1. బాబా దయతో తీరిన మొక్కు2. అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ సమయానికి డబ్బు అందించిన బాబా
బాబా దయతో తీరిన మొక్కు
ఓం శ్రీసాయినాథాయ నమః!!! శ్రీసాయినాథుని దివ్య పాదాలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాను. నా పేరు సంధ్య. 10 సంవత్సరాల క్రితం కుటుంబ కలహాలు, తోడికోడళ్ళ వేధింపుల వల్ల మా అక్క విషం తాగింది. డాక్టర్లు తను బతకడం కష్టమన్నారు. అటువంటి సమయంలో నేను అప్పట్లో ఆరాధించే సంతోషిమాతను శరణువేడి, "అమ్మా సంతోషమాతా! మా అక్కను బ్రతికించు. నేను 16 శుక్రవారాలు వ్రతం చేస్తాను" అని కన్నీటితో వేడుకున్నాను. ఆ తల్లి దయవల్ల ఒక నెల రోజుల్లో మా అక్క కోలుకుంది. అందుకు కృతజ్ఞతగా వ్రతం చేయాలనుకున్నాను. కానీ ఆ వ్రతం సంతోషిమాత గుడిలోనే చేయాలి. గుడిలో 10 గంటలకు పూజారి వ్రతం ప్రారంభిస్తారు. కాబట్టి నేను ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని 9 గంటలకల్లా గుడికి చేరుకోవాలి. కానీ గుడి మేము నివాసముంటున్న ఊరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక శ్రావణమాసంలో వ్రతం ప్రారంభించి ఐదు వారాలు చేసి ఆరవ వారం ఉద్యాపన చేశానుగాని కష్టకాలంలో మొక్కిన మొక్కును తీర్చడం నావల్ల కాలేదు. ఒక పది సంవత్సరాలు గడిచిపోయినా 16 వారాల వ్రతం చేయలేకపోయాను. నేను ప్రతిరోజూ ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతాను. తరచూ బ్లాగులో "మొక్కులు చెల్లించకపోతే కష్టాలొస్తాయి. మొక్కులు చెల్లించి తీరాలి" అని బాబా సందేశం వస్తూ ఉండేది. బాబా అది నాకే చెప్తున్నారనిపించి, "బాబా! నాకు తోడుగా ఉండి నా చేత 16 శుక్రవారాల సంతోషిమాత వ్రతం చేయించి 17వ వారం ఉద్యాపన కూడా చేయించండి. ఉద్యాపన పూర్తికాగానే మీ అపార ప్రేమను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాయి బంధువులతో పంచుకుంటాను సాయీ" అని మొక్కుకున్నాను. తర్వాత ఒక శ్రావణమాసంలో శుక్రవారంనాడు సంతోషిమాత వ్రతం ప్రారంభించాను. సాయిబాబా నాకు తోడుగా ఉండి, నాకు కావాల్సిన శక్తిని ప్రసాదించి 16 వారాల వ్రతాన్ని పూర్తి చేయించి 17వ వారం ఉద్యాపన కూడా చేయించారు. సాయిమాతకు చాలా చాలా కృతజ్ఞతలు.
నా ఇష్టదైవాలు ఈశ్వరుడు, జగన్మాత. ఒకసారి నేను, "మీరు మీ భక్తులకు వారివారి ఇష్ట దైవాలను మీలో చూపించారు కదా బాబా! మరి నాకు ఎప్పుడు చూపిస్తార"ని అడిగాను. ఒకరోజు కలలో ద్వారకామాయిలో ధుని దగ్గర గరళాన్ని తాగుతున్న ఈశ్వరుడు అగ్నిజ్వాలల రూపంలో దర్శనమిచ్చారు. ఇంకోరోజు కలలో సమాధి మందిరంలో బాబా ఉన్న స్థలంలో జగన్మాత నీలంరంగు వస్త్రాలలో ఎనిమిది చేతులతో దర్శనమిచ్చింది. కాసేపట్లో అదే స్థానంలో బాబా దర్శనమిచ్చారు. ఆవిధంగా బాబా తామే ఈశ్వరుడు, జగన్మాత అని నిదర్శనమిచ్చారు. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించిన సాయినాథునికి వేలవేల కృతజ్ఞతలు.
అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ సమయానికి డబ్బు అందించిన బాబా
ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం. మొదట నేను సాయి భక్తుడిని కాదు కాని, సాయి భక్తుల అనుభవాలు చదివినప్పటినుంచి నేను కూడా సాయి భక్తుడినైపోయాను. ఇటీవల సాయితండ్రి నా జివితంలో చేసిన అద్భుతం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. నేను దుబాయ్లో 4 సంవత్సరాలు ఉన్నాక నా వీసా కాలపరిమితి పూర్తి కావడంతో తిరిగి ఇండియాలోని మా ఇంటికి రావడానికి నేను టికెట్ బుక్ చేసుకున్నాను. దుబాయ్ కంపెనీలు కొంతకాలం పనిచేసి తిరిగి వెళ్ళేటప్పుడు కొంత డబ్బు బోనస్గా ఇస్తాయి. చాలా కంపెనీలు మనం ఇంటికి రావడానికి 2 రోజులు ముందు ఇస్తుండగా నేను పని చేసిన కంపెనీ మాత్రం ఇంటికి వెళ్లిపోయిన నెల రోజుల తరువాత ఇస్తుంది. చాలామందికి అలానే ఇచ్చారు. అయితే నాకు కాస్త అర్జెంట్గా డబ్బుల అందాల్సిన అవసరం ఉండింది. కాని మా కంపెనీ అప్పుడే డబ్బు ఇచ్చే పరిస్థితి లేదని, ఒక నెల తర్వాతే ఇస్తుందని తెలిసిన నాకు ఏం చేయాలో తోచలేదు. అప్పుడే నాకు సాయితండ్రి గుర్తుకు వచ్చి, ఆయన్ని ఒక్కటే కోరుకున్నాను: "తండ్రీ సాయీ! ఎలాగైన నేను ఇంటికి వెళ్ళడానికి ఒకటి, రెండు రోజుల ముందు డబ్బులు వచ్చేటట్టు చూడండి. నేను కోరుకున్నట్టు డబ్బులు నాకు అందితే 10 మందికి అన్నదానం చేస్తాను, ఇంకా మీ అనుగ్రహాన్ని తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని. అంతే, ఇప్పటివరకు ప్రతి ఒక్కరికీ నెలా తర్వాతే డబ్బులు వస్తే సాయితండ్రి దయవల్ల నేను వెళ్లడానికి ఒకరోజు ముందే నాకు చెక్ రూపంలో డబ్బంతా కంపెనీ నాకు అందజేసింది. నాకు చాలా ఆనందమేసింది. నేను సాయి భక్తులకు ఒక్కటే చెప్తున్నాను, 'సాయితండ్రి మనతో ఉన్నంతవరకు చిన్న చీమ వల్ల కూడా మనకి అన్యాయం జరగదు, బాధ కలగదు. సాయితండ్రిని నమ్ముకుంటే మనకి ఎప్పుడూ అంతా మంచే జరుగుతుంది. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లు అన్నదానం ఇంకా చేయలేదు. సమయం చూసుకొని చేస్తాను. ఆలస్యానికి క్షమించు తండ్రీ".
సాయి మహరాజ్ కి జై!!!

