- మేరే బాబా మన వెంటే ఉన్నారు!
- బాబా దయవల్ల అనారోగ్యం నుండి విముక్తి
- ఊదీ మహిమ వలన మానసిక ఆందోళన దూరం
మేరే బాబా మన వెంటే ఉన్నారు!
అందరికీ నమస్తే! ఈ బ్లాగు ప్రారంభించినప్పటి నుండి వచ్చిన సాయిభక్తులందరి అనుభవాలు చదువుతుంటే, మేరే బాబా (నా బాబా) తన బిడ్డలను ఎప్పటికీ విడిచిపెట్టరని నమ్మకం కలుగుతుంది. నా పేరు ఉమ. మేము దుబాయిలో ఉంటాము. మా పెద్దబ్బాయి కెనడాలో ఉంటున్నాడు. ప్రసవ సమయంలో కోడలికి తోడుగా ఉందామని 2019, నవంబరు 10వ తేదీన నేను కెనడా వెళ్లాను. ఆరునెలలు అక్కడే ఉండి, ఏప్రిల్లో తిరిగి వచ్చేద్దామని వెళ్ళేముందే అనుకున్నాను. కానీ కరోనా కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో నేను 11 నెలలపాటు కెనడాలో ఉండిపోవాల్సి వచ్చింది. చివరికి 2020, అక్టోబరులో దుబాయి తిరిగి వచ్చాను. అయితే ఆరునెలలకు పైగా అక్కడ ఉండిపోవటం వలన నా దుబాయి రెసిడెన్సీ వీసా రద్దు చేయబడింది. దాంతో మళ్ళీ వీసాకి దరఖాస్తు చేశాను. దానికోసం నాకు రక్తపరీక్ష, ఛాతీ ఎక్స్-రే తీశారు. తరువాత వీసా కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎక్స్-రే డిపార్టుమంట్ నుండి, ‘ఏదో అనుమానం ఉంది. ఒకసారి హాస్పిటల్కి రమ్మ’ని మావారికి మెసేజ్ వచ్చింది. మావారు ఆఫీసు నుండి ఫోన్ చేసి ఆ విషయాన్ని నాకు చెప్పి, “నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను. నువ్వు సిద్ధంగా ఉండు” అని చెప్పారు. ఒక్కసారిగా నాకు చాలా భయమేసి, “నాకు ఏమయింది బాబా?” అని బాబాతో మాట్లాడుకుంటూ ఏడ్చేశాను. తరువాత ఏడుస్తూనే బాబా సమాధానం కోసం ఫేస్బుక్ ఓపెన్ చేశాను. “నేను నీ చెంత ఉండగా భయమేల?” అనే బాబా సందేశం కనిపించింది. బాబా సమాధానానికి ఆనందంతో ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేశాను. అంతలో మావారు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్లు నాకు ‘స్పుటుం’ టెస్ట్ చేశారు. మళ్ళీ మరుసటిరోజు కూడా వచ్చి మరోసారి టెస్ట్ చేయించుకొని వెళ్ళమన్నారు. అసలు ఏం జరుగుతోందో, ఏం చేయాలో నాకేమీ అర్థంకాని స్థితిలో, “బాబా! నువ్వే నాకు దిక్కు” అని మనసులో అనుకున్నాను. తరువాత హాస్పిటల్ నుండి తిరిగి వస్తూ మావారిని, “స్పుటుం టెస్టు ఎందుకు చేస్తారు?” అని అడిగాను. అందుకు మావారు, “ఊపిరితిత్తులకు సంబంధించి ఏదైనా వ్యాధి ఉందన్న అనుమానం ఉంటే ఆ టెస్టు చేస్తారు” అని చెప్పారు. నాకింక ఏడుపు ఆగలేదు. ఆ బాధలో, “ఇదంతా ఏమిటి బాబా? ఏదేమైనా నాకు మీరే దిక్కు మేరే(నా) బాబా! నా రిపోర్టులు నార్మల్ అని రావాలి” అని నా మనసులోనే బాబాకు చెప్పుకున్నాను. రెండురోజుల తర్వాత మావారికి హాస్పిటల్ నుండి “సమస్య ఏమీ లేద”ని మెసేజ్ వచ్చింది. మావారు ఆఫీసు నుండి నాకు ఫోన్ చేసి, “భయపడవద్దు, ‘అంతా బాగుంద’ని హాస్పిటల్ నుండి మెస్సేజ్ వచ్చింది” అని చెప్పారు. ‘అంతా మీరే చూసుకోవాలి మేరే బాబా, నేను మిమ్మల్నే నమ్ముకున్నాను మేరే బాబా’ అని అనుకున్న ప్రతిసారీ మేరే బాబా (నా సాయి) నా వెంటే ఉండి నన్ను చూసుకుంటున్నారు. ఆయన కృపవలన నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అంతా బాబా దయ. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”.
బాబా దయవల్ల అనారోగ్యం నుండి విముక్తి
ముందుగా సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు లలిత. 2021లో ఒకసారి నేను గ్యాస్ట్రిక్ సమస్య వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. ఆ కారణంగా కడుపులో తీవ్రమైన నొప్పి, చేతుల్లో చురుక్ చురుక్ మంటూ చాలా బాధపడ్డాను. అప్పుడు బాబాను ప్రార్థించి, “ఈ సమస్య నుంచి రక్షించండి బాబా” అని బాబాను వేడుకున్నాను. తరువాత బాబా ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగాను. ఇంకా, ఆ రోజంతా బాబా నామస్మరణ చేశాను. బాబా దయవల్ల నేను అనారోగ్యం నుండి బయటపడ్డాను. “బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు”.
ఊదీ మహిమ వలన మానసిక ఆందోళన దూరం
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
నేను ఒక సాయిభక్తురాలిని. ఒకసారి నేను చాలారోజులు మానసికవ్యాధితో బాధపడ్డాను. దానివలన నేను ఆరోగ్యరీత్యా చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. ముఖ్యంగా రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టేది కాదు. నా పరిస్థితి చూసి నేనేమైపోతానోనని నా తల్లిదండ్రులు చాలా భయపడ్డారు. చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరిగాము. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరికి నేను హాస్పిటల్కి వెళ్లడం మానేసి, బాబాను ప్రార్థించి, బాబా ఊదీని నుదుటన ధరించి నిద్రపోవడం మొదలుపెట్టాను. బాబా దయవలన కొద్ది క్షణాల్లోనే నాకు నిద్రపట్టేది. నెమ్మదిగా మానసిక ఆందోళన నుండి కూడా నేను బయటపడ్డాను. ఏ డాక్టరు వల్ల సాధ్యం కానిది బాబా కృపవల్ల సాధ్యమైంది. బాబా ఎల్లప్పుడూ ఇలాగే మనందరినీ కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!".
