1. సజీవ సాయిబాబా మూర్తి
2. మగబిడ్డను, సొంత ఇంటిని అనుగ్రహించిన బాబా
3. బాబా అనుగ్రహంతో చెడు అలవాట్లకు ముగింపు
శిరిడీ శ్రీసాయిబాబా సంస్థాన్లో పనిచేసిన ఒక సీనియర్ పూజారి తన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు:
సజీవ సాయిబాబా మూర్తి: అప్పుడే సంస్థాన్లో పూజారిగా చేరిన నన్ను వేకువజామున సమాధి మందిరంలో బాబాకి కాకడ ఆరతి, మంగళస్నానం చేసేందుకు నియమించారు. నేను మొదటిసారి బాబా విగ్రహానికి స్నానం చేసే పని మొదలుపెట్టి నా కుడిచేతితో వెన్న మొదలైనవి బాబా ముఖంపై రుద్ది, ఆపై గంగాజలంతో మంగళస్నానం పూర్తి చేసాను. అదేరోజు రాత్రి బాబా నాకు స్వప్న దర్శనమిచ్చారు. ఆ కలలో ఆయన తమ ముఖంపై గీరుకుపోయి ఉండటాన్ని చూపించి, "చూడు, నీ ఉంగరం నా ముఖాన్ని ఏమి చేసిందో! ఉంగరం ధరించడం నీకు అంత ఇష్టమైతే, విగ్రహానికి స్నానం చేసేటప్పుడు నువ్వు ఆ ఉంగరాన్ని నీ ఎడమ చేతికి ధరించు లేదా నాకు స్నానం చేసేంతసేపు దాన్ని తీసి పక్కన పెట్టుకో" అని అన్నారు. నిజమే, కొంతకాలంగా నా కుడి చేతికి ఒక వెండి ఉంగరం ఉంది. దాని వల్లే బాబా ముఖం గీరుకుపోయిందని గ్రహించాను. నా తప్పు నేను తెలుసుకొని ఆరోజు నుండి ఉంగరాన్ని తీసి నా ధోతి యొక్క ఒక మూలలో చుట్టి, శ్రీబాబా విగ్రహానికి జాగ్రత్తగా స్నానం చేస్తుండేవాడిని. బాబా స్వయంగా "నా ఫోటోను దర్శిస్తే, నన్ను దర్శించినట్లే" అని చెప్పారు. వారికీ వారి మూర్తికి భేదం లేదు.
మగబిడ్డను, సొంత ఇంటిని అనుగ్రహించిన బాబా: నేను సంస్థాన్లో ఉద్యోగం పొందినప్పటికీ కొన్ని కుటుంబ సమస్యల వల్ల సంతృప్తిగా ఉండేవాడిని కాదు. నాకు పుత్రసంతానమూ లేదు, సొంత ఇల్లూ లేదు. అందువలన నేను, "నా ఇంట్లో ఒక మగపిల్లవాడు ఎప్పుడు జన్మిస్తాడు? నాకంటూ స్వంత ఇల్లు ఎప్పుడు ఏర్పడుతుంది?" అని నిరాశతో నిరుత్సాహంగా ఉంటుండేవాడని. నేను ఆ నిరాశ, నిస్పృహలతో అర్థమనస్కంగా ఉంటూ సంస్థాన్కి రాజినామా చేసి, గ్రామానికి వెళ్లి చిన్న వ్యాపారం ఏదైనా ప్రారంభించాలని లేదా నా కుటుంబాన్ని పోషించుకోవడానికి వేరే పనేదైనా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆరోజు దీపావళి పండుగ. నేను సమాధి మందిరంలో లక్ష్మీ పూజ చేస్తూ నా మనసులో, "సమాధి మందిరంలో నేను చేస్తున్న చివరి లక్ష్మీ పూజ ఇది. ఎందుకంటే, నేను ఇక ఈ ఉద్యోగాన్ని వదిలి శిరిడీ నుండి దూరంగా వెళ్ళిపోతాను" అని అనుకున్నాను. తర్వాత నేను పూజ, శాస్త్రోక్తంగా ఇతర విధులు పూర్తిచేసి మందిరం నుండి బయటకు వచ్చి, ఇంటికి వెళ్ళసాగాను. రాత్రివేళ నేను కలత చెందిన మనస్సుతో శిరిడీ పోస్టు ఆఫీసు దగ్గర చీకటిగా ఉన్న ఒక సందులో నడుస్తున్నాను. ఆ సందు చివరన ఒక వృద్ధ ఫకీరు తన చేతిని నా వైపుగా చాచి నిలబడి ఉన్నాడు(సాయిబాబాలా వస్త్రాలు ధరించిన అనేకమంది బిచ్చగాళ్ళు, ఫకీర్లు శిరిడీ వీధుల్లో తిరుగుతుంటారు). నేను అతనితో చికాకుగా, "బాబా, ఈ క్షణం మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు" అని అన్నాను. ఆ ఫకీరు బాబా, "సరే, నువ్వు లక్ష్మీ పూజ పూర్తి చేసుకొని వస్తున్నావు కదా! నువ్వు శిరిడీ వదిలి వెళ్ళలేవు. నేను నిన్ను ఏమీ అడగడం లేదు కానీ, దీనిని తీసుకొని నీ ఇంట్లోని మీ పూజామందిరంలో ఉంచుకో" అని చెప్తూ రెండు, మూడు నాణేలు నా చేతిలో పెట్టాడు. నేను ఏమీ అర్థం చేసుకోలేక మౌనంగా నా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి చేరుకున్నాక నా చేయి తెరిచి చూస్తే, బ్రిటిష్ కాలంనాటి రెండు, మూడు నాణేలు అందులో ఉన్నాయి. అప్పుడు నా మదిలో 'నేను లక్ష్మీ పూజ చేసి సమాధి మందిరం నుండి వస్తున్నానని, నేను శిరిడీ విడిచి వెళ్లిపోవాలనుకుంటున్నానని వీధిలో నిలబడి ఉన్న ఫకీర్కు ఎలా తెలుసు?' అని ఒక ప్రశ్న తలెత్తింది. దాంతో, 'బాబా వద్ద మాత్రమే బ్రిటీషర్ల నాణేలు ఉంటాయి. శిరిడీ వీధుల్లో తిరిగే సాధారణ ఫకీర్ వద్ద అటువంటి పాత నాణేలు ఎలా ఉంటాయి?' అని నాకనిపించింది. ఏదేమైనా నేను ఆ నాణేలను భక్తివిశ్వాసాలతో నా పూజామందిరంలో ఉంచాను. బాబా ఆశీస్సులతో కొంతకాలానికి నా భార్య ఒక మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఇంకా ఇప్పుడు నాకు శిరిడీలో స్వంత ఇల్లు కూడా ఉంది. ఈరోజు నేను పూర్తి సంతృప్తితో ఉన్నాను. నా చివరి శ్వాస వరకు శిరిడీలో నివసిస్తూ బాబాకు సేవ చేయడమే నా ప్రధాన లక్ష్యం. ఇదంతా బాబా ఆశీర్వాదం.
శ్రీసాయిబాబా సంస్థాన్లోని మరో పూజారి చెప్పిన అనుభవం:
బాబా అనుగ్రహంతో చెడు అలవాట్లకు ముగింపు: నేను ఒకరోజు మధ్యాహ్నం సమాధి మందిరంలో విధులలో ఉన్నాను. సమాధి మందిరం ప్రధాన హాలులో పెద్దగా రద్దీ లేదు. 22-23 సంవత్సరాల ఒక యువకుడు దర్శనం కోసం సమాధి దగ్గరకు వచ్చాడు. అతను తన చేతిలో ఉన్న ఒక ఇంజెక్షన్, ఒక ఔషధ సీసాను నాకు అందించాడు. (సాధారణంగా భక్తులు ఉంగరాలు, లాకెట్స్, బాబా ఫోటోలు మొదలైనవి సమాధిని తాకించేందుకు ఇస్తారు. పూజారి వాటిని తాకించి తిరిగి భక్తులకు అందజేస్తారు. ఆ విధంగా వాళ్ళు బాబా ఆశీస్సులు పొందినట్లు భావిస్తారు.) నేను అతనిచ్చిన ఇంజెక్షన్, ఔషద సీసాను సమాధికి తాకించి, తిరిగి అతనికి ఇచ్చాను. కానీ అతను వాటిని తీసుకోవడానికి నిరాకరించాడు. నేను మళ్ళీ వాటిని అతనికిస్తూ, "మీ వస్తువులు మీరు తీసుకోండి" అని అన్నాను. అందుకతను దుఃఖిస్తూ, "పండిట్జీ, అవి నాకు తిరిగి ఇవ్వకండి. అది 'బ్రౌన్ షుగర్'(మత్తు మందు). నేను దాన్ని వాడటం వలన చాలా విసిగిపోయాను. ఈ చెడు అలవాటు కారణంగా నా భార్య నన్ను విడిచిపెట్టి, మా బిడ్డను తనతో తీసుకొని వెళ్ళిపోయింది. నా ఉద్యోగాన్ని కూడా కోల్పోయాను. నా జీవితం నాశనం అయింది. ఈ చెడు అలవాటు నుండి నేను బయటపడాలని దయచేసి మీరు బాబాను ప్రార్థించండి" అని అన్నాడు. నేను అతని సమస్యను, మానసికస్థితిని అర్థం చేసుకున్నాను. నేను అతనిని బాబా సమాధిని తాకడానికి అనుమతించి, 'వినాశకరమైన ఈ మత్తు పదార్థాలను ఎప్పుడూ తాకనని, తీసుకొనని ప్రతిజ్ఞ చేయమ'ని అన్నాను. స్వయంగా నేను కూడా, "ఆ మత్తు పదార్థాలను ఉపయోగించాలనే కోరిక అతనికి కలగకుండా ఉండేలా తగిన మనోబలాన్ని ఇవ్వమ"ని బాబాను ప్రార్థించాను. తర్వాత నేను అతనికి బాబా ప్రసాదం, ఊదీ ఇచ్చి, "విశ్వాసం, సహనం కలిగి ఉండమ"ని చెప్పాను. ఆరునెలల తర్వాత అదే వ్యక్తి తన భార్యాబిడ్డతో బాబా దర్శనానికి సంతోషంగా శిరిడీ వచ్చాడు. అతను నాతో, "డ్రగ్స్ తీసుకోవడం మానేశాను. తిరిగి నా డ్రైవర్ ఉద్యోగం నాకు వచ్చింది. నా భార్య తిరిగి ఇంటికి వచ్చింది" అని చెప్పాడు. ఇప్పుడు అతను కస్టపడి సంపాదించి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సంతోషకరమైన కొత్త జీవితాన్ని శ్రీసాయిబాబా అతనికి ప్రసాదించారు.
సోర్స్: శ్రీసాయిబాబా ద సేవియర్ బుక్.

