- శిరిడీ యాత్ర
ఓం నమో సాయినాథాయ నమః!!! సాయిబంధువులందరికీ నమస్కారములు. నేను ఒక సాయి భక్తురాలిని. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న మా వివాహ వార్షికోత్సవం. ఆ సందర్భంగా నేను ఆరోజు శిరిడీలో ఉండాలని ఆశపడుతుంటాను. అలాగే ఈ సంవత్సరం 2024, ఫిబ్రవరి 19న బయలుదేరి 20కి శిరిడీ చేరుకొని, మరుసటిరోజు 21, ఉదయం కాకడ హారతి దర్శనం చేసుకుని అనంతరం బయలుదేరి లోనావాలా వెళ్లేలా ప్లాన్ చేసి, టికెట్స్ బుక్ చేసుకున్నాము. అదలా ఉంచితే, వేరే స్నేహితుల బృందంతో కలిసి ఫిబ్రవరి 8న పండరియాత్రకు వెళ్ళే అవకాశం అనుకోకుండా వచ్చింది. కొద్దిరోజుల వ్యవధిలో మళ్లీ శిరిడీ వెళ్ళటానికి ఇబ్బంది అవుతుందేమోనని నాకు అనిపించినప్పటికీ తెగించి పండరి యాత్రకు వెళ్ళాను. బాబా దయవల్ల ఆ యాత్ర అంతా బాగా జరిగి ఫిబ్రవరి 13న ఇంటికి తిరిగి వచ్చాము. ఫిబ్రవరి 19న శిరిడీకి ప్రయాణమవ్వాల్సి ఉండగా ఆలోగా నాకు నెలసరి రావాలి. అది ఖచ్చితంగా జరుగుతుందనే ధైర్యంతోనే నేను 3 నెలల ముందుగా టూర్ ప్లాన్ చేసుకొని టికెట్లు బుక్ చేసుకున్నాను. అంతటి ధైర్యం నాకు ఎందుకంటే, బాబా ఇంతవరకు నాకు ఎప్పుడూ నెలసరి ఆటంకం ఏ విషయంలోనూ కలగనివ్వలేదు. ఆ విషయంలో నాకు ఎన్నోసార్లు నిదర్శనం చూపించారు బాబా. అందుకని పండరి యాత్ర నుండి రాగానే చాలా సాధారణంగా ఒకసారి, "బాబా! శిరిడీ ప్రయాణానికి ముందే నాకు నెలసరి వచ్చేయాలి" అని మనసులో అనుకుని వదిలేసాను. అంతే, బాబా దయవల్ల 14వ తారీఖున నెలసరి వచ్చేసింది. 18వ తారీకుకి 5వ రోజు కూడా ఐపోయింది. అలా మేము బయలుదేరాల్సిన రోజుకి ఒకరోజు ముందే అంతా క్లియర్ ఐపోయేలా బాబా చేసారు.
మేము 20వ తేది ఉదయం 10.30కి శిరిడీ చేరుకొని, రూము తీసుకుని స్నానాలు చేసి గుడి దగ్గరకు వెళ్ళేసరికి మధ్యాహ్న హారతి సమయం అయింది. సమాధి మందిరంకి వెళ్తే ఎలాగూ హారతికి లోపలికి వెళ్ళలేమని ద్వారకామాయికి వెళ్ళాము. లోపల చాలా ఖాళీగా ఉన్నప్పటికీ మా దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నందున అక్కడున్న సెక్యూరిటీ గార్డు మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరు విడివిడిగా వెళ్ళిరండి అని సూచించాడు. దాంతో మావారికి నా ఫోన్ ఇచ్చేసి నేను ముందు లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అరటిపళ్ళు, కిస్మిస్లు, ఇంకా ఏవో కలిపి నైవేద్యం తయారు చేస్తున్నారు. అది చూడగానే, 'ఇప్పుడు హారతి అయ్యాక ఈ నైవేద్యం బాబాకు నివేదించి అందరికీ పంచుతార'ని అనిపించి, 'ఎప్పుడూ దర్శనమై బయటికి వచ్చాక ఊదీతో పాటు ఇచ్చే బూందీ ప్రసాదం తీసుకోవడమేకానీ బాబాకు నివేదించిన ప్రసాదాన్ని తినలేదు. ఇప్పుడు బాబాకి నివేదించిన ఈ ప్రసాదం నాకు దొరికితే బాగుండు' అనుకున్నాను. కానీ బయట మావారు ఉన్నందున హారతి పూర్తయ్యేవరకు లోపల ఉండలేక బాబా దర్శనం చేసుకుని బయటికి వచ్చి మావారిని లోపలికి పంపించాను. ఆయన లోపల వుండగానే హారతి పూర్తి అవ్వడంతో బయటికి వచ్చేవాళ్ళకి ఆ ప్రసాదం ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో నేను మావారు రాగానే మళ్లీ వెళ్దామని సిద్ధంగా ఉన్నాను. కానీ మావారు రావడంతోటే, "అక్కడ ప్రసాదం ఐపోయింది. ఇంకేమి లేదు" అని చెప్పారు. అయినా గిన్నెకి అంటుకొని ఉన్న చిన్న పిసర అంత దొరికినా చాలని నేను మళ్ళీ లోపలికి వెళ్ళాను. నేను లైన్లో వుండగా నా ముందు ఉన్న ఒక ముగ్గురూ నలుగురు మధ్యలో నుంచి ఖాళీ ప్రసాదం గిన్నెను ధుని వెనక్కి తీసుకు వెళ్ళడం చూసాను. వాళ్ళని రిక్వెస్ట్ చేసి కాస్త గిన్నికి అంటిన ప్రసాదమైన ఇమ్మని అడుగుదామని ముందుకి వెళ్ళేసరికి ధుని వెనక ఉన్న కొలయి దగ్గర ఆ పాత్రని తోమేసి కడిగేసారు. నాకు ఒక్కసారిగా చాలా నిరుత్సాహంగా అనిపించింది. 'బాబా నాకు ప్రసాదం ఇవ్వలేదు, నా కోరిక తీర్చలేదు' అన్న భావం కలిగింది కానీ, 'నాకు ఎంత ప్రాప్తమో! అంతే ఇస్తారు బాబా. అలా బాధ పడకూడదు' అని సరి పెట్టుకున్నాను. అది కూడా బాబా నాకు ప్రసాదించినదే. ఎందుకంటే, సాధారణంగా నాకు కోపం ఎక్కువ. ఎప్పుడూ బాబాపై అలిగేదాన్ని. సరే, ద్వారకామాయి నుండి బయటికి వచ్చి చావడికి వెళ్ళాము. అక్కడ బాబాకి దణ్ణం పెట్టుకున్నాక అక్కడ ఖాళీగా ఉంటే కొంచెం వెనక్కి జరిగి ఒక నిమిషం పాటు కూర్చున్నాను. కళ్ళు తెరిచేసరికి అక్కడ ఉండే మహిళ సెక్యూరిటీ నా దగ్గరకి వచ్చి బాబాకి చావడిలో నివేదించిన కోవా నా చేతిలో పెట్టింది. ఒక్క క్షణం నాకు ఏం అర్థం కాలేదు గానీ తర్వాత ఇలా తట్టింది: 'కాసేపటి క్రితం ద్వారకామాయిలో జరిగింది బాబా నాకు పెట్టిన పరీక్ష అని, నేను సర్డుకుంటానా, లేదా నాకు ప్రసాదం ఇవ్వలేదని అలుగుతనా అని పరీక్షించారని, ఆ పరీక్షలో నేను పాస్ అయ్యాన'ని. దాంతో నాకు చాలా ఆనందమేసింది. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ లేచి వెళ్లబోతుంటే ఆ మహిళ సెక్యూరిటీ నన్ను వెనక్కి పిలిచి బాబా శేష వస్త్రాన్ని ఇచ్చింది. ఇక నా మానసిక స్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరానుకుంటాను.
తర్వాత ఎంతో సంతోషంగా సమాధి మందిర దర్శనానికి బయలుదేరాం. దారిలో జామకాయలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తే బాబాకోసం తీసుకుని వెళ్ళాలనిపించింది నాకు. కానీ ప్రస్తుతం సమాధి మందిరం లోపలికి ఏమీ తీసుకొని వెళ్లనివ్వట్లేదు. అయినా సరే బాబాకి నివేదిస్తే నివేదిస్తారు లేకపోతే లేదని రెండు జామకాయలు తీసుకున్నాను. విచిత్రంగా సెక్యూరిటీవాళ్ళు ప్యాకెట్లు, వస్త్రాలు, ప్రసాదాలు అన్నీ తీసేసుకున్నారు కానీ, మా కవరులో ఉన్న జామకాయలను చూసి కూడా వదిలేశారు. నేను తీసుకెళ్లిన ఒక కాగితంతో పాటు ఆ రెండు జామకాయలు సమాధి మందిరంలో పూజారికిస్తే, వాటిని బాబా పాదాల వద్ద పెట్టి, తిరిగి ఇచ్చారు. ఏమని వర్ణించాలి సాయి కటాక్షాన్ని? ఇకపోతే బాబా పాదాల వద్ద ఉంచిన కాగితం ఏమిటంటే, అది మా పాప బయోడేటా. మేము తనకి సంబంధాలు చూడడం మొదలుపెట్టాలనుకొని ముందుగా ఆ బయోడేటాని సాయి పాదాల వద్ద ఉంచి వారి ఆశీర్వాదం తీసుకొని, ఆపై ఎవరికైనా పంపాలని దాన్ని బాబా పాదాలు వద్ద ఉంచాము. అలా మాఘమాసం, ఏకాదశి వంటి పవిత్రమైన రోజున మా అమ్మాయి పెళ్ళి బాధ్యతను బాబాకి అప్పగించి చాలా సంతోషంగా బయటికి వచ్చాము. తర్వాత జామకాయ ప్రసాదం పక్కవాళ్ళకి పంచి మేము కూడా స్వీకరించాము. ఆ తర్వాత కూడా రెండుసార్లు దర్శనానికి వెళ్లినప్పుడు మా పాప బయోడేటాను బాబా పాదాల వద్ద ఉంచి ఆశీర్వదించమని కోరుకున్నాము. "బాబా తండ్రీ! పాపకి ఎన్నో మంచివి ఇచ్చి తనని ఎంతో ఉన్నతస్థానంలో ఉంచావు. రాబోయే చిన్నచిన్న అపాయాలను తొలగించావు. ఇప్పుడు తన జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఆ విషయంలో కూడా అడుగడుగునా మీరు అన్నీ అయి వుండి, నీ అంగీకారంతోనే అన్నీ ముందుకు నడిపించు బాబా. తన వైవాహిక జీవితం అంతా ఆనందమయంగా ఉండేలా ఆశీర్వదించు బాబా. మీ బిడ్డ మంచిచెడ్డలు మీరే దగ్గరుండి చూసుకోవాలి. ఇలాంటి సంబంధం కావాలి, అలాంటి సంబంధం కావాలి అని నేను కోరను. అది ఏదైనా మీరు పంపినదై ఉండాలి. మీ అంగీకార ముద్ర ఉండాలి. అన్ని పరిస్థితులు అనుకులించేలా చేసి మీ ప్రణాళిక ప్రకారం మీరే నడిపించండి బాబా. నా మనసులో కోరిక ప్రకారం పరిస్థితిని మార్చండి బాబా".
20వ తేదీ సాయంత్రం సంధ్యా హారతి తరువాత ఒక దర్శనం, రాత్రి ద్వారకామాయి దగ్గర శేజారతి చూసి మరుసటిరోజు పొద్దున్నే కాకడ హారతిలో బాబా అద్భుతమైన దర్శనంతో, వారి ఆశీస్సులతో మా పెళ్లిరోజును ప్రారంభించి తరువాత లోనావాలా వెళ్ళాము అక్కడ లోహగఢ్ ఫోర్ట్ అనే ఒక కోట ఎక్కేందుకు వెళ్ళాము. మెట్ల మార్గం మొదలులో కీరదోస ముక్కలు మొదలైన చిరు తినుబండారాలు అమ్ముకునే ఒక అతను మమ్మల్ని ఆపి, “పైకి వెళ్ళేటప్పుడు ఉతానికి కర్ర తీసుకొని వెళతారా?” అని అడిగి మరీ ఒక మీడియం సైజ్ కర్ర లాంటిది ఇచ్చారు. మళ్ళీ “ఇంకొకటి కావాలా?” అని అడిగి మావారికి కూడా ఒకటి ఇచ్చారు. చాలా ఎత్తుగా ఉన్న ఆ మెట్ల సులువుగా ఎక్కడానికి ఆ కర్ర ఎంత ఉపయోగపడిందో నాకు మాత్రమే తెలుసు. మాతో మెట్లు ఎక్కడం మొదలుపెట్టిన మిగతా వాళ్లంతా చాలా కష్టపడుతూ చాలా ఆలస్యంగా పైకి రాగలిగారు. కొండ దిగేటప్పుడు ఆ కర్ర మరింత ఎక్కువగా ఉపయోగపడింది. మేము అడక్కపోయినా, అలాంటిది ఒకటి వాడవచ్చని మాకు తెలియకపోయినా పిలిచి మరీ మాకు కర్రలు ఇచ్చి సహాయపడింది బాబానే అనటంలో నాకైతే ఎటువంటి సందేహం లేదు. లోనావాలాలో 2 రోజులు సంతోషంగా గడిపి ఫిబ్రవరి 24న క్షేమంగా మా ఇంటికి చేరుకున్నాం. ఆ విధంగా మా యాత్రను పూర్తి చేయించారు బాబా. మనసుకు కలిగిన అనుభూతిని పదాలలో పెట్టి వ్రాయడం చాలా కష్టమైన విషయం. ఉన్నది ఉన్నట్లుగా సాయి బంధువులకు అందించ సాధ్యం కాదు. అయినా ఏదో చిరు ప్రయత్నం చేసి ఈ సాయి లీలామృతాన్ని మీ ముందు వుంచాను.
ఓం నమో సాయినాథాయ నమః!!!

