మహల్సాబాయి అనే ఒక నిరుపేద సాయిభక్తురాలు శిరిడీలో నివాసముంటుండేది. ఒకసారి హరి బాపూరావు శీర్షతే శిరిడీ వచ్చినప్పుడు ఆమె అతన్ని ఆశీర్వదించి, డబ్బులు ఇమ్మని అడిగింది. అతను కొంత డబ్బిచ్చి, శిరిడీ నుండి వెళ్లేముందు మరికొంత ఇస్తానని ఆమెతో చెప్పాడు. అయితే తిరుగు ప్రయాణమయ్యే సమయానికి మహల్సాబాయికి ఇచ్చిన మాట గురించి అతను మరచిపోయాడు. కానీ ఆమె మరువక అతనిని డబ్బు అడిగితే, అతను డబ్బివ్వకపోగా కోపంతో, "వెళ్ళిక్కణ్ణించి, ఎవరన్నా మూడుసార్లు డబ్బిస్తారా?" అని ఆమెపై అరిచాడు. తరువాత అతను తన ప్రయాణంలో ఎన్నో అవస్థలు పడ్డాడు. కోపర్గాఁవ్లో స్టేషన్కి వెళ్ళడానికి అతనికి టాంగా దొరకలేదు. ఆ కారణంగా రైలు తప్పిపోయింది, దానివల్ల అతను ఆ రాత్రంతా అక్కడే గడపాల్సి వచ్చింది. అప్పుడతను, "ప్రతిసారీ సాయిబాబా అనుమతి తీసుకుని బయలుదేరితే నా ప్రయాణం సుఖంగా సాగేది. ఈసారి ఎందుకు ఇంత ఇబ్బందులు పడాల్సి వచ్చింది?" అని అనుకున్నాడు. మరుసటిరోజు ప్రయాణంలో అతను మన్మాడ్ స్టేషన్ నుంచి తోటి ప్రయాణికుడు, సాయిభక్తుడైన బీహార్లాల్ వ్యాస్తో మాటల్లో పడ్డాడు. ఆ కబుర్లలో వ్యాస్ తన అనుభవాన్ని ఇలా చెప్పాడు: "ఈరోజు నేను శిరిడీ నుండి బయలుదేరుతున్నపుడు మహల్సాబాయి అనే పిచ్చిది నా దగ్గరకొచ్చి డబ్బులిమ్మని అడిగింది. ఆమె ఒంటిమీద ఉన్న బట్టల నుంచి వచ్చే దుర్వాసనకి నాకు వికారం కలిగింది. కానీ నేను ఆమెకు కొంత డబ్బిచ్చాను. ఆమె ఆ డబ్బు తీసుకుని వెనుతిరిగిన మరుక్షణంలో మల్లెలు మొదలైన పూల సుగంధ పరిమళాలు వ్యాపించగా నేను ఆశ్చర్యపోయాను" అని. ఆ మాటలు వింటూనే శీర్షతే తన ప్రయాణంలో తనకు ఎదురైన అసౌకర్యానికి కారణం మహల్సాబాయి పట్ల తన అమానుష ప్రవర్తనే అని గ్రహించాడు. దాంతో అతని కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. సాయిబాబా తన ప్రశ్నకు వ్యాస్ ద్వారా సమాధానం ఇచ్చారని గుర్తించి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఈ అనుభవం ద్వారా అతనికి 'హీనులను, దీనులను అలక్ష్యము చేయరాద'ని బాబా బోధించారు.
సోర్స్: శ్రీసాయిబాబా బై సాయి శరణానంద.
om sai ram
ReplyDelete🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister
ReplyDeleteJai sairam
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌸🥰🌺🤗🌹
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete