- సచరిత్ర పారాయణతో గుండె జబ్బు నుండి నాన్నను రక్షించిన సాయి
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! ముందుగా గురువులకే గురువు, పరమ గురువైన సాయి చరణములకు నా అనంతకోటి నమస్కారాలు. నా పేరు శ్రీనివాసరావు. మాది నరసరావుపేట. సాఫ్ట్వేర్ ఇంజినీర్నైన నేను వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉంటున్నాను. నేను నా చిన్నప్పటి నుంచి సాయిబాబా భక్తుడిని. బాబానే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇంకా చెప్పాలంటే, ఒకప్పుడు బాబా తప్ప మరే ఇతర దేవతలు నాకు తెలీదు. సాయిని చూస్తూ, తలుస్తూ, సాయి లీలామృతం చదువుతూ పెరిగాను. ఒకరకంగా చెప్పాలంటే సచ్చరిత్రలో చెప్పినట్టు బాబానే నన్ను పెంచారు. నాకు ఏ సమస్య వచ్చినా 'బాబా' అని పిలిచినంతనే ఆ తండ్రి నాకు తోడూనీడై సహాయం అందిస్తున్నారు. నేను ఇదివరకు గుండె సంబంధిత సమస్య నుండి మా అన్నయ్యని కాపాడటంలో బాబా ఏవిధంగా సహాయం చేసారో మీతో పంచుకున్నాను. ఇప్పుడు అదే గుండె సంబంధిత సమస్య నుండి మా నాన్నను బాబా ఏవిధంగా రక్షించారో మీతో పంచుకుంటాను.
ఆది 2023, డిసెంబర్ నెల చివరి వారం. క్రిస్మస్ సెలవుల కారణంగా ఆ వారం అంతా వర్క్ తక్కువగా ఉంటుంది. కనుక నేను 2023, డిసెంబర్ 24 నుండి 2024, జనవరి 8 వరకు సెలవు పెట్టాను. అదే సమయానికి ఊరిలో మా నాన్న 'తన ఛాతీలో కుడివైపు నొప్పిగా వుంద'ని మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తే, అన్నయ్య నాన్నని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఆ విషయం అన్నయ్య నాకు ఫోన్ చేసి డిసెంబర్ 24, ఆదివారంనాడు సాయంత్రం చెప్పాడు. నేను వెంటనే హైదరాబాద్ నుండి నరసరావుపేట వెళ్లేందుకు బయలుదేరాను. అక్కడ హాస్పిటల్లో నాన్నకి వచ్చింది గ్యాస్ నొప్పి అని ఇంజక్షన్ చేసారు. తర్వాత ఈసీజీ తీస్తే రిపోర్టు అబ్నార్మల్గా వచ్చింది. అప్పుడు డాక్టర్, "ఈసీజీ అబ్నార్మల్గా వుంది. మీరు ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం గుండె డాక్టర్ని కలవండి" అని చెప్పి ఇంటికి పంపించారు. ఆ ఈసీజీ రిపోర్టును మా అన్నయ్య తిరుపతిలో అనస్థీషియా టెక్నీషియన్గా పని చేస్తున్న మా బావకి వాట్సాప్లో పంపాడు. తను ఆ రిపోర్టు చూసి, "రేపటిదాక వేచి ఉండక నాన్నను వెంటనే గుండె డాక్టర్ హాస్పిటల్లో చేర్చమ"ని బలవంతం చేశారు. దాంతో నాన్నని ఆరోజు రాత్రి 10 గంటలకి హాస్పిటల్లో చేర్పించారు. సరిగా రాత్రి 12 గంటలకు నాన్న, "నాకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా వుంది" అని చెప్తే, ఆయనను ICUకి షిఫ్ట్ చేసి ఇంక్యూబేషన్లో పెట్టారు. ఆ సమయంలో బస్సులో ఉన్న నాకు మా వదిన ఫోన్ చేసి, 'నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చి గుండె పనితీరు తగ్గి లంగ్స్లోకి నీరు చేరి ఊపిరి ఆడటం లేద'ని చెప్పింది. నేను భయంతో బాబాని తలుచుకున్నాను. ఉదయం 5.30కి బస్సు నర్సరావుపేట చేరింది. నేను నేరుగా హాస్పిటల్కి వెళ్ళాను. ICUలో ఉన్న నాన్నను ఆ స్థితిలో చూసి చాలా బాధపడి, "బాబా! ఎలాగైనా నాన్నని ఈ గండం నుండి బయటపడేయండి" అని ప్రార్ధిస్తూ బాబా నామస్మరణ చేస్తూ ఉన్నాను. డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పుడు నాన్నని చూసి, "48 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేము" అని అన్నారు. ఆ మధ్యాహ్నం 2.30 అప్పుడు నన్ను అర్జెంటుగా ఐసీయూలోకి రమ్మని పిలిస్తే వెళ్లాను. 'నాన్న పల్స్ రేటు తగ్గి, గుండె బలహినపడింద'ని చెప్పి నాన్నకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పుడు పల్స్ రేటు పెరిగింది. ఆ సన్నివేశం చూసాక నేను ఎంతో భయడిపోయాను. బాబాను, "జయ జయ సాయినాథా! దయాఘనా, ప్రేమస్వరూప, క్షమసాగరా! అనాధలం, దీనులం నిస్సహయులం అయిన మాపై దయ చూపు సాయి. నాన్న రోగాన్ని తక్షణమే తొలగించి నాన్నకు ప్రాణబిక్ష పెట్టు సాయి" అని వేడుకోసాగాను. ఇంకా, "నాన్న ఈ ప్రమాదం నుండి బయటపడితే, మీ అనుగ్రహం 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల అప్పటికి గండం గడిచింది. అయినప్పటికీ డ్యూటీ డాక్టర్ నన్ను పిలిచి, "72 గంటలు గడిస్తే కానీ, ఏ విషయమూ చెప్పలేము. మీరు అన్నిటికి సిద్ధంగా వుండండి" అని చెప్పారు. నేను ఆ 3 రోజులూ బాబా నామం జపిస్తూనే వున్నాను.
బాబా దయవల్ల 3 రోజుల తర్వాత నాన్నను ఐసీయూ నుండి రూముకి షిఫ్ట్ చేసారు. తరువాత అంజియోగ్రామ్ చేసి, "గుండెలో 3 బ్లాకులు వున్నాయి. ఇది బైపాస్ సర్జరీ కేసు. కానీ సర్జరీ హై రిస్క్తో కూడుకుంది. ఖర్చు కూడా లక్షలో అవుతుంది. ఇక మీ ఇష్టం. కావాలంటే, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి" అని చెప్పారు. నాకు ఏమి చేయాలో అర్ధం కాలేదు. మా బావ అంజియోగ్రామ్ CD తీసుకొని తిరుపతి వెళ్లి ఇద్దరు, ముగ్గురు డాక్టర్లని సంప్రదిస్తే వాళ్ళు, "ఇది బైపాస్ సర్జరీ కేసు. సర్జరీ చేయాలన్నా రిస్క్ ఎక్కువగా ఉంది. పైగా వయసు పెద్దది. అందులోనూ షుగర్ వ్యాధిగ్రస్తులు. కాబట్టి ఈ వయసులో సర్జరీ వద్దు" అని అన్నారు. నా భార్య అంజియోగ్రామ్ CD తీసుకుని హైదరాబాద్ వెళ్లి అదివరకు అన్నయ్యని చూపించిన కిమ్స్ హాస్పిటల్లో డాక్టరుకి చూపించింది. ఆ డాక్టర్ CD చూసి, "గుండెలో 3 బ్లాక్లు ఉన్నాయి. సర్జరీ చేస్తే హై రిస్క్ ఉంది. 3 లక్షలు అవుతుంది. స్టెంట్స్ వేస్తే 8 లక్షలు ఖర్చు అవుతుంది" అని చెప్పారు. దాంతో నేను నాన్నని హైదరాబాద్ తీసుకెళ్లి కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. రెండు రోజుల వ్యవధిలో నాలుగు రోజుల్లో స్టెంట్స్ ప్రొసీజర్ విజయవంతంగా పూర్తి చేసారు. మొత్తం 6 రోజులు హాస్పిటల్లో వున్నాక 7వ రోజు నాన్నని మా ఇంటికి తీసుకొచ్చాము. ఇప్పుడు నాన్న క్షేమంగా వున్నారు. నేను ఆ ఆపద సమయమంతా సచ్చరిత్ర పారాయణ, హనుమాన్ చాలీసా పఠనం చేస్తూ బాబాని స్మరిస్తూ ఉండేవాడిని. సచ్చరిత్రలో బాబా "నా చరిత్ర పారాయణ చేసి వారి వ్యాధులు నయమవుతాయి" అని చెప్తారు. అదేవిధంగా బాబా చరిత్ర పారాయణ వలన గుండెపోటు నుండి నాన్న సురక్షితంగా బయటపడ్డారు. తర్వాత నిదానంగా కూర్చొని ఆలోచిస్తే, బాబా నాన్న అనుభవించాల్సిన ఆ కర్మని నా ఆఫీసు సెలవుల వరకు ఆపారని నాకు అనిపించింది. ఎందుకిలా అన్నానంటే, ఆ కష్ట సమయంలో నాన్నకి నా తోడు చాలా అవసరం వుంది. అప్పుడైతేనే లాంగ్ హాలిడేస్తో నేను ఖాళీగా ఉన్నాను. సచ్చరిత్రలో చెప్పినట్టు గురువే కర్త. ఏ సమయానికి ఏది చేయాలో మనకంటే బాబాకే ఎక్కువ తెలుసు. మా అన్నయ్య, నాన్న అనారోగ్య పరిస్థితులతో నాకు ఒకటి బాగా అర్ధమైంది: 'సాయి పాదాలని నమ్మి, నిత్యం సచ్చరిత్ర పారాయణ చేసేవారి ప్రారబ్దంలో ఎంతటి బలమైన చెడు కర్మలున్నా బాబా నెమ్మదిగా వాటిని తొలగించి మనకు ఆనందకరమైన పూర్వపు జీవితాన్ని తిరిగి ప్రసాదిస్తారు' అని. ఇది సత్యం. బాబా తమ భక్తులను ఆపదకాలంలో ఆదుకుంటారు. ఆ సమయంలో మనం ఆయనపట్ల విశ్వాసంతో హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉండాలంతే! "థాంక్యూ బాబా. నిజంగా మీరు సర్వసమర్థులు, కరుణామయులు".

