1. అడగాలేగాని మనకు మంచిదైతే బాబా ఇవ్వనిదంటూ ఏదీ ఉండదు
2. ఎన్నో విధాలా కాపాడుతున్న సాయితల్లి
అడగాలేగాని మనకు మంచిదైతే బాబా ఇవ్వనిదంటూ ఏదీ ఉండదు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఈ బ్లాగు ద్వారా బాబా మాకు ప్రసాదించిన అనుభవాలను తోటి భక్తులతో పంచుకునేందుకు మార్గం చూపిన సాయికి నమస్కారాలు. నేను సాయి భక్తురాలిని. సాయే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. సాయితో నాకున్న అనుభవాలు లెక్కలేనన్ని. మూడు సంవత్సరాల నుంచి నాకు బ్లీడింగ్ సమస్య ఉంది. ఈమధ్య డాక్టరు దగ్గరకి వెళ్తే MRI స్కాన్ చేయించమని "రిపోర్టులో గడ్డ లాంటిది ఏమైనా ఉన్నట్టు వస్తే, బయాప్సీ చేయాలి" అని చెప్పారు. నాకు చాలా భయమేసింది. MRI చేస్తున్నంతసేపు నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపించాను. సాయి దయవలన రిపోర్టు నార్మల్ వచ్చింది. "ధన్యవాదాలు బాబా. మాపై ఎల్లప్పుడూ మీ దయ ఇలానే ఉండాలి తండ్రి".
మా పెద్దపాప నిట్ పరీక్షల ప్రిపరేషన్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళింది. కోచింగ్లో ఉన్నప్పుడు తను నాకు ఫోన్ చేసి, "నాకు సీటు వస్తుందో, రాదో అని భయంగా ఉంద"ని బాధపడేది. ఆ విషయమై నేను ఎప్పుడు సాయిబాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సైట్ ఓపెన్ చేసినా, "విజయం సాధిస్తావు" అని బాబా మెసేజ్ వచ్చేది. నేను బాబా మీద నమ్మకం ఉంచాను. పరీక్ష జరగడానికి ముందు ఒకరోజు రాత్రి టెన్షన్తో పాప చాలా ఏడ్చింది. ఆ మరుసటిరోజు ఉదయం 'సద్గురు సాయి' వాట్సాప్ గ్రూపులో, "జాతకాలను నమొద్దు. నా మీద విశ్వాసముంచి కష్టపడి చదువు. నువ్వు తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తావు. సాయిబాబాను స్మరించుకో" అని మెసేజ్ వచ్చింది. దాన్ని చూస్తూనే నాకు ధైర్యం వచ్చింది. పాప పరీక్ష వ్రాసింది. రిజల్టు వచ్చాక చూస్తే, బాబా దయవల్ల అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. నేను, "పాపకి ఏ కాలేజీలో బాగుంటుందంటే అదే కాలేజీలో సీటు ఇవ్వు తండ్రి" అని బాబాను ప్రార్థించాను. బాబా, "మీకు ఏ కోరిక ఉన్నా, మీకు ఏది మంచిదో అదే నేను చేస్తాను" అని మెసేజ్ ఇచ్చారు. బాబా దయవల్ల ఫస్ట్, సెకండ్ ఫేజ్ల్లో పాపకి ఒకే కాలేజీలో సీటు వచ్చింది. బాబా చెప్పినట్టు ఆ కాలేజీ చాలా బాగుంది. "బాబా! పాపకి ఎంబీబీస్ సీటు ప్రసాదించినందుకు ధన్యవాదాలు. మీ పాదపద్మాలకు శతకోటి వందనాలు బాబా. తనకి తోడుగా ఉండి మంచి ఆరోగ్యాన్ని, చదువుని ప్రసాదించి గొప్ప డాక్టరుని చేసి ఉజ్వల భవిష్యత్తుని అనుగ్రహించండి".
ఒకసారి మా బావగారి కొడుకుకి డెంగ్యూ ఫీవర్ వచ్చి ఏమి తిన్నా వాంతులు చేసుకునేవాడు. ప్లేట్లెట్లు 20వేలకు పడిపోయాయి. వాళ్ళ అమ్మ బాధతో నాకు ఫోన్ చేసి పరిస్థితి వివరించింది. నేను తనతో, "ఏం భయం లేదు, బాబా ఉన్నారు. ఆయనపై విశ్వాసముంచి ఆయన ఊదీ బాబు నుదుటన పెట్టి, మరికొంత ఊదీ నీటిలో కలిపి తన చేత త్రాగించండి" అని చెప్పాను. ఆమె నేను చెప్పినట్లే ఊదీ నీళ్లలో కలిపి బాబు చేత త్రాగించింది. ఆరోజు నుండి వాంతులు తగ్గి కొంచెం కొంచెం తినడం ప్రారంభించాడు. రెండు రోజుల్లో జ్వరం కూడా తగ్గి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ప్లేట్లెట్లు 20వేల నుండి రెండు లక్షలకు పెరిగాయి. ఇప్పుడు బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. బాబా దయవలన ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కూడా వచ్చింది.
బాబాని అడగాలేగాని మనకు మంచిదైతే ఆయన ఇవ్వనిదంటూ ఏదీ ఉండదు. 'సాయీ' అని ఒక్కసారి స్మరిస్తే నేనున్నానంటూ 'ఓయీ' అని పలుకుతారు నా బాబా. ఆయన నేను మొదలుపెట్టిన ఏడు శనివారాల పూజకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసి, పూజ పూర్తయిన రోజు రాత్రి బయలుదేరి తిరుమల వెళ్లేలా అనుగ్రహించి, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చేయించి, ఆ దేవదేవుని దర్శన భాగ్యం అయ్యేటట్లు చేశారు. ఈమధ్య మా మోటార్ పని చేయక నీరు రాలేదు. ప్లంబర్ చూసి "లోపల పైపులు పగిలాయి. వాటిని తీసి కొత్త పైపులు వేయాల"ని చెప్పాడు. అప్పుడు నేను, "పైపులు మార్చే అవసరం లేకుండా చూడు బాబా" అని బాబాను ప్రార్థించాను. వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ, బాబా దయవల్ల పైపులు మార్చే అవసరం లేకుండా నీళ్లు వచ్చాయి. "థాంక్యూ బాబా. మా ఇంటి స్లాబ్ లీకేజ్ లేకుండా చూడండి బాబా. శిరిడీ వచ్చి మీ మొక్కు తీర్చుకుంటాం. నా అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యమైనందుకు క్షమించు సాయి".
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!
ఎన్నో విధాలా కాపాడుతున్న సాయితల్లి
సాయి భక్తులకు నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న అన్నయ్యకి బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. ఎటువంటి ఆపద వచ్చినా బాబా అనుకోగానే ఆయన తమ ఆశీస్సులు మనతో ఉన్నాయని సదా తెలియజేస్తుంటారు. అందుకే నేను నిరంతరమూ సాయి నామస్మరణ చేసుకుంటూ, సాయి నాతోనే ఉన్నారని భావిస్తాను. సాయితల్లి నన్ను ఎన్నో విధాలా కాపాడుతున్నారు. అటువంటి కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు మా చిన్నబాబు ఆడుకుంటూ హఠాత్తుగా మెట్ల మీద పడిపోయాడు. ఆ ఘటనలో మెట్టుకి బాబు తల గుద్దుకుని చీల్చుకుపోయి బాగా రక్తస్రావం జరగడంతో నాకు చాలా భయమేసింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే కుట్లు వేశారు. బాబు నొప్పి తట్టుకోలేక బాగా ఏడుస్తుంటే నాకు భయమేసి బాబా నామస్మరణ చేసాను. నర్స్, "నొప్పి తగ్గడానికి రెండు రోజులు పడుతుంద"ని చెప్పి సిరప్ ఇచ్చింది. నేను ఆ రాత్రి బాబు నిద్రపోడని భయపడ్డప్పటికీ బాబా దయవల్ల బాబు నొప్పని అస్సలు అనలేదు. బాబా మనతో ఉన్నప్పుడు బాధ ఎందుకు ఉంటుంది. రెండు రోజుల తర్వాత కుట్లు తీసేశారు. అంతా సాయితల్లి దయ.
నేను ఒక సంవత్సరం పాటు స్కిన్ అలర్జీతో బాధపడ్డాను. ఎన్నో మందులు వాడినప్పటికీ ఫలితం కనపడలేదు. అలా ఉండగా ఒకసారి బ్లాగులో, "ఊదీ రాస్తూ ఉండు. ఎంతటి వ్యాధి అయినా తగ్గుతుంది" అన్న బాబా వచనం చూసాను. ఇంక నేను బాబా చెప్పినట్లు చేయడం మొదలుపెట్టాను. ఆశ్చర్యంగా కొన్ని రోజుల్లో ఆ అలర్జీ నుండి నాకు ఉపశమనం లభించి చాలా ఆనందంగా ఉన్నాను. ఒకరోజు ఉదయం గ్యాస్ట్రిక్ సమస్య వచ్చి గుండెల్లో మంటతో నేను చాలా బాధపడ్డాను. టాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదు. ఆ రాత్రి సాయి తల్లి ఊదీ నీటిలో వేసుకుని త్రాగి, మరికొంత ఊదీ గుండెకు రాసుకుని పడుకున్నాను. బాబా దయవలన మరుసటిరోజుకి అంతా నార్మల్ అయింది.
మా తమ్ముడికి చాలాకాలం వరకు పెళ్లి కాలేదు. ఆ విషయం గురించి నేను సాయితల్లికి చెప్పుకుని నవగురువార వ్రతం మొదలుపెట్టాను. ఆయన దయతో మూడో గురువారమే తమ్ముడికి మంచి అమ్మాయితో సంబంధం కుదిరింది. నేను చాలా ఆనందించి, "ఇలాగే నిశ్చితార్థం, పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిపించండి బాబా" అని బాబాను వేడుకున్నాను. బాబా నా ప్రార్థనను మన్నించి 2022, ఆగస్టు 10న తమ్ముడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. అలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా నాతో నవగురువారాలు పూజ పూర్తి చేయించి, తొమ్మిది మందికి అన్నదానం చేసేలా బాబా అనుగ్రహించారు. సాయి భక్తులందరూ బాబాయందు భక్తితో, ఆయన చెప్పినట్లు శ్రద్ధ, సబూరీలతో ఉంటే ఎంతటి కష్టమైనా బాబా చూసుకుంటారు. "శతకోటి వందనాలు సాయితల్లి".

