1. బాబా వెంట ఉన్నారనేదానికి ఎన్నో నిదర్శనాలు
2. బాబా దయ అనంతం
బాబా వెంట ఉన్నారనేదానికి ఎన్నో నిదర్శనాలు
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!! నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఎన్నోసార్లు ఆ సాయినాథుడు నా మీద చూపిన అనుగ్రహ వీక్షణలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ప్రతి అనుభవం మనపై సాయి ఎంతలా కరుణ చూపిస్తారో, ఎంతలా మన వెంటే ఉండి కాపాడతారో తెలియజేస్తుంది. కానీ మనం మామూలు మనుషులం. కష్టమొస్తే మన అనుకున్నవాళ్ళకి కష్టం చెప్పుకుంటాము, బాధపడతాం, ఆ కష్టం కలిగించినవాళ్ళని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తిట్టుకుంటాము, ఇది అంత మన కర్మ వల్ల జరిగిందని అనుకుంటాం. అయినప్పటికీ ఆ కష్టం కలిగించినవాళ్ళ పట్ల కోపం పోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ఒకసారి మా ఇంట్లో ఉండే ఒక వ్యక్తి వల్ల నాకు ఒక కష్టం వచ్చింది. నా తప్పు ఏమీ లేకపోయినా నేను చాలా చాలా బాధను అనుభవించాను. తట్టుకోలేక నాకు ఆ కష్టం కలిగించిన వ్యక్తి గురించి మా అమ్మ దగ్గర ఫిర్యాదు చేశాను. ఆ వ్యక్తి నేను మా అమ్మతో మాట్లాడిన విషయాలన్నీ మాకు తెలియకుండా ఫోన్లో రికార్డ్ చేసి నన్ను ఇంకా బాధపెట్టడానికి సిద్ధమయ్యారు. నిజానికి నేను ఏదీ తప్పుగా మాట్లాడలేదు. ప్రతి ఇంట్లో జరిగే సాధారణ విషయాలలాగే మాట్లాడాను. అయినా కూడా ఆ వ్యక్తి తన గురించి వెనుక మాట్లాడామని నన్ను, మా అమ్మని ఆ కారణంగా అవమానించారు. నేను చాలా మానసిక క్షోభకు గురయ్యాను. అప్పటినుంచి నాకు ఒక రకమైన ఫోబియా(భయం) ఏర్పడింది. ఆ వ్యక్తి గురించి మాట్లాడాలంటేనే నాకు తెలియకుండానే నా మనసులో ఆందోళన వచ్చేస్తుండేది. అలాంటిది ఈమద్య ఒకసారి మా అమ్మ నాతో ఆ వ్యక్తి గురించి ప్రస్తావన తెచ్చి, ఆ వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు నేను గతంలో ఆ వ్యక్తి నన్ను ఎలా బాధపెట్టింది గుర్తు చేసుకొని, నేను కూడా ఆ వ్యక్తి గురించి మాట్లాడాను. తర్వాత గతంలోలా ఆ వ్యక్తి మళ్ళీ రికార్డు చేసి ఉంటారేమోనని నాకు ఆందోళన వచ్చింది. వాస్తవానికి మేము మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో లేరు. అయినప్పటికీ కూడా గతంలో గాయం వల్ల ఇప్పుడు కూడా రికార్డ్ చేస్తున్నారేమోనని చాలా ఆందోళన పడ్డాను. ఆ ఆందోళన నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక్కసారిగా నాకు చెమటలు పట్టేసాయి. ఇదంతా కేవలం నా భయమేనని తెలుస్తున్న కూడా నన్ను నేను నియంత్రించుకోలేక బాబాని తలుచుకొని, "ఈ ఆందోళన నుండి బయటపడేయండి" అని ప్రార్ధించాను. కానీ ఆ ఆందోళన అలానే కొనసాగింది. నాకు ఏమి చేయాలో పాలుపోక, "ఈ ఆందోళన తగ్గేలా దయ చూపండి" అని బాబాని వేడుకున్నాను. కొద్దిసేపటికి ఆ వ్యక్తి నుండి నాకు ఒక మెసేజ్ వచ్చింది. చూస్తే, అది ఒక బాబా ఫోటో. ఆ ఫోటోని చూడగానే నా ఆందోళనంతా ఒక్కసారిగా చేతితో తీసినట్టుపోయింది. బాబా పిలిస్తే పలుకుతారన్నదానికి ఇంతకన్నా ఋజువు ఏమి కావాలి?.
ఈమద్య నాకు ఒక సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి స్థితిగతులు, ఉద్యోగం, కుటుంబం అన్నీ బాగున్నందువల్ల ఆ సంబంధం నా తల్లిదండ్రులకి బాగా నచ్చింది. నేను కూడా నాకు పెళ్లి కుదురుతుందని ఆశపడ్డాను. కాని పెళ్లిచూపుల్లో నేను ఆ అబ్బాయితో మాట్లాడినపుడు నాకు, ఆ అబ్బాయికి మానసికంగా కుదరదనిపించింది. ఎందుకంటే, చాలా విషయాల్లో మా ఇద్దరి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. అయినప్పటికీ నేను ఆ అబ్బాయికి నచ్చాను. నా తల్లిదండ్రులకి, ముఖ్యంగా మా అమ్మకి ఆ సంబంధం నచ్చింది. అందువల్ల నేను, '"నాకు నచ్చలేదు" అని చెప్తే, వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. ఒక రెండు రోజులు నాకు సర్ది చెప్పి ఒప్పించటానికి మా అమ్మ ప్రయత్నించింది. కానీ నా మనసు ఒప్పుకోలేదు. అందువల్ల ఆ సంబంధం నాకు 'ఓకే' అని చెప్పలేకపోయాను. అలాగని 'నో' చెప్తే, మా అమ్మ 'మళ్లీ అన్నీ బాగుండే సంబంధం రాదు' అని బాధపడుతుండేది. నేను ఆ రెండు రోజులు నేను చాలా బాధపడ్డాను. డిప్రెషన్లోకి వెళ్లినట్టు కూడా అనిపించింది. అటువంటి సమయంలో, "బాబా! అమ్మానాన్న నన్ను కష్టపెట్టకుండా ఆ సంబంధం వాళ్లతో 'నో' చెప్పాలి. నేను నా రోజువారీ జీవితంలోకి తిరిగి వచ్చేలా అనుగ్రహించమ”ని బాబాను వేడుకున్నాను. బాబా నా ప్రార్థన విన్నారు. మూడో రోజు అమ్మానాన్న నన్ను బలవంతం చేసి ఒప్పించకూడదన్న నిర్ణయానికి వచ్చి, 'మాకు ఈ సంబంధం వద్దు' అని వాళ్లతో చెప్పేశారు. దాంతో నేను హాయిగా నా సాధారణ జీవితంలోకి వచ్చేశాను. ఇలా బాబా నా వెంట ఉన్నారనేదానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. నాకు ఈ జన్మకి కావాల్సింది ఏమీ లేదు. బాబా మీద విశ్వాసమొక్కటి చాలు, జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి. “చాలా చాలా ధన్యవాదాలు బాబా”.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
బాబా దయ అనంతం
శ్రీసాయినాథాయ నమః!!! సాయిబంధువులకు నమస్కారాలు. నేను ఒక సాయిభక్తుడిని. రెండు సంవత్సరాల క్రితం నాకు క్యాన్సర్ వచ్చింది. అది గొంతు క్యాన్సర్ అయినందున ఆహారం తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. నేను దాదాపు జీవితం మీద ఆశ వదిలేసుకొని సాయిని ఆశ్రయించాను. ప్రతిరోజూ ఊదీ తీసుకుంటూ కాలం నెట్టుకురాసాగాను. ఇలా ఉండగా మా వాళ్ళు నన్ను తీసుకుని వెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నాకు అసలైన నరకం మొదలైంది. వారానికి ఒక కీమో, ప్రతిరోజూ రేడియేషన్ చికిత్సలు చేయడం మొదలుపెట్టారు. ఆ వైద్యం కన్నా మరణం ఎంతో మేలు అనిపించింది. అంతటి కష్టంలో నేను బాబాను వేడుకోవడం తప్ప చేయగలిగింది ఏదీ లేదని ఆయన్ని తలుచుకుంటూ ఉండేవాడిని. మొత్తం పది కీమోలు, 42 రేడియేషన్లు చికిత్సలు చేసారు. నేను దాదాపు 15 కిలోలకు పైగా బరువు తగ్గిపోయాను. ఆహారం తీసుకోవడం పూర్తిగా దుర్భరంగా మారింది. అటువంటి దారుణమైన స్థితికి వెళ్లిన నేను బాబా దయవల్ల అనూహ్యంగా కోలుకోనారంభించి అనతికాలంలోనే పూర్తిగా కోలుకున్నాను. అంతా బాగానే ఉందనుకుంటే దాదాపు పది నెలల తర్వాత తిరిగి గొంతునొప్పి మొదలైంది. మళ్ళీ ఆసుపత్రికి వెళ్లాలంటే గత అనుభవం దృష్ట్యా నేను పోదలుచుకోలేదు. ప్రతిరోజూ బాబా ఊదీ తీసుకుంటూ, "గొంతునొప్పి తగ్గి, తేలిగ్గా ఆహారం తీసుకోగలిగేల అనుగ్రహించండి" అని బాబాతో చెప్పుకున్నాను. కేవలం వారం రోజుల్లో బాబా అద్భుతం చేశారు. గొంతునొప్పి తగ్గి ఆహారం తేలిగ్గా తీసుకోగలుగుతున్నాను. బాబా దయ అనంతం. సాయి సమర్థులకు అనేక కోటి నమస్కారాలతో ఈ బాధామయ జగత్తునంతటినీ కాపాడమని వేడుకుంటున్నాను.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
.jpeg)
