సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి వాణి - 'యాక్సిడెంట్....యాక్సిడెంట్'


సాయిబంధువులందరికీ సాయిరాం. నా పేరు సౌజన్య దేవేందర్‌రావు. నాకు ఇద్దరు అబ్బాయిలు. మేము ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నాము. మా స్వస్థలం విజయవాడ దగ్గర  పైడికొండలపాలెం. మావారు బాబా భక్తులు. మొదట్లో నాకు అంతగా బాబాపై నమ్మకం ఉండేది కాదు. కానీ నా జీవితంలో జరిగిన ఒక సంఘటన వలన నేను పూర్తిగా బాబా భక్తురాలిని అయిపోయాను. "నా భక్తుల సంరక్షణను సమాధినుండియే నిర్వహిస్తాను" అనే తమ వాగ్దానాన్ని నిరూపిస్తూ బాబా నా పిల్లలని, నా కుటుంబసభ్యులని ఒక పెద్ద ప్రమాదం నుండి ఎలా కాపాడారో ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా మీకు తెలియచేస్తున్నాను.

మేము 2016, డిసెంబరు 22వ తేదీ, గురువారంనాడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న (పూజ్య గురుదేవులు శ్రీసాయినాథుని శరత్‌బాబూజీ) సత్సంగంలో పాల్గొనడానికి వెళ్ళాము. అక్కడ సత్సంగంలో, "సాయిబాబా.. సాయిబాబా... సాయిబాబా.." అంటూ బాబా నామాన్ని స్మరిస్తూ ఉన్నాను. ఆ నామస్మరణ చేస్తూనే బాబాతో, "బాబా! నా పిల్లలను రేపు మా ఊరికి మా చెల్లెళ్ళతో పంపుతున్నాను. వాళ్లు క్షేమంగా వెళ్లి వచ్చేలా చూడు తండ్రీ” అంటూ నా మొర చెప్పుకున్నాను. అంతలోనే 'యాక్సిడెంట్..యాక్సిడెంట్' అంటూ ఒక వాణి(స్వరం) వినపడింది. కానీ అది నా భ్రమ అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అది 'సాయివాణి' అని, బాబా నన్ను హెచ్చరిస్తున్నారని నాకు అప్పుడు అర్థం కాలేదు. తరువాతరోజు, అనగా 23వ తేదీన మా తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్ళు, మా మరిది, నా ఇద్దరు పిల్లలు అందరూ కలిసి మా చెల్లెలు కొత్తగా కొన్న కారులో మా ఊరికి బయలుదేరారు. మా చిన్నబాబు మా మరిదిగారి ఒడిలో కూర్చున్నాడు. మా పెద్దబాబు వెనకాల సీటులో మా చెల్లెలి ఒడిలో కూర్చున్నాడు.

ఉదయం 5 గంటల సమయంలో విజయవాడ దగ్గర పరిటాలకు రాగానే కారు అదుపు తప్పింది. ఎదురుగా ఎలాంటి వాహనం లేదు. కారు గాలిలోనే మూడు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి పొలాల్లోకి వెళ్ళిపోయింది. కారు విద్యుత్ స్తంభానికి ఢీకొనడం వలన కరెంటు తీగలు తెగిపడ్డాయి. కరెంట్ తీగలలో కరెంట్ పాస్ అవుతూనే ఉంది. కారు బోల్తా పడడం వలన లోపల ఉన్నవాళ్ళంతా సహాయం కోసం చూశారు. కానీ, అది ఉదయం సమయం కావడం వల్ల అక్కడ ఎవరూ లేరు. ఎలాగోలా మా తమ్ముడు, మరిది బయటకు వచ్చి అందరినీ బయటకు తీశారు. తరువాత వాళ్ళు అంబులెన్స్‌కు, పోలీసులకు ఫోన్ చేస్తే ఊరంతటికీ కరెంటు తీసి, కరెంటు తీగలని తొలగించారు. కారంతా తుక్కు తుక్కు అయ్యింది. 

మాములుగా అలా యాక్సిడెంట్ జరిగితే, ఏ ఒక్కరు కూడా బ్రతికే అవకాశం లేదు. కానీ నేను గురువుగారి సత్సంగంలో, "బాబా! నా పిల్లలను, నా కుటుంబసభ్యులను క్షేమంగా ఇంటికి చేర్చండి” అని బాబాను ప్రార్థించాను కదా! బాబా నా ప్రార్థనను మన్నించి, ఏ ఒక్కరికి కూడా ప్రాణాపాయం కలగకుండా చిన్న చిన్న దెబ్బలతో కాపాడారు. కారులో ఉన్న నా పిల్లలను, కుటుంబసభ్యులను క్షేమంగా ఇంటికి చేర్చారు. "సాయివాణి" ద్వారా బాబా ముందుగానే హెచ్చరించారు. కానీ నాకు అర్థంకాక నా భ్రమ అనుకున్నాను. బాబా ఏకాదశ సూత్రాలలో చెప్పారుగా, "నన్ను ఆశ్రయించినవారిని, నన్ను శరణుజొచ్చినవారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యం" అని. అలా చెప్పినట్లుగానే బాబా సమర్థవంతంగా తమ విధిని నిర్వర్తించారు. 'పుత్రశోకం' కలగకుండా నన్ను కాపాడారు బాబా. బాబా రక్షించకపోయివుంటే అనే ఆలోచనే భరించలేకపోతున్నాను. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పటికీ, ఏ ఒక్కరికీ ఏమీ కాకుండా చిన్న దెబ్బలతో బయటపడడం 'బాబా దయ' కాకపోతే మరేమిటి? నేను, నా కుటుంబసభ్యులం అందరం ఇప్పుడు 'బాబా భక్తులం'. ఎప్పటికీ బాబా పాదాలను విడవడం అంటూ జరగదు. నా జీవితంలో జరిగిన ఈ లీల ద్వారా నేను పూర్తిస్థాయి సాయిభక్తురాలిగా మారిపోయాను.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo