ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా సహాయం
2. సాయి దయ
3. సద్గురువుకి పగ్గాలు అప్పగిస్తే చింతకు తావే లేదు
బాబా సహాయం
నేను ఒక సాయిభక్తురాలిని. 2023, ఫిబ్రవరిలో ఒకరోజు నా ఎడమకంటిలో ఏదో నలత పడినట్లు అనిపించింది. అప్పుడప్పుడు నా కనుబొమ్మలే నా కన్నుల్లో పడి ఇబ్బందిపెడుతుంటాయి. అందువలన అవే పడి ఉంటాయని అనుకున్నాను. కానీ సాయంత్రమైనా ఆ నలత పోక అసౌకర్యంగా ఉండింది. అప్పుడింక అద్దంలో చూసుకుంటే, నా కంటి లోపల కనుగుడ్డుకి దగ్గరగా ఒక నరం ఎర్రగా కనిపించింది. నేను కొంచెం భయపడ్డప్పటికీ మరుక్షణమే బాబా ఊదీని నా కంటికి పూసుకొని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల రెండవరోజుకి అసౌకర్యం తగ్గి అంతా బాగైంది. ఇంకోరోజు హఠాత్తుగా నా ఎడమఛాతీలో ఒక రకమైనా అసౌకర్యం మొదలైంది. అది ఏమిటో, ఎందుకలా అనిపిస్తుందో నాకు అర్థం కాలేదు కానీ, బాబా ఊదీ ఉండగా భయమెందుకని ఊదీ రాసుకొని, 'ఈ అసౌకర్యం తగ్గిపోవాల'ని అనుకున్నాను. అంతే, బాబా దయవల్ల ఆ అసౌకర్యం తగ్గింది.
నేను కొన్నాళ్లుగా చింతతోనూ, ఆకస్మిక భయాందోళనలతోనూ బాధపడుతున్నాను. నేను వాటిని కంట్రోల్ చేసుకోలేకపోయినప్పుడు బాబాకి లెటర్ వ్రాసి, ఆయన దగ్గర పెడతాను. బాబా నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. ఆయన దయతో నేను వాటినుండి బయటపడుతున్నాను. ఒకరోజు నేను షాపుకి వెళ్ళినప్పుడు హఠాత్తుగా ఆందోళన మొదలై నాకు చాలా భయమేసింది. వెంటనే నేను మనసులో, "నన్ను ఈ పరిస్థితి నుండి బయటపడేయండి" అని బాబాను ప్రార్థించాను. మామూలుగా ఆందోళన మొదలైతే 2, 3 గంటలైనా తగ్గదు. అలాంటిది ఆరోజు బాబాని ప్రార్థించిన అరగంటలో నార్మల్ అయ్యాను. "సహాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సాయి దయ
నేనొక సాయిభక్తురాలిని. నా పేరు లలిత. ఆమధ్య మా వదినకి క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారు. వదినని మరో డాక్టర్ దగ్గరకి తీసుకెళదామని అనుకున్నారు. అప్పుడు నేను, "వదినకి క్యాన్సర్ కాకూడదు బాబా" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. డాక్టరు వదినని పరీక్షించి, 'ఇది క్యాన్సర్ కాదు, గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చింద'ని చెప్పి, తనకు ఆపరేషన్ చేశారు. బాబా దయవలన తనకిప్పుడు బాగానే ఉంది.
ఈమధ్య ఒకరోజు నాకు నడుమునొప్పి చాలా విపరీతంగా వచ్చింది. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, ఊదీని నడుముకి రాసుకొని, 'నొప్పి తగ్గాలి బాబా' అనుకున్నాను. బాబా దయవలన మరునాటికి నొప్పి కొంచెం తగ్గి, రెండవరోజుకి పూర్తిగా తగ్గిపోయింది. నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఈ అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. "బాబా! ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను? మీ పాదాల యందు స్థిరమైన నమ్మకం భక్తి, శ్రద్ధలు కలిగేటట్టు అనుగ్రహించండి".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
సద్గురువుకి పగ్గాలు అప్పగిస్తే చింతకు తావే లేదు
సాయి బంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఈ బ్లాగులోని సాయి భక్తుల అనుభవాలు చదువుతుంటాను. నాకు బాగా పరిచయమున్న ఒక అమ్మాయి జీవితంలో బాబా చేసిన అద్భుతాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆ అమ్మాయికి తన భర్తతో సమస్యలు వచ్చి పుట్టింటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ విధంగా చూసినా తిరిగి భర్తతో కలిసే అవకాశమే కనిపించక ఇక అంతా అయిపోయింది అదనుకున్న స్థితిలో ఆమె బాబాను నమ్ముకుని భరద్వాజ మాస్టారుగారు రచించిన సాయిలీలామృతం కొన్ని నెలలు నిరంతర పారాయణ చేసింది. ఆ పారాయణ జరుగుతున్న సమయంలోనే తన భర్త, "కలవడానికి అవకాశం లేదు. నువ్వు రావద్దు" అని చెప్పాడు. ఆమె నెత్తిన పెద్ద బండ పడినట్టు అయ్యింది. కానీ 15 రోజుల్లో ఆమె భర్త మనసు ఎలా మారిందో గానీ, తనంతట తానే వచ్చి గౌరవంగా ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు. ఇప్పుడు వాళ్ళు చక్కగా కాపురం చేసుకుంటున్నారు. ఇది బాబా లీల కాక మరేమిటి?. 'సద్గురువుకి పగ్గాలు అప్పగిస్తే చింతకు తావే లేదు' అన్న మాట అక్షర సత్యం. బాబా చరణాలను ఆశ్రయించి అందరూ సంతోషంగా, సుఖశాంతులతో తృప్తిగా ఉండాలని కోరుకుంటూ.. సెలవు.

