సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రామచంద్ర రామకృష్ణసామంత్



శ్రీసాయినాథుని దివ్య ఆశీస్సులతో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

"బాబా! మీ ఆశీస్సులతో ప్రారంభమైన ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ మీ ప్రేమలో అయిదు వసంతాలు పూర్తి చేసుకుని ఆరవ వసంతంలోకి అడుగిడుతున్న శుభసందర్భంలో.. మీ ప్రేమను పంచుకుంటూ, ఆస్వాదిస్తూ సదా మీ స్మరణలో ఆనందంగా ఉండేలా మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి."


బాబా అన్నాసాహెబ్ దబోల్కర్‌ను చాలా ప్రేమించేవారు. ఆ ప్రేమ పరిమళాలు అతని అల్లుడు రామచంద్ర రామకృష్ణ సామంత్‌ని కూడా చుట్టుముట్టాయి. సామంత్ అత్యంత భక్తిప్రపత్తులు గల ధార్మిక కుటుంబంలో జన్మించాడు. అతని ముత్తాత లక్ష్మణ అర్జున్ సామంత్(భగత్) విఠలుని పరమభక్తుడు. ఆయన తరచూ పండరి యాత్రకు వెళ్తుండేవాడు. ముఖ్యంగా ఆషాఢ, కార్తీక మాసాలలో పండరి యాత్ర తప్పనిసరిగా చేస్తుండేవాడు. రామచంద్ర రామకృష్ణ సామంత్ తాత విఠల భక్తుడేకాక శివునిపట్ల కూడా భక్తి కలిగి ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ మధ్యాహ్నం ఏకాగ్రతతో ధ్యానం, శివనామజపం చేస్తుండేవాడు. రాత్రుళ్ళు 'హరిపథ' పఠనం, వేకువజామున భజన వంటి వాటితో పెక్కు గంటల సమయం దైవచింతనలో గడిపేవాడు. రామచంద్ర రామకృష్ణ సామంత్ తండ్రి అంతగా ఆధ్యాత్మిక ప్రగతి సాధించనప్పటికీ కుటుంబ సంప్రదాయాన్ని పాటిస్తూ పలుమార్లు పండరీపురం దర్శించాడు. అటువంటి గొప్ప ఆధ్యాత్మిక వాతావరణంలో రామచంద్ర రామకృష్ణ సామంత్ చిన్నతనం సాగింది. కానీ అతను చదివిన చదువు యొక్క ప్రభావం తొలి ఏళ్లలో అతని మదిలో ఏర్పడిన ఆధ్యాత్మిక భావాలను, అభిప్రాయాలను నిర్వీర్యం చేసేంత మరియు అణిచివేసేంత బలంగా ఉండటం మూలాన అతనిని వ్యతిరేక దిశలోకి లాగింది.

1911వ సంవత్సరంలో అతనికి దబోల్కర్ కుమార్తెతో వివాహం అయింది. ఆ సమయంలోనే అతను వంశపారంపర్యంగా వచ్చిన అల్బుమినూరియా(మూత్రంలో ప్రోటీన్ పోవడం) అనే వ్యాధితో బాధపడనారభించాడు. దాని చికిత్సకోసం అతను కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సి వచ్చింది. రాత్రిపూట ఘన పదార్థాలు తీసుకోకుండా కేవలం ద్రవాహారం తీసుకుంటుండేవాడు. అటువంటి పరిస్థితుల్లో సాయి మహిమల గురించి వినడం వల్ల అతనిలో తిరిగి భక్తి బీజాలు మొలకెత్తసాగాయి. అయితే ఆధ్యాత్మికత పట్ల అతని మదిలో స్తబ్దత కొనసాగుతుంది. కానీ ఇతరుల భక్తిని అపహాస్యం చేయడం వంటివి మానుకున్నాడు. అతను అతని మామగారిని, ఇతరులను అనుసరిస్తూ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండేవాడు. ఇటువంటి సమయంలో అతను తన మామగారైన అన్నాసాహెబ్ దబోల్కర్ 'తన కుమార్తెను, అల్లుడిని శిరిడీ తీసుకొస్తాన'ని మొక్కుకున్న మొక్కుననుసరించి తన భార్య, మామగారితో కలిసి 1912వ సంవత్సరంలో గురుపూర్ణిమకు మొదటిసారి శిరిడీ వెళ్ళాడు. శిరిడీలో ఇతరులు బాబాకు నమస్కరిస్తే, అతనూ వారికి నమస్కరించేవాడు. ఒకసారి మాధవరావుదేష్పాండే అతనిని బాబాకు నమస్కరం చేయమని చెప్పాడు. అప్పుడు అతని మనసెరిగిన బాబా, "ఒత్తిడి చేస్తేగాని ఇతను గురుపాదాలకు నమస్కరించడు" అని అన్నారు. ఆ సున్నితమైన ఒత్తిడితో బాబా క్రమంగా అతనిలో మార్పు తెచ్చారు. బాబా కృపవల్ల అతనికెంతో మేలు జరిగి బాబా పట్ల అతనికి నమ్మకం పెరగసాగింది. అతనికున్న వ్యాధి మూలంగా ఇతరులవలె సాధారణ వేళల్లో, సాధారణ పరిమాణంలో ఆహారం తీసుకోలేకపోవడం వల్ల అతను బలహీనపడిపోతున్నాడని బాబాకి చెప్పినప్పుడు ఆయన, "అల్లా మేలు చేస్తాడు(అల్లా అచ్చా కరేగా)" అని అన్నారు. బాబా మాటలు నిజమయ్యాయి. అతను మితాహారం, మందులు తీసుకోవడం కొనసాగిస్తూ ముందుజాగ్రత్తగా అప్పుడప్పుడు మూత్ర పరీక్షలు చేయించుకుంటూ ఉండగా తొందరలోనే వ్యాధి నయమై అతను మాములుగా భోజనం చేయనారభించాడు.

రామచంద్ర రామకృష్ణ సామంత్ మొదటిసారి బాబాను దర్శించి వచ్చిన 11 నెలలకు అంటే 1913, జూన్ 5న అతనికి తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. అదే సంవత్సరం అతను బస్సెన్‌లోనున్న తుంగేశ్వర్ దేవాస్థానం కమిటీ చైర్మెన్‌గా నియమింపబడ్డాడు. తర్వాత 1915, ఫిబ్రవరిలో అతని ఎఱుకలో లేకుండా నిగూఢరీతిలో బాబా అతనినెలా కాపాడుతున్నారో తెలియజేసే సంఘటన ఒకటి జరిగింది. ఆ నెల ప్రారంభంలో అతను ఆర్నాలలోని తన ఇంట్లో జబ్బునపడి తిరిగి కోలుకుంటున్నాడు. ఒకరోజు అతను మంచం మీద నుండి లేవడానికి ప్రయత్నించే క్రమంలో అకస్మాత్తుగా మూర్ఛ వచ్చి క్రింద పడిపోయాడు. ఆ ఘటనలో అతని తల బలంగా నెలకు గుద్దుకుంది. అతని భార్య ఇది ఏ ప్రమాదానికి దారితీస్తుందోనని భయపడింది. ఇతర కుటుంబసభ్యులు కూడా అతని చుట్టూ చేరారు. ఆ సమయంలో అతనికి ఒక దృశ్యం కనపడింది. దాని గురించి అతను ఇలా చెప్పాడు: "యమదూతలవలె ఉన్న 8 నుండి 10 నల్లని ఆకారాలు చేత బల్లెలు, కత్తులు పట్టుకొని నన్ను చుట్టుముట్టారు. నాకు నొప్పి ఏమీ తెలియనప్పటికీ, వాళ్ళు నన్ను కొడుతున్న అనుభూతి కలగడంతో నాలో నేను, 'ఇదంతా ఏమిటి? వీళ్ళు నన్నెందుకు కొడుతున్నారు?' అని అనుకోసాగాను. అంతలో ఒక వెలుగు వచ్చింది. తర్వాత ఒక చేయి కదులుతూ ఆ నల్లని ఆకారాలను ఒక పక్కకు తోయడం నేను చూసాను. ఆ ఆకారాలన్నీ పక్కకి తప్పుకొని గొరవభావంతో నిలబడ్డాయి. ఆ చేయి క్రిందగా తెల్లని కఫ్నీ కొద్దిభాగం కన్పించింది. ఒక వింతైన పరిమళం నాకు అనుభూతమైంది. తర్వాత నాకు సృహ వచ్చి చూస్తే, నా చుట్టూ చాలామంది గుమిగూడి ఉన్నారు. కింద పడడం వల్ల నాకెలాంటి గాయాలు కాలేదుగాని, నా కళ్లద్దాలు మాత్రం పగిలిపోయాయి. కుటుంబసభ్యులందరూ బాబానే నన్ను కాపాడారని విశ్వసించారు. కానీ నాకప్పుడు బాబాపై అంతటి నమ్మకం లేదు. 1927లో నారాయణ మహారాజ్ మహిమను చవిచూసిన తర్వాతే నాకు బాబాపై దృఢమైన నమ్మకమేర్పడి ఆరోజు నన్ను రక్షించిన అమృతహస్తం సాయిబాబాదే అని గుర్తించాను".

1915లో గురుపూర్ణిమకి రామచంద్ర రామకృష్ణ సామంత్ రెండోసారి మునపటిలాగే తన భార్య, మామగారితో కలిసి శిరిడీ వెళ్లి బాబాను దర్శించాడు. ఆ సమయంలో అతనికి చెప్పుకోదగ్గ అనుభవాలు ఏమీ కలగలేదు. తర్వాత 1918, అక్టోబరులో బాబా సమాధి చెందడానికి వారం, పది రోజుల ముందు రామచంద్ర రామకృష్ణ సామంత్ మూడోసారి శిరిడీ వెళ్లి బాబాని దర్శించాడు. అప్పుడు అతను తన ఇద్దరు పిల్లలతోపాటు ఇతర కుటుంబసభ్యులను కూడా తీసుకెళ్లాడు. శిరిడీలో ఉండగా అతని కొడుకులిద్దరూ నీళ్ల విరేచనాలతో బాధపడ్డారు. సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆహారం ఇవ్వకపోవడం లేదా ద్రవాహారం ఇవ్వడం చేస్తారు. కానీ ఆ విషయం గురించి బాబాని అడిగినప్పుడు, "వాళ్ళకి శిరా తినిపించండి" అని అన్నారు. అలా చేస్తే పిల్లలు వారం రోజుల్లో కోలుకున్నారు. ఇలాగే అతని మామగారైన దబోల్కర్ ఒకసారి అనారోగ్యం పాలైనప్పుడు బాబా ఆదేశం మేరకు నిషేద్ధమైన ఆహారాన్ని తీసుకున్నారు. బాబా ఆజ్ఞానుసారం నడుచుకోవడం వల్ల ఎటువంటి హాని కలగలేదు.

1918లో బాబా రామచంద్ర రామకృష్ణ సామంత్‌ని మొదటిసారి దక్షిణ అడిగారు. అతను ఆయన అడిగినన్ని సార్లు, వారు అడిగినంత మొత్తం ఇచ్చాడు. అటువంటి ప్రదేశాలలో అప్పు చేయడం అతనికి ఇష్టముండదని తెలిసిన బాబా దక్షిణ విషయంగా అప్పు తీసుకోమని అతన్ని బలవంతం చేయలేదు. అతని జేబులోని డబ్బులన్నీ అయిపోక మునుపే వారు అతన్ని దక్షిణ అడగడం మానేసారు. అతనిలా చెప్పాడు: "బాబా దక్షిణ అడగటంలో నేను గమనించిన విషయమేమిటంటే, నాకు ఆధ్యాత్మికత పట్ల అపనమ్మకం జనించిన సమయాలలోనే బాబా నన్ను దక్షిణ అడిగేవారు. వారు దక్షిణగా అడిగే 25, 15, 10 సంఖ్యలలో ఏదైనా అంతరార్థముందో లేక ఆ సంఖ్యలు ఏ విషయాన్నైనా సూచిస్తాయో నాకర్థమయ్యేది కాదు. బాబా ఒక్కొక్కసారి "వెళ్లి వాడాలో కూర్చో!” అని ఆదేశించేవారు. నేను వారి మాటలను యథాతథంగా తీసుకొని, మేము బస చేసిన వాడాకు వెళ్లి మా మామగారి వద్ద కూర్చునేవాడిని. కానీ, చాలాకాలం తరువాత బాబా మాటలకు అర్థం 'వాడాలో జరిగే పురాణ పఠనం వినమ'ని నేను తెలుసుకున్నాను. మానవతత్త్వం- దైవత్వం కలగలసిన స్వరూపమే శ్రీసాయిబాబా! దైవత్వము, దైవశక్తులు వారిలో ఒక భాగమన్న గొప్ప విశ్వాసం నాకు కలగడానికి దోహదమైన ఒక సంఘటన గురించి నేనిప్పుడు చెప్తాను. 

1926, ఆగష్టులో నా కుమారుల్లో ఒకరు తీవ్ర అనారోగ్యం పాలవడం మొదలై దీర్ఘకాలం ఆ పరిస్థితి కొనసాగింది. ఆ సమయంలో ప్రముఖ డాక్టర్లు పరీక్ష చేసి విభిన్నమైన రోగనిర్ధారణలు చేసి, విభిన్న చికిత్సలు చేసారు. కానీ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా పిల్లవాడి ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరికి 1927, అక్టోబరులో నిరాశాజనకంగా అనిపించి నేను ఆశలు వదులుకున్నాను. అప్పుడు మా వదిన పిల్లవాడిని ఖేడ్గాంపేట్‌లో ఉన్న నారాయణ్ మహరాజ్ దగ్గరకు తీసుకెళితే బాగుంటుందని చెప్పింది. దాంతో పిల్లవాడిని మహరాజ్ దగ్గరికి తీసుకెళ్ళాను. అప్పుడు ఆయన, "అతడికి నయం అవుతుంది. ఈ తీర్థం తీసుకోండి!" అని అన్నారు. తర్వాత అంతకుముందు చికిత్స చేసిన డాక్టరు మందులు మార్చడంతో పిల్లవాడు క్రమంగా కోలుకొనసాగి ఆరునెలల్లో ప్రమాదం తప్పిపోయింది. ఆ తరువాత బలం పుంజుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. నారాయణ్ మహరాజ్ మాటలతో సంభవించిన ఆ మలుపు నారాయణ్ మహరాజ్, శ్రీసాయిబాబా లాంటి సత్పురుషులను, సామాన్య మానవమాత్రులుగా పరిగణించడం సరికాదని నాకర్థమైంది. సామాన్యులకందని ఉన్నతస్థాయిలో ఉన్న ఆ మహాత్ములు, టెన్నిసన్ తన 'మెమోరియమ్' అనే కవితలో చెప్పినట్లు దైవత్వము- మానవత్వము కలబోసిన దివ్యమూర్తులు.

1930 నుండి సాధు సత్పురుషుల గురించి నాకు మరిన్ని విషయాలు తెలిసి వచ్చాయి. తుంగరేశ్వర్ ఆలయంలో నాగబువా అను సాధువు నివసిస్తూ ఉండేవాడు. అతను గంజాయి పీల్చేవాడు. అతను 1930లో తుంగరేశ్వర్లో మరణించాడు. ఆ రోజు రాత్రి నేను బాంద్రాలోని నా గదిలో కలత నిద్రలో ఉండగా అకస్మాత్తుగా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో నా ముక్కు, గొంతులోకి ఘాటైన పొగవాసన చేరడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. లేచి చూస్తే, గదిలో నా భార్య మాత్రమే వుంది. నేను తనని, "నీవు పొగత్రాగావా?" అని అడిగాను. వాస్తవానికి ఎప్పుడూ పొగ తగని ఆమె నా మాటలకి విస్తుపోయి "మీరు ఏం మాట్లాడుతున్నారు?" అని కోపంగా అడిగింది. కానీ ఆ పొగవాసన నాకు ఇంకా వస్తూనే ఉండటంతో పొగ నా గదిలోనికి ఎలా వస్తుందో అని ఆశ్చర్యపోయాను. చిత్రంగా నా భార్యకు మాత్రం ఆ పొగవాసన రాలేదు. మర్నాడు ఉదయం నేను కారు నడుపుకుంటూ ఒక గ్రామంలో ప్రయాణిస్తున్నప్పుడు హఠాత్తుగా అప్పటి తుంగరేశ్వర్ ఆలయ చైర్మెన్‌గా ఉన్నతను ఎదురుపడ్డాడు. అతను నా కారు ఆపి, 'నాగబువా గతరాత్రి 2 గంటల ప్రాంతంలో మరణించారని, అతని అంతిమసంస్కారాలకు ఏమేమి ఏర్పాట్లు చేయాలో తెలుపమ'ని నన్ను అడిగాడు. అప్పుడు నాకు నాగబువా దేహం విడిచి వెళ్ళేముందు నా గదికి వచ్చి వెళ్ళారని అర్థమైంది. నా గదిలో వచ్చిన పొగవాసన, నాగబువా త్రాగే గంజాయి పొగవాసనగా గుర్తించాను కూడా! 1915లో బాబా నా గదికి వచ్చి నల్లని ఆకారాలను తుడిచి వేసినప్పుడు, వింతైన సుగంధ పరిమళం వచ్చినట్లు చెప్పాను కదా? ఆ పరిమళం బాబా వచ్చినప్పుడు మాత్రమే వస్తుందని కూడా గ్రహించాను.

బాబా నా గత జన్మల వృత్తాంతం నా ముందే శ్రీనానాసాహెబ్ నిమోణ్కర్కు వివరించారు. కానీ నేను వాటిని స్పష్టంగా వినలేకపోయాను. ఆ వివరాలేవో నిమోణ్కర్ను అడిగి తెలుసుకునేలోగా అతను మరణించాడు".

మూలం: డీవోటీస్ ఎక్స్పీరియన్సెస్ బై బి.వి నరసింహస్వామి,
బాబా'స్ అనురాగ్ బై విన్నిచిట్లురి.
రెఫ్: అనుభవసంహిత. 

14 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, take care of my parents 🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐

    ReplyDelete
  6. ఓం సాయిరామ్

    ReplyDelete
  7. ఓం సాయిరామ్

    ReplyDelete
  8. Om sai ram, naaku manashantini evvu, nenu korukunnadi jarige la chudandi, na manasuki nachakunda yedi jaragakunda chudandi baba, amma nannalani kshamam ga chudandi tandri pls

    ReplyDelete
  9. Om Sairam
    Sai always be with me 💐💐💐💐

    ReplyDelete
  10. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  11. sai baba nannu kshaminchandi, nenu madava ni thittanu. enka epudu thittanu baba. mee prasadam baba madava. madava ki exams lo above 75% ravali baba. Anugrahimchandi baba

    ReplyDelete
  12. Baba,naa evaru ebbandi padakunda bhada padakunda chudandi please 🥺🥺🥺🥺🥺🙏🙏🙏🙏🙏....naku mere dikku mere nannu kapadali....Mee padale naku raksha mammalni ee situations nundi bayataki vachela anugrahinchandi please 🥺🥺🥺🥺🥺

    ReplyDelete
  13. Om Sri Sai Arogyakshemadhaaya Namaha 🙏🙏🙏
    Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo