1. బాబా కరుణామయుడు, ఆపద్బాంధవుడు2. శిరిడీ వెళితే బంగారం పోయిందన్న నింద పడకుండా చూసిన బాబా
బాబా కరుణామయుడు, ఆపద్బాంధవుడు
నా పేరు లక్ష్మి. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దబాబుకి సంవత్సరం వయసున్నప్పుడు వాడిని మా అమ్మానాన్నల దగ్గర వదిలి నేను, నా భర్త ఉద్యోగం కోసం సిటీలో ఉండేవాళ్ళం. కానీ తల్లిగా వాడిని దగ్గరుండి చూసుకోలేకపోతున్నానే బాధ నన్ను ఎప్పుడూ వెంటాడుతుండేది. కొన్నిరోజులకు అతి కష్టం మీద బాబా అనుగ్రహంతో నాకు ఒక చిన్న ఆఫీసులో ఉద్యోగం దొరికింది. అక్కడ నాపై అధికారి నాకు కొంచెం కూడా సహకరించేవాడే కాదు. నేను ఎంత పని చేసిన కూడా అతనెప్పుడూ పైఅధికారులకు నా గురించి తప్పుగా చెప్తుండేవాడు. ఆ కారణంగా నాకు రావాల్సిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు సరిగ్గా అందేవి కాదు. ఇంకా ఎన్నో అవమానాలకు గురి అవుతూ నేను చాలా బాధని అనుభవిస్తూ 3 సంవత్సరాల, 5 నెలలు గడిపేశాను. అన్ని బాధలను ఎదుర్కోవడం తప్ప జీవితంలో చెప్పుకోతగ్గ మార్పు రాకపోవడంతో ఇక అప్పుడు నేను వేరే ఉద్యోగం వెతుక్కోవడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఏవీ ఫలించలేదు. నేను రోజూ బాబా గుడికి వెళ్లి, నా బాధని బాబాతో చెప్పుకుంటూండేదాన్ని. కరుణామయుడు, సాయిరాముడు దయవల్ల క్రమక్రమంగా నా పైఅధికారిలో మార్పు రావటం మొదలైంది. ఒక రోజు నౌకరి నుంచి ఒక ఉద్యోగ అవకాశం ఉందని నాకు కాల్ వచ్చింది. దానికి కావాల్సిన శిక్షణను నా పైఅధికారి ఇచ్చారు. నేను ఆ ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళితే, బాబా దయవల్ల అంతా సవ్యంగా జరిగింది. నేను అప్పటికి అందుకున్న జీతానికి రెండింతల కంటే ఎక్కువ జీతం ఆఫర్ చేశారు. నాకు చాలా సంతోషమేసింది. రెండు రోజుల్లో ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తామన్నారు. అయితే 2 నెలలైనా నా చేతికి ఆఫర్ లెటర్ అందలేదు. HRకి కాల్ చేస్తే, "హోల్డ్లో పెట్టాము. ఎప్పుడు వస్తుందో చెప్పలేము. మీకు వేరే ఆఫర్ దొరికితే వెళ్లిపోండి" అని అంటుండేవారు. నాకు ఏం చేయడానికి దిక్కు తోచలేదు. అటువంటి స్థితిలో, "ఎవరికైనా అన్నదానం చేస్తే నీ సమస్య తీరుతుంది" అని బాబా సందేశం వచ్చింది. దాంతో నేను ఒకరోజు పొద్దున్నే మిరియాల పొంగలి తీసుకుని, దారిలో ఎవరైనా బిక్షకులకు ఇద్దామని ఇంటి నుండి ఆఫీసుకి బయలుదేరాను. ఆరోజు రోజూ ఆ దారిలో కనిపించే భిక్షగాళ్లు ఎవరూ కనపడలేదు. కానీ ఎప్పుడూ చూడని ప్రదేశంలో ఒకాయన కూర్చుని ఉన్నాడు. నేను 3 సంవత్సరాలుగా అదే దారిలో ఆఫీసుకి వెళుతుండగా అంతకు ముందెప్పుడూ నేను ఆయనని అక్కడ చూడలేదు. నేను పొంగలి ఇస్తే ఆయన సంతోషంగా తీసుకున్నారు. ఆ మరునాడే నాకు జాయినింగ్ డేట్తో ఆఫర్ లెటర్ నా మెయిల్కి వచ్చింది. అంతే, నా సంతోషానికి అవధులు లేవు. వెంటనే మా నాన్నగారికి, మా అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. అప్పుడు నాకు అనిపించింది, 'నా దగ్గర పొంగలి తీసుకుంది ఎవరో కాదు, ఆ సాయినాథుడే' అని.
మా చిన్నబాబుకి 10 నెలల వయసప్పుడు చెన్నైలోని ఒక పెద్ద హాస్పిటల్లో డాక్టర్లు బాబుకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని, చాలా క్రిటికల్ సర్జరీ చేయాల్సిన అవసరముందని ఏవేవో టెస్టులు వ్రాసి, అవి ప్రతి వారం చేయాలని, ఆ తర్వాత చూసి సర్జరీ చేస్తామని చెప్పారు. మేము పిల్లాడిని మా అమ్మ నాన్నల దగ్గర వదిలి ఉద్యోగరీత్యా మేము చెన్నై వెళ్లిపోయాము. ఆఫీసుకి వెళ్లనున్న మాటేగాని నా మనసంతా బాబు మీదే ఉండేది. ఒక రోజు బాబుకి 3 టెస్టులు చేయించారు. రిజల్ట్ వచ్చేలోపు నాకు దుఃఖం ఆగలేదు. ఏం చేయాలో పాలుపోక భారం అంతా బాబా మీదేసి ఊదీ నీళ్లలో కలుపుకుని, పిల్లాడిని తలుచుకొని తాగాను. చమత్కారం! టెస్ట్ రిపోర్టులు డాక్టర్ దగరకు తీసుకొని వెళితే, "ఏం ఇన్ఫెక్షన్ లేదు. ఇక భయపడాల్సిన పని లేదు" అని చెప్పారు. బాబా కరుణామయుడు, ఆపద్బాంధవుడు, పిలిచినంతనే పలికే దైవం, భక్తులపాలిట కల్పవృక్షం. ఆయన లీలలు కోకొల్లలు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా”.
శిరిడీ వెళితే బంగారం పోయిందన్న నింద పడకుండా చూసిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సద్గురు సాయినాథునికి నమస్కారాలు. నా పేరు రాణి. మాది తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ. నాకు శిరిడీ సాయినాథుడు తప్ప వేరే దైవం లేరు. సర్వ దేవతలను నా సాయిలోనే చూసుకోవడం నా అలవాటు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఆయన్నే కొలుస్తున్నాను. పెళ్ళైన తర్వాత కూడా నేను సాయినే పూజిస్తున్నాను. ఆయన నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. 2024, ఫిబ్రవరి 1న నేను శిరిడీ వెళ్ళాను. అప్పుడొకరోజు రాత్రి శేజారతి అనంతరం మేము బస చేసిన గదికి వెళ్తుండగా ఒక బైక్ మీద ఇద్దరు అబ్బాయిలు వచ్చి నా మెడలోని రెండు లక్షల రూపాయల విలువ గల మంగళసూత్రాలున్న బంగారు గొలుసు లాగే ప్రయత్నం చేసాడు. నా ప్రాణం పోయినంత పనైంది. కానీ విచిత్రం తెలుసా, నా చైనులో చిన్న లింకు కూడా వాడు తీసుకెళ్లలేకపోయాడు. కానీ హఠాత్పరిణామానికి నేను ఒక రకమైన షాకులో ఉండిపోయాను. పక్కనే ఉన్న మా పెద్దపాప, "మమ్మీ! నీ చైన్కు ఏమీ కాలేదు చూడు. సాగింది అంతే, ఏ నష్టం జరగలేదు. చూడు మమ్మీ" అని అరిచింది. అప్పుడు నేను తేరుకున్నాను. అక్కడున్న వాళ్ళు, "చాలా విచిత్రం అమ్మా. గొలుసు లాగితే ఇక అంతే, అది పోయినట్లే. కానీ మీ గొలుసు పోలేదు. మీరు చాలా అదృష్టవంతులు" అని అన్నారు. కానీ అది మా అదృష్టం కాదు, సాయి దయ. నా తండ్రి నాకెంత సహాయం చేశారో ఒక గ్రాము పోయినా తిరిగి కొనే స్థితిలో లేని నాకు మాత్రమే తెలుసు. బాబా నన్ను, నా బంగారం గొలుసును కాపాడి శిరిడీ వెళితే బంగారం పోయిందన్న నింద పడకుండా చూసారు. "ధన్యవాదాలు బాబా".
శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!

