ఈ భాగంలో అనుభవం:
- శ్రీ సాయి సచ్చరిత్ర ద్వారా బాబా సందేశాలు
- గాజు కనిపించేలా అనుగ్రహించిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. నేను బాబాను అనుక్షణమూ స్మరిస్తూ ఉంటాను. ఆయన నాకు ఒక స్నేహితునిలా కనిపిస్తారు. నేను ప్రతిరోజు నిత్యపూజతోపాటు విష్ణుసహస్రనామ పారాయణ చేస్తాను. 2020, జూన్ 26న నేను మహా పారాయణ గ్రూపులో చేరాను. అప్పటినుండి ప్రతి గురువారం సాయి సచ్చరిత్రలోని నాకు కేటాయించబడిన అధ్యాయాలను చదవడం నా జీవితంలో భాగమైంది. నాకు ఏదైనా సమస్య వస్తే సచ్చరిత్ర పుస్తకం చేతిలోకి తీసుకుని బాబాకు నమస్కరించి, కళ్ళు మూసుకుని నా సమస్య ఆయనకు విన్నవించుకుంటాను. తరువాత యథాలాపంగా సచ్చరిత్రలోని ఒక పేజీ తీసి, ఆ పేజీలోని ఏ అక్షరాల మీద నా చూపు పడితే దానిని బాబా నా సమస్యకు ఇచ్చిన సమాధానంగా విశ్వసిస్తాను. ఈ ప్రక్రియ నాకు, నా కుమార్తెకు అలవాటు. ఏ సమస్య వచ్చినా బాబా తీరుస్తారని తనకి ఒక నమ్మకం. అందుచేత తనకి ఏదైనా సమస్య వస్తే, "అమ్మా! నా సమస్యను బాబాకి చెప్పి, పరిష్కారం అడుగు" అనటం తనకు అలవాటు. తను గ్రాడ్యుయేషన్ (BDS) ఫైనల్ పరీక్షలు వ్రాస్తున్నప్పుడు బాగా టెన్షన్ పడుతుంటే నేను బాబాను తన గురించి అడిగాను. అప్పుడు బాబా "విష్ణుసహస్రనామ పారాయణ చేయమ"ని, ఇంకా సచ్చరిత్రలోని 29వ అధ్యాయం నందు గల టెండూల్కర్ కథని చూపించారు. ఇక్కడో ఒక విషయం చెప్పాలి. అదేమిటంటే నేను ఎప్పుడు యథాలాపంగా సచ్చరిత్ర తెరిచినా 29వ అధ్యాయమే వచ్చేది. అంటే మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ మాత్రమే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుందని బాబా సూచిస్తుండేవారన్న మాట. అదే నిజమైంది. మా జీవితంలో బాబా లీలలు ఇంతటితో ఆగలేదు ఇంకో అనుభవం చెప్తాను.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత మా అమ్మాయికి మంచి సంబంధం వస్తే, పెళ్లి చేసాము. తనిప్పుడు డెంటిస్ట్గా ఒక క్లినిక్లో ఉద్యోగం చేస్తోంది. కోవిడ్ కాలంలో ఒకరోజు మా అమ్మాయి క్లినిక్ నుండి నాకు ఫోన్ చేసి, "అమ్మా! నా బంగారు గాజుల జత ఒకటి కనిపించడం లేదు" అని చెప్పింది. కోవిడ్ సమయములో ఒక డాక్టరుగా తను క్లినిక్లో ఉన్నప్పుడు 'పీపీఈ' సూటు, డబుల్ మాస్క్, గ్లాస్సెస్ ధరిస్తుంది. కాబట్టి తను తన బంగారు గాజులు తీసి హ్యాండ్ బ్యాగులో పెట్టి, దాన్ని డాక్టర్స్ గదిలోని లాకర్లో పెడుతుంది. అందువలన ఆ గాజులు ఎప్పుడు పోయాయో, ఎలా పోయాయి, ఎవరు తీశారో మాకు ఏమాత్రమూ అర్థం లేదు. మా అమ్మాయి తను పని చేస్తున్న క్లినిక్ హెడ్కి, తన సహద్యోగులకి, అసిస్టెంట్స్కి గాజులు పోయిన విషయం చెప్పింది. కానీ ఏమీ లాభం లేకపోయింది. ఎవరి మీద అనుమానం లేదు, ఎటువంటి సూచన, సమాచారం గాని లేవు. అయితే ఆ బంగారు గాజులు మా అమ్మాయికి పెళ్లప్పుడు తన అత్తమామలు ఇచ్చినవి అయినందున అవి అంటే మాకు చాలా సెంటిమెంట్. అందువలన మేము చాలా బాధపడ్డాము. మా మనసు వికలమైపోగా నేను బాబాకు చెప్పుకుని ఏడ్చాను. అలా రోజులు గడుస్తూ నెల రోజులు అయిపోయింది. ఒకరోజు మా అమ్మాయి ఇంట్లో పని చేస్తున్న పనమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి, "నన్ను అనుమానిస్తున్నారా?" అని గొడవ పెట్టుకుని పని మానేసి వెళ్ళిపోయింది. తను అలా పని మానేసి వెళ్లిపోవడంతో ఆ అమ్మాయే గాజులు తీసుంటుందని మేము ఒక నిర్ధారణకు వచ్చాము. కానీ ఆధారం లేనందువల్ల మేము ఏమీ చేయలేకపోయాం.
నేను రోజూ బాబా దగ్గర బాధపడుతూ ఉండేదాన్ని. ఎప్పటిలానే ఒకరోజు బాబా దగ్గర సమస్యను చెప్పి, "మార్గం చూపించమ"ని వేడుకుని చేతిలోకి సచ్చరిత్ర తీసుకున్నాను. బాబాకు నమస్కరించి కళ్ళు మూసుకుని ఒక పేజీ తీశాను. 29వ అధ్యాయం వచ్చింది. అందులో ఉన్న దాన్నిబట్టి 'విష్ణు సహస్రనామ పారాయణ చేయమ'ని బాబా సూచిస్తున్నట్లు నాకు అనిపించింది. మళ్లీ యథాలాపంగా పేజీలు తిప్పాను. ఈసారి నా చూపు క్రింది వాక్యంపై పడింది.
బాబా 'రాజారామ్'యను మంత్రమును ఎల్లప్పుడూ జపించమనుచు నిట్లనియె, "నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనసు శాంతించును. నీకు మేలు కలుగును".
వెంటనే నేను బాబా సూచించినట్లు 40 రోజులు(మండలం)పాటు విష్ణుసహస్రనామ పారాయణ, 'రాజారామ్' అనే నామస్మరణ చేయ సంకల్పించి, దాన్ని ఆచరణలో పెట్టాను. మండల దీక్ష మొదలుపెట్టి 15 రోజులు గడిచాయి. రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి. మామూలుగానే పోయిన గాజుల గురించి ఎటువంటి సూచన, సమాచారం రాలేదు. అందరూ మెల్లగా ఆ విషయం గురించి మర్చిపోతున్నారు. మా కుటుంబసభ్యులందరూ ఆశ వదులుకున్నారు. నేను మాత్రం బాబా మార్గం చూపిస్తారని నమ్మకంతో ఉన్నాను.
ఒకరోజు నేను, "బాబా! దయ చూపండి" అని ప్రార్థించి, సచ్చరిత్ర చేతిలోకి తీసుకుని బాబాకు నమస్కరించి, కళ్ళు మూసుకుని యథాలాపంగా సచరిత్రలోని ఒక పేజీ తీశాను. ఈసారి 36వ అధ్యాయం వచ్చింది. పేజి నెంబర్ 309లో ఒక బ్రాహ్మణ వంటమనిషి తన యజమాని ద్రవ్యమును దొంగిలించిన కథ ఉంది. ఆ కథ ద్వారా బాబా నాకు ఏదో సూచన ఇస్తున్నారనిపించి బాగా ఆలోచించాను. క్లినిక్లో మా అమ్మాయి కింద పనిచేసే వాళ్లెవరో దొంగతనం చేసి ఉంటారని అనిపించింది. సరే, అదలా ఉంచితే, 'దొంగలించినవారే తిరిగి సొమ్ము ఇస్తార'ని ఆ కథ సూచిస్తుంది. 'మరి, మాకు అంత అదృష్టం ఉందా? ఈ కాలంలో దొంగలించి ఎవరు నేరం ఒప్పుకుని, తిరిగి మన సొమ్ము మనకి ఇస్తారు?' అని అనుకున్నాను. నేను మా అమ్మాయితో విషయం చెప్పాను. తను, "పోయిన బంగారం ఎలా దొరుకుతుంది? నాకు నమ్మకం లేదమ్మా" అంది. కానీ నాకు నమ్మకం, ఆశ చావలేదు. రోజూ విష్ణు సహస్రనామ పారాయణ, 'రాజారామ్' మంత్రం జపం చేస్తున్నాను. అద్భుతం! 38వ రోజున మా అమ్మాయికి దొంగ దొరికింది. అది ఎవరో కాదు. తన క్లినిక్లో పనిచేసే ఒక జూనియర్ డాక్టర్. తను ఇంకొక దొంగతనం చేస్తూ మా అమ్మాయికి పట్టుబడింది. నిలదీసి అడిగితే, "ఈ రెండు దొంగతనాలు నేనే చేశాను. డబ్బు అవసరమైంది. బంగారం చూసి నా మనసు చలించింది. అందుకే దొంగిలించాను" అని నేరం ఒప్పుకుంది. అయితే అప్పటికే ఆ జూనియర్ డాక్టరు గాజులను ఒక షాపులో అమ్మడం, ఆ షాపు యజమాని ఆ బంగారాన్ని కరిగించడం జరిగిపోయినందున మా బంగారు గాజులకి వెలకట్టి డబ్బులిచ్చారు. విశేషమేమిటంటే, అది నేను చేస్తున్న మండల దీక్షలో అది 40వరోజు అంటే చివరి రోజు. పైగా ఆరోజు గురువారం. మొత్తానికి బాబా దయవల్ల మేము పోగొట్టుకున్నది అంతా డబ్బు రూపంలో తిరిగి మాకు దక్కింది. మా సంతోషానికి హద్దుల్లేవు. చాలా చాలా ఆనందించాము. ఈ కాలంలో పోయినవి తిరిగి దొరకడం అనేది చాలా అదృష్టం. దొంగతనం చేసిన ఆ జూనియర్ డాక్టర్ తన తప్పు ఒప్పుకుని క్షమించమని వేడుకుంది. మేము క్షమించాము. ఇలా చాలా సందర్భాలలో బాబా నాకు, మా కుటుంబసభ్యులకి తన లీలలు చూపిస్తున్నారు. నేను ఆయనను ఎప్పటికీ మరువలేను.
చివరిగా ఒక చిన్న అనుభవం చెప్తాను. 2021, ఆఖరి కార్తీక సోమవారంనాడు మా ఇంట్లో రుద్రాభిషేకం చేయించాము. మా దంపతులిద్దరమూ పీటల మీద కూర్చుని పూజ ప్రారంభించే సమయంలో నా దృష్టి పక్కనే ఉన్న అగరుబత్తీల ప్యాకెట్ మీద పడింది. దాన్ని చూస్తూనే 'బాబా వచ్చార'ని నా మనసుకి చాలా సంతోషం అనిపించింది. బాబా వచ్చింది ఇదిగో ఈ విధంగా....
"చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం ఇలాగే ఎప్పుడూ మాపై, మీ భక్తులందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను తండ్రీ".
గాజు కనిపించేలా అనుగ్రహించిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటున్నాను. నేను ఒక సాయిభక్తురాలిని. 2021, డిసెంబర్ 9న నేను ఒక పెళ్లికి వెళ్ళొచ్చాను. ఇంటికి వచ్చాక నా చేతికున్న బంగారు గాజులు తీసి పాత గాజులు వేసుకున్నాను. వాటిలో ఒక గాజు తక్కువగా ఉన్న విషయం నేను చూసుకోలేదు. తరువాత స్నానం చేసేటప్పుడు చూసుకుని ఒక గాజు తక్కువగా ఉందని కంగారుపడి బాబాను మదిలో తలుచుకుని, "బాబా! గాజు కనిపించేలా చూడండి, మేరే దయామయ తండ్రి. గాజు కనిపిస్తే, మీ బ్లాగు ద్వారా నా అనుభవాన్ని అందరితో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. ఆపై మునుపు గాజులు ఉన్న చోట చూస్తే, నా గాజు కనిపించింది. "మేరే బాబా! ఓ కరుణామయ తండ్రి. ఎప్పటికీ మీరు మా వెంటే ఉంటూ మమ్మల్ని మంచి మార్గంలో నడిచేలా చూడండి బాబా".