1. 'వివిధ వేషధారి రూపాయ నమః' అన్న దానికి నిదర్శనమిచ్చిన బాబా
2. ఎలాంటి సమస్య అయినా బాబాకు చెప్పుకుంటే తొలగిపోతుంది
3. మూసేస్తామనుకున్న బిజినెస్ లో లాభాలను అనుగ్రహించిన బాబా
'వివిధ వేషధారి రూపాయ నమః' అన్నదానికి నిదర్శనమిచ్చిన బాబా
సద్గురు శ్రీసాయి కీ జై!!! ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు మురళీమోహన్. 2022, ఏప్రిల్ 7న నేను సాయిసచ్చరిత్ర 40, 41 అధ్యాయాలు చదువుతున్నప్పుడు నాకు 1998లో జరిగిన ఒక అద్భుతమైన అనుభవం గుర్తుకు వచ్చింది. ఎందుకో ఆ అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకోవాలన్న స్ఫురణ నాకు కల్గింది. దాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. అప్పట్లో ఒకసారి నేను సచ్చరిత్ర పారాయణ చేసి, చివరిరోజున, "బాబా! నాకు మీ నిదర్శనం చూపించండి. మిమ్మల్ని 'వివిధ వేషధారి రూపాయ నమః' అని అన్నారు కదా. మరి ఏదో ఒక రూపంలో వచ్చి నాకు దర్శనం ఇవ్వండి. మీ దర్శనం అయ్యేంతవరకు నేను ఏమీ తినను" అని అనుకున్నాను. అంతే, మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏమీ తినలేదు. మా అమ్మ 'తిను, తిను' అని నా వెంటపడినా నేను తినలేదు. మరోపక్క నా పట్టుదల ఇంకాస్త పెరిగింది. సమయం కాస్తా మధ్యాహ్నం రెండు గంటలైంది. మేము ఉండేది బాగా ఇంటీరియర్ ప్రదేశం, అదికూడా గవర్నమెంట్ కాలనీ, పైగా 4వ అంతస్థులో. లిఫ్ట్ కూడా లేదు. నిజానికి మా ఇంటివరకూ ఎవరూ రారు. ఏమైనా కావాలి అంటే మేమే కిందకి వెళ్ళాలే తప్ప, సరుకులు అమ్ముకునేవాళ్ళు కూడా పైకి రారు. అసలు ఆ ప్రదేశమంతా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తి పైనున్న మా ఇంటి దగ్గరకి వచ్చి మూసి ఉన్న తలుపు కొట్టాడు. నేను ఆత్రంగా గబగబా వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఆ వ్యక్తి. అతని ఎడమబుగ్గ లోపలి నుండి కుడిబుగ్గ వరకు ఒక కర్రపుల్ల గ్రుచ్చి ఉంది. అతనిని చూస్తూనే బాబానే ఆ రూపంలో వచ్చారని నాకు, మా అమ్మకి కలిగిన ఆనందానికి అవధులు లేవు. అతన్ని, "భోజనం చేస్తావా?" అని అడిగితే, అతను, "చేస్తాను" అన్నాడు. భోజనానంతరం మేము అతనికి దక్షిణగా డబ్బులు ఇస్తే, చాలా నిర్లక్ష్యంగా తీసుకున్నాడు. తరువాత అతను ప్యాంటు, షర్ట్ అడిగితే ఇచ్చాము. అంతే, కాసేపు వసారాలో కూర్చుని వెళ్ళిపోయాడు. ఆరోజు గురువారం. పిలిచినంతనే బాబా అతని రూపంలో వచ్చి నన్ను అనుగ్రహించారని చాలా చాలా ఆనందించాను. "ధన్యవాదాలు బాబా. నా తప్పులు ఏవైనా ఉంటే మన్నించండి. ఎన్నాళ్ళనుంచో నేను ఒక మంచి ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నాను. ఇకనైనా కరుణించండి సాయినాథా".
ఎలాంటి సమస్య అయినా బాబాకు చెప్పుకుంటే తొలగిపోతుంది
సాయిబంధువులందరికీ మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు హేమ. మేము విజయవాడ నివాసస్థులం. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను. 2021, మే నెలలో నాకు కోవిడ్ వచ్చి, బాబా దయవల్ల కోలుకున్నాను. ఇప్పుడు ఇలా బ్రతికున్నానంటే అది బాబా చలవే. ఈమధ్య నా ఎడమచేయి బాగా లాగేస్తోంది. ఎడమచేయి నొప్పి రాకూడదని అంటారు కదా! అందుకే నన్ను మా తమ్ముడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ టెస్టులు చేసి, రిపోర్టులు రావడానికి రెండు గంటలు పడుతుందని అన్నారు. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! రిపోర్టులు నార్మల్ అని వచ్చేలా చూడండి. నా అనుభవాన్ని తోటి సాయిబంధువులతో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులు నార్మల్గా వచ్చాయి. డాక్టరు రిపోర్టులు చూసి, "భయపడాల్సిన అవసరం లేదు. అది మామూలు నొప్పే" అని చెప్పారు. నేను ఆనందంగా, "చాలా చాలా ధన్యవాదాలు బాబా" అని అనుకున్నాను. అయితే ఎందుకో తెలీదు రెండురోజులుగా మళ్ళీ నా ఎడమచేయి లాగేస్తోంది. కొంచెం భయంగా ఉన్నా బాబా ఉన్నారనే ధైర్యంతో ఉన్నాను. బాబా ఈ నొప్పిని త్వరలోనే తగ్గించేస్తారని భావిస్తున్నాను. "బాబా! అమ్మ, నాన్నలా నాకు అన్నీ మీరే. ఏ చిన్న కష్టం వచ్చినా నేను మీతోనే చెప్పుకుంటాను. ఎప్పుడూ మీ ప్రేమ, కరుణ నా మీద, నా కుటుంబం మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను బాబా".
మా ఆడపడుచు కూతురికి 2020, డిసెంబరులో పెళ్లయింది. కరోనా సెకండ్ వేవ్లో మా ఆడపడుచు చనిపోయింది. తల్లి మరణించాక ఆ అమ్మాయి తన పుట్టింట్లోనే ఉంటుంది. తను కడుపుతో ఉండగా, కరోనా మూడో వేవ్లో తన తండ్రికి కోవిడ్ వచ్చింది. కూతురు కడుపుతో ఉందని అతను ఒంటరిగా ఒక గదిలో ఉండసాగాడు. అయినప్పటికీ ఆ అమ్మాయికి జ్వరం, దగ్గు వచ్చాయి. దాంతో మాకు చాలా భయమేసింది. తను అసలే ప్రెగ్నెంట్ అని నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "తనకి ఎలాంటి సమస్యా లేకుండా చూడండి బాబా. నా అనుభవం తోటి సాయిబంధువులతో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో ఆ అమ్మాయికి జ్వరం, దగ్గు తగ్గిపోయాయి. నేను బాబాకి మాటిచ్చినట్లు నా అనుభవాలు మీతో పంచుకున్నాను. "కొంచెం ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా. త్వరగా ఈ కరోనాను నాశనం చేసి అందరూ సంతోషంగా ఉండేలా మీరే చూడాలి బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
మూసేస్తామనుకున్న బిజినెస్లో లాభాలను అనుగ్రహించిన బాబా
"బాబా! మీకు శతకోటి వందనాలు తండ్రీ". 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ సభ్యులకు నా ధన్యవాదాలు. మీరు చాలా ఓపికతో అందరి అనుభవాలను చదివి, వాటిని సరిచేసి బ్లాగులో ప్రచురిస్తూ సాయిభక్తులందరికీ బాబా అనుగ్రహాన్ని పంచుతున్నారు. నా పేరు కృష్ణవేణి. నేనిప్పుడు నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. మాది పైపులు బిజినెస్. కొన్ని నెలల క్రితం మాకు కావల్సిన మెటీరియల్ పైపులు దొరికేవి కావు. మా కస్టమర్స్ ఆ మెటీరియల్ పైపులు మాత్రమే కావాలని అడిగేవారు. దాంతో మేము చాలా ఇబ్బందిపడ్డాము. బిజినెస్ చాలా డల్ అయిపోయింది. 12 సంవత్సరాలలో మేము ఎప్పుడూ బిజినెస్ అంత డల్ అవటం చూడలేదు. మాకు బిజినెస్ తప్ప వేరే ఏ ఆధారమూ లేదు. అయినా, ఏమవుతుందో అర్థంకాని పరిస్థితుల్లో బిజినెస్ పూర్తిగా మూసేద్దాం అనుకున్నాను. అది చాలదన్నట్లు ఇంట్లో అందరికీ ఆరోగ్య సమస్యలు. అప్పటి మా పరిస్థితి బాబాకు మాత్రమే తెలుసు. చివరికి 5 నెలల క్రిందట మా బిజినెస్ సరిగా నడవడం లేదని బాబాను ప్రార్ధించాను. అప్పటినుంచి బిజినెస్లో ఉన్న సమస్యలు చాలావరకు తగ్గిపోయాయి. మాకు కావాల్సిన పైపులు మా ఊరిలోనే దొరికేలా చేశారు బాబా. మొన్న ఉగాదికి దస్త్రం పూజ చేసి లాభాలు లెక్కిస్తే, ఎప్పటిలాగానే లాభం మంచిగా వచ్చింది. నిజానికి నేను ఈ సంవత్సరం బిజినెస్ ముసేస్తాం అనుకున్నాను. అలాంటిది ఎప్పటిలాగే లాభాలు వచ్చాయంటే మాటలా? నాకు ఇప్పటికీ అదొక అద్భుతంలా ఉంది. అంతా బాబా దయ. బాబా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఈ 8 నెలలూ కంటికి రెప్పలా కాపాడుతూ మమ్మల్ని ఆ స్థితి నుండి బయటపడేశారు. ఈ బ్లాగును పరిచయం చేసి, ప్రతిరోజూ భక్తుల అనుభవాలు, సాయి వచనాల ద్వారా ధైర్యంగా ఉండేలా చూశారు. ఈ బ్లాగు నిజంగా బాబానే. బాబానే ఈ బ్లాగు రూపంలో ఉండి భక్తుల బాధలు తీరుస్తున్నారు. నా విషయంలో మాత్రం ఇది నిజం. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు తండ్రీ. నాకు మీరు తప్ప దిక్కు ఎవరూ లేరు బాబా. నాకు సమస్యలతో పోరాడే శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించు బాబా".

