ఈ భాగంలో అనుభవం:
- సాయి సమాధానాలు - నేర్పిన పాఠం
ఓం శ్రీసాయినాథాయ నమః. హే సాయి భవరోగ వినాశకాయ శరణం శరణం.
నా పేరు శ్రీవాణి. 2025, అక్టోబర్ లేదా నవంబర్లో నా కాలుకి ఆక్సిడెంట్ అయింది.
యాంకిల్
లిగ్మెంట్ టియర్ అవడం వల్ల డాక్టరు బెడ్ రెస్ట్ ఉండమన్నారు. ఆ సూచనమేరకు నేను అలాగే ఉండసాగాను. అయితే పాదం రెస్ట్లో ఉంచి 3 నెలలవుతున్నా నేను నడవలేకపోతుండటంతో చాలా టెన్షన్ పడ్డాను. అటువంటి సమయంలో మా గురువుగారు(పూజ్య గురుదేవులు శ్రీఅమ్ముల సాంబశివరావుగారు) ఒక సాయి కార్యక్రమం నిమిత్తం మా ఊరికి కొంచం దగ్గరలో ఉన్న ఊరికి ఫిబ్రవరి 8న వస్తున్నారని తెలిసింది. నేను ఆ రాత్రి, ఫిబ్రవరి 8న ఆ వూరు వెళ్లి, 'నాకు త్వరగా నయమవ్వాలంటే ఇంటర్నెట్ ద్వారా నేను తెలుసుకున్న రెండు, మూడు ట్రీట్మెంట్లలో ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో గురువు గారిని అడిగి వారి సలహా ప్రకారం చేయాల'ని అనుకున్నాను. మర్నాడు ఉదయం నేను నిద్ర మేలుకోవడానికి ముందు ఇంకా పూర్తిగా చైతన్యంలోకి రాని స్థితిలో సమాధి మందిరంలో కూర్చుని వున్న సాయి ఫోటో, దాని పక్కన మెసేజ్ బాక్స్లా ఒకటి కనిపించింది. ఆ మెసేజ్ ఒక్కో పదం వరుసగా కనిపిస్తుంటే, నేను చదివాను. ఆ మెసేజ్ ఏమిటంటే, "నాకోసం వేచి ఉండొద్దు. నీ ఆత్మజ్ఞానం ప్రకారం ముందుకి వెళ్ళు" అని. అప్పుడు నేను, 'మా గురువుగారు వచ్చేవరకు ఆగకుండా నా స్వంత జ్ఞానం ప్రకారం వెళ్ళమ'ని సాయి సలహా ఇచ్చారని కుదుటపడ్డాను. కానీ ఆత్మజ్ఞానం అంటే వేరు కదా! అని అనుమానమొచ్చి ఆ పదానికి పర్యాయపదాలు గూగుల్లో చూస్తే 'ఆత్మజ్ఞానం' అంటే 'సొంత జ్ఞానం' అనే అర్థం కూడా వుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 4, ఉదయం, 'నేను ఎప్పుడు వాకర్ లేకుండా మునుపటిలా నడవగలుగుతాను? ఎప్పుడు కాలు పూర్తిగా నయమవుతుంది? నేను స్కూలులో నా ఉద్యోగ విధులకు హాజరయ్యాక వాకర్ సహాయంతో ఎలా మైంటైన్ చేయాలి?' అని చాలాసేపు మధనపడ్డాను. అంతలో మా గురువుగారి ఫోటోతోపాటు 'softly move with careful instructions' అన్న వాక్యం కనిపించింది. ఆవిధంగా 'నేను మదనపడుతుండటం గమనించి 'జాగ్రత్తలు పాటిస్తూ నిదానంగా నడవమ'ని సాయిదేవుడు సలహా ఇచ్చారు. మన కర్మ బలీయంగా ఉన్నప్పుడు సాయినాథుడు దాని తీవ్రత తగ్గిస్తారు. మనం ఆదుర్దపడుతోంటే, మన పక్కన ఉండి మనకు ధైర్యం చెప్తారు. మనం చేసే ప్రతి ఆలోచన కనిపెడుతూ మనకి సమాధానాలు ఇస్తుంటారు. ఆయనపై పూర్తి భారమేసి, అనన్య శరణాగతితో సాయి పాదాల వద్ద పడి ఉండడమే మనకి శ్రేయస్కరం. "థాంక్యూ బాబా. దయచేసి ఇలాగే ఎల్లప్పుడూ ప్రతి కష్టంలో నన్ను నడిపించు తండ్రీ. నేను మిమ్మల్ని తప్ప మారేదీ కోరకుండుగాక!"
నాకు యాక్సిడెంట్ అయినప్పటినుం డి 8 నెలలుగా నేను స్టూలుపై కూర్చుని స్నానం చేస్తుండగా 2026, జూలై 18న నా పాఠశాల విధులు ముగించుకొని ఇంటికి వచ్చి స్నానం చేస్తుంటే, అనుకోకుండా స్టూల్ మీద నుండి జారి కింద పడిపోయాను. అయితే విచిత్రంగా స్టూల్ పక్కకి జరిగిపోయినా నేను అమాంతం కింద పడకుండా ఎవరో నన్ను పట్టుకొని కిందకి జారవిడుస్తున్నట్లు చాలా నెమ్మదిగా కింద పడ్డాను. అది ఎలా సాధ్యమో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఒక్కసారిగా కింద పడి నా నడుము విరగకుండా సాయే ఆవిధంగా కాపాడారని నాకనిపిస్తుంది. సరే, ఆ తరువాత 'నేను ఈరోజు ఏదైనా తప్పు చేసానా?' అని పరిశీలించుకుంటుంటే, ఆరోజు ఉదయం స్కూల్లో 6వ తరగతి పిల్లలని నేను గట్టిగా కొట్టిన సంగతి గుర్తుకు వచ్చింది. నేను పనిచేస్తున్న పాఠశాల హైదరాబాద్ పరిసర ప్రాంతం అవడం వల్ల పిల్లలు చాలా దూకుడుగా వున్నారు. క్లాసుని డిస్టర్బ్ చేస్తున్న ఇద్దరిని అదుపుచేయడంలో విఫలమై అలిసిపోయి, సహనం నశించి స్కేలుతో కొంచెం అతిగానే దండించాను. 'ఉపాధ్యాయులు విద్యార్థులని ప్రేమగా దండించాలి కానీ, ద్వేషంతో దండించకూడద'ని మా గురుదేవులు చెప్తుంటారు. అలాంటిది, నేను అలా అతిగా దండించాను. అందుకు నాకు ఈ ప్రమాదం జరిగిందేమోనని అనిపించింది. రాత్రి నిద్రపోయేటప్పుడు, "బాబా! ఎప్పుడూ లేనిది ఇలా ఎందుకు జారిపడ్డాను? ఈ పనిష్మెంట్ నా ఏ కర్మకి కారణమో నాకు తెలియజేయండి" అని ప్రార్థించాను. మరుసటిరోజు ఉదయం 'సాయిమహారాజ్ సన్నిధి' వాట్సాప్ ఛానల్లో నా అనుమానం నిజం చేసేలా 'సాయి శరణానంద అనుభవాలు - 33వ భాగం' నాకు కనిపించింది. అందులో
సాయి శరణానంద, 'శ్రీకృష్ణ భగవానుడి ప్రతిమలోనూ, మహనీయుల చిత్రపటాల్లోనూ పాఠశాల విద్యార్థీ విద్యార్థినులు, అధ్యాపకులు, అధ్యాపకురాళ్ళు కనిపించేవారు. దీన్ని గురించి ఆలోచించిన మీదట "గురుమహారాజు సర్వవ్యాపకుడు” అన్న నిర్ణయానికొచ్చాను. ఇది తెలుసుకుని ఆయనకు నేను ఆరతి ఇస్తుంటే దానికో పరిణామం కలిగింది. “మూలప్రతిమల స్థానంలో కనిపించిన విద్యార్థీ విద్యార్ధినులంతా నేనేనని తెలుసుకోవాలని నా స్థానంలో నీకు వాళ్ళనే కనిపింపచేస్తున్నాను” అని గురుమహారాజు నాకు ప్రబోధించాలనుకుంటున్నారని అనిపించింది' అని తన తన అనుభవాన్ని పంచుకున్నారు. అది చదివాక, "పాఠశాల విద్యార్థులతో సహా అందరిలోనూ సాయి వ్యాపించి వున్నారు. విద్యార్థుల అల్లరిని సున్నితంగా అదుపు చేయకుండా, వాళ్ళు వినడం లేదనే కారణంతో వాళ్ళని దండించడం వల్ల వాళ్లలో ఉన్న సాయిని బాధపెట్టినట్లే' అనే పాఠాన్ని నేను నేర్చుకున్నాను. ఇకపై వాళ్ళని దండించవద్దని నిర్ణయం తీసుకున్నాను.
తర్వాత ఆరోజు ఆదివారం అయినందున రాపిడో బుక్ చేసుకుని కొంపల్లిలోని మా అక్కవాళ్ళింటికి బయలుదేరాను. ఇంటినుండి బయలుదేరేటప్పుడు ఎప్పటిలాగానే, "సాయీ! నన్ను కాపాడు" అని బాబాకి చెప్పుకుని వెళ్ళాను. మధ్య దారిలో నేను వెళ్తున్న ఆటో పంక్చరై శబ్దం చేస్తూ రోడ్డు మధ్యలో ఆగిపోయింది. సాయి దయవలన ఆ సమయంలో మా ఆటో వెనుక ఏ వాహనాలు లేనందున పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే హైదరాబాద్ వెళ్లే ఆ బిజీ మార్గంలో వేగంగా వెళ్లే వాహనాలు, హఠాత్తుగా ఆగిపోయిన మా ఆటోని గుద్దేసేవే! నా కర్మ నన్ను వెంటాడుతున్నా దానినుండి నన్ను కాపాడిన సాయికి కృతజ్ఞతలు చెప్పుకుని వేరే వెహికిల్లో నా గమ్యం చేరుకున్నాను. కర్మ చాలా సూక్ష్మమైనది. సాయి చెప్పినట్లు పదునైన కత్తి అంచు మీద నడవడం లాంటిది. మన నడతలో ఏ చిన్న పొరపాటు జరిగినా కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. అందుకే సాయి తన భక్తులు ఏ చిన్న పొరపాటు చేసినా సహించరు. ఏ చిన్న తప్పు కూడా చేయని విధంగా సాయి తన భక్తులని సరిదిద్దుతుంటారు. ఒకవేళ తన భక్తుడు ఏదైనా పొరపాటు చేసినా దాని ఫలితాన్ని వెంటనే అనుభవించేలా చేసి తొలగిస్తాడు. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో సాయి మనకు నేర్పే పాఠం దాగి ఉంటుంది. ప్రతి నిమిషం ఆత్మవిమర్శ చేసుకుంటూ, ఏ చిన్న విషయంలోనూ ధర్మం తప్పకుండా, కర్మల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ సాయి మార్గంలో మనం వెళ్తూ ఉండాలి. సూక్ష్మాతి సూక్ష్మమైన ధర్మ సూత్రాలని తెలుసుకుంటూ ఆచారిస్తూ ఉండటం శ్రేయస్కరం. అప్పుడే మన జీవితం శాంతిగా, సుఖంగా సాయి నీడలో సాగిపోతుంది. జీవితంలో ఏ చిన్న తప్పు కూడా చేయని సూక్ష్మబుద్ధిని నాకు ప్రసాదించి, నన్ను తమ సేవలో ఉపయోగించుకొని ధన్యురాలిని చేయమని సాయిని ప్రార్థిస్తున్నాను.
జై సాయిదేవా.

Om Sairam
ReplyDeleteSai always be with me
Baba me daya valana Kalyan ki marriage ipoindi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu house koni pettandi baba pl
ReplyDelete