1. సాయి అజ్ఞలేక ఏదీ జరగదు
2. బాబా కృపాశీస్సులు
3. బాబా దయతో ఏ ప్రాబ్లం లేదని వచ్చిన రిపోర్టు
సాయి అజ్ఞలేక ఏదీ జరగదు
జై సద్గురు సాయినాథాయ నమః!!!
సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
"నా ఆజ్ఞలేక ఆకైనా కదలదు" అని బాబా స్వయంగా చెప్పారు. అంటే బాబా ఆజ్ఞలేక మనము కదలలేము, బయటకి వెళ్లలేము, ఏ పనీ చేయలేము. ఆ సాయికృప వలనే ఏ అనుభవమైనా, ఏ పనైనా. మన పూర్వజన్మ పుణ్యఫలం వలన అటువంటి సాయినాథుడు మనకు దొరికాడు, మనమీ జన్మలో ఆయన భక్తులమైనాము. నాపేరు మల్లారెడ్డి. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకుంటున్నాను. ముందుగా ఆ సాయి పాదపద్మములకు నా శతకోటి వందనాలు. ఈ బ్లాగులో సాయిభక్తుల అనుభవాలను ప్రచురిస్తున్న సాయికి ధన్యవాదాలు. ప్రతిరోజూ నేను తోటి భక్తుల అనుభవాలను చదువుతూ, వాటిని ఇతర భక్తులతో పంచుకుంటూ బాబా ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాను.
సాధారణంగా మేము దీపావళినాడు నోము నోచుకుని, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం చేసుకుంటాము. కానీ కొన్ని అనివార్యకారణాలవల్ల గత 3, 4 సంవత్సరాలుగా చేసుకోలేకపోయాం. అందువల్ల ఈ సంవత్సరమైనా ఊరు నుండి మా అమ్మగారిని తీసుకొచ్చి దీపావళి మంచిగా చేసుకుందామనుకున్నాను. కానీ అనివార్యకారణాల వల్ల మా అమ్మగారు రాలేకపోయారు. అసలు విషమేమిటంటే, నేను 2021, నవంబరు 3న పూజకు కావాల్సిన వస్తువుల కోసం ఒక షాపుకి వెళ్లాను. ఆ షాపులో ఉండగా మా బావగారు నాకు ఫోన్ చేసారు. అయితే నేను ఫోన్ ఎత్తలేదు. అయినా అతను మళ్లీమళ్లీ ఫోన్ చేస్తుంటే చాలాసేపటి తరువాత నేను ఫోన్ ఎత్తితే, 'మా బ్రదర్ అంటే పెదనాన్న కొడుకు చనిపోయాడ'ని మా బావగారు చెప్పారు. వెంటనే నేను షాపు నుంచి బయటికి వచ్చాను. దీపావళినాడు అంత్యక్రియలు చేసే వీలులేదు కాబట్టి, అదేరోజు అంటే మూడో తారీఖున చేస్తారని వెంటనే హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్ళాను. అక్కడ అంత్యక్రియలు చూసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాను. వచ్చిన రోజు నుంచి నాకు జలుబు, దగ్గు, జ్వరము మొదలయ్యాయి. నాతోపాటు మా ఇంట్లో ఉన్న నలుగురూ జ్వరము, దగ్గు, జలుబులతో చాలా బాధపడ్డారు. ఆ సాయినాథుని వేడుకుంటూ హాస్పిటల్స్ కి తిరిగాము. కానీ తగ్గలేదు. ఇలా ఉండగా నేను వెళ్ళిన ఊళ్ళో అందరికీ జ్వరము, దగ్గు, జలుబు వచ్చి బాధపడ్డారని అందరూ అంటుంటే నేను చాలా భయపడ్డాను. కరోనా కాలంలో ఏమిటిలా అని ఎంతో బాధపడ్డాను. సాయినాథుని గుడికి వెళ్లి, "నాకు, నా కుటుంబానికి తొందరగా తగ్గిపోవాల"ని ఆ తండ్రిని వేడుకున్నాను. ఊదీ నుదుటన ధరించి, ఊదీ నీళ్ళు త్రాగడం ప్రతిరోజూ వారం రోజులపాటు చేయగా మాకు తగ్గింది. కానీ మా అబ్బాయికి బాగా ఎక్కువైంది. దాంతో వాంతులు చేసుకోవడం, తినకపోవడం చేస్తుండేవాడు. తరువాత తనకి కూడా బాబా దయవల్ల నయమైంది. ఇకపోతే మా అమ్మగారు కూడా జలుబు, దగ్గుతోపాటు విపరీతమైన జ్వరమొచ్చి చాలా బాధపడ్డారు. ఆమె ఒక్కతే ఊరిలో ఉంటున్నందున ఏమీ తినక బాగా నీరసించిపోయింది. పదోరోజు కర్మ చేయడానికి ఊరు వెళ్లి, బాగా నీరసించిపోయి ఉన్న అమ్మను దగ్గర్లోని హాస్పిటల్ కి తీసుకెళ్లి టెస్టులు చేయించి, "రిపోర్టులన్నీ నార్మల్ వచ్చేలా అనుగ్రహించమ"ని సాయినాథుని వేడుకున్నాను. ఆయన దయవల్ల నేను కోరుకున్నట్లుగానే అంతా నార్మల్ అని వచ్చింది. "చాలా చాలా ధన్యవాదాలు సాయి. నా కోరిక మన్నించిన మీ పాదపద్మములకు శతకోటి వందనాలు".
ఈమధ్య ఒకసారి నాకు గుండె దగ్గర విపరీతమైన నొప్పి వచ్చింది. అలా రెండు, మూడు రోజులు వచ్చేసరికి గురువారంనాడు నేను ఆ సాయినాథుని ఊదీ గుండెపై రాసుకుని, మరికొంత ఊదీ నీళ్ళలో వేసుకుని త్రాగాను. తరువాత సాయినాథుని గుడికి వెళ్లి, అయన దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి నా నొప్పి తగ్గిపోయింది.
ఇప్పుడు చెప్పోబోయేది చాలారోజుల క్రిందటి అనుభవం. నేను, మా అమ్మాయి ప్రతి గురువారం సాయినాథుని గుడికి వెళ్తాము. ఆ సాయినాథుని కరుణవలన మా అమ్మాయికి మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీ అనే మంచి కాలేజీలో బీ.టెక్ సీటు వచ్చింది. ఆ సాయినాథుడు నాపై ఎల్లప్పుడూ ఇలా తమ కరుణను చూపుతున్నారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ అనుభవాలను నేను ఎప్పుడో పంచుకోవాలి. ఎన్నోసార్లు పంచుకోవాలనుకున్నాను కూడా. కానీ సాధ్యపడలేదు. ఆ సాయినాథుని లీలలు ఎవరికీ తెలియవు. ఆయన ఆజ్ఞ అయినప్పుడే మనం మన అనుభవాలను పంచుకోగలుగుతాం. అది ఆయన కృపవల్లనే జరుగుతుందని నా నమ్మకం. నేను సాయిని కోరుకునేదొక్కటే, 'ఎప్పుడూ నా మనసు, నా బుద్ధి ఆయన పాదాలపై లగ్నమై ఉండాల'ని. "సాయినాథా! నా కోరికను మన్నించమని మనవి చేసుకుంటున్నాను. ఎప్పటినుంచో నాకున్న కోరిక మీకు తెలుసు సాయీ. మీకు తెలియనిదంటూ ఏమీ లేదు. సర్వ జగత్తుకు మూలాధారమైన వారు మీరు. కాబట్టి నా కోరిక నెరవేర్చండి సాయి. సాయీ, నాకు కిడ్నీలో రాళ్ల సమస్య ఉంది. మీ ఊదీ వేసిన నీళ్లు త్రాగుతున్నాను. నా సమస్యను వెంటనే తీసివేయండి. నాకు కొంత డబ్బు రావాల్సి ఉంది. ఆ డబ్బు తీసుకున్నవాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు. ఆ డబ్బు త్వరగా వచ్చేటట్టు నాకు సహాయం చేయండి. అలాగే మీ దర్శనానికి నన్ను శిరిడీకి తీసుకుని వెళ్ళండి. ఈమధ్య నాకు మీపై భక్తి లేకుండా పోతుంది. ఎప్పుడూ మీపై నా మనసు నిలిచేలా అనుగ్రహించండి. మీరు కరుణాసాగరులు. మేము మీ ప్రేమలో మునిగితేలుతున్నాము. కరుణాసాగరా! ఆత్మబంధు! తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన సద్గురు సాయినాథా మాపై ఎల్లవేళలా మీ కరుణ కురిపించమని మీ పాదపద్మములపై శిరస్సు ఉంచి వేడుకుంటున్నాను. చివరిగా మీ ఈ బిడ్డను దీవించండి". మరో అనుభవంతో మీ ముందుకు వస్తానని, ఆ సాయినాథుని కృప ఎల్లవేళలా భక్తులందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బాబా కృపాశీస్సులు
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
ముందుగా సాయిభక్తులకు నమస్కారం. నా పేరు రజనీకాంత్. నేను బాబా భక్తుడిని. ఈ బ్లాగు గురించి నాకు మా అక్క ద్వారా తెలిసినప్పటి నుంచి నేను ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతున్నాను. తద్వారా నాకు సాయి మీద నమ్మకం బాగా పెరిగింది. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. ఒకసారి మా పొలంలో ఉన్న మోటార్ పని చేయిడం మానేసింది. అప్పుడు నేను, 'పెద్ద సమస్య లేకుండా తక్కువ ఖర్చుతో మోటర్ బాగైతే, నా అనుభవాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల తక్కువ ఖర్చుతో మోటర్ బాగైంది. "థాంక్యూ బాబా! నేను ఏమన్నా తెలిసీతెలియక తప్పులు చేస్తే నన్ను క్షమించండి బాబా".
ఒకరోజు నాకు ముళ్ళు గుచ్చుకుంది. అప్పటికి నొప్పి తెలియలేదుగానీ ఆ రాత్రికి నొప్పిగా అనిపించింది. మరుసటిరోజు ఆ నొప్పి ఇంకా ఎక్కువై అస్సలు నడవలేకపోయాను. అందరూ ఆ నొప్పి మూడు రోజులు ఉంటుందని అన్నారు. అప్పుడు నేను, "బాబా! త్వరగా నొప్పి తగితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి నొప్పి కొంచం తగ్గి, ఆ మర్నాటికి పూర్తిగా తగ్గిపోయింది. "త్వరగా నొప్పి తగ్గించినందుకు ధన్యవాదాలు బాబా".
2022, జనవరిలో నా బైక్కి సంబంధించిన కాగితాలు కనిపించలేదు. ఇల్లంతా వెతికినప్పటికీ అవి దొరకలేదు. ఆ బైక్ మేము సెకండ్ హ్యాండ్లో కొన్నాము. ఇంకా నా పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు. కాబట్టి ఆ కాగితాలు కనపడకపోతే ఇక ఆ బైక్ దొంగ బైక్ లెక్క కిందికి వెళ్ళిపోతుంది. అందువల్ల నేను, "బాబా! ఏదైనా అద్భుతం జరిగితే, 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. అంతే, ఒక్క రోజులో బైక్ కాగితాలు దొరికాయి. అదీ బాబా మహిమ అంటే.
మా తమ్ముడికి ఎంత ప్రయత్నించినా ఉద్యోగం వచ్చేది కాదు. ఒకసారి వచ్చినట్లే వచ్చి చివరి క్షణంలో చేజారిపోయింది. ఉద్యోగ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నందుకు తమ్ముడు చాలా బాధపడ్డాడు. మేము బాబానే నమ్ముకున్నాం. బాబా మిరాకిల్ చేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది కదా! తమ్ముడు ఉద్యోగం గురించి ఎప్పుడు సాయిబాబా క్వశ్చన్&ఆన్సర్స్ వెబ్సైట్లో అడిగినా, "అంతా మంచి జరుగుతుంది. అంతా బాగుంటుంది" అని వచ్చేది. మా తమ్ముడువాళ్ళు సాయి దివ్యపూజ 9వారాలు చేశారు. చివరి వారం అంటే 9వ వారం తమ్ముడికి చేజారిన ఉద్యోగం కంటే అధిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అంతా బాబా దయ. బాబా తన భక్తులను ఎన్నటికీ బాధపడనివ్వరు. ఆయనకి ఏది, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు ఉండాలి. లవ్ యు బాబా. నాకు ఒక కోరిక ఉంది, తొందరలో అది తీరుస్తారని ఆశిస్తున్నాను".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
బాబా దయతో ఏ ప్రాబ్లం లేదని వచ్చిన రిపోర్టు
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. నేను ఒక సాయిభక్తుడిని. ఈ రోజు నేను బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2022, జనవరి 4న నేను బ్లడ్ టెస్టుకి శాంపిల్స్ ఇచ్చాను. రిపోర్టులో అన్నీ నార్మల్ అని వచ్చాయి కానీ, కొలెస్ట్రాల్ మాత్రం ఎక్కువ ఉందని వచ్చింది. ఆ ల్యాబ్ అతను, "మీరు వెంటనే డాక్టరును సంప్రదించండి. కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ ప్రాబ్లం వస్తుంది" అని అన్నాడు. దాంతో నేను 2022, జనవరి 9న డాక్టరు దగ్గరకు వెళ్ళాను. డాక్టరు ఈసీజీ, ఎకో టెస్టులు చేశారు. అప్పుడు నేను, "బాబా! ఎకోలో ఏ ప్రాబ్లం లేకుండా చూడు తండ్రి" అని బాబాతో చెప్పుకున్నాను. ఆయన దయవలన ఏ ప్రాబ్లం లేదని వచ్చింది. "దన్యవాదాలు బాబా".
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై.
