సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1822వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
 
  • శ్రీసాయి అనుగ్రహలీలలు - 34వ భాగం

నా పేరు సాయిబాబు. ఒకరోజు నేను, నా భార్య, తన తల్లి ముగ్గురం కలిసి గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళాం(ఆ మందిరంలోనే 2005లో మా అమ్మాయి వివాహం, 2018లో మా మనవడి పంచల మహోత్సవం ఘనంగా జరిగాయి). మేము మందిరం లోపలికి ప్రవేశించడానికి ముందు నా భార్య తన ఫోన్‌లోని యూట్యూబ్‌లో ఒక ప్రవచనం చూస్తుంది. అకస్మాత్తుగా తన ఫోన్‌కి మా అమ్మాయి నుండి వీడియో కాల్ వచ్చింది. నేను తనకి బాబాని, మందిరాన్ని చూపించాను. తను చాలా సంతోషించింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇటు నా భార్యకానీ, అటు మా అమ్మాయికానీ ఆ వీడియో కాల్ చేయలేదు. మరి ఎవరు చేశారు? ఇంకెవరు ఆ బాబానే! ఇకపోతే మందిరంలో స్వాములు అయ్యప్ప ఇరుముడ్లు వేసుకుంటున్నారు. వాళ్ళు, వాళ్ళ బంధువులు, బంధువుల పిల్లలు అందరూ కలిసి 780 మంది ఉంటారు. మేము బాబా మూర్తికి ప్రదక్షిణ చేసుకొని నమస్కరించుకుందామని బాబా పాదుకుల వద్దకు వెళ్ళాము. నా భార్య తన చేతిలో ఉన్న ఫోను పాదుకలు పక్కనపెట్టి రెండు చేతులతో పాదుకలు తాకి, తల ఆనించి నమస్కారం చేసుకుంది. తల ఎత్తేసరికి పూజారి తీర్ధమిచ్చి, "ప్రసాదం తీసుకోండి" అని పక్కనే ఉన్న టేబుల్ దగ్గరకి నడిచారు. ఆయన వెనుక మేము వెళ్లి ప్రసాదం తీసుకుని కొంచెం సేపు బాబా సన్నిధిలో కూర్చున్నాము. తర్వాత అదే ప్రాంగణంలో ఉన్న ఆంజనేయస్వామిని, శివలింగాన్ని, పక్కనే ఉన్న అమ్మవారిని దర్శించుకున్నాము. ఈ లోపల అయ్యప్పస్వామి స్వాములు అందరూ వెళ్ళిపోయారు. ఆలయ గుమస్తా వచ్చి "ప్రసాదం(టిఫిన్) తినేసి వెళ్ళండి" అని స్వాములు కోసం చేయించిన ప్రసాదం పెట్టించారు. ఆ తర్వాత మేము బయటికి వెళ్లి కారు ఎక్కబోతున్నప్పుడు నేను నా భార్య చేతిలో ఫోన్ లేకపోవడం గమనించి, "నీ ఫోన్ ఏది?" అని నా భార్యని అడిగాను. అప్పుడు ఆమెకు గంట క్రితం తన ఫోన్ బాబా పాదాల పక్కన పెట్టానని గుర్తొచ్చింది. వెంటనే గుడి మెట్లు ఎక్కుతూ, "బాబా! మీ సన్నిధిలో వున్న ఫోన్ నాకు తిరిగి లభిస్తుంద"ని అనుకుంది. కానీ వెళ్ళి చూస్తే, అక్కడ ఫోన్ కన్పించలేదు. పూజారిని అడిగితే, "ఆ ఫోన్ మీదా? నేను ఎవరో మర్చిపోయారని గుడి ఛైర్మన్‌గారి అబ్బాయికి జాగ్రత్త చేయమని ఇచ్చాను. అతను, మరికొంతమంది స్వాములు ఇప్పుడే పూజ చేసుకొని శబరిమలైకి బయల్దేరి వెళ్ళారు. అయినా మీరు కంగారుపడకండి. అతను ఫోన్ వాళ్ళింట్లో ఇచ్చి వెళతానని చెప్పాడు" అని చెప్పి గుడి మేనేజర్‌గారికి విషయం చెప్పి, అతన్ని చైర్మన్‌గారి ఇంటికి పంపి నా భార్య ఫోన్ తెప్పించారు. బాబా సమక్షంలో ఏ వస్తువూ పోవటం జరగదు కదా!

2022, జనవరిలో బాబా అనుమతితో నా భార్య హైదరాబాదులో ఉన్న తన చెల్లిలి ఇంటికి వెళ్ళింది. తిరిగి మా ఇంటికి ఎప్పుడు రావాలో బాబానే ఏదో విధంగా సూచిస్తారని తను అనుకుంది. అలవాటు ప్రకారం అక్కడ కూడా తను రోజూ సచ్చరిత్ర చదువుతుండేది. 20వ రోజు రాత్రి 7:30 అప్పుడు తను సచ్చరిత్ర పుస్తకం తెరవగానే ఒక పేజీలో 'నీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళు. రేపే వెళ్ళు. ఆలస్యం చేయవద్దు' అని కనిపించింది. వెంటనే తను బాబా ఆజ్ఞననుసరించి మరునాడు ఉదయం 7-30కి ఉన్న జన్మభూమి ట్రైన్‌కి టికెట్ రిజర్వ్ చేసుకుంది. మర్నాడు ఉదయం తను ట్రైన్ ఎక్కాక నాకు ఫోన్ చేసి, "గుంటూరు స్టేషనుకు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొండి" అని చెప్పి, ట్రైన్ రీచ్ అయ్యే టైం నాకు మెసేజ్ పెట్టింది. 5 నిముషాల తర్వాత టీసీ వచ్చి నా భార్య టికెట్ చూసి, "ఇది జన్మభూమి కాదు. మీరు ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కారు" అని చెప్పగానే నా భార్య కొంచెం కంగారుపడి బాబాని తలుచుకొని టీసీతో, "పోర్టరు నా లగేజ్ తెచ్చి ఈ ట్రైన్లో సర్ది, ఈ సీటు చూపించాడు. అతనికి సరిగా తెలిసే వుంటుందిలే అని నేను చెక్ చేసుకోలేదు" అని అంది. టీసీ విషయం అర్ధం చేసుకుని ఏసీ కోచ్ టిక్కెట్టు వున్నందున ఒక సీట్ చూపించి "మీరు ఇక్కడ కూర్చోండి" అని చెప్పి, "మామూలుగా అయితే ఫైన్ వ్రాయాలి కానీ వ్రాయట్లేదు. తప్పు పోర్టర్ది  కాబట్టి" అని వెళ్ళిపోయాడు. అలా బాబా దయవల్ల కరోనా కేసులు కొంచెం ఎక్కువగా ఉన్న సమయంలో నా భార్య క్షేమంగా మా ఇంటికి చేరుకుంది. అప్పుడు నా ఫోన్‌కి, "నీ ప్రయాణంలో నేను నీ వెంటే వున్నాను. ఎన్నో సందర్భాలలో నిన్ను రక్షించాను" అని మెసేజ్ వచ్చింది. ఆ విధంగా ప్రయాణం చేసిన నా భార్యను క్షేమంగా చేర్చమని బాబా తెలియజేసారు. కనుక బాబా మా వెన్నంటే ఉంటారనడంలో మాకు అస్సలు సందేహం లేదు. "వెన్నటుండి ప్రయాణంలో ఎటువంటి ఆటంకం కలగకుండా, ఏ వ్యాధుల బారినపడకుండా క్షేమంగా ఇల్లు చేర్చిన మీకు కృతజ్ఞతలు బాబా".

ఒకరోజు సాయంత్రం నేను ఒక్కడినే టీవీలో సంధ్య హారతి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాను. కర్పూరంతో బాబా మూర్తికి హారతి ఇచ్చాక చుట్టూ తిరిగి మనందరికీ చూపించి మరలా బాబాకి హారతి ఇస్తారు కదా! అయితే ఆరోజు అలా చేసినప్పుడు నాకు హారతి కనిపించలేదు. వెంటనే నేను బాబాని, "బాబా! నీ హారతి దర్శంపజేయవా?" అని మనసులో అనుకున్నాను. మరుక్షణం పెద్ద టీవీ స్క్రీన్ నిండా హారతి వెలుగు మాత్రమే ఒక నిమషంపాటు కనిపించింది. గర్భగుడిలో లైట్లు లేకుండా హారతి దర్శిస్తే ఎలా ఉంటుందో అంత వెలుగు ఉంది. మాములుగా హారతి వెలుగులో బాబా మూర్తి, సింహాసనం, సమాధి అన్ని కనిపిస్తాయి. కానీ నా కోరిక తీర్చడానికి బాబా హారతి వెలుగు మాత్రమే దర్శనమయ్యేలా చేసారు.

ఒకరోజు మా అమ్మాయి నాకు ఫోన్ చేసి, "సచ్చరిత్ర 108 సార్లు, స్తవనమంజరి 108 సార్లు పారాయణ చేయాలి. చేయగలవా?" అని అడిగింది. నేను, "బాబానే నా చేత అన్నిసార్లు పారాయణ చేయిస్తారు. నేను నిమిత్తమాత్రుణ్ణి" అని చెప్పి ఒక గురువారంనాడు పారాయణ మొదలుపెట్టాను. నేను పారాయణ మొదలుపెట్టిన కొన్ని రోజులకు నా మొబైల్ ఫోన్‌లో, 'భక్తులు పారాయణ చేయాలనుకుంటే, వారికి సచ్చరిత్ర పుస్తకం ఉచితంగా పంపుతామ'ని ఒక సందేశం నాకు కనిపించింది. నేను వెంటనే వారిచ్చిన ఫారంలో అన్ని వివరాలు నింపి ఆ సందేశం పంపినవాళ్ళకి పంపించాను. వాళ్ళు, "ఈ నెల కోటా అయిపోయింది. వచ్చే నెలలో ప్రయత్నించండి" అని బదులిచ్చారు. సరేనని, నేను తర్వాత నెలలో ప్రయత్నిస్తే వాళ్ళిచ్చిన వెబ్సైటు ఓపెన్ కాలేదు. నేను నా మనసులో, 'సచ్చరిత్ర అన్నిసార్లు పారాయణ చేస్తే, పుస్తకం నలిగిపోతుంది కదా బాబా. కాబట్టి మీరే కొత్త సచ్చరిత్ర పుస్తకం నాకు తప్పనిసరిగా పంపుతార'ని అనుకున్నాను. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు ఉదయం బాబా పూజ అయిన తర్వాత నేను బాబాని, "బాబా! సచ్చరిత్ర పుస్తకం ఈరోజు నాకు అందిస్తావా?" అని అడిగాను. అదేరోజు మధ్యాహ్న హారతి చూస్తుండగా పోస్ట్మాన్ నన్ను పిలిచి ఒక కవర్ చేతికి ఇచ్చాడు. తెరిచి చూస్తే అందులో సచ్చరిత్ర పుస్తకం ఉంది. అది చూడగానే నా కళ్ళల్లో నీళ్లు తిరగగా బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. అడగ్గానే ఎలా నెరవేర్చారో చూసారా! సచ్చరిత్ర అంటే మామూలు పుస్తకం కాదు. అదొక దైవిక గ్రంథం. అక్షయపాత్ర కన్నా ఎక్కువ. నిస్వార్థ కోరికలు తీర్చే కామధేనువు.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo