సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 897వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా నెరవేర్చిన కోరికలు
2. రిజర్వేషన్ టికెట్లిచ్చి సహాయం చేసిన బాబా
3. తీవ్రంగా విరోచనాలైనా నీరసం లేకుండా అనుగ్రహించిన బాబా

బాబా నెరవేర్చిన కోరికలు


ఓం శ్రీ సాయినాథాయ నమః. ముందుగా, శ్రీసాయినాథుని దివ్యపాదాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి, సాటి సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. బాబా తాము నాకు ప్రసాదించిన అనుభవాలను మీ అందరితో పంచుకునే అవకాశం కల్పించారు. నా పేరు పద్మ. మా అమ్మాయివాళ్ళు చాలాకాలంగా ఉద్యోగ సంబంధిత విషయాల వలన చాలా టెన్షన్ పడుతున్నారు. ఈ.ఏ.డి కార్డు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ విషయంగా నేను, "ఐదువారాలలోపు శుభవార్త రావాలనీ, అలా జరిగితే ఈ బ్లాగులో పంచుకుంటాన"నీ బాబాకి చెప్పుకుని సాయి దివ్యపూజ చేశాను. నాలుగవ వారం పూజ పూర్తయిన నాలుగురోజులకి మంగళవారంనాడు మా అమ్మాయి వద్ద నుండి నేను ఆశించిన శుభవార్త వచ్చింది. తను ఫోన్ చేసి, ‘ఈ.ఏ.డి కార్డు వచ్చింద’ని చెప్పింది. నాకు చాలా సంతోషంగా అనిపించి బాబాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. 


ఇంకో విషయం.. సంవత్సరం క్రితం మా మరిది కాలికి చిన్న ఫ్రాక్చర్ అయింది. కానీ ఈమధ్య నొప్పి, వాపు ఉండటం వలన తన కాలికి పిండికట్టు కట్టి, 20 రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. అయితే పదిరోజుల్లో తను అత్యవసరంగా అమెరికా ప్రయాణమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, బాబా ఊదీని నా నుదుటన ధరించి, "అతనికి ఏ ఇబ్బందీ కలగకుండా కాపాడమ"ని వేడుకున్నాను. బాబా దయవలన అతను 2021, ఆగష్టు 22వ తేదీన అమెరికాకి సుఖంగా ప్రయాణమయ్యాడు. "ధన్యవాదాలు బాబా".


ఇంకో అనుభవం: మా చెల్లెలువాళ్లు రెండు, మూడు రోజుల్లో అమెరికాకి ప్రయాణమవ్వాల్సి ఉందనగా హోటల్ ఫుడ్ తినడం వల్ల మా చెల్లి కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. డాక్టరు ఘనపదార్థాలేవీ తీసుకోవద్దని చెప్పారు. దాంతో తను కేవలం కొబ్బరినీళ్లు, మజ్జిగ మాత్రం తీసుకొంటూ ఉండేది. పైగా లో-బిపి కారణంగా తను బాగా నీరసించిపోయింది. ‘ఈ స్థితిలో ప్రయాణం సాధ్యమేనా?’ అని మాకు చాలా భయమేసింది. వెంటనే నేను బాబాను వేడుకున్నాను. ఆ సాయినాథుని దయవల్ల రెండు, మూడు రోజులనుండి ఆహారంలేక నీరసించినపోయిన మా చెల్లి తన భర్తతో కలిసి అమెరికాకు ప్రయాణమైంది. అయితే వాళ్ళు మధ్యలో మాల్దీవులలో 14 రోజులు ఉండాల్సి ఉన్నందున అక్కడి నుండి కూడా వారి ప్రయాణం సౌకర్యవంతంగా జరిగి క్షేమంగా అమెరికాకు చేరుకోవాలని బాబాను వేడుకున్నాను. ఆ సాయినాథుని దయతో మా చెల్లెలు, తన భర్త క్షేమంగా అమెరికా చేరుకొని ఆరోగ్యంగా ఉన్నారు. బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, బాబాకిచ్చిన మాట ప్రకారం నేను ఈ అనుభవాన్ని బ్లాగులో విన్నవించుకున్నాను. ఈ అవకాశమిచ్చిన బ్లాగువారికి నా కృతజ్ఞతలు.

ఓం శ్రీ సాయినాథాయ నమః.


రిజర్వేషన్ టికెట్లిచ్చి సహాయం చేసిన బాబా


సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. నా పేరు శారద. సాయిబాబా నాకు  ప్రసాదించిన ఒక గొప్ప అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాను.


ఒకప్పుడు మావారు వృత్తిరీత్యా పూణేలో పనిచేస్తూ ఉండేవారు. మా అత్తగారికి క్యాన్సర్ ఉన్నందున, ఆవిడను చూసుకునేందుకు నేను, మా పిల్లలు కర్నూలులో ఉండవలసి వచ్చింది. అప్పుడు పిల్లలకు వేసవి సెలవులు రావడంతో ఒక నెలరోజులపాటు మమ్మల్ని  పూణేకు తీసుకుని వెళ్ళాలని నా భర్త అనుకున్నారు. కానీ అప్పటికప్పుడు మాకు రైల్వే రిజర్వేషన్ దొరకలేదు. అయినప్పటికీ ఏదో ఒక చోట సీటు దొరుకుతుందన్న నమ్మకంతో మేము ఆదోని రైల్వేస్టేషన్‌కి వెళ్ళాము. ట్రైన్ రాగానే జనరల్ కంపార్ట్‌మెంటులో ఎక్కాలని ప్రయత్నించాము. కానీ, కాళ్ళు కూడా పెట్టలేనంతగా జనరల్ కంపార్ట్‌మెంట్ ప్రయాణీకులతో క్రిక్కిరిసిపోయి ఉంది. పోనీ రిజర్వేషన్ కంపార్ట్‌మెంటులో ఎక్కుదామంటే వాటి పరిస్థితి కూడా అలాగే ఉంది. దాదాపు అన్ని బోగీలు ప్రయాణికులతో క్రిక్కిరిసిపోయి ఉన్నాయి. మొదటిసారిగా నాకు అర్థమైంది ఏంటంటే, రైల్వే రిజర్వేషన్ లేకుండా వేసవి సెలవుల్లో ప్రయాణం ఎంతో బాధాకరమని. సరే, ఏదో ఒక విధంగా ట్రైన్ ఎక్కేశాము. కానీ, వచ్చేవాళ్ళు, పోయేవాళ్లు మమ్మల్ని ‘జరగండి, జరగండ’ని అంటుంటే, నిలబడ్డానికి కూడా స్థలం లేని మాకు చాలా కష్టంగా అనిపించింది. ముఖ్యంగా మా పిల్లల అవస్థను చూసి నాకు చాలా బాధేసింది. అప్పుడు మా పాప వయసు నాలుగేళ్లు, బాబు వయసు ఎనిమిదేళ్లు. స్టేషన్ వచ్చిన ప్రతిసారీ మేమున్న బోగీలో నుంచి ఇంకొక బోగీలోకి వెళ్లి పిల్లల కోసం ఒక్క సీటు దొరికినా చాలని ప్రయత్నం చేశాము, కానీ ఫలితం లేకపోయింది. చివరిగా ఇంకొక బోగీ ఎక్కాము. అక్కడ కూడా అదే పరిస్థితి. కానీ, అక్కడ కొందరు మద్రాసు నుంచి శిరిడీకి వెళ్తున్నారు. వారందరూ తమిళంలో బాబా భజనలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా నాకు దుఃఖం ఆగలేదు. బాగా ఏడ్చేసి, "బాబా! పిల్లల కోసం ఒక్క సీటైనా దొరికితే చాలు తండ్రీ. మా పిల్లల అవస్థను నేను చూడలేకపోతున్నాను" అని బాబాను వేడుకున్నాను. ఒక అరగంటసేపు బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూనే ఉన్నాను. అంతలో ఇంకొక స్టేషన్ వచ్చింది. రిజర్వేషన్ ఉన్నవాళ్ళు ఆ కంపార్ట్‌మెంటులో ఎక్కారు. పదినిమిషాల తర్వాత మేము మా పిల్లలతో పడుతున్న అవస్థలు చూసి ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చి, "నా దగ్గర రెండు రిజర్వేషన్ టికెట్లు ఉన్నాయి, అవి తీసుకుని ప్రశాంతంగా ప్రయాణం చేయండి" అని అన్నాడు. మేము రిజర్వేషన్ టికెట్ డబ్బులు ఇస్తామన్నా కూడా అతను తీసుకోలేదు. పైగా, "భగవంతుడు నాకు ఎంతో సాయం చేశాడు. నేను మీకు సాయం చేస్తున్నాను" అని చెప్పి వెళ్ళిపోయాడు. నాలో తెలియని ఆనందం, ఆశ్చర్యంతో దుఃఖం ఆగడం లేదు. బాబా ఆ వ్యక్తి రూపంలో వచ్చి మాకు సహాయం చేశారని చాలా ఉప్పొంగిపోయాను. ఒక్క సీటు కోసం బాబాను అర్థిస్తూ ఉంటే, రెండు రిజర్వేషన్ టికెట్లు ఇచ్చి ప్రశాంతంగా ప్రయాణం చేసేలా అనుగ్రహించారు బాబా. "బాబా! ఏమని వర్ణించను తండ్రీ నీ కరుణను? మనసా, వాచా, కర్మణా త్రికరణశుద్ధిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను తండ్రీ. నాకు మీ పాదపద్మముల యందు అచంచలమైన భక్తివిశ్వాసాలు కలిగేలా ఆశీర్వదించు తండ్రీ".


తీవ్రంగా విరోచనాలైనా నీరసం లేకుండా అనుగ్రహించిన బాబా

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!


నా పేరు మాధురి. ముందుగా సాయిబంధువులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. మా నాన్నగారి వయసు 84 సంవత్సరాలు. ఈమధ్యకాలంలో ఒకరోజు నాన్న నాతో, "ఉదయం నాలుగు గంటల నుండి నాకు విరేచనాలు అవుతున్నాయి, నీరసంగా ఉంది" అని చెప్పారు. విరేచనాలు తగ్గటానికి నేను నాన్నకి ట్యాబ్లెట్ ఇచ్చాను. అది వేసుకున్నాక సాయంత్రం బాగానే ఉంది. కానీ రాత్రి 8 గంటల తర్వాత మళ్ళీ ఆయనకి విరేచనాలు మొదలయ్యాయి. ఈసారి ట్యాబ్లెట్లు ఇచ్చినా తగ్గలేదు. అప్పుడు నేను బాబా ఊదీని నాన్నకి పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చాను. అయినా విరేచనాలు అవుతూనే ఉన్నాయి. ఈ వయసులో డీహైడ్రేట్ అయితే చాలా ప్రమాదమని నాకు చాలా భయం వేసింది. నేను మరోసారి నాన్నకి బాబా ఊదీ పెట్టి, మరికొంత ఊదీని ఆయన నోట్లో వేసి, "నాన్నకి తగ్గిపోతే ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. తర్వాత మరో ట్యాబ్లెట్ కూడా ఇచ్చాను. బాబా దయవల్ల రాత్రి రెండు గంటలకి విరేచనాలు ఆగాయి. మరునాడు ఉదయం నాన్న నిద్రలేచి ఎంతో హుషారుగా, "విరేచనాలు తగ్గిపోయాయి. నీరసం అసలు లేదు" అని చెప్పారు. ఆ వయసులో అన్ని విరేచనాలు అయిన తర్వాత కూడా నీరసం లేకపోవటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలాగే చాలా ఆనందం కలిగింది. ఇదంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం అందరిపై ఉండాలి".



9 comments:

  1. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌺😃🥰🌹🌼🌸

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Om sai ram please change my mind negative thoughts to positive thoughts. You can do it baba. In health problems I am in depression. In my husband health problem and mine. Please help sai. I trust you baba�� ��

    ReplyDelete
  4. Please help me baba can I join other job or not

    ReplyDelete
  5. Baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  6. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  7. Baba karthik ki, santosh ki health bagundali thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo