సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1814వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సంపూర్ణ విశ్వాసముంటే ఏ సమస్యనైనా పరిష్కరిస్తారు బాబా
2. ప్రతి కష్టంలో బాబా చేయూతనివ్వడం మన అదృష్టం

సంపూర్ణ విశ్వాసముంటే ఏ సమస్యనైనా పరిష్కరిస్తారు బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ప్రతిరోజూ ఠంచనుగా సాయి పూజ చేస్తాను. కాని నా పూజలో, ప్రార్ధనలో ఏదో వెలితి ఉన్నట్లు నాకు అనిపించేది. అవసరార్దం తప్ప మనఃస్పూర్తిగా నేను సాయిని కొలవటం లేదనేది నా మనస్సాక్షికి తెలిసేది. ఎంత ప్రయత్నించినా పూజ చేస్తున్న సమయంలో నా మనసును పలురకాల ఆలోచనలు చుట్టుముట్టేవి. బలవంతంగా మనసును పూజ వైపుకు మరలించుకునేదాన్ని. బాబాతో నా పరిస్థితి చెప్పుకొని, "నాపై దయతలచి నా మనసు మీ పాదాల చెంత ప్రతిక్షణం నిలిచేలా అనుగ్రహించండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఆయన చంచలమైన మనసుతో నేను చేసే పూజను స్వీకరించి ఎన్నో దారుణమైన పరిస్థితుల నుండి నన్ను, నా కుటుంబాన్ని పలుమార్లు కాపాడారు. అయినా నాలాంటి అజ్ఞాని దృష్టి దృఢంగా ఆయనపై నిలిచేది కాదు. ఒకరోజు బాబా సందేశాన్ని అనుసరించి నేను సచ్చరిత్ర సప్తాహ పారాయణం మొదలుపెడుతూ, "నన్ను కనికరించి నా మనసును మీ ఆధీనంలో ఉంచుకొని నాతో పారాయణం చేయించండి" అని బాబాను ప్రార్థించి పారాయణ సాగించాను. బాబా దయతో మొదటిరోజు నుండి నా మనసులో ఎలాంటి ఆందోళనలు లేకుండా నాకు తృప్తినిచ్చే విధంగా పారాయణ ప్రశాంతంగా జరిగింది. అంతకుముందు నేను ఎన్నోసార్లు చేసిన పారాయణకు ఆసారి మనసుపెట్టి చేసిన పారాయణకు చాలా వ్యత్యాసముంది. సోమవారంనాడు పారాయణ పూర్తయ్యాక కోర్టు వ్యవహారార్థం అత్యవసరంగా నా లాయరును కలవాల్సి వచ్చింది. ఆ లాయరు సంవత్సరం క్రితం పూర్తి చేయాల్సిన నా కేసును నా పరిస్థితి వివరిస్తున్న కూడా అకారణంగా వాయిదా వేస్తూ వచ్చాడు. ఆరోజు ఎలాగైనా ఆ లాయర్ని కలిసి కేసు విషయం మాట్లాడాలన్న నిశ్చయంతో నేను ప్రయాణమయ్యాను. దారి పొడవునా ఎటువంటి సంశయాలు, వత్తిడి లేని నిండు మనసుతో ఆరోజు సచ్చరిత్రలో చదివిన విషయాలను మననం చేసుకుంటూ లాయర్ ఆఫీసుకు చేరుకున్నాను. అక్కడ ఆఫీసు తలుపులు తెరిచే వున్నాయి గాని లాయర్ కానీ, అతని స్టాఫ్ కానీ అందుబాటులో లేరు. అప్పటికి నెల రోజుల ముందు నుండి నాకు అదే పరిస్థితి ఎదురవుతుంది. అయినప్పటికీ ఆరోజు ఎలాగైనా నేను లాయరును కలవాలనుకున్నాను. అందుచేత అక్కడ ఎవరూ లేకపోయినా లైట్లు వేసి, తలుపులు తెరిచి ఉన్నందున వాళ్ళు వస్తారన్నా ఆశతో అక్కడే సుమారు రెండు గంటలు వేచి వున్నాను. కానీ ఎవరూ రాలేదు. కనీసం ఫోన్‌‌లో మాట్లాడదామని ప్రయత్నించినా నా ఫోన్ కాల్‌కి ఆన్సర్ చేయలేదు. చివరికి నేను బాబాను, 'ఇంకా అక్కడే వుండనా? లేదా తిరిగి వెళ్లనా?' అని అడిగితే, 'వెళ్ళమ'ని సమాధానం వచ్చింది. దాంతో మరుసటిరోజు ప్రయత్నిద్దామని నేను అక్కడి నుండి బయలుదేరాను. దారిలో నాకు కావలసిన పండ్లు కొందామని ఒక సూపర్ మార్కెట్‌కు వెళ్ళి, తిరిగొచ్చి కారు ఎక్కగానే నా ఫోన్‌కు లాయర్ వద్ద నుండి మెసేజ్ వచ్చింది. నా కేసు వాయిదా కోర్టులో మరుసటిరోజు వుందన్నది దాని సారాంశం. నా పరిస్థితికి దయతలిచి వెంటనే పని జరిగే విధంగా అనుగ్రహించిన నా తల్లి, తండ్రి, తోబుట్టువు, గురువు, దైవం అన్నీ అయిన నా బాబాకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సంపూర్ణమైన విశ్వాసంతో ధర్మబద్ధమైన ఏ కోరిక కోరినా ఆ తండ్రి అనుగ్రహించడానికి ఆత్రుతపడతారని ఈ అనుభవం వల్ల మరోసారి నాకు ఋజువైంది.


ఒకరోజు విపరీతమైన పని ఒత్తిడి వల్ల ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. ఆ కారణంగా మరుసటిరోజు నేను చాలా అలసటగా వున్నాను. అయినా బయటకు వెళ్ళక తప్పని పరిస్థితి ఉండటంతో బాబా కథలను గుర్తు చేసుకుంటూ, ఆయన నామాన్ని జపిస్తూ ఎలాగో ప్రయాణం సాగించాను. తీరా అంత కష్టపడి వెళితే నేను వెళ్లిన పని మరుసటిరోజుకు వాయిదా పడింది. 'అయ్యో..' అనుకుంటూ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు తెరిస్తే, “నా మందిరంలో కూర్చొని నా హారతి చూడు తల్లీ' అని కనిపించింది. అప్పటికి నేను వెళ్ళిన ప్రదేశం నుండి నేనింకా తిరిగి ఇంటికి బయలుదేరలేదు. అక్కడున్న మిగతా పనులు చూసుకొని ఒక గంట తరువాత తిరిగి ఇంటికి వస్తూ, దారిలో వున్న బాబా మందిరం సమీపంలోకి రాగానే సుమారుగా రాత్రి 8.30 గంటలప్పుడు సాయంత్రం బ్లాగులో చదివిన పై మెసేజ్ గుర్తొచ్చింది. ఇప్పుడు గుడి తెరిచి ఉందో, లేదో అని సందేహిస్తూనే గుడి దగ్గరకి వెళ్ళాను. గుడి తెరిచి ఉంది. లోపల ఇద్దరు వ్యక్తులు మాత్రమే వున్నారు. త్వరత్వరగా వెళ్ళి బాబా దర్శనం చేసుకొని మందిరం మూసే సమయమేమోనని తొందరగా తిరిగి వచ్చేయబోతుండగా పూజారి, "అమ్మా! బాబా హారతి సమయమైంది. మీకు యిష్టమైతే అది అయ్యేవరకు వుండమ"ని అన్నారు. నేను సంతోషంగా హారతిలో పాల్గొన్నాను. శ్రీసాయి హారతి చూడమని ఆదేశించటమే కాదు, చూసే అవకాశం కూడా కల్పించారు. ఆయన లీలలు ఎన్ని చెప్పినా తక్కువే. వాయిదాపడిన నా పని 2 రోజుల తరువాత నేను అనుకున్నదానికంటే చాలా బాగా పూర్తయింది. "సాయి ప్రభూ! ఎప్పటికీ మీ అనుగ్రహం సాయి భక్తులందరిపై ఇలాగే వుండాలని కోరుకుంటూ మీకు కోటి వందనాలు తండ్రీ".


సమర్ధ సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!!!


ప్రతి కష్టంలో బాబా చేయూతనివ్వడం మన అదృష్టం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి అనంత్ కోటి పాదాభివందనాలు. సాయిబంధువులకు నమస్కారాలు. నా పేరు ప్రసన్న. నేను హైదరాబాద్ నివాసిని. నాకు సాయే తల్లి, తండ్రి, గురువు, దైవం, సమస్తం. 2024, మార్చి నెల రెండో వారంలో ఒకరోజు మా చెల్లి చాలా టెన్షన్ పడుతూ మా ఇంటికి వచ్చింది. విషయమేమిటని అడిగితే, "ఇంట్లో చాలా వాదులాటలు జరుగుతున్నాయి" అని చెప్పింది. ఆ కారణంగా తన ఆరోగ్యం కూడా కాస్త చెడింది. తను ఆరోజు సాయంత్రం వరకు మా ఇంటిలో ఉండి వెళ్ళింది. తను వెళ్ళాక నేను 2-3 సార్లు ఫోన్ చేస్తే, తను చాలా క్లుప్తంగా మాట్లాడింది. నాకు చాలా టెన్షన్‌గా అనిపించి, "బాబా! చెల్లి వాళ్ళింట్లో అంతా సాధారణ స్థితికి రావాలి. తను నాకు ఫోన్ చేయాలి" అని సాయినాథుని వేడుకొని ఆ రాత్రి పడుకున్నాను. మరుసటిరోజు మా చెల్లి ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడింది. సాయి ప్రేమ అనంతం, అక్షయం. ఆయన కరుణ అపారం. ప్రతి కష్టం, సమస్యలో ఆయన మనకి చేయూతనివ్వడం మన అదృష్టం. సాయి లేని జీవితం అసలు ఊహించలేము. "ధన్యవాదాలు బాబా. మీ కృపాకటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo