1. ఏ సమస్యనైనా ఇట్టే తీర్చే బాబా
2. సాయినాథుని దయ
3. ఊదీ నీళ్లు త్రాగమని సూచించి తద్వారా కడుపునొప్పి తగ్గించిన బాబా
ఏ సమస్యనైనా ఇట్టే తీర్చే బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
నా పేరు సంధ్య. నేను శిరస్సు వంచి శ్రీసాయినాథుని దివ్యపాదాలకు నమస్కరిస్తూ నా అనుభవాలను పంచుకోవడంలో ఆలస్యమైనందుకు ఆయనకు క్షమాపణలు వేడుకుంటూ నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ముందుగా సాయిబంధువులకు నమస్కారాలు. ఒకసారి నేను మహాశివరాత్రి సందర్భంగా ఇల్లు శుభ్రపరుస్తున్నప్పుడు నాకు చాలా మెడనొప్పి వచ్చింది. ఊదీ పెట్టుకుని, ఊదీ తీర్థాన్ని తీసుకుని బాబాను ప్రార్ధించాను. మెడనొప్పి కొంతవరకు తగ్గింది. అయితే రెండు రోజుల వ్యవధిలో మళ్ళీ వచ్చింది. ఈసారి దానితోపాటు తలనొప్పి కూడా వచ్చింది. ఆ మెడనొప్పి, తలనొప్పి భరించలేక 'హాస్పిటల్కి వెళ్ళాలా, వద్దా' అని చీటీలు వేసి బాబాను అడిగాను. బాబా, 'హాస్పిటల్కి వెళ్ళమ'ని చెప్పారు. అప్పుడు నేను, "సరే బాబా, మీరు చెప్పినట్లే హాస్పిటల్కి వెళ్తాను. ఏ సమస్య లేదని డాక్టరు చెప్పాలి" అని బాబాను ప్రార్ధించి హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టరు, "శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల ఆ నొప్పులు వచ్చాయి. తగ్గిపోతుంది" అని ఒక ఇంజక్షన్, 3 రోజులకి మందులు ఇచ్చారు. బాబా దయవల్ల మూడు రోజుల్లో మెడనొప్పి పూర్తిగా తగ్గిపోయింది.
ఒకసారి నాకు విపరీతమైన నడుము నొప్పి వచ్చి ఇంట్లో పని చేయడానికి కూడా చేత కాలేదు. నా బాధ బాబాకు చెప్పుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపిస్తూ, "హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా ఊదీతోనే ఈ నొప్పిని తగ్గించండి బాబా" అని ప్రార్ధించాను. బాబా దయవల్ల హాస్పిటల్కి వెళ్ళకుండానే నడుము నొప్పి తగ్గిపోయింది. "ధన్యవాదాలు సాయితండ్రి".
ఈమధ్య అద్దెకిచ్చిన మా ఇల్లు ఒకటి ఖాళీ అయ్యాక రెండు నెలలు గడిచినా ఎవరూ అద్దెకు రాలేదు. వచ్చిన వాళ్లంతా చూసి వెళ్ళిపోయేవారు. అప్పుడు నేను, "ఏంటి బాబా, ఇల్లు రెండు నెలల నుండి ఖాళీగా ఉంది. మీ దయవలన ఈ రోజు కనుక ఎవరైనా ఇంట్లో అద్దెకు దిగితే, మీ ప్రేమను, కరుణను సాయి బంధువులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్ధించాను. ఆశ్చర్యం! బాబాతో అలా చెప్పుకున్నానో, లేదో ఆ సాయంత్రమే ఒక కుటుంబం వచ్చి ఇల్లు కావాలని అడిగారు. నేను ఇల్లు చూపిస్తే, వాళ్లకు నచ్చింది. వాళ్ళు అద్దెకు దిగడం, ఇల్లు ఖాళీగా ఉందనే నా చింత తొలగిపోవడం చకచకా జరిగిపోయాయి. అంతా బాబా దయ. అంతకుముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంటి ముందు ఊడ్చేవాళ్ళు కాదు. అందువలన నేను, "ఈసారి సొంత ఇల్లులా చక్కగా చూసుకునే వాళ్ళు రావాల"ని బాబాను ప్రార్తించాను. బాబా నా మొర ఆలకించి, చక్కగా ఇల్లు వాకిలి ఊడ్చుకుని చక్కగా ఉండేవాళ్ళను పంపించారు. "ధన్యవాదాలు సాయి".
సద్గురు చరణం భవభయ హరణం సాయినాథ శరణం!!!
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయినాథుని దయ
సాయి మహారాజ్కి నా శతకోటి నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, ఏప్రిల్ 12వ తేదిన మేము మా అమ్మవాళ్ళతో విజయవాడ వెళ్ళాము. మరుసటిరోజు అమ్మ పాదాలకి వాపు వచ్చింది. మేము ప్రయాణం వల్ల వాపు వచ్చిందేమో అనుకొన్నాము. కానీ వారం రోజులైనా తగ్గలేదు. అప్పుడిక అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. డాక్టర్ హార్ట్, కిడ్నీ సంబంధిత టెస్టులు రాసారు. మేము అన్ని టెస్టులు చేయించి, "రిపోర్టులు నార్మల్గా రావాల"ని బాబాకి విన్నవించుకుని రిపోర్టులు వచ్చేదాక బాబా నామస్మరణలో గడిపాము. ఆ సాయంత్రం రిపోర్టులు ఇచ్చారు. డాక్టరు రిపోర్టులు చూసి, "ఏ సమస్య లేదు, బ్లడ్ తక్కువగా ఉంది" అని చెప్పారు. "శతకోటి నమస్కారాలు సాయితండ్రీ. అందరినీ చల్లగా కాపాడు తండ్రి" .
2019లో నాకు నెలసరి సమస్య వస్తే స్కానింగ్ చేసారు. రిపోర్టులో యుటరస్ ఫైబ్రియోడ్ అని వచ్చింది. డాక్టరు, "ఆపరేషన్ చేయాలి" అన్నారు. నాకు భయమేసి ఒకటి, రెండు నెలలు ఆయుర్వేద మందులు వాడి, ఆ తర్వాత నుండి రోజూ బాబాకి నా సమస్య గురించి చెప్పుకుంటూ ఊదీ నా పొట్టకి రాసుకుంటూండేదాన్ని. 2022, మార్చి 3న మళ్లీ స్కానింగ్ చేయించుకుని 'రిపోర్టు నార్మల్గా రావాల'ని బాబా స్మరణ చేశాను. రిపోర్టు వచ్చాక డాక్టర్ దగ్గరకి వెళ్తే, పాత రిపోర్టు, కొత్త రిపోర్టు రెండు పరిశీలించి, "ఫైబ్రియోడ్ పరిమాణం తగ్గింది. ఇప్పుడు ఇక ఆపరేషన్ వద్దు. మందులు కూడా అవసరం లేదు. మళ్లీ 6 నెలల తరువాత స్కాన్ చేసి చూద్దాం" అని డాక్టరు అన్నారు. అంతా మన సాయినాథుని దయ. "బాబా! ఇంకా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్నాయి. అవి కూడా తగ్గిపోయేలా చూడమని మిమ్మల్ని కోరుకుంటున్నాను తండ్రి. మేము ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి సాయి".
జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై!!!
ఊదీ నీళ్లు త్రాగమని సూచించి తద్వారా కడుపునొప్పి తగ్గించిన బాబా
శ్రీసమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
సాయి మహరాజుకు నా అనంతకోటి వందనాలు. నేను ఒక చిన్న సాయి భక్తురాలిని. 2022, మే 2న నాకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. ఆ కారణంగా అస్సలు నిలుచోలేకపోయాను, కూర్చోలేకపోయాను. ఏడుపు ఒక్కటే తక్కువ. అప్పటికి రెండు రోజుల ముందు నుండి ఏవో కారణాల వల్ల నేను మన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు చదవలేదు. ఇంక అప్పుడు ఆ నొప్పితోనే చదవటం ప్రారంభించాను. ఆశ్చర్యం! బ్లాగు తెరవగానే 'బాబా కృపతో తగ్గిన కడుపునొప్పి' అనే టైటిల్తో ఒక బాబా భక్తురాలు తమ అనుభవం పంచుకున్నట్లు కనిపించింది. ఆ భక్తురాలు తను కడుపునొప్పితో బాధపడుతున్నప్పుడు 'బాబా ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగాను' అని పంచుకున్నారు. అప్పుడు 'నాకు ఆ ఆలోచన రానందుకు బాబా దయతో మందలిస్తూ, నన్ను కూడా ఊదీ కలిపిన నీళ్లు త్రాగమ'ని ఆదేశిస్తున్నట్లు నాకనిపించింది. వెంటనే నీటిలో ఊదీ కలుపుకుని త్రాగి, బ్లాగులో భక్తులు పంచుకున్న అనుభవాలన్నీ చదివి సాయి నామస్మరణ చేసుకుంటూ పడుకున్నాను. కాసేపటికి నిద్రపట్టింది. తెల్లవారేసరికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అంతా బాబా దయ. "బాబా! మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉంటూ నాకు దారి చూపిస్తున్నందుకు నేను మీకు సదా ఋణపడి ఉంటాను. ఎప్పుడూ నా చేయి విడువకు తండ్రి".
శ్రీసమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!
సర్వం శ్రీసద్గురు సాయినాథార్పణమస్తు!!!
