1. పిలిస్తే పలికే దైవమని మరొకసారి నిరూపించిన సాయినాథుడు
2. సాయి కృప
పిలిస్తే పలికే దైవమని మరొకసారి నిరూపించిన సాయినాథుడు
సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు భార్గవి. మాది నెల్లూరు జిల్లా. నాకు చిన్నప్పటినుండి బాబా అంటే ఎంతో భక్తి, నమ్మకం. ప్రతి గురువారం బాబా గుడికి వెళ్లి, రావడం చిన్నవయసు నుండే నాకు అలవాటు. బాబా కృపతో నా జీవితంలోని చిన్న చిన్న అపార్ధాలు, సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం మా బాబుకి సంబంధించినది. 2023, నవంబర్ నెలలో మా కుటుంబంలో అందరికీ వైరల్ ఫీవర్ వచ్చాయి. మొదట మావారికి, తర్వాత నాకు, మా బాబుకి వచ్చాయి. నేను, మావారు త్వరగా కోలుకున్నాం. కానీ మా బాబుకి తగ్గలేదు. మొదటిరోజు ఇంట్లో ఉన్న మందులు వేసి చూసాను కానీ, తగ్గలేదు. దాంతో పక్క రోజు ఆసుపత్రికి తీసుకెళ్లాము. డాక్టరు వేరే మందులు రాసిచ్చారు. అవి కూడా వాడుతున్నా జ్వర తీవ్రత 103 - 104 డిగ్రీలకు తక్కువ ఉండేది కాదు. బాబు కళ్ళు తెరవడం, మూయడం, పాలు తాగిస్తే తాగడం తప్ప ఏమీ చేసేవాడు కాదు. నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, జ్వరం ఎక్కువగా ఉంటే ఫిట్స్ వస్తాయని అంటారు. అదివరకు ఒకసారి వచ్చాయి కూడా. అప్పుడు బాబా దయతోనే బాబు కోరుకున్నాడు. ఇప్పుడు మరోసారి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా నాకు భయమేసింది. ఆ రోజు రాత్రి బాబు తలపై తడిగుడ్డ వేసి బాబా నామస్మరణ చేస్తూ ఫోన్ తీసాను. రోజూ నిద్రపోయే ముందు బాబా భక్తుల అనుభవాలు చదవడం నాకు అలవాటు. ఆ అలవాటు ప్రకారం ఆరోజు కూడా ఫేస్బుక్లో బాబా భక్తుల అనుభవాలు చదువుతూ, "బాబా! త్వరగా బాబుకి నయమైతే, నేను కూడా నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని మనసులో బాబాని ప్రార్థించాను. మరుసటిరోజు ఉదయం నుండి బాబు పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చింది. మెల్లగా లేచి కూర్చున్నాడు, ఇడ్లీ పెడితే తిన్నాడు. మధ్యాహ్నం నుండి జ్వరం కూడా తగ్గుముఖం పట్టింది. నాకు చాలా సంతోషమేసింది. అంతా బాబా దయ. రెండు, మూడు రోజులుగా తగ్గని జ్వరం బాబాను వేడుకున్నాక తగ్గింది. బాబా దయతో ఇప్పుడు మా బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. శిరిడీ సాయినాథుడు పిలిస్తే పలికే దైవమని నా విషయంలో మరొకసారి నిరూపించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. అందరూ సంతోషంగా ఉండాలి".
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయి కృప
నా పేరు సుగుణ. నేను కూడా సాయి భక్తురాలిని. నేనెప్పుడూ బాబాని మీపై మరింత భక్తి కుదిరేలా చేయమని కోరుకుంటూ ఉంటాను. నేను కొన్ని కుటుంబ పరిస్థితుల కారణంగా మా ఇంటి నుండి దూరంగా హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. నా పిల్లలు అమ్మవాళ్ళ దగ్గర ఉంటున్నారు. 2022, డిసెంబర్లో మా అమ్మకి ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. ఆమె బ్రెయిన్లో చిన్నగా నీరు లాంటి లిక్విడ్ ఏర్పడింది. మేము అంతా చాలా భయపడ్డాం. అప్పుడు నేను బాబాతో, "అమ్మకి ఏం కాకుండా జాగ్రత్తగా చూడమ"ని చెప్పుకున్నాను. బాబా దయవల్ల కొన్ని మందులు వాడాక అమ్మ ఆరోగ్యం మెరుగుపడింది. అప్పుడు నేను ఆనందంతో, "మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. కానీ అమ్మ విషయం గుర్తున్నా కూడా ఆ అనుభవాన్ని ఎందుచేతనో పంచుకోకుండా అశ్రద్ద చేసి వేరే రెండు అనుభవాలు నావి పంచుకున్నాను. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అమ్మ మళ్ళీ అదే సమస్యతో ఇబ్బందిపడింది. అప్పుడు నేను, "బాబా! అమ్మకి ఏం కాకుండా చూడండి. తను బాగుండాలి" అని బాబాతో చెప్పుకున్నాను. మా అన్నయ్య అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించాడు. బాబా దయవల్ల డాక్టర్, "ఏం పర్వాలేదు. మీ అమ్మగారు నీరసంగా ఉన్నారు. కొన్ని మందులు రాస్తున్నాను, అవి వాడండి చాలు" అని చెప్పారు. "చాలా చాలా థాంక్స్ బాబా. అమ్మ ఆరోగ్యం మెరుగుపడేలా చేయండి బాబా. నాన్నని కూడా జాగ్రతగా చూసుకోండి బాబా".

