సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సమయగతి ఎఱుగని సమ్యమీంద్రుని 'సమయనియమాలు'! - శ్రీసాయిబాబా దినచర్య - మూడవ భాగం


బాబా అప్పుడప్పుడు మలబద్ధకం, జీర్ణకోశవ్యాధులతో బాధపడేవారు. వాటి నివారణకు గాను సోనాముఖి ఆకును మరికొన్ని మూలికలను కలిపి కషాయం తయారుచేసేవారు. తాము కషాయం తీసుకునేటప్పుడు ఆ కషాయాన్ని పక్కనున్న భక్తులకీ ఇచ్చేవారు! కండ్లకలక లాంటివి వచ్చినప్పుడు మిరియాలను ముద్దగా నూరి, దానిని కండ్లలో వుంచుకునేవారు. ఇక ఆయనెక్కువగా బాధపడింది ఉబ్బసంతో. ఉబ్బసం మరీ ఎక్కువైనప్పుడు ఆయన పడుతున్న బాధను చూడలేక సన్నిహితభక్తులు కంటతడి పెట్టుకునేవారు. అలాంటి సందర్భంలోనే ఒకసారి, ఆయన్ని చూసి పురందరే పెద్దగా ఏడుస్తుంటే, “భావూ, ఏమైందని నాకిపుడు? తగ్గిపోతుందిలే, ఊరుకో!” అని బాబాయే అతన్ని ఓదార్చవలసివచ్చింది. అంత అనారోగ్యంలో కూడా బాబా తన భిక్షాటనను మానేవారే కాదు. ఆయన నడవలేని స్థితిలో వుంటే ఒక్కోసారి భక్తులే ఆయనను నడిపిస్తూ భిక్షకు తీసుకెళ్ళేవారు! అలా బాబా ఒకసారి తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు ఒక భక్తుడు బాబాకు ఒక చక్రాలకుర్చీని సమర్పించాడు (ఇప్పటికీ ఆ కుర్చీని చావడిలో చూడవచ్చు). బాబా దాన్నొకసారి తాకి పక్కన పెట్టేశారే కానీ, ఎన్నడూ ఆ కుర్చీని ఉపయోగించలేదు.
బాబా అనారోగ్యంగా వున్నపుడు ఆయన ప్రతినిధులుగా భిక్షకు వెళ్లిన భాగ్యాన్ని పొందిన భక్తులలో శ్రీ మాధవరావు దేశ్ పాండే (షామా), శ్రీ బాలక్ రామ్, శ్రీ వామన్ రావ్ పటేల్ (శ్రీ సాయి శరణానంద), ప్రొఫెసర్ జి.జి.నార్కే మొదలైనవారున్నారు.

శ్రీసాయిశరణానంద తమ స్మృతులలో ఇలా రాసుకున్నారు: “ఒకసారి బాలక్ రామ్ ఊర్లో లేనందువల్ల, బాబా కోసం మధ్యాహ్నంపూట భిక్ష చేసే అవకాశం నాకు చాలారోజులు లభించింది. నేను శ్రీజోగ్ ఇంటినుండి భిక్షను, మరొకరి ఇంటినుండి పాలను తెచ్చేవాడిని”. శ్రీసాయిశరణానందకు లభించిన అవకాశం చూసిన నార్కే తనకు ఆ సేవ లభిస్తే బాగుండునని మనసులో తలిచాడు. ఒకరోజు దుస్తులు మార్చుకునే వ్యవధిలేక సూటు-బూటు-హేటులతో మసీదు చేరిన నార్కేనుద్దేశించి బాబా, “ఈరోజు ఇతను భిక్షకు వెళతాడు” అని అన్నారు. ఆనందంతో అతను అప్పటికప్పుడు, ఆ దుస్తులతోనే భిక్షకు వెళ్ళివచ్చాడు. అలా బాబా కొరకు భిక్షచేసే అరుదైన అవకాశం నార్కేకు నాలుగునెలలపాటు లభించింది.

భిక్షకు వెళ్ళేటప్పుడు బాబా భుజాన ఒక జోలె, చేతిలో ఒక రేకుడబ్బా తీసుకువెళ్ళేవారు. అన్నము, రొట్టె, కూరలు మొదలైన ఘనపదార్థాలు జోలెలోనూ, పులుసు, పాలు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలను రేకుడబ్బాలోనూ పోయించుకొనేవారు. ఆయనెన్నడూ రుచుల కోసం చూడలేదు. తన భక్తులకూ “రుచులకు పోవద్దు!” అని చెప్పేవారు.

బాబా భిక్షకు వెళ్ళేమార్గం ఎప్పుడూ ఒకేతీరుగా వుండేది. మసీదు నుండి చావడి దాటిన తరువాత ఎదురెదురుగా వుండే సఖారాం షెల్కే, వామన్ రావ్ గోండ్కర్‌‌ల ఇళ్ళ దగ్గర మొదట భిక్షనడిగేవారు. తరువాత కొద్దిదూరంలో, పక్కపక్కన వుండే బయ్యాజీ పాటిల్ మరియు తాత్యాకోతే పాటిల్ (బయజాబాయి) ఇళ్ళదగ్గర భిక్ష తీసుకుని చివరగా నందూరాం ఇంటికి వెళ్ళేవారు. బయ్యాజీపాటిల్ ఇంటినుంచి వచ్చేదారిలో అప్పట్లో ఒక చిన్నగుట్ట వుండేది. భిక్ష తీసుకుని వస్తూ బాబా అక్కడ నిలబడి వీధిలో కుక్కలకూ, కాకులకూ ఆహారాన్ని పెట్టేవారు. ఇప్పుడు ఆ స్థలంలో బాబా పాదుకలను ప్రతిష్ఠించి వున్నారు. భిక్షాటన నుంచి మసీదుకి రాగానే, కొంత పదార్ధాన్ని ముందు ధునికి సమర్పించేవారు. తరువాత మసీదులో ఒకమూలవుండే కొలంబా (మూకుడు)లో మిగిలిన పదార్ధాలన్నింటినీ వేసేవారు. దానికి పైన మూత వుండేదికాదు. కుక్కలు, పిల్లులు, చీమలు, ఈగలు వంటి ప్రాణులకు అది సిద్ధాన్నం. ఎవరైనా సరే అందులోంచి ఆహారాన్ని యధేచ్ఛగా తీసుకోవచ్చు. వేటినీ తరమటంగానీ, ఎవరినీ వారించటం కానీ జరిగేదికాదు. మసీదు శుభ్రం చేసే స్త్రీ స్వతంత్రంగా దానిలో నుంచి రోజూ ఏడెనిమిది రొట్టెలదాకా తీసుకెళ్ళేది.

బాబా ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర మధ్య లెండీకి వెళ్ళివచ్చేవారు. లెండీకి వెళ్ళేటప్పుడు మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు, అదికూడా ప్రతిసారీ కాదు. ముందు మసీదు బయటకు వచ్చి, కొద్దిసేపు అక్కడ గోడకు ఆనుకుని నిలబడేవారు. తర్వాత మారుతి ఆలయం ఎదురుగా నిలుచుని తీక్షణమైన వీక్షణాలతో ఏవో సంజ్ఞలు చేసేవారు. తర్వాత గురుస్థానం దగ్గర అన్నివీధుల కూడలిలో నిలుచుని కొద్దిసేపు ఎవరికో ఏదో చెబుతున్నట్లు సైగలు చేసి, ముందుకు కదిలేవారు. వాడాలో వున్న భక్తులు, కొత్తగా దర్శనార్థం వచ్చినవారూ బాబాను అక్కడ దర్శించుకునేవారు. వారంతా బాబా రాకకై ఎదురుచూస్తూ ఆ ప్రదేశంలో బారులు తీరి నిలుచుని వుండేవారు. బాబా వారిని ఆప్యాయంగా పేరుపేరునా పలుకరిస్తూ, చిరునవ్వుతో మెల్లగా నడిచేవారు. ఆ తర్వాత ఎడమవైపుకి తిరిగి కానిఫ్ నాథ్ మందిరం దిశగా నడిచేవారు(పోస్టాఫీసు ఎదురుగా కానిఫ్ నాథ్ మందిరం వుంది). కొంతదూరం ముందుకు వెళ్ళి కుడివైపుకి తిరిగి లెండీలో ప్రవేశించేవారు. అలా లెండీకి చేరిన బాబా అక్కడ తమ నిత్యకృత్యాలు తీర్చుకునేవారు. లెండీలో యిపుడు వేప, రావి చెట్లు వున్నచోటే చిన్నగుంటలో ఓ దీపం (నందదీపం) వుండేది. దానిచుట్టూ గోనెపట్టాలతో తెరలు కట్టబడి వుండేవి. బాబా కొద్దిసేపు అక్కడ కూర్చునేవారు. బాబా అక్కడ కూర్చున్నపుడు దానికి వీపుతిప్పి కూర్చునేవారు. దానివంక చూసేవారు కాదు. అబ్దుల్ బాబా ఆ ప్రదేశమంతా శుభ్రంగా చిమ్మటం, దీపాలలో నూనె పోయటం వంటి పనులు చేస్తుండేవాడు. బాబా రాగానే అతనక్కడ రెండుకుండలతో నీరు తెచ్చిపెట్టేవాడు. బాబా ఆ కుండలలోని నీటిని అన్ని దిక్కులకు చల్లుతూ ఏవో సైగలు చేసేవారు. అప్పుడు వేరెవ్వరూ అక్కడ వుండటానికి బాబా అంగీకరించేవారు కాదు. అబ్దుల్ బాబా కూడా ఆ సమయంలో దూరంగానే ఉండేవాడు. లెండీదాకా బాబాతో వచ్చిన భక్తులు కూడా, లెండీ బయటే బాబాకోసం ఎదురుచూస్తూ నిలుచునేవారు. అక్కడున్న వేప, రావి మొక్కలను బాబానే స్వయంగా నాటారు. అందులో ఒక మొక్క మొదట బలహీనంగా వుండి సరిగా ఎదగకుండా వుంటే బాబా రోజూ దాన్ని అటు ఇటూ వూపి వంచేవారు. బాబా అమృత హస్తస్పర్శతో బలం పుంజుకుని కొద్దిరోజుల్లోనే ఏపుగా పెరిగిందది. అక్కడలా కొద్దిసేపు గడిపిన తర్వాత లెండీనుంచి మసీదుకు మళ్ళీ వెళ్ళినదారినే తిరిగివచ్చేవారు. ఈ రాకపోకల దారిని ఆయన ఒక్కరోజున కూడా మార్చలేదు. నియమానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చే బాబా ఏ ఒక్క పనైనా, అది చిన్నదేకావచ్చు పెద్దదేకావచ్చు, నియమం తప్పటానికి ఒప్పుకునేవారు కాదు. బాబా సన్నిధికి అసంఖ్యాకంగా భక్తులు రావడం మొదలైన తర్వాత, బాబా లెండీయాత్ర చిన్నతరహా ఉత్సవంలాగా జరగసాగింది. బాబా లెండీ వెళ్ళడానికి మసీదు బయటకు రాగానే, ఆయన వెనుక నడుస్తూ, భాగోజి ఛత్రాన్ని పట్టేవాడు. నాణ్యమైన కుట్టుపని, అల్లికలు, కుచ్చులతో ఆ ఛత్రం చూడముచ్చటగా వుండేది. ఇక బాబాకు కుడి ఎడమలుగా నానాసాహెబ్ నిమోన్‌‌కర్, బూటీలు నడిచేవారు. వీరందరూ కలిసి లెండీకి నడుస్తున్న ఒరిజినల్ ఫోటో మనకు లభ్యమవుతుంది.

మూలం: సాయిపథం ప్రధమ సంపుటం

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.

 


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo