సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సమయగతి ఎఱుగని సమ్యమీంద్రుని 'సమయనియమాలు'! - శ్రీసాయిబాబా దినచర్య - రెండవ భాగం


సరిక్రొత్త సాయి అంబరం-‘పేదసాధు’లకానాడు సంబరం!

బాబా ఏడెనిమిది రోజులకొకసారి స్నానం చేసేవారు. అరుదుగా ఐదారువారాలపాటు కూడా స్నానం మాటే ఎత్తేవారు కాదు. స్నానం గురించి ఏ భక్తుడైనా ప్రశ్నిస్తే, “ఇప్పుడేగా గంగాస్నానం చేసి వచ్చింది. మళ్ళీ స్నానం ఎందుకు?” అనేవారు. సంకల్పమాత్రాన తమ కాలిగోటినుండి పవిత్రజలాలను ప్రవహింపజేయగల పరమపావనునికి స్నానంతో పనేముంటుంది? రోజూ స్నానం చేయకపోయినా, ఆయన ఎంతో పరిశుభ్రంగా కనిపించేవారు. స్నానానంతరం బాబా ఆకుపచ్చని లుంగీ కట్టుకుని, విడిచిన కఫ్నీని నీటిలో పిండి ధునిపై ఆరబెట్టి వేసుకునేవారు. స్నానం చేసే ఆ సమయంలో తప్ప ఆయనెపుడూ కఫ్నీ లేకుండా వుండేవారుకాదు. బాబా ఎప్పుడూ ముతక కారికం గుడ్డతో కుట్టిన కఫ్నీలనే ధరించేవారు. ఆ కఫ్నీకూడా బాగా చిరుగులుపడి మరీ పాతదైతే, భక్తుల బలవంతంపై కొత్త కఫ్నీని ధరించేవారు. ఆయన వంటినున్న పాతచిరుగుల కఫ్నీని ఎలాగైనా మార్పించాలని తాత్యా ఆయన దగ్గర చేరి ఏదో మాట్లాడుతున్నట్లు నటిస్తూ, “బాబా ఏమిటిది, కఫ్నీ బాగా చిరిగిపోయినట్లున్నదే!” అంటూ ఆ చిరుగులలో వేలుపెట్టి, వాటినింకా పెద్దవిచేసి, ఇక కుట్టుకునేందుకు కూడా వీలు లేకుండా చేసేవాడు. ఆపై, “కఫ్నీ బాగా చిరిగిపోయింది. ఏమైనా సరే కఫ్నీ మార్చాల్సిందే!” అని పట్టుపట్టేవాడు. బాబాకింక తప్పేది కాదు. కఫ్నీ మార్చదలుచుకున్నపుడు కాశీనాథ్ షింపీ అనే బట్టల వ్యాపారిని పిలిచి, “కాశీనాథ్, కఫ్నీ లావ్!” అని పురమాయించేవారు. కఫ్నీ తెచ్చిన ‘కాశీనాథ్’కు దాని ఖరీదు కంటే ఎంతో ఎక్కువ డబ్బులిచ్చేవారు. కొత్త కఫ్నీ వేసుకుని పాతదానిని ధునిలో పడేసేవారు. సామాన్యంగా బాబా తాము కఫ్నీ మార్చినప్పుడు అప్పుడక్కడున్న పేదఫకీర్లకు, సాధువులకు కూడా క్రొత్త కఫ్నీలను పంచేవారు. అలా బాబా తమ కఫ్నీ మార్చిన దినం ఆ పేదసాధువులకు ఒక పండుగే! 1914లో ఒకసారలాగే బాబా క్రొత్త కఫ్నీలను పంచుతుండగా, అక్కడున్న నార్కే అను భక్తుడు తనకూ ఒక కఫ్నీ ఇస్తే బాగుండుననుకొన్నాడు. అతని మనసులో ఆ ఆలోచన మెదలగానే, బాబా నార్కే వైపు తిరిగి, అతని తలపై మెల్లగా తడుతూ, “ఊహు! నీకు కఫ్నీ ఇచ్చేందుకు ఆ పైనున్న ఫకీరు అంగీకరించటంలేదు. నేనేం చేసేది?” అని అన్నారు. అప్పుడప్పుడు బాలానాయీ అనే మంగలిని పిలిపించి నున్నగా గుండు చేయించుకునేవారు, మీసాలను కోసుగా కత్తిరించుకునేవారు. అతనికి బాబా నుంచి బాగా ప్రతిఫలం దక్కేది.

భక్తభారభృతుడు భిక్షకేగిన ‘భంగి’!

ఉదయం ఎనిమిదిగంటల ప్రాంతంలో బాబా భిక్షకు బయలుదేరేవారు. గణపతి కోతే పాటిల్ (బయజాబాయి), అప్పాజీ పాటిల్, సఖారాం షెల్కే, వామన్ గోండ్కర్, నందూరాం మార్వాడీల ఇళ్ళు, సకలలోకాలకు జీవప్రదాత అయిన సాయినాథునికి భిక్షనిచ్చే భాగ్యానికి నోచుకున్న పుణ్యలోగిళ్ళు! బాబా ఒక్కో ఇంటిదగ్గర నిలుచుని ఒక్కోరకంగా పిలిచేవారు. “ఆబాదే ఆబాద్, అల్లా భలాకరేగా!” అని ముందు ఆ ఇంటి ఇల్లాలిని దీవించేవారు. “బయజా మా! జెవన్ దే! రోటీ లావ్!” (అన్నం పెట్టు, రొట్టె తే!) అని బయజాబాయి ఇంటివద్ద అడిగేవారు. అప్పాజీ పాటిల్, వామన్ గోండ్కర్‌‌ల ఇళ్ళముందు వాళ్ళ పేర్లు పిలుస్తూ, “భాక్రీ దే” (రొట్టె ఇవ్వు!) అనేవారు. సఖారాం ఇంటిదగ్గర ‘ఇత్లాయీ బాయీ, రోటీ లావ్!’, అని కేకవేసి భిక్ష అడిగేవారు. ఐదిళ్ళలో చివరగా నందూరాం మార్వాడీ ఇంటికి వెళ్ళేవారు. “నందూరాం, భాక్రీ దే!” అనో, లేకపోతే అతని భార్య రాధాబాయిని ఉద్దేశించి, “బోపిడీబాయి, భాక్రీ దే!” అనో అరిచేవారు. మరాఠీలో “బోపిడీ” అంటే నత్తి అని అర్థం. ఆమె కొద్దిగా నత్తిగా మాట్లాడేదని బాబా ఆమెనలా పిలిచేవారు. ఆమె భిక్ష తేవటం కనుక కొద్దిగా ఆలస్యమైతే, “ఏమిటంత ఆలస్యం?” అని ఒక్కోసారి కేకలేసేవారు. ఇక అప్పుడప్పుడు పండుగ, సందర్భము ఏమీ లేకుండానే “బోపిడీబాయ్, మీఠాలావ్!” అనేవారు. ఆమె కూడా తనకెన్ని పనులున్నాసరే, బాబా అడిగినవెంటనే ఆయనకిష్టమని పూరన్ పోళీలు (బొబ్బట్లు) చేసి బాబాకు తెచ్చిపెట్టేది. అందులోంచి ఒక ముక్క తమ నోటిలో వేసుకుని, మిగిలినదంతా అక్కడున్న భక్తులకు పంచేసేవారు బాబా. బాబా భిక్షకు వెళ్ళే ఇళ్ళను ఏనాడూ మార్చలేదు; భిక్షకు వెళ్ళే ఇళ్ళ క్రమమూ మార్చలేదు. కానీ భిక్ష చేసే సమయాలకు మాత్రం ఏ నియమాలూ వుండేవికావు. ఒక్కోసారి, ఆయన ఒకేరోజున ఏడెనిమిదిసార్లు కూడా భిక్షకు వెళ్ళిన సందర్భాలున్నాయి. శ్రీబయ్యాజీ అప్పాకోతే పాటిల్ చెప్పిన వివరాల ప్రకారం: “బాబా మొదటి మూడు సంవత్సరాలు రోజుకి ఎనిమిదిసార్లు, తరువాత మూడు సంవత్సరాలు రోజుకి నాలుగుసార్లు, ఆ తరువాత పన్నెండు సంవత్సరాలపాటు రోజూ రెండుసార్లు భిక్షకు వెళ్ళేవారు. చివరి రోజులలో రోజుకి ఒక్కసారి మాత్రమే భిక్షచేసేవారు.”
బయజాబాయి ఇంటికి భిక్షకు వెళ్ళినపుడల్లా, ఆమె బాబాను లోపలకు వచ్చి కూర్చుని తన కళ్ళముందు రెండు ముద్దలన్నా తిని వెళ్ళమని బ్రతిమలాడుకునేది. గడప అవతలే తప్ప, ఏనాడూ ఎవరింటి లోపలికీ వెళ్ళి కూర్చుని భిక్ష స్వీకరించని బాబా, ఆ మాతృమూర్తి ప్రేమతో చేసిన అభ్యర్ధనను కాదనలేక ఎప్పుడైనా అరుదుగా వారి ఇంటి అరుగు మీద కొద్దిసేపు కూర్చునేవారు. వరుసగా వాళ్ళింటికి ఎన్నిసార్లు వెళ్ళినాసరే, ఆ తల్లి ఆయననెన్నడూ ఒట్టిచేతులతో పంపేదికాదు. పరుగున వచ్చి బాబా జోలెలో కనీసం ఇంత ఊరగాయో, అప్పడమో తెచ్చిపెట్టేది. బాబా ఆమెను తన సోదరి అనేవారంటే, మరి ఆమె ఎంతటి అదృష్టవంతురాలో! బాబా మహిమను లోకమింకా గుర్తించని రోజుల్లోనే, ఆయనలోని మహనీయతను గుర్తించి, రోజూ ఆయనకు ఆహారం పెట్టికానీ తాను తినకూడదన్న నియమం పెట్టుకుందంటే బయజాబాయి పూర్వజన్మ సంస్కారమెంతటిదో కదా! గొప్ప గొప్ప చదువులు, వింత వింత నాగరికపోకడలు లేకపోతేనేం? భక్తి మమతలతో నిండిన ఆనాటి శిరిడీ గ్రామంలోని గృహిణుల సంస్కారానికి చేయెత్తి మొక్కవలసిందే!

బాబా శిరిడీచేరిన రెండు సంవత్సరాల తర్వాత (1876 సంవత్సరంలో) అహ్మద్ నగర్ జిల్లా అంతటా పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు రోజుల్లో అప్పుడు ధనికులైన నందూరాం, బయజాబాయి ఇళ్ళవద్దకు మాత్రమే బాబా భిక్షకు వెళ్ళేవారు. అప్పుడు ఆయనకు ఒక్కొక్క ఇంటిదగ్గర సగం రొట్టెముక్క లభించేదట!

బాబాను దైవస్వరూపంగా కనుగొన్న భక్తులు ప్రవాహంలా శిరిడీకి రావడం మొదలై, ధనికులైన భక్తులు ఖరీదైన మధురపదార్థాలను నైవేద్యంగా ఆయన ముందు పెడుతున్నా, ఆయన మాత్రం భిక్షాటనతోనే జీవించారు. తమచుట్టూ రోజురోజుకు పెరుగుతున్న ఆడంబరాలపై ఏమాత్రం దృష్టిపెట్టలేదు. లోకానికి ఒక ఫకీరుగా ప్రకటమైన ఆయన, చివరి వరకు ఆ ఫకీరుగానే జీవించారు. తనకోసం వంటచేసుకోవటం కానీ, మరుసటిరోజు కోసం ఏదీ దాచుకోవడంగానీ ఆయనెన్నడూ చేయలేదు. చివరి రోజులలో అనారోగ్యం వల్ల నడవలేని పరిస్థితులలో కూడా, తనకు మారుగా మరెవరినైనా భిక్షాటనకు పంపేవారు.

మూలం: సాయిపథం ప్రధమ సంపుటం

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.

 


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo