సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సమయగతి ఎఱుగని సమ్యమీంద్రుని 'సమయనియమాలు'! - శ్రీసాయిబాబా దినచర్య - ఐదవ భాగం


మధ్యాహ్నం రెండున్నరకు మళ్ళీ ఒకసారి లెండీబాగుకు వెళ్ళివచ్చేవారు. లెండీ నుండి వచ్చిన తరువాత మరొకసారి సాయిదర్బారు వుండేది. అదయ్యాక సాయంత్రం బాబా మసీదు ముంగిట్లో అటూ, ఇటూ పచార్లు చేస్తుండేవారు. ఆ సమయంలోనే మసీదు ప్రహరీగోడనానుకుని ఆ వీధిలో అటూ ఇటూ పోయేవారితో సావకాశంగా మాట్లాడేవారు. ఒక్కోసారి తమకు మాత్రమే అర్థమయ్యే పరిభాషలో మాట్లాడుతుండేవారు. “పదిపాములు వెళ్ళిపోయాయి, ఇంకా చాలా వస్తాయి”; “ఇక్కడ జనం చీమల్లా గుమికూడతారు”; “వణి (వ్యాపారస్థులు) తేలీ (నూనెవర్తకులు), నన్ను చాలా ఇబ్బందిపెట్టారు. నేనీ మసీదులో ఎక్కువ కాలం వుండను. నేనిక్కడనుండి వెళ్ళిపోతాను” అనేవారు. ఒక్కొక్కసారి మసీదు విడిచి నిజంగానే బయలుదేరేసేవారు. బాబా బయలుదేరుతున్నారన్న విషయం చెవినపడిన వెంటనే తాత్యా ఒక్క పరుగున బాబా వద్దకు వచ్చి “మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవాళ్ళను నేను దండిస్తాను. నేను మిమ్మల్ని శిరిడీ వదిలి వెళ్ళనివ్వను. ఈ రోజు వద్దు బాబా, మరోరోజు వెళదాము” అంటూ బుజ్జగించేవాడు. బాబా ఒక్కోసారి ఎందుకలా చేసేవారో ఆయనకే ఎరుక. తాత్యా సముదాయించిన తరువాత, బాబా మరలా యధాస్థానంలో కూర్చుని ఏమీ జరగనట్లే భక్తులతో మాట్లాడేవారు. మసీదు ప్రహరీ గోడనానుకుని వారు నిలుచున్నచోట యిపుడు చిన్న పాదుకలు ప్రతిష్ఠించి ఉన్నారు. గోడపై మోచేయి ఆనించుకొనే చోట కూడా పాదుకలు ప్రతిష్ఠింపబడివున్నాయి. ఆ స్థానంలో నిలబడి బాబా ఒక్కొక్కసారి సూర్యోదయాన్ని గమనిస్తుండేవారట.


సాయంత్రాలు తరచుగా మసీదుకు పక్కనున్న వీధిలో అటూఇటూ నడిచేవారు. అపుడు ఆ వీధిలో జనం బారులు తీరి నిలుచునేవారు. బాబా వారందరితో కుశల సమాచారాలు మాట్లాడుతూ మెల్లగా నడిచేవారు.

ఆరు ఆరున్నర మధ్య బాబాకు సంధ్యారతి ఇచ్చేవారు. ఆరతి తరువాత జరిగే సాయిదర్బారులో మళ్ళీ భక్తులంతా బాబా దగ్గర చేరి వారి కష్టసుఖాలు చెప్పుకుని ఆశీర్వాదాలు పొందేవారు.

బాబా, భక్తులను దక్షిణ అడిగి తీసుకునేవారు. సుమారు రాత్రి ఎనిమిదిగంటల సమయంలో బాబా దక్షిణరూపంలో ఆరోజు వచ్చిన డబ్బునంతా పంచేసేవారు. బాబా జీవితపర్యంతం ఆ దానయజ్ఞం కొనసాగింది. ప్రతిరోజూ బాబా ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క నిర్ణీతమొత్తం చొప్పున కొందరు భక్తులకు పైకం ఇచ్చేవారు. భక్తులు దీన్ని బత్యం అనేవారు. బడేబాబాకు 55 రూ/-, తాత్యాకు 35 రూ/-, జంతేముసల్మానుకు 7 రూ/-, బయ్యాజీపాటిల్ కోతేకు 4 రూ/-, భాగోజీకి 4 రూ/-, రామచంద్రపాటిలుకు 4 రూ/- ఇచ్చేవారు. బాబా వద్దనుండి ప్రతిరోజూ డబ్బు తీసుకునేవారిలో రామచంద్రపాటిల్ తాను తీసుకున్న 4 రూపాయలకు బదులు నాలుగు కలకండ పలుకులను బాబాకు సమర్పించేవాడు. నూతన వధూవరులు తమ ఆశీస్సుల కోసం వచ్చినపుడు బాబా వారికి చెరొక రూపాయి ఇచ్చేవారు. రామనవమి లాంటి ఉత్సవాలు జరిగినపుడు దాదాకేల్కరుకు, బడేబాబాకు రెండుకట్టల రూపాయినోట్లు యిచ్చి పంచమనేవారు. బాబాకు వచ్చే నైవేద్యం మీద ఆధారపడి ఎందరో ఫకీర్లు, బైరాగులు జీవించేవారు. వారికి ఒక్కొక్కరికి బాబా రోజూ 25 పైసలు ఇచ్చేవారు. సాయంత్రం హరిదాసులు, పౌరాణికులు, వివిధ కళాకారులు, సర్కస్ వాళ్ళు తమతమ కళలను బాబా ముందు ప్రదర్శించేవారు. బాబా వారికి ఒక్కొక్కరికి రెండు రూపాయలు ఇచ్చేవారు.

ఇదంతా అయిన తరువాత ప్రతిరోజూ రాత్రి తాత్యా రొట్టెలు, పాలు నైవేద్యంగా తెచ్చేవాడు. బాబా అందులోనుంచి కొంత స్వల్పంగా తీసుకున్నాక, తక్కినది ప్రసాదంగా అందరికీ పంచేవారు. ఆ సమయంలో ప్రతిరోజూ బాబా తాత్యాకు 35 రూ/- ఇచ్చేవారు. అది బాబా మసీదులోనే నిదురించే రోజైతే అందరూ బాబా వద్ద ఊదీ తీసుకుని ఇళ్ళకు వెళ్ళిపోయేవారు. మహల్సాపతి, తాత్యాలను తప్ప మరెవ్వరినీ రాత్రిళ్ళు మసీదులో నిద్రించటానికి బాబా అనుమతించేవారు కాదు.

ఒకనాడు శిరిడీలో కుంభవృష్టి కురిసింది. శిధిలావస్థలోనున్న మసీదు పరిస్థితిని గమనించి అతి చేరువలోనున్న చావడిలో ఆ రాత్రి తలదాచుకోమని భక్తులు ప్రార్థించారు, ఒత్తిడిచేశారు. మసీదు నుండి కదిలేందుకు బాబా ససేమిరా అంగీకరించలేదు. అప్పుడు నారాయణతేలి అనే ఒక భక్తుడు చొరవ తీసుకుని శ్రీసాయి వద్దని కేకలేస్తున్నా లక్ష్యపెట్టకుండా, ఆయనను భుజాలపై మోసుకుని వెళ్ళాడు. అలా ఒకరాత్రి చావడిలో గడిచింది. ఆనాటినుండి మిగిలిన జీవితపర్యంతం రోజుమార్చిరోజు చావడిలో నిద్రించారు బాబా.

బాబా చావడిలో కుడిభాగంలో పడుకునేవారు. ఇప్పుడు ఆ భాగాన్ని రైలింగుతో వేరుచేసి వున్నారు. ఎడమవైపు భాగంలో మరికొందరు భక్తులు పడుకునేవారు. బాబా చావడిలో నిద్రించేరోజు గొప్పగా చావడిఉత్సవం జరిగేది. రాధాకృష్ణమాయి, అబ్దుల్ మసీదునుండి చావడి వరకు గల రోడ్డును చిమ్మేవారు. దుమ్ము పైకిలేవకుండా నీళ్ళుచల్లేవారు. రంగురంగుల ముగ్గులుపెట్టేవారు. దారిపొడవునా బాబా నడిచేందుకు గుడ్డపరిచేవారు. తరువాత తాత్యా బాబా వద్దకు వచ్చి చావడికి బయలుదేరటానికి సిద్ధంగావుండమని చెప్పేవాడు. కానీ బాబా కదిలేవారు కాదు. తాత్యా అప్పుడు చంకలో చేయివేసి లేవదీసేవాడు. బాబా బయలుదేరగానే ఒక జలతారు శాలువాను ఆయన భుజాలపై వేసేవాడు. బాబాకు ఎడమవైపు తాత్యా, కుడివైపున మహల్సాపతి నిలుచుని బాబాను మసీదునుంచి చావడివైపుకి నడిపించేవారు. చావడికి వెళ్లేముందు, బాబా కుడికాలిపాదంతో ధునిలోని కట్టెలు సవరించి, కుడిచేత్తో అక్కడున్న దీపాన్ని ఆర్పి బయలుదేరేవారు. బాబా ఎడమచేతిని తాత్యా, కుడిచేతిని మహల్సాపతి పట్టుకుని బాబాను మసీదునుండి చావడికి నడిపించి తీసుకెళ్ళేవారు.

బాబా మసీదుమెట్లు దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పిలాజీగురవే షహనాయి వాయించేవాడు. భక్తులు భజనచేసేవారు. ఉత్సవానికి ముందు చక్కగా అలంకరించబడిన శ్యామకర్ణ, సాయిపాదుకలున్న పల్లకీ కదిలేవి. రకరకాల దీపాలంకరణలతో కన్నులపండువగా సాగేదా ఉత్సవం. ఒకవంక సంగీతవాయిద్యాల హోరు, మరొకవంక భజన, ‘సాయినాథ్ మహరాజ్ కీ జై!’ అన్న జయజయ ధ్వానాలు మిన్నుముట్టేవి. మధ్యమధ్య భక్తులు బాబాపై పువ్వులు, గులాల్ చల్లేవారు. బాబా ప్రసన్నంగా అడుగులో అడుగులేస్తున్నట్లు మెల్లగా కదులుతూ ముందుకుసాగేవారు. బాబాకు అందంగా అలంకరించిన గొడుగును జోగ్ పట్టేవాడు. బాబా మసీదు చివరకు వచ్చింతరువాత మారుతి ఆలయం వైపుకు తిరిగి కొన్ని భంగిమలు చేసేవారు.
బాబా రాకను స్వాగతిస్తూ చావడిని అద్దాలు, దీపతోరణాలతో అలంకరించి సిద్ధంగా ఉంచేవారు. బాబా చావడి చేరగానే తాత్యా ముందు లోపలికి వెళ్ళి బాబాకు ఆసనం, ఆనుకోవటానికి చెక్క అమర్చి, బాబాను దానిమీద కూర్చోబెట్టి ఆయనకు ఒక అందమైన కోటు తొడిగేవాడు. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరిగే ఛత్రం పట్టేవాడు. బాబా ద్వారానికెదురుగా ఆసీనులయాక జోగ్ వెండిపళ్ళెంలో బాబా పాదాలు కడిగి, గంధం రాసి తాంబూలం సమర్పించేవాడు. భక్తులు బాబాకు పాదనమస్కారాలు చేసుకునేవారు. అంతలో షామా చిలిం తయారుచేసి బాబాకు అందించేవాడు. తరువాత అది భక్తులందరకూ చేరేది. కోండ్యా కిళ్ళీలను సిద్ధంచేసి బాబాకిచ్చేవాడు. బాబా కొన్ని తాము వేసుకుని, మిగిలినవి భక్తులపై విసిరేవారు. తరువాత శేజారతి జరిగేది. శేజారతి అయ్యాక భక్తులంతా ఇళ్ళకు వెళ్ళేందుకు శలవు తీసుకుంటూండగా బాబా అందరినీ పంపించి తాత్యాతో మాత్రం “వెళితే వెళ్ళావు కానీ, మధ్యమధ్యలో వచ్చి నన్ను గమనించి పోతూండు” అని చెప్పి సెలవిచ్చిపంపేవారు. తాత్యా అలాగేనని చెప్పి వెళ్ళేవాడు.

జగద్రక్షకుడైన శ్రీసాయి లోకధర్మాన్ననుసరించి పవళిస్తున్నట్లు అలా కనులు మూసుకున్నా, వారి కనుదోయినుంచి కరుణాదృక్కులు మనపై సదా ప్రసరిస్తూనేవుంటాయి! ఆయన తన బిడ్డలమైన మనందరినీ చల్లగా గమనించుకుంటూ, కాపాడుకుంటూనే వుంటారు!

సమాప్తం.....
 మూలం: సాయిపథం ప్రధమ సంపుటం

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.

 

1

2

3

4

5

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.


5 comments:

  1. Om Sai ram all experiences are very nice.devotees who saw Sai are very lucky.i want darshan in dreams.please give darshan.om saima

    ReplyDelete
  2. Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo