1. తొందరగా అనుగ్రహించే దైవం సాయిబాబా
2. శ్రీ సాయినాథుని దీవెనలు
3. బాబా దయతో కుదుటపడిన నాన్న ఆరోగ్యం
తొందరగా అనుగ్రహించే దైవం సాయిబాబా
నేను ఒక సాయి భక్తుడిని. నేనిప్పుడు బాబా అనుగ్రహించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. అవి చిన్న అనుభూతులే కావచ్చు కానీ, వాటిని 'బ్లాగులో పంచుకుంటాన'ని సాయికి మాటిచ్చాను. నాకు మొదట్లో సాయిబాబా చరిత్ర పారాయణ గురించికానీ, ఆయన బోధనల గురించికానీ ఏమీ తెలియదు. ఏదో ఆ సద్గురుమూర్తికి నమస్కారం చేసేవాడిని అంతే. అలాంటి నేను సాయి సచ్చరిత్ర పుస్తకాన్ని మొట్టమొదటిసారి చదివేటప్పుడు మంచం మీద పడుకుని రోజుకి ఒక అధ్యాయం చొప్పున చదివాను. సాయి సచ్చరిత్ర ద్వారా నాకు పారాయణ అంటే ఏమిటో తెలిసింది. తరువాత రోజుల్లో స్నానం చేసి, పూజ చేసి, విడిగా కూర్చుని సచ్చరిత్ర పారాయణ చేయసాగాను. ఒకసారి నేను నా కంపెనీ పని పూర్తి చేసిన తర్వాత పూజ చేసి పారాయణ మొదలుపెట్టాను. నేను చదువుతూ ఉండగా ఒక అధ్యాయంలో "నా భక్తుని ఇంట్లో అన్నవస్త్రాలకు లోటుండదు" అని ఉంది. నేను అక్కడ ఆగి, 'నాకేమైనా లోటు ఉందా?' అని కొద్దిసేపు ఆలోచనలో పడ్డాను. నా చిన్నతనంలోనే మా అమ్మానాన్నలు విడిపోవడం వల్ల మా నాన్న మమ్మల్ని పట్టించుకునేవారు కాదు. అందువలన మేము పేదరికం అనుభవించేవాళ్ళం. తిండికి కూడా లోటుగా ఉండేది. అయితే నేను ఎప్పుడూ ఖాళీగా ఉండకపోవడం వల్ల, జులాయిగా తిరగకపోవడం వల్ల, నిరంతరం శ్రమను నమ్ముకోవడం వల్ల మా పరిస్థితి కొంచం మెరుగుపడింది. తిండికి లోటుండేది కాదు కానీ, వస్త్రాలకు కొంచం ఇబ్బందిగా ఉండేది. నాకు షర్టులు ఎక్కువగా ఉన్నా ప్యాంట్లు మాత్రం నాలుగైదే ఉండేవి. వాటిలో కూడా ఒకదానికి జిప్ ఉండేది కాదు, మరొకటి బాగా పాతది, అది వేసుకుంటే కింద కూర్చోవడం కష్టంగా ఉండేది. ఇవన్నీ నా మదిలో మెదిలాక, "నా భక్తుని ఇంట్లో అన్నవస్త్రాలకు లోటుండదు" అని సాయి చెప్తున్నారు. కానీ 'నాకు ప్యాంట్లు కొరతగా ఉన్నాయి కాబట్టి, నేను ఆయనకి భక్తుణ్ణి కాదేమో! ఒకవేళ నేను సాయి భక్తుణ్ణి అయితే నాకు ఎందుకు లోటు ఉంది?' అని అనిపించింది. అదే ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రపోయాను. నాది కేవలం ఆలోచన మాత్రమే. ఏ విధమైన ప్రార్థనగానీ, అభ్యర్థనగానీ బాబాకు చేయలేదు. మరుసటిరోజు ఉదయం నేను యథావిధిగా నేను కంపెనీకి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చాను. ఇంట్లో చూస్తే 8 ప్యాంట్లు ఉన్నాయి. వాటి విషయం అమ్మని అడిగితే, "పట్టణంలో ఒక పెద్దాయన ఇచ్చారు. అవి నీకే, తీసుకో!" అని అమ్మ చెప్పింది. ఆయనెవరో నాకు తెలీదుకానీ అప్పటినుంచి నాకున్న వస్త్రాల లోటు కూడా నన్ను పూర్తిగా వదిలేసింది. ఈరోజు నేను ఇతరులకి వస్త్రాలు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాను. మన మనసు పొరల్లో వచ్చే చిన్న ఆలోచన కూడా సాయికి తెలుస్తుంది. నిజంగా మనకు అవసరమైన వాటిని ఆయన తప్పక చే(ఇ)స్తారు. సాయి సచ్చరిత్ర పారాయణ నా జీవితాన్ని సమూలంగా మార్చివేసింది. ఒకప్పుడు నేను 'నాకు మంచి-చెడు చెప్పేవారు లేర'ని బాధపడేవాణ్ణి. అలాంటి నేను ఇప్పుడు ఎవరికైనా, ఎలాంటి సమస్యకైనా ధైర్యం చెప్పగలగుతున్నాను. ఇది నాకు సాయిసచ్చరిత్ర పారాయణ వలన, గురుస్మరణ వలనే సాధ్యమైంది. నేను కొత్తగా మహా పారాయణలో కూడా చేరి అందులో సభ్యునిగా కొనసాగుతున్నాను.
ఒకసారి నేను విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్డాను. సరిగా అప్పుడే ఈ బ్లాగులో ఒక భక్తురాలు 'ఊదీతో తనకున్న బాధ తగ్గింద'ని పంచుకున్న అనుభవం చదివాను. వెంటనే నేను కూడా ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగి, "బాబా! కడుపునొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మాటిచ్చాను. అంతే, రెండు రోజులుగా వేదిస్తున్న కడుపునొప్పి నిమిషాల వ్యవధిలో తగ్గిపోయింది. తొందరగా అనుగ్రహించే దైవం సాయిబాబా.
ప్రస్తుతం నేను ఒక ఇంటి నిర్మాణం చేపట్టాను. ప్లాస్టింగ్ వర్క్ జరగాల్సి వుంది. అయితే రెండు లక్షల అప్పు ఉంది. బాబా దయతో ఏ ఇబ్బంది లేకుండా ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. నేను నా ఇంటికి 'సాయి నిలయం' అని పేరు పెట్టుకుంటాను. సాయి తండ్రి నా ఇబ్బందులను అర్థం చేసుకుని త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. అప్పుడెప్పుడో తెలియక పట్టుకున్న బాబా పాదుకలు ఇప్పుడు తెలిసి పట్టుకోవాలని నా మనసు ఎంతగానో ఉబలాటపడుతుంది. కానీ కరోనా నిబంధనల వల్ల కుదరడం లేదు. "బాబా! మీ కృపకోసం ఎదురుచూస్తున్నాను. త్వరగా నాపై దయ చూపండి బాబా. మీకు చాలా చాలా ధన్యవాదాలు". చివరిగా ఓపికగా నా అనుభవాన్ని చదివిన మీ అందరికీ ధన్యవాదాలు. మరొక అనుభవంతో మళ్లీ వస్తాను.
శ్రీ సాయినాథుని దీవెనలు
అనంతకోటి బ్రహ్మాండనాయక శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నేను ఒక సాయి భక్తురాలిని. బాబా ఇటీవల నాకు ప్రసాదించిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, డిసెంబరు నెలలో నా చేతికున్న ఉంగరం ఎక్కడో పోయింది. అది చిన్న ఉంగరమే అయినా నాకు ఏదో తెలియని భయం, బాధ కలిగాయి. కారణం, మేమున్న పరిస్థితుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నదాన్ని కూడా తట్టుకునే పరిస్థితి నాకు తగ్గిపోయింది. సరే, ఏ కష్టమొచ్చినా మన బాబాని శరణు వేడటం సాయి భక్తులందరికీ అలవాటే కదా! నేను కూడా బాబా దగ్గరకి వెళ్లి, "తండ్రీ! వెంటనే నా ఉంగరం దొరికితే, మీ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను బాబా" అని వేడుకున్నాను. అలా చాలాసార్లు బాబాను ప్రార్థిస్తూ ఒక రోజంతా ఆ ఉంగరం కోసం అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాము. కానీ ఎంత వెతికినా ఉంగరం కనపడలేదు. 'ఇంక ఆ ఉంగరం పోయినట్లే' అని అనుకున్నాను కూడా. కానీ నా మనసుకి నేను సర్దిచెప్పుకోలేకపోయాను. మరుసటిరోజు పూజలో కూర్చుని కూడా ఆ ఉంగరం గురించే ఆలోచిస్తూ, దొరికితే బాగుండు అనుకుంటున్నాను. అంతలో మా పనమ్మాయి బట్టల దగ్గర ఉంగరం దొరికిందని తెచ్చి ఇచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నేను అదే చోట ఒకటి కాదు, రెండు కాదు చాలాసార్లు వెతికాను. అంతెందుకు పూజలో కూర్చోడానికి ముందు కూడా అక్కడ వెతికి వచ్చాను. అలాంటిది అక్కడే ఉంగరం దొరికిందంటే అది బాబా చేసిన అద్భుతం అనిపిస్తుంది నాకు. "ధన్యవాదాలు బాబా. ఉంగరం దొరికిన వెంటనే బ్లాగులో పంచుకోవాలని అనుకున్నప్పటికీ ఆలస్యమైంది. నన్ను క్షమించండి బాబా. మమ్మల్ని ఇలానే దయతో కాపాడు తండ్రి. మా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి మాకు ఒక మంచి దారి చూపించు సాయినాథా. కష్టాలు తీరి మా కుటుంబమంతా హాయిగా ఉండేలా అనుగ్రహించు స్వామి. మా భారమంతా మీదే బాబా".
2021, డిసెంబర్ 25న శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు మన తండ్రి బాబా. మేము వెళ్ళే సమయానికి భక్తులు ఆరతులకు హాజరయ్యే అవకాశం రద్దు చేశారని తెలిసి, "అయ్యో బాబా! మీ ఆరతి దర్శనం మాకు దొరికితే బాగుంటుంది" అనుకున్నాము. మన బాబా ఎంత బాగా అనుగ్రహించారో చూడండి. మాతోపాటు వచ్చిన మా స్నేహితులిద్దరు డొనేషన్ కట్టారు. ఆ కారణంగా ఆరతులకు, దర్శనాలకు ఉచితంగా వెళ్ళే అవకాశం బాబా మాకు ప్రసాదించారు. అలా ఆరతికి హజరైనప్పుడు బాబాకి ఎదురుగా కూర్చుని, తనివితీరా వారిని దర్శించుకునే అదృష్టం మాకు దక్కింది. అలా మేము ఉన్న 4 రోజులలో ప్రతి పూటా తమ దర్శనానికి, ఆరతులకు హాజరయ్యే భాగ్యాన్ని కలిగించారు ఆ సాయితండ్రి. అయితే ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా కూడా మరోసారి దర్శించగలిగితే బాగుంటుందన్న ఆలోచనే మా అందరి మదిలోన. ఏదేమైనా అంతటి అవకాశమిచ్చిన బాబాకు ఎన్ని వేల నమస్కారాలు సమర్పించుకున్నా తక్కువే.
ఇకపోతే మా ప్లాన్లోగానీ, ఆలోచనలోగానీ లేని వణిలోని శ్రీ సప్తశృంగిదేవి దర్శనానికి మార్గం చూపి, మాచేత ఆ దేవి దర్శనం చేయించారు బాబా. అక్కడి నుండి నాసిక్ వెళ్లి, ఆ తరవాత శ్రీత్రయంబకేశ్వరుని దర్శనం, అపై ఘంటా గణపతి దర్శనం చేసుకున్నాము. ఇవన్నీ ఆ సాయినాథుని దీవెనలే మాకు. ఆ చల్లని దీవెనలతో తిరిగి మేము మా ఊరు క్షేమంగా చేరుకున్నాము. "తండ్రీ! నీ లీలలు ఏమని చెప్పనయ్యా. మళ్ళీ త్వరగా మీ దర్శన భాగ్యాన్ని మాకు కలిగించండి. కోవిడ్ మహమ్మారి నుండి ఈ లోకాన్ని రక్షించండి సాయినాథా. మీ బిడ్డలమైన మమ్మల్నందరినీ సర్వదా కాపాడు తండ్రి. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండలా ఆశీర్వదించండి బాబా".
బాబా దయతో కుదుటపడిన నాన్న ఆరోగ్యం
శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
సద్గురు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
నా పేరు మాధురి. ముందుగా సాయి బంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను ఇంతకు ముందు కొన్ని అనుభవాలు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. మా నాన్నగారి వయస్సు 85 సంవత్సరాలు. ఈ మధ్య ఒకరోజు రాత్రంతా ఆయనకు విపరీతంగా నీళ్ళ విరోచనాలు అయ్యాయి. రాత్రంతా యాంటీబయోటిక్స్, సెలైన్లు ఎక్కించారు. ఉదయానికి విరోచనాలు కొంచెం తగ్గినా మధ్యాహ్నానికి మళ్ళీ మొదలై అలా అవుతూనే ఉన్నాయి. రాత్రి పదిగంటలప్పుడు ఐదు నిమిషాల్లో మూడుసార్లు విరోచనాలు అయ్యాయి. ఆయన బాగా నీరసించిపోయారు. మాకు చాలా భయమేసి హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాలని అనుకున్నాము. హాస్పిటల్కి వెళ్లేముందు నేను, "బాబా! ఈ కరోనా కాలంలో హాస్పిటల్ సురక్షితం కాదు. కానీ తప్పట్లేదు. నాన్న క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. ఆయన క్షేమంగా వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. మేము మూడురోజులు హాస్పిటల్లో ఉన్నాము. బాబా దయవలన నాన్న ఆరోగ్యం బాగవడంతో గురువారంనాడు ఆయనని డిశ్చార్జ్ చేసారు. ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి రావడం బాబా దయ, ఆయన కృప. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని కొంచెం ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా. మేమందరమూ మీ పాదాలను ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉండేలా మమ్మల్ని అనుగ్రహించండి. మీ అనుగ్రహం అందరిపై ఉండాలి బాబా".
