1. సాయి మన చుట్టూ ఉన్నారు - హృదయపూర్వక ప్రార్థనలను నెరవేరుస్తున్నారు2. ఎవరి మీదంటే వాళ్ళ మీద అతి నమ్మకం పెట్టుకోకూడదని తెలియజేసిన బాబా
సాయి మన చుట్టూ ఉన్నారు - హృదయపూర్వక ప్రార్థనలను నెరవేరుస్తున్నారు
నా పేరు మల్లికార్జునరావు. మాది వైజాగ్. సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంగా గల నేను సాయి మహిమను అనుభవించేవరకు నాస్తికుడిగా ఉండేవాడిని. ఇటీవల నాకు జరిగిన ఒక అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నా కొడుకు యు.ఎస్.ఏలో ఉద్యోగం చేస్తున్నాడు. తను సంవత్సరానికి ఒకసారి నాలుగు వారాల సెలవు మీద మా ఇంటికి వస్తాడు. అలా వచ్చినప్పుడు తను మమ్మల్ని ఇండియాలోని కొన్ని సుందర ప్రదేశాలకు లేదా తీర్థక్షేత్రాలకు తీసుకెళ్లాలని ఆశపడతుంటాడు. అందుకోసం అవసరమైన టిక్కెట్లు, హోటల్ బుకింగ్స్ వగైరా అన్నీ చక్కగా ప్లాన్ చేస్తుంటాడు. అలాగే ఈసారి ఇండియా వచ్చినప్పుడు ఐదు రోజులపాటు కేరళలోని కొన్ని ప్రదేశాలను చూడటానికి అన్ని ఏర్పాట్లు చేసాడు. తదనుగుణంగా మా కుటుంబమంతా కేరళ వెళ్లి ఒకరోజు ఆనందంగా గడిపాము. మరుసటిరోజు నా కొడుకుకి తీవ్రంగా జలుబు చేసి, విపరీతమైన జ్వరం వచ్చింది. మేము దాదాపు రెండు రోజులు మా గదుల్లోనే ఉండిపోయాము. దాంతో సుమారు ఆరు నెలల క్రితం నా కొడుకు ఈ పర్యటన ప్లానింగ్, టికెట్స్ మరియు హోటల్ బుకింగ్లు చేస్తే, ఇప్పుడు ఇలా అయిందని నేను చాలా బాధపడ్డాను. మాకు దేవుణ్ణి ప్రార్థించడం తప్ప వేరే మార్గం లేకపోయింది. నేను ఆ స్థితిలో సాయిని నిజాయితీగా, "రేపు ఉదయానికి నా కొడుకు బాగుండేలా దయ చూపండి బాబా. అలా అయితే కనీసం చివరి రెండు రోజులైన నా కొడుకు తాను అనుకున్న ప్రకారం మమ్మల్ని కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్లగలుగుతాడు" అని అర్థించాను. సాయి నా ప్రార్థనలు విన్నారనిపించింది, మరుసటిరోజు ఉదయానికి నా కొడుకు ఆరోగ్యం పూర్తిగా బాగైంది. అలా నా కొడుకుకి నయం కాకుంటే మేము తిరిగి వచ్చేద్దామని అనుకున్నాము. కానీ సాయి ఆశీస్సులతో నా కొడుకుకి నయమవడంతో కొన్ని ప్రదేశాలను చూసి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాము. ఈ అనుభవం ద్వారా సాయి మన చుట్టూ ఉన్నారని, మన హృదయపూర్వక ప్రార్థనలను వింటారని, వాటిని నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను. 105 సంవత్సరాల క్రితం జీవించిన సాయిబాబా ఇప్పటికీ తమ సమాధి నుండి భక్తుల మొరలను ఆలకించడం, అవసరమైనప్పుడు వాళ్ళకి అండగా నిలవడం అద్భుతం, అపూర్వం. "ధన్యవాదాలు సాయినాథ". (చివరిగా నాదొక సూచన: ప్రజలు తమ మతం లేదా దేవుడిపై ఉన్న నమ్మకం వల్ల ఏవైనా అద్భుతాలను అనుభవించినప్పుడల్లా వాటిని కొన్ని బ్లాగులలో పోస్ట్ చేసినట్లయితే అవి చాలామందికి తెలివిగా తమ మార్గాన్ని ఎంచుకునేందుకు దోహదం చేస్తాయి.)
ఎవరి మీదంటే వాళ్ళ మీద అతి నమ్మకం పెట్టుకోకూడదని తెలియజేసిన బాబా
శ్రీ సాయినాథునికి నా సాష్టాంగ నమస్కారాలు. తోటి సాయిబంధువులకు నమస్కారాలు. నా పేరు మహేష్. నేను చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. ఈమధ్య నాకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను నా ప్లాట్ ఒకటి అమ్మిపెట్టాడు. నేను అతన్ని మంచివాడని పూర్తిగా నమ్మాను. తర్వాత అతను ఒక ప్లాట్ విషయంగా నాతో మాట్లాడి, "ఒక వారం లోపల నేను దాన్ని అమ్మిస్తాను. నువ్వు అగ్రిమెంట్ చేసుకో" అని చెప్పాడు. నేను అతని మాయలో పడి అగ్రిమెంట్ చేసుకున్నాను. అలాగే ఇంకో రెండు ప్లాట్లలో మరొకతనితో వాటా పెట్టించి, వాటిని కూడా అగ్రిమెంట్ చేయించాడు. ఇక అప్పటినుండి ఆ ప్లాట్లు గురించి అడిగితే, 'ఇప్పుడు, అప్పుడు అమ్ముడవుతాయి. పార్టీ వస్తుంద'ని ఏవేవో మాటలు చెప్పి నన్ను మభ్యపెడుతుండేవాడు. అంతలో నాకు నాతోపాటు వాటా పెట్టిన అతను నాకు తెలియకుండానే ఒక ప్లాటు అమ్మేశాడని తెలిసింది. నేను అతన్ని గట్టిగా అడిగితే, "ఇంకా అమ్మలేదు. ప్రాసెస్ నడుస్తుంది" అని అబద్ధం చెప్పాడు. కానీ నాకు వేరే వాళ్ల ద్వారా ఆ ప్లాట్ ఎప్పుడో అమ్మేసాడని పక్కాగా నిజం తెలిసింది. నేను అతన్ని, "నాకు ఆ వ్యవహారంలో లాభం లేకున్నా పర్లేదుగాని, నేను పెట్టిన వాటా డబ్బులు నాకు ఇవ్వమ"ని అడిగితే, "ఇంకా డబ్బులు రాలేదు. రాగానే ఇస్తాన"ని అన్నాడు. కానీ బాబా దయతో నాకు అతను ఆ ప్లాట్ అమ్మిన డబ్బులతో ఇంకో ప్లాటు అగ్రిమెంట్ చేసుకున్నాడని తెలిసింది. అప్పుడుగాని నాకు, 'నాతో షేర్ పెట్టించిన అతను, షేరు పెట్టినతను ఒకటేనని, వాళ్ళు నా డబ్బులు వాడుకుంటున్నార'ని అర్థం కాలేదు. దాంతో నేను, "నా డబ్బులు నాకు కావాల"ని వాళ్ళను అడిగాను. అందుకు వాళ్ళు, "ఇంకా రెండు ప్లాట్లు ఉన్నాయి కదా! అవి అమ్మగానే ఇస్తామ"ని అన్నారు. అలా మూడు, నాలుగు నెలలు వాళ్ళు నన్ను ఇబ్బందిపెట్టారు, మానసికంగా చాలా బాధపెట్టారు. నేను బాబాను ఒకటే వేడుకున్నాను, "బాబా! మిమ్మల్ని అడగకుండా వాటా పెట్టినందుకు నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ ఇలా చేయను" అని. ఆలోగా ఆ ఫ్లాట్ల అగ్రిమెంట్ టైం అయిపోవడంతో ఆ ఫ్లాట్ల యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకోమని ఒత్తిడి తెచ్చారు. నేను అప్పటికే నన్ను మోసం చేస్తున్నవాళ్లతో, "ఆ ప్లాట్లకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. నా డబ్బులు నాకు ఇవ్వమ"ని చెప్తుండేవాడిని. కానీ వాళ్ళు నేను చెప్పింది పట్టించుకోకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్కు నన్ను డబ్బులు పెట్టమని ఇబ్బందిపెట్టారు. నేను వాళ్లతో. "నేను పెట్టను. మీరు ఆ ప్లాట్ల అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోండి. నా డబ్బులు నాకు ఇవ్వండి" అని ఖరాఖండిగా అడిగాను. అందుకు వాళ్ళు, "నీ వాటాలో కొంత డబ్బు ఉంచుకొని ఇస్తామ"ని చెప్పారు. లాభాలు వాళ్ళు తీసుకొని, నష్టం నన్ను భరించుకోమన్నారు. ఆ స్థితిలో నేను బాబాను శరణువేడి, "నేను పెట్టిన డబ్బులు నాకు వచ్చేలా చేయండి" అని వేడుకున్నాను. బాబా దయ చూపించారు. చిన్న నష్టంతో నా డబ్బులు నాకు వచ్చాయి. ఈ అనుభవం ద్వారా 'ఎవరి మీదంటే వాళ్ళ మీద అతి నమ్మకం పెట్టుకోకూడద'ని బాబా నా కళ్ళు తెరిపించారు. "నా డబ్బు నాకు ఇప్పించినందుకు ధన్యవాదాలు బాబా".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!

