సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1728వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ఒకే నెలలో రెండుసార్లు ప్రాణభిక్ష పెట్టిన బాబా

నేను ఒక సాయి భక్తురాలిని. సాయి లేకపోతే నేను లేను. నా కుటుంబం కూడా లేదు. ఆయనకి చెప్పందే నేను ఇల్లు కదలను. ఆయన్ని అడగందే నేను ఎటువంటి పని ప్రారంభించను. ఆయన నాకు గురువు, దైవం, ఇంటి పెద్ద, స్నేహితుడు కూడా. నేను ఒకసారి వన భోజనాలకి వెళ్తున్నప్పుడు వాతావరణం ఏమంత బాగోలేదు. నేను అప్పుడు సాయికి, "వాన పడకుండా ఆపమ"ని చెప్పుకున్నాను. ఆయన ప్రేమతో ఎండ, వాన లేని చల్లని ఆహ్లాదకర వాతావణం అనుగ్రహించారు. ఆ రోజు వన భోజనాల్లో మేము ఎంతో ఎంజాయ్ చేశాం. నాకు ఏమాత్రమూ అలసటగా అనిపించలేదు. అందుకే నా జీవితంలో మా అమ్మ, నాన్న, చెల్లికి ఉన్న ప్రాధాన్యత సాయికి కూడా ఉంది. నా జీవితమంతా గుర్తుంచుకునే అనుభవాలు సాయి నాకు ఎన్నో ఇచ్చారు. నేను మూడుసార్లు సాయి సచ్చరిత్ర మండలం రోజుల పారాయణ చేశానుగాని సప్తాహ పారాయణ చేయలేదు. ఈమధ్యనే మొదటిసారి సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేసాను. ఆ సమయంలో సాయి నాపై చూపిన అనుగ్రహాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


నేను ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ఒక టాబ్లెట్ క్రమం తప్పకుండా వేసుకోవాలి. అయితే ఒకరోజు నేను మర్చిపోయి ఒక టాబ్లెట్‌కి బదులు రెండు టాబ్లెట్లు వేసుకున్నాను. ఆ టాబ్లెట్ ఒకటి వేసుకుంటేనే విపరీతమైన మత్తు వస్తుంది అలాంటిది రెండు వేసుకున్నాను. ఆ విషయం గుర్తించగానే భయంతో వణికిపోయాను. ఎందుకంటే, 2023, డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో మిచౌంగ్ తుఫాన్‌ విరుచుకు పడి మోకాళ్ళ లోతు నీళ్ళు కాలువలను తలిపిస్తూ పొంగి పొర్లుతున్నాయి. విద్యుత్ కోతలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో నాకేదైనా అయితే అమ్మ, చెల్లి ఎంత ఇబ్బందిపడతారో నా ఊహకు కూడా అందలేదు. మామూలుగానే శారీరకంగా చాలా బలహీనంగా ఉండే నేను నా వల్ల ఎవరికీ ఏ సమస్య రాకూడదనుకుంటాను. అలాంటిది రెండు టాబ్లెట్లు వేసుకున్నందువల్ల ‘ఇప్పుడు ఏమవుతుందో, పొద్దున్నే లేస్తానో, లేదో’ అని ఏవో పిచ్చిపిచ్చి ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఒకపక్క సప్తాహా పారాయణ చేస్తూనే, మరోపక్క సాయికి నా బాధ చెప్పుకున్నాను. అంతే! నా కళ్ళ ముందు '86' అనే నంబర్ కనిపించింది. వెంటనే సాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైట్ ఓపెన్ చేసే, ఆ నెంబర్ టైపు చేసి చూస్తే, "ప్రమాదం నుండి రక్షింపబడతావు" అని వచ్చింది. సాయి అలా చెప్పడంతో నా మనసు కాస్త శాంతించింది. రాత్రి హాయిగా నిద్రపోయాను. ఉదయాన్నే ఎంతో హుషారుగా లేచాను. ఇలా ఎల్లప్పుడూ నా వెంటే ఉండి నన్ను కాపాడుతున్న నా సాయినాథునికి నేను ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేసినప్పటి నుంచి బాబా నాకు చాలా దగ్గరగా ఉన్నారని, నేను చేసే ప్రతి పనిని గమనిస్తున్నారని, ఆయనకి నా ప్రతి కదలిక తెలుసని నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సప్తాహ పారాయణ ప్రారంభించినప్పటి నుంచి నాకు సాయి మాటలు వినపడుతున్నాయి. ఒక అదృశ్య స్వరం నేను కోరుకున్న కోరికలు మరియు అడుగుతున్న ప్రశ్నలుకు సమాధానం చెబుతోంది. కార్తీకమాసం అంతా మాంసాహారం తినని నేను కార్తీకమాసం పూర్తవుతూనే నాన్ వెజ్ తిందామని ఒక బిర్యానీ పాయింట్ నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. దాన్ని తినేముందు, "సాయీ! నేను ఈరోజు బిర్యాని తింటున్నాను" అని బాబాకు చెప్పుకున్నాను. వెంటనే, "వద్దు" అని నాకు వినపడింది. కానీ నేను భ్రమపడ్డానేమో అనుకుని బిర్యాని తినేసాను. సరిగ్గా అర్ధరాత్రి గం.12:25 నిమిషాలకి నా శరీరమంతా భయంకరమైన దురద మొదలైంది. తట్టుకోలేక బీభత్సంగా ఎలా పడితే అలానే గోకేసుకున్నాను. దాంతో నా ఒళ్లంతా ఎర్ర బారిపోయి పెద్ద పెద్ద దద్దుర్లు వచ్చాయి. ఎందుకలా జరిగిందో నాకు అర్థం కాలేదు. వెంటనే లేచి ఊదీ పెట్టుకుని నా తల దగ్గర చిన్న ఆసనం వేసి, దాని మీద సాయి విగ్రహం పెట్టుకొని పడుకున్నాను. సరిగా పావుగంట తర్వాత నా కడుపులో విపరీతంగా తిప్పడం, అలాగే తలంతా తిప్పడం, చెవులు మూసుకుపోవడం వంటివి జరిగాయి. ఇదంతా జరగడానికి ముందు నాకు నిద్రలో మా ఇంట్లో నుంచి ఒక పాము బయటికి వెళ్లి వరండాలో చచ్చిపడి ఉన్నట్టు కల వచ్చింది. అంతకు రెండు రోజులు ముందు కూడా కలలో నాకు కరెంట్ షాక్ కొడితే, ఒకాయన నా చేయి పట్టుకొని లాగి, 'నీకు కరెంట్ షాక్ కొట్టి, చావబోతున్న నిన్ను బ్రతికించాను. అది నీకు అర్థం అయిందా?' అని అడిగారు. ఆ కలలకు అర్ధమేంటో తెలియక చాలా తేలికగా తీసుకున్నాను. కానీ ఇప్పుడిలా ఆహారం వికటించేసరికి నాకేదో ప్రమాదం జరగబోతుందని నాకు స్పష్టంగా అర్థమైంది. అప్పుడు నేను లేచి ఇంట్లో నుండి బయట వరండాలోకి వెళ్లాను. అక్కడి నుంచి మా ఇంటి సందులోకి వెళ్లి కుప్పకూలిపడిపోయాను. నా కళ్ళు మూసుకుపోయాయి, నా చెవులకు ఏమీ వినిపించడం లేదు. 'అమ్మా' అని మాత్రమే పిలిచి కళ్ళు మూసుకొని 'సాయి సాయి' అని లోపల అనుకుంటూ ఉండగా మా చెల్లి వచ్చింది. తను నా దగ్గర నిలబడి, '200సార్లు సాయి నామజపం చేస్తానని, ధునిలో టెంకాయ వేస్తానని' మొక్కుకొని, తర్వాత వెళ్లి ఊదీ తీసుకొచ్చి నా నుదుటను పూసింది. అప్పటికే నేను చనిపోయానన్న భావనలో ఉన్నాను. అలాంటి స్థితిలో ఉన్న నేను రెండు, మూడు నిమిషాల తర్వాత హఠాత్తుగా లేచి కూర్చున్నాను. అప్పటిదాకా నా కడుపులో ఉన్నటువంటి వికారం, కళ్ళు-చెవులు మూసుకుపోవటం, ప్రాణం పోయిందని అనుకోవటం, నేను ఇక నా కుటుంబానికి లేనని అనుకోవటం వంటివేమీ లేవు. వాటన్నింటి నుండి నేను పూర్తిగా బయటపడ్డాను. ఇలా ఒకే నెలలో సాయి నాకు రెండుసార్లు ప్రాణభిక్ష పెట్టారు. ఆయన ఎప్పుడూ నాకు చెడు జరగబోతుందన్న కలల ద్వారా నన్ను హెచ్చరిస్తారు. నేను వెంటనే ఆయన పాదాలు పట్టుకుని, "నాకు ఇలా రాత్రి చెడు కల వచ్చింది. దాన్ని నిజం కాకుండా చూడు స్వామీ" అని వేడుకుంటాను. ఆయన నాకు, నా కుటుంబానికి కీడు జరగకుండా రక్షిస్తారు. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా సాయి నన్ను హెచ్చరించడం, నేను ఆయన్ని ప్రార్థించడం, ఆయన ఎటువంటి కీడు జరగకుండా చూడటం నా జీవితంలో జరుగుతుంది. సాయి లేకపోతే నేను లేను, సాయి లేకపోతే నా కుటుంబం లేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo