అనందపరిచారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబాతో తొలి అనుభవం
నా పేరు శ్రీలత. మా అమ్మానాన్నలకు మేము నలుగురం ఆడపిల్లలం. చిన్నవయసులో 7వ తరగతి చదువుతున్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం మేమంతా భోజనం చేసి పాఠశాలకు వెళ్ళాము. తరువాత ఒకతను మా ఇంటికి వచ్చి, "అన్నం పెట్టమ"ని అమ్మని అడిగాడు. అప్పుడు అమ్మ, "అన్నం పెట్టడానికి నీ దగ్గర ఏదైనా పాత్ర ఉందా?" అని అతన్ని అడిగింది. అందుకతను, "నా దగ్గర ఏమీ లేదు. ఆకులో పెట్టిస్తే ఇక్కడే తింటాను" అని అన్నాడు. అంతేకాదు, "నువ్వు చింతకాయ పచ్చడి చేశావు కదా! అది కూడా వేసి పెట్టు" అని అన్నాడు. అమ్మ, "అలాగే కానీ, ఉన్నది మీ కడుపునిండా సరిపోదు" అని చెప్పింది. అతను, "ఫరవాలేదు, పెట్టమ్మా" అన్నాడు. సరేనని, అమ్మ ఆకులో అన్నం పెట్టింది. అతను అన్నం తింటూ, "మీరు చాలా కష్టాలు పడుతున్నారు. త్వరలో మీ కష్టాలు తీరుతాయి. సొంత ఇల్లు కట్టుకుంటారు..." అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, అమ్మ "నాకు ఏమీ చెప్పకండి. ఇవన్నీ నేను నమ్మను" అని అంది. అతను అన్నం తిని వెళ్లిపోయాడు. అమ్మ ఇంట్లోకి వెళ్లి, ఏదో అనుమానంతో వెంటనే తిరిగి బయటకి వచ్చి, అతను ఇంకా ఎవరి ఇంట్లోనన్నా అడుగుతున్నాడేమోనని చూస్తే, అతను ఎక్కడా కనపడలేదు. అప్పటికి మాకు బాబా గూర్చి ఏమీ తెలియనప్పటికీ మా నాన్నగారు మాత్రం ప్రతి గురువారం బాబాకి బన్ను నైవేద్యంగా పెట్టి, రాత్రి వేళల్లో అన్నం తినకుండా టిఫిన్ మాత్రమే తింటుండేవారు. కొన్నిరోజులకు మాకు ఒక బాబా ఫోటో దొరికింది. ఆవిధంగా బాబా మా ఇంటికి వచ్చారు. తరువాత కొన్ని సంవత్సరాలకు మా నాన్నగారికి తన ఆఫీసులో ఇంటి నిర్మాణం కొరకు లోన్ ఇస్తున్నారని తెలిసింది. అయితే ‘స్థలం ఉన్నవారికి మాత్రమే’ అని ఒక నిబంధన ఉంది. అయితే, బాబా దయవల్ల, 'ముందుగా డబ్బేమీ ఇవ్వలేము, లోన్ వచ్చిన తరువాత ఇస్తామ'ని చెప్పినప్పటికిీ ఒకతను ముందు ఒక స్థలాన్ని మాకు రిజిస్టర్ చేసి ఇచ్చారు. అలా బాబా అనుగ్రహంతో మా నాన్న ఒక సొంత ఇల్లు కట్టించుకున్నారు. ఇది 1978లో జరిగింది. ఆ తర్వాత చాలాకాలానికి 1982లో బాబాను కొలిచే నా స్నేహితురాలి వద్ద నుంచి నేను బాబా పారాయణ పుస్తకం తీసుకుని వచ్చాను. నాన్న ఆ పుస్తకం చదివిన తర్వాత మా అందరికీ బాబా గురించి చాలా తెలిసింది. తరువాత 1983లో నాన్న శిరిడీ వెళ్లి బాబాను దర్శించారు. తరువాత 1986లో మా కుటుంబమంతటికీ శిరిడీ వెళ్లి బాబాను దర్శించే అవకాశం లభించింది. శిరిడీ వెళ్లిన మేము రెండవ రోజున బయలుదేరి తిరిగి రావాలన్నది మా ప్లాన్. కానీ, బాబా మమ్మల్ని 3 రోజులు శిరిడీలో ఉండేటట్లు చేసి ఎంతగానో అనుగ్రహించారు. ఇది బాబాతో మా తొలి అనుభవం.
ఆటంకం లేకుండా చూసిన బాబా
సాయిభక్తులందరికీ నా శతకోటి వందనాలు. నా పేరు నళిని. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదిస్తున్నారు. నేను ఏది కోరుకున్నా తక్షణమే బాబా ఆశీర్వదిస్తారు. మేము ఈమధ్య ఒక సముద్రతీర ప్రాంతానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాము. ఇంతలో వాయుగుండాలు చాలా ఎక్కువగా ఉన్నందున వర్షాలు బాగా పడతాయని, వాతావరణం ఎంత మాత్రమూ బాగోలేదని వార్తల్లో వచ్చింది. అప్పటికే మేము అన్నీ బుక్ చేసుకున్నందున ఆ డబ్బు వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. అదీకాక నా వేలికి బాగా దెబ్బ తగిలింది. అట్టి స్థితిలో నేను బాబాని, "బాబా! నాకు తగిలిన ఈ దెబ్బ తగ్గి, ఎటువంటి ఇబ్బందీ లేకుండా మేము ట్రిప్కి వెళ్ళొచ్చేలా చూడండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల మేము బయలుదేరే సమయానికి నాకు దెబ్బ తగ్గిపోయింది. అంతేకాదు, మేము వెళ్ళిన చోట వర్షాలు లేవు. ఇదంతా సాయి మహిమ. "థాంక్యూ బాబా, మీరు ఎప్పుడూ నాతో ఉంటున్నందుకు, నన్ను కాపాడుతున్నందుకు".
కరోనా కాలంలో మాకు చాలాసార్లు జలుబు, దగ్గు వస్తూ ఉండేవి. అలా ఒకసారి వచ్చినప్పుడు మేము వేరే ఊరికి వెళ్లాల్సి రావడంతో, "బాబా! నాకు, నా కుటుంబానికి జలుబు, దగ్గు తగ్గేలా అనుగ్రహించండి" అని బాబాతో చెప్పుకున్నాను. అంతే, మాకు జలుబు, దగ్గు తగ్గిపోయాయి. మేము సంతోషంగా ఊరికి వెళ్లి వచ్చాము. "బాబా! మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించి మేము అనుకున్న పనులు నెరవేర్చినందుకు ధన్యవాదాలు బాబా. నా మదిలో ఉన్న కోరిక కూడా మీకు తెలుసు. అది కూడా నెరవేరుస్తారని కోరుకుంటూ... మీ కూతురు నళిని".



