1. ఆపద్భాంధవుడు సాయినాథ్ మహారాజ్
2. 'బాబా' అని పిలిస్తే, పలుకుతారు బాబా
3. హ్యాపీగా ఉండేలా చూసిన బాబా
ఆపద్భాంధవుడు సాయినాథ్ మహారాజ్
ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!
నా పేరు విజయ్ కుమార్. బాబా నాకు మంచి ఉద్యోగం, భార్యాబిడ్డలను అనుగ్రహించారు. ఒకసారి మా అన్నయ్యను తను పని చేస్తున్న కంపెనీవాళ్ళు తనని ఉద్యోగం నుండి తొలగిస్తుంటే అన్నయ్యవాళ్లతోపాటు మేము కూడా ఎంతో కంగారుపడ్డాము. అప్పుడు నేను, "బాబా! అన్నయ్యకి ఆ కంపెనీలో ఉద్యోగం ఉండేలా అనుగ్రహించు తండ్రీ" అని సాయిబాబాను వేడుకున్నాను. బాబా కృపవలన కంపెనీవాళ్ళ మనసు మారి అన్నయ్యను అదే ఉద్యోగంలో కొనసాగించారు. "థాంక్యూ బాబా".
ఇంకోసారి అన్నయ్యకు కరోనా వస్తే, వదిన, వాళ్ల చిన్నపిల్లలిద్దరికీ కూడా కరోనా వస్తుందేమోనని మాకు చాలా భయం వేసింది. కరోనా సమయమైనందున నేను వాళ్ళ దగ్గరకి వెళ్ళలేక మన ఆపద్భాంధవుడు, అనాథరక్షకుడు అయిన సాయినాథ్ మహారాజ్ పటం ముందు, "అన్నయ్య తొందరగా కోలుకోవాలి" అని అనుకున్నాను. బాబా అనుగ్రహంతో అన్నయ్య త్వరగా కోలుకుని ఇంటికి క్షేమంగా వచ్చాడు. ఇంకా బాబా దయవల్ల వదిన, పిల్లలకి కరోనా రాలేదు. "థాంక్యూ బాబా".
కొద్దిరోజుల తర్వాత కరోనా ప్రభావం పెద్దగా లేదనుకున్న సమయంలో బస్సులో మా స్వగ్రామానికి వెళ్ళిన మా అమ్మ అక్కడినుండి తిరిగి జ్వరంతో మా ఇంటికి వచ్చింది. మేము అది మామూలు జ్వరమే అయుంటుందని తలచి నాలుగు రోజులు మందులు వాడాం. కానీ జ్వరం తగ్గలేదు. అప్పుడు టెస్టు చేయిస్తే, కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మరుసటిరోజు నేను, మా ఆవిడ, పిల్లల కూడా టెస్టు చేయించుకున్నాము. నాకు, పిల్లలకు కోవిడ్ నెగిటివ్ వచ్చినప్పటికీ నా భార్యకు పాజిటివ్ వచ్చింది. దాంతో అమ్మ, నా భార్య వేరు గదుల్లో ఉండసాగారు. నా భార్యకు పరవాలేదు కానీ, అమ్మ పరిస్థితి రోజురోజుకి ఇబ్బందికరంగా మారి బాగా విషమించింది. 65 సంవత్సరాలు వయస్సున్న అమ్మ చాలా భయపడిపోయింది. నాకు కూడా చాలా భయం వేసింది. అదే సమయంలో బ్లాగులో కొంతమంది భక్తులు 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రం పఠించడం వల్ల తమకు కరోనా తగ్గిందని పంచుకున్నారు. అది చదివి నేను కూడా ఆ మంత్రం పఠిస్తూ ఉండేవాడిని. కానీ నాకు టెన్షన్ తగ్గలేదు. అప్పుడు నేను నా మొబైల్లో సాయిబాబా లైవ్ దర్శనం చూస్తూ, "బాబా! నాకు ఏదో ఒక నిదర్శనం చూపండి. నేను ఈ టెన్షన్ తట్టుకోలేకున్నాను బాబా" అని ఏడ్చేశాను. తరువాత ఏదైనా పువ్వు రాలిపడితే అమ్మ ఆరోగ్యం బాగుంటుందని బాబా నిదర్శనమిస్తున్నట్లు అని అనుకుంటూ ఉన్నాను. ఆరోజు వినాయకచవితి. ఆ సందర్భంగా బాబా సమాధి వద్ద పెట్టిన వినాయకుని పటం మీద నుంచి పువ్వు రాలింది. కానీ నేను నా కళ్ళను నమ్మలేక, 'నిజంగా అక్కడ పువ్వు లేదేమో! అదంతా నా భ్రమ ఏమో!' అని అనుకున్నాను. అయినా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. అప్పుడు టైమ్ మధ్యాహ్నం 1:59 అయ్యింది. నా ఆర్తిని వింటున్న బాబా నా సమస్యని ఎలా పరిష్కరించారో చూడండి. అప్పట్లో నాకు 'శ్రీసాయినాథ్ మహారాజ్' అనే వాట్సప్ గ్రూపు ఉండేది. అనుకోకుండా ఆ గ్రూపు ఓపెన్ చేసాను. అందులో కొన్ని సమాధి మందిరంలోని సాయిబాబా ఫొటోలు పంపి ఉన్నారు. అద్భుతం! వాటిలో మధ్యాహ్నం 1:48కి సమాధి మందిరంలోని వినాయకుని పటానికి పువ్వు ఉండడం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆవిధంగా పటం మీద నుంచి పువ్వు రాలడం నిజమని బాబానే నిరూపించి, నా సందేహాన్ని తొలగించారు. ఆ ఫోటోలు రెండూ మీకోసం కింద జతపరుస్తున్నాను. తరువాత బాబా నిదర్శనమిచ్చినట్లే అమ్మ ఆరోగ్యం బాగైంది. "ధన్యవాదాలు బాబా. నా ఉద్యోగ నిర్వహణలో అనునిత్యం నాతో ఉంటూ నాకు సమస్యలు రాకుండా కాపాడుతున్నావు బాబా. నేను మీకు ఎంతో ఋణపడి ఉంటాను".
ఓం శ్రీ సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై!!!
'బాబా' అని పిలిస్తే, పలుకుతారు బాబా
బాబా భక్తులకు నమస్కారం. నా పేరు మాధవి. మాది ఒంగోలు. నేను ఈ మధ్యే బాబాకి భక్తురాలినయ్యాను కానీ, ఇంటర్ చదివేటప్పటి నుంచి బాబా గుడికి వెళ్ళడం నాకు అలవాటు. నాకు ఏ కష్టం వచ్చినా బాబాకే చెప్పుకుంటాను. నేను ఎప్పుడు కష్టంలో ఉన్నా 'బాబా' అని పిలిస్తే ఆయన పలుకుతారు. ఇటీవల మేము ఒక స్థలం కొనుక్కోవాలని తలచి సాయి దివ్యపూజ చేసాను. బాబా అనుగ్రహం వల్ల పూజ పూర్తయ్యేలోపు మా అన్నయ్య నాకు స్థలం కొనిచ్చాడు.
2021, డిసెంబర్ 21న నేను పని చేస్తున్న స్కూలువాళ్ళు సి.బి.ఎస్.ఈ పరీక్షల పర్యవేక్షణాధికారిగా డ్యూటీ వేసి నన్ను వేరే స్కూలుకి పంపించారు. 16 రోజుల ఆ డ్యూటీలో అంతా సజావుగా జరుగుతుందనుకున్న తరుణంలో ఇంకా ఒక రోజు డ్యూటీకి వెళ్ళాల్సి ఉందనగా నా ఎం.ఎస్.సి ప్రాక్టికల్స్కి డేట్ వచ్చింది. డ్యూటీ, ప్రాక్టికల్స్ రెండూ ఒకేరోజు అవ్వటంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మావారు కాలేజీవాళ్ళకి ఫోన్ చేసి, ప్రాక్టికల్స్కి గైర్హాజరు కావడానికి అనుమతి అడిగితే వాళ్ళు ఒప్పుకోకుండా ఖచ్చితంగా రావాల్సిందే అన్నారు. రెండింటికి ఒకే సమయంలో నేను మాత్రం ఎలా హాజరుకాగలను? అందుచేత నేను వెంటనే బాబాకి పూజచేసి, "నీ ఇష్టం ఎలా ఉంటే అలా కానివ్వు బాబా" అని విన్నవించుకున్నాను. మరుసటిరోజు మావారు మళ్లీ కాలేజీవాళ్ళకి ఫోన్ చేస్తే, "వేరే ఎవరి చేత అయినా పరీక్ష రాపిద్దాం" అన్నారు. ఇదంతా బాబా దయే. ఆయన పిలిస్తే పలికే దైవం. ఆయన నా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తున్నారు. "ధన్యవాదాలు బాబా".
హ్యాపీగా ఉండేలా చూసిన బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. ముందుగా సాయిభక్తులకు నమస్కరాలు. 2021, డిసెంబర్ 20వ తేదీన మా అబ్బాయి నాతో మా కోడలికి మెడ పట్టుకుందని చెప్పాడు. అదేరోజు రాత్రి మా అబ్బాయి ఫోన్ చేస్తే, "నేను తిన్నారా?" అని వాళ్ళ కుశలములు అడిగాక మా కోడల్ని, "మెడ పట్టుకుందట కదా! తగ్గిందా?" అని అడిగాను. అందుకు తను, "ఆ తగ్గింద"ని చెప్పింది. కానీ తరువాత ఆ విషయం నాకెవరు చెప్పారని మా అబ్బాయిని అడిగి, అన్ని విషయాలు మీ అమ్మకు చెప్తావా అని అలిగి కూర్చుందట. తరువాత నేను మా అబ్బాయి ఫోన్కి ఫోటోలు పెట్టి "కోడలికి చెవి బుట్టలు చేయించాను, ఎలా ఉన్నాయో చూపించు" అని అడిగాను. అందుకు మా అబ్బాయి, "నేను తనకి మెడ పట్టుకున్న సంగతి నీతో చెప్పినట్లు తనతో ఎందుకు అన్నావు?" అని అడిగాడు. "తను ప్రెగ్నెంట్ కదా! అందుకే ఎలా ఉందని అడిగాను" అని అన్నాను. కానీ నావల్ల కోడలు అలిగిందని తెలిసి, "బాబా! నాకు ఏ చిన్న సమస్య వచ్చినా నిన్నే వేడుకుంటాను. నా వల్ల వాళ్ళిద్దరూ బాధపడకూడదు. ఉదయానికి వాళ్లిద్దరూ సంతోషంగా ఉండేలా అనుగ్రహించు తండ్రీ" అని బాబాతో చెప్పుకున్నాను. నా సాయిబాబా నన్ను ఎప్పుడూ నిరాశపరచరు. ఉదయం కోడలు మా అబ్బాయితో సారీ అని చెప్పిందట. మా అబ్బాయి ద్వారా అది విని నేను శాంతించాను. తరువాత మా కోడలు కూడా మేము హ్యాపీగా ఉన్నామని చెప్పింది. అంతా బాబా దయ. "బాబా! నాకు వాళ్లిద్దరూ హ్యాపీగా ఉండటం ముఖ్యం. వాళ్లను చల్లగా చూడు సాయి. మీ కృపతో తనకి సుఖప్రసవం అవ్వాలి".
ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి!!!
