- ఎన్నో విధాలా అనుగ్రహిస్తున్న బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి. నేను ఇటీవలే ఈ బ్లాగు చూశాను. ఇందులోని భక్తుల అనుభవాలు చదివిన తర్వాత నాకు అంత భక్తి లేదనిపించింది. కానీ సాయి ఎప్పుడూ నాతోనే ఉన్నారని అనిపిస్తుంది. నాకు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పటినుంచి నేను ప్రతి గురువారం సాయిబాబా పూజ చేస్తుండేదాన్ని. పూజ అంటే పెద్దగా ఏం చేసేదాన్ని కాదు, మామూలుగా చేసే పూజే. అప్పట్లో నాకు 'ఓం సాయిరాం' అనే పదం తప్ప నాకింకే మంత్రమూ తెలీదు. సాయి సచ్చరిత్ర గురించి కూడా తెలీదు. నాకు ఏదైనా జరగాలని అనిపించినప్పుడు 'ఓం సాయిరాం' అని అనుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు. బాబా అంటే నమ్మకం, అంతే!
ఒకసారి మా బావ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు పరిచయం లేని ఎవరో వ్యక్తి, "ఎందుకో తెలీదు, ఈ పుస్తకం మీకు ఇవ్వాలనిపిస్తుంద"ని మా బావకి 'సాయి సచ్చరిత్ర' పుస్తకం ఇచ్చారు. ఐదు సంవత్సరాల తర్వాత నాకు 22 సంవత్సరాల వయసున్నప్పుడు మా అక్క ఆ సాయి సచ్చరిత్ర పుస్తకం నా చేతికి ఇచ్చింది. అలా నా దగ్గరకి ఆ పుస్తకం రావాలన్నది బాబా లీల ఏమో! అప్పటినుంచి నేను సాయి సచ్చరిత్ర చదువుతున్నాను.
నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాను. చాలా పరీక్షలు వ్రాశాను కానీ, నాకు ఉద్యోగం రాలేదు. సాయి సచ్చరిత్ర చదివిన తర్వాత నాకు ఇష్టమైన ఆహారం వదిలేయాలని నిశ్చయించుకొని ఒక సంవత్సరంపాటు చికెన్ తిననని బాబాకి చెప్పుకొని రోజూ సచ్చరిత్ర చదువుతూ ఉండేదాన్ని. ఒక సంవత్సరం లోపు ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది. అందుకు సంబంధించిన పరీక్షకు ఒక నెల కష్టపడి చదివి పరీక్ష వ్రాశాను. తర్వాత చూసుకుంటే పరీక్షలో కొన్ని తప్పులు పెట్టాను. అందువల్ల ఉద్యోగం వస్తుందో, రాదో అని ఆందోళన చెంది, "నాకు ఆ ఉద్యోగం రావాల"ని సాయిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. బాబా దయవల్ల నాకు ఆ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి ఎంపికైన బీసీ కేటగిరి వాళ్లలో నాదే చివరి పేరు. నేను ఆ ఉద్యోగానికి సంబంధించి ఆరు నెలల ట్రైనింగ్ కోసం సంవత్సరంన్నర వయసున్న నా పాపని అమ్మవాళ్ళ దగ్గర ఉంచి మచిలీపట్నం వెళ్లాను. అక్కడకు వెళ్లిన కొన్నిరోజుల తర్వాత కొత్తగా ఒక అమ్మాయి వచ్చి ట్రైనింగ్లో జాయిన్ అయింది. విషయం ఏమిటంటే, ఆమెకు నాకంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఉద్యోగానికి ఎంపికైన వాళ్ళ జాబితాలో తన పేరు లేదట. ఆ విషయం గురించి అధికారులను నిలదీస్తే, జరిగిన పొరపాటును సరిచేస్తూ ఆమెను ఉద్యోగంలోకి తీసుకున్నారు. అందుచేతనే ఆమె ఆలస్యంగా ట్రైనింగ్కి వచ్చింది. బీసీ కేటగిరీకి చెందిన ఆ అమ్మాయి పేరు మొదట్లోనే ఉద్యోగానికి ఎంపికైన వాళ్ళ జాబితాలో ఉండి ఉంటే నాకు ఆ ఉద్యోగం వచ్చి ఉండేది కాదు. అంటే, బాబా అద్భుతం చేసి నాకు ఉద్యోగం ప్రసాదించారు.
మచిలీపట్నంలో ఉన్నప్పుడు నేను ఉండే హాస్టల్ పక్కనే సాయిబాబా గుడి ఉండేది. అక్కడ పూజారి చాలా మంచి వ్యక్తి. అతను భక్తుల చేత బాబాకి అభిషేకం, స్నానం, అలంకరణ మొదలైనవన్నీ చేయించేవారు. అందువల్ల నాకు అక్కడ బాబాకు సేవ చేసే అవకాశం వచ్చింది. అంతకుముందెప్పుడూ అలా నేను బాబాను సేవించుకోలేదు. ఇకపోతే, అక్కడ ఉన్నప్పుడు నేను బాబాకి 500 రూపాయలు దక్షిణ ఇద్దామని అనుకున్నాను. కానీ మళ్ళీ సర్టిఫికెట్ల కోసం వెళ్ళేటప్పుడు ఇద్దామనుకొని అప్పుడు ఇవ్వలేదు. తర్వాత నేను ట్రైనింగ్ పూర్తి చేసి, పరీక్షా వ్రాసి వైజాగ్లో మా ఇంటికి వచ్చేసాను. మేం వైజాగ్లో ఒక భవనం మొదటి అంతస్థులో ఉంటాం. ఒకరోజు సాయిబాబా బండి మా వీధిలోకి వచ్చింది. వాళ్ళు అందరినీ దక్షిణ అడుగుతున్నారు. నేను అది చూసి ఒక పది రూపాయలు తీసుకొని కిందకు వెళ్లాను. కాషాయ వస్త్రాలు ధరించిన ఒకామె నా దగ్గరకు వస్తే, నేను పది రూపాయలు ఆమెకి ఇచ్చాను. ఆమె ఆ డబ్బులు తీసుకుని, "నాకు కావాల్సింది ఇది కాదు" అని అంది. నేను, 'మరేమిటి?' అన్నట్లు చూశాను. ఆమె వెంటనే పెన్ను తీసుకుని నా చేతిపై 500 రూపాయలు అని రాసింది. నేను ఏమీ ఆలోచించకుండా పైకి వెళ్లి, 500 రూపాయలు తీసుకొచ్చి ఆమెకిచ్చాను. ఆమె ఆ డబ్బులు తీసుకొని, నేను ముందు ఇచ్చిన పది రూపాయలు నాకు తిరిగి ఇచ్చేసి, "నా మనసులో కోరిక నెరవేరుతుంది" అని చెప్పింది. నేను పరీక్ష పాసవ్వాలని అంటే, "తప్పకుండా జరుగుతుంది" అని ఆమె వెళ్ళిపోయింది. అలాగే నేను పరీక్షలో పాస్ అయ్యాను. తర్వాత సర్టిఫికెట్లు తీసుకోవడానికి నేను మచిలీపట్నం వెళ్లాల్సినవసరం లేదని అన్నారు. దాంతో నేను అక్కడ ఇవ్వాలనుకున్న 500 రూపాయలు ఇవ్వడం ఎలా అనుకున్నాను. కానీ ఆలోచిస్తే, సర్వమూ తెలిసిన బాబా ఆ కాషాయ వస్త్రాల స్త్రీ రూపంలో నేను ఇవ్వాలనుకున్న 500 రూపాయలు నా వద్ద నుండి తీసుకున్నారని నాకు అర్థమైంది. అద్భుతం కదా!
నాకు పశ్చిమగోదావరి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. అది నాకు నచ్చలేదు. చాలా దూరమని ఏడ్చాను. "ఎందుకిలా చేసావ"ని సాయిని తిట్టుకున్నాను. చివరికి ఆ ఉద్యోగం మానేద్దాం అని అనుకున్నాను కూడా. కానీ రెండు నెలలు చేసి మానేద్దామని నిర్ణయించుకుని అక్కడికి వెళ్లాను. అక్కడ నన్ను నేను సర్దుబాటు చేసుకోలేక చాలా ఇబ్బందిపడుతూ బదిలీ కోసం ప్రయత్నం చేస్తుండేదాన్ని. ఆ విషయం అలా ఉంచితే, అక్కడ కూడా ఒక బాబా గుడి ఉంది. నేను ప్రతిరోజూ ఆ గుడి మీదగా డ్యూటీకి వెళ్తుండేదాన్ని. ఒకసారి బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒకతను, "ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. 5,000 రూపాయల డొనేట్ చేయండి. అలా అందరూ చేశాక ఆ డబ్బులు బ్యాంకులో వేసి, వచ్చే వడ్డీ డబ్బులతో ప్రతివారం అన్నదానం చేస్తామ"ని చెప్పారు. నేను చూస్తానని చెప్పి వచ్చేసాను. అయిదు నెలల్లో నాకు బదిలీ అయింది. ఇప్పుడు నేను మా ఇంటికి దగ్గరలో ఉద్యోగం చేసుకుంటున్నాను. నేను పశ్చిమ గోదావరి జిల్లా నుండి వచ్చేముందు 5,116 రూపాయలు బాబా గుడిలో డొనేట్ చేసి వచ్చాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం మా పాప పుట్టినరోజునాడు ఆ గుడిలో అన్నదానం జరుగుతుంది. మేము అక్కడ లేకపోయినా జీవితాంతం అలా అన్నదానం జరిగేందుకే బాబా నన్ను అక్కడికి పంపారని నాకు అనిపిస్తుంది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. నా మనసులోని కోరికలు తీరిలా అనుగ్రహించండి సాయినాథా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!

