- సాయి కృపాశీస్సులు
సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు ప్రశాంతి. మేము కాకినాడలో ఉంటున్నాము. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను కొన్నింటిని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.
మొదటి అనుభవం: కరోనా థర్డ్ వేవ్ సమయంలో ఒకసారి మా బాబు తప్పనిసరి పరిస్థితులలో ఒకేరోజులో కాకినాడ నుంచి ద్రాక్షారామానికి మూడుసార్లు వెళ్లిరావలసి వచ్చింది. దానితో ఆ మరుసటిరోజు ఉదయం బాబుకి బాగా జ్వరం వచ్చింది. శరీర ఉష్ణోగ్రత సుమారు 101 డిగ్రీలు ఉంది. బాబుకి జ్వరం తగ్గడానికి ఆ రోజంతా నా దగ్గర వున్న మందులు వేశాను. కానీ, ఆ రాత్రికి కూడా జ్వరం తగ్గకపోయేసరికి నేను సాయిబాబాకు నమస్కరించుకుని, “స్వామీ! బాబుకి జ్వరం తగ్గితే నీ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని ప్రార్థించాను. బాబా దయవల్ల ఆ మరుసటిరోజు బాబుకి జ్వరం తగ్గింది. తరువాత బాబుని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళితే, ఆయన బాబుకి వున్న జ్వరం లక్షణాలు తెలుసుకుని, “ఇది వైరల్ ఫీవర్, కరోనా కాదు” అని చెప్పారు. ఈ విధంగా బాబుని కరోనా నుంచి రక్షించారు బాబా.
రెండవ అనుభవం: ఒకసారి సంక్రాంతి పండుగ సందర్భంగా మేమంతా భీమవరంలోని మా అమ్మగారింటికి వెళ్ళాము. నా భర్త భోగి పండుగకి ద్రాక్షారామం వెళ్లి సంక్రాంతిరోజుకి మా అమ్మగారి ఇంటికి వచ్చారు. పండుగ తరువాత మేము మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి కాకినాడ తిరిగి వచ్చాము. వచ్చాక తెలిసింది, మా అత్తగారికి, మా వదినకి, వాళ్ళ పిల్లలకి కరోనా వచ్చిందని. ఆ తరువాత మా అందరికీ కూడా జ్వరం వచ్చింది. మా పాపకి కోవిడ్ టెస్ట్ చేయిద్దామనుకుంటే, తనకు స్కూల్లో కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేసి ఒక వారంరోజులే అయింది. వ్యాక్సిన్ వేసిన వారంరోజుల్లో వ్యాక్సిన్ ఎఫెక్ట్ వల్ల జ్వరం వస్తుంది. ఆ సమయంలో కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని వస్తుంది. అందుకని ఆ సమయంలో కోవిడ్ టెస్ట్ చేయించుకోకూడదు. వ్యాక్సిన్ వేసిన 15 రోజుల తర్వాత జ్వరం వస్తే, అప్పుడు కోవిడ్ టెస్ట్ చేయించుకుని మందులు వాడాల్సి ఉంటుంది. ఆ విషయం అలా ఉంచితే, నేను 3 రోజులపాటు జలుబుతో బాధపడ్డాను. ఒకరోజు అయితే జలుబు మరీ ఎక్కువై శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది. అయితే నాకు జ్వరం మాత్రం ఏమీ లేదు. ఏదేమైనా అందరం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుండటంతో నేను సాయిబాబాకు నమస్కరించుకుని, “స్వామీ! మా కుటుంబంలో మా అత్తగారికి, వదినకి, వాళ్ళ పిల్లలకి కరోనా వచ్చింది. ఇక్కడ మేము జ్వరంతో బాధపడుతున్నాము. మమ్మల్నందరినీ ఈ కరోనా నుండి రక్షించి, మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామీ” అని ఆర్తిగా వేడుకున్నాను. బాబా దయవల్ల మా అందరికీ 3 రోజుల్లో జ్వరం పూర్తిగా తగ్గింది. మళ్ళీ మేమందరం ఆరోగ్యవంతులమయ్యాము. ఈవిధంగా బాబా మమ్మల్నందరినీ కరోనా నుంచి రక్షించారు.
మూడవ అనుభవం: మా పాపకి 10వ తరగతి ఫైనల్ పరీక్షలు ప్రారంభమైనప్పుడు తను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నాకు 10వ తరగతి ఫైనల్ పరీక్షలలో మంచి మార్కులు వస్తే, నా అనుభవాన్ని నీ బ్లాగులో పంచుకుంటాన”ని మ్రొక్కుకుంది. బాబా దయవల్ల తనకు పరీక్షల్లో 569 మార్కులు వచ్చాయి. “ధన్యవాదములు సాయీ!”
నాలుగవ అనుభవం: ఒక నెలరోజుల క్రితం చాలా తరచుగా బంధువులు మా ఇంటికి రావడంతో పని ఒత్తిడితో బాగా అలసిపోయాను. విశ్రాంతి లేకపోవడంతో, నా ఎడమకాలు పైనుంచి క్రిందవరకు చాలా ఎక్కువగా లాగేస్తుండేది. కూర్చోవడానికి, నిలబడటానికి చాలా ఇబ్బందిగా ఉండేది. కాలు ముడుచుకోవడం కూడా కష్టంగా ఉండేది. విశ్రాంతి తీసుకొంటే నొప్పి తగ్గుతుందేమో అనుకుంటే అప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. నిద్రలో ఏమైనా పట్టేసిందేమో అనుకున్నాను. కానీ అది నిద్రలో కూడా సెట్ అవలేదు. కాలినొప్పితో నాకు అసలు నిద్రపట్టేది కాదు. ఇలా ఉండగా ఒకరోజు, మెడికల్ రిప్రజెంటేటివ్ అయిన మా వదినగారి అబ్బాయికి ఫోన్ చేసి నా సమస్య గురించి చెబితే, దానికి సంబంధించిన మెడిసిన్ సూచించాడు. ఆ మెడిసిన్ వేసుకొన్నాక ఉపశమనం లభించింది, కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. నేను పడుతున్న బాధను చూసి కొందరు అది సయాటికా అనీ, మరికొందరు ఎముకేమైనా బెణికిందేమో అనీ సందేహం వెలిబుచ్చి, డాక్టర్ని సంప్రదించమని సలహా ఇచ్చారు. దాంతో నేను డాక్టర్ని సంప్రదించాలని నిర్ణయించుకుని ఒకరోజు బాబాకు నమస్కరించుకుని, “బాబా! నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. నువ్వే ఆ డాక్టర్ హృదయంలో ఉండి, ‘X-ray ఏమీ అవసరంలేదు, మందులు వాడితే నొప్పి తగ్గిపోతుంది’ అని ఆయన చేత చెప్పించు స్వామీ” అనుకుని హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టరుగారు నా సమస్య విని, “పని ఎక్కువైనపుడు ఒకొక్కసారి తొడ ఎముక రాసుకుంటుంది. దానివల్ల మీకు నొప్పి వచ్చింది” అని చెప్పి, పారాసిటమాల్, జిన్కోవిట్(zincovit) టాబ్లెట్స్ ఇచ్చి కొద్దిరోజులు వాడమన్నారు. “నువ్వు తప్ప నాకింక దిక్కు ఎవరూ లేరు. నువ్వే నాకు దిక్కు” అని బాబాను ఆర్తితో అడిగితే కన్నతల్లిలా మనలను ఆదుకుంటారు బాబా.
అయిదవ అనుభవం: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉగాదికి ముందు నాకు ఒకరోజు ఉన్నట్టుండి శరీరమంతా ఒకటే వేడిమంటలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఛాతీ క్రిందనుండి చాలా చిన్నచిన్న పొక్కులు రావడం మొదలైంది. అలా ఆ పొక్కులు ఒకచోటనుంచి మరొకచోటికి వ్యాపించాయి. వేడిమంటలు తట్టుకోలేక ప్రతిరోజూ బాధపడేదాన్ని. తెలిసినవాళ్ళు నాతో, “ఇది జంధ్యాలచప్పి, ఆడవారికి కూడా వస్తుంది. మంత్రం వేయించుకోండి, తగ్గిపోతుంది. దీనికి మెడిసిన్ కూడా వాడవచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్ రాదు” అని చెప్పారు. నేను బాబాకు నమస్కరించుకుని, “స్వామీ! నీ ఊదీయే నాకు మెడిసిన్” అని చెప్పుకుని, బాబా ఊదీని నీళ్ళల్లో కలుపుకొని త్రాగాను. అలా 3 రోజులు వరుసగా బాబా ఊదీనీళ్లు త్రాగేసరికి శరీరమంతా ఉన్న వేడిమంటలు తగ్గాయి. అలాగే పొక్కులు కూడా తగ్గాయి. “స్వామీ! నీ దయ ఎంతని చెప్పను తండ్రీ!”
ఆరవ అనుభవం: కొద్దిరోజుల క్రితం నాకు బాగా గ్యాస్ ఏర్పడి, నా ఎడమచేయి, ఎడమవైపు ఛాతీ భాగమంతా బాగా విపరీతమైన నొప్పి వచ్చింది. దాంతో నేను బాబాకు నమస్కరించుకుని, ఊదీనీళ్ళు త్రాగి, “స్వామీ! నాకు ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తోంది. ఏరోజూ కూడా ఆనందంగా నామస్మరణ చేసుకోలేకపోతున్నాను” అని బాబా దగ్గర చాలా బాధపడ్డాను. తరువాత, “బాబా! నా అనుభవాలు ఎప్పటికప్పుడు బ్లాగులో పంచుకుంటానని మీతో చెప్పుకోవడం, తర్వాత అశ్రద్ధ చేయడం జరుగుతోంది. నా తప్పులను క్షమించి, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామీ” అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల ఆ మరుసటిరోజు నా నొప్పి చాలావరకు తగ్గింది. “స్వామీ! నీ దయ, నీ కరుణ ఎల్లప్పుడూ మా అందరిమీదా ఉండాలి.”
సర్వం శ్రీసాయి చరణకమలార్పణమస్తు!!!
