సాయినే నమ్మి ఆయన మీదే భారమేస్తే ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! నేను ఒక సాయి భక్తురాలిని. నా చిన్నతనంలో ఒకసారి మా మేనత్తకి నోటి లోపల అంటే అంగిలిలో నిమ్మకాయ అంత గడ్డ లేచింది. దానివల్ల ఆమె ఏమి తినలేకపోయేది, త్రాగలేకపోయేది, చివరికి ఆవలించలేకపోయేది. విషయం తెలిసి మా నాన్న ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. డాక్టర్ చూసి సర్జరీ చేయాలన్నారు. ట్యాబ్లెట్, ఇంజక్షన్ అంటేనే భయపడే మా అత్త సర్జరీకి అసలు ఒప్పుకోలేదు. "నాకు బాబానే ఉన్నాడు. నేను సర్జరీ చేయించుకోను" అని మొండికేసింది. ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా వినలేదు. బాబా మీద భారమేసి ఆయనకి పూజలు చేస్తూ, "నా సమస్య తీరిపోతే శిరిడీ వస్తాను" అని మొక్కుకుంది. సాయి ఆమె మొర విన్నారు. కొన్ని నెలలపాటు పీడించిన ఆ గడ్డ మెల్లగా కరిగిపోయింది. అంతే, మా అత్త తన మొక్కు తీర్చుకోడానికి మా బాబాయిని తీసుకోని మొదటిసారి శిరిడీ క్షేత్ర దర్శనానికి వెళ్ళింది. అక్కడ ఇద్దరూ బాబా దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణానికి రైల్వేస్టేషన్కి వచ్చారు. వాళ్ళకి ట్రైన్ ఏ సమయానికి ఉంది, ఏ ప్లాట్ఫారం మీదకి వస్తుంది వంటివేమీ తెలియవు. హిందీ, ఇంగ్లీష్ భాషలు రావు. అటువంటి వాళ్ళు స్టేషన్లోకి అడుగుపెట్టగానే తెల్ల చొక్కా, లాల్చి వేసుకొని, తెల్లటి టోపీ పెట్టుకున్న 60 సంవత్సరాల వయసున్న ఒక పెద్దాయన వాళ్ళ దగ్గరకి వచ్చి ఎప్పటినుండో పరిచయమున్న వ్యక్తిలా ప్రేమగా పలకరించి, రైలు వచ్చేవరకు వాళ్ళతోనే ఉండి రైలు ఎక్కించాడు. ఆ పెద్దాయన రూపంలో సాయిబాబానే వచ్చి తనని ట్రైన్ ఎక్కించారని మా అత్త నమ్మకం. సాయినే నమ్మి ఆయన మీదే భారం వేస్తే ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు, మనల్ని కాపు కాస్తారు అనటానికి ఈ సంఘటన పెద్ద ఉదాహరణ. నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు మా అత్తయ్య జీవితంలో జరిగిన ఈ సంఘటనతో పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు సాయి నన్ను తమ వైపుకి లాక్కున్నారు. ఆనాటినుండే నా మనసులో సాయి మీద అపారమైన భక్తి, ప్రేమలు మొదలయ్యాయి. సాయికి మేము అంటే ఎంతో ప్రేమ. ఇలాంటి కరుణాకటాక్ష వీక్షణలు మాపై ఎన్నోసార్లు కురిపించారు. ఇకపై కూడా ఇలానే ఆయన కరుణరసం మాపై కురిపిస్తారన్న నమ్మకం నాకుంది. "సాయీ! మీరు మా ఇంటి పెద్ద. నా పెళ్లి నువ్వే చేయాలి. నా బాధ్యత నీదే తండ్రీ".
2023, ఆగష్టు నెల రెండోవారంలో నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసి, "నా భర్తకి డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్లెట్ కౌంట్ 30 వేలకు పడిపోయింది. ఆయన శరీరమమంతా రాషెస్ వచ్చాయి. ఏమీ తినలేకపోతున్నారు, త్రాగలేకపోతున్నారు. పరిస్థితి చాలా విషమంగా ఉంది" అని చెప్పింది. ఆమెకి ఇద్దరు చిన్నపిల్లలున్నారు. ఒక పాపకి 9 నెలల వయసు, ఇంకో పాప వయసు రెండు సంవత్సరాలు. అదీకాక ఆమె ఎడమ చేతికి యాక్సిడెంట్ జరిగి రాడ్స్ వేసి ఇంకా తొలగించలేదు. అందువల్ల ఎడమ చేయి ఉపయోగించే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో భర్త ఆరోగ్యం అలా అయిపోయేసరికి ఏం చేయాలో దిక్కుతోచక ఆమె చాలా బాధలో ఉంది. నేను తనతో, "శ్రీసాయి రక్షా స్తోత్రం కుదిరితే తొమ్మిదిసార్లు లేదా కనీసం ఐదుసార్లు చదువుకో" అని సాయి రక్షా స్తోత్రాన్ని వాట్సప్లో షేర్ చేశాను. ఆమె ఆగస్టు 15 రాత్రంతా నిద్రపోకుండా సాయి రక్షా స్తోత్రాన్ని చదివింది. తెల్లారిజామునకు ఏదో సమయానికి ఆమెకి నిద్రపట్టి కాసేపు పడుకొని హడావిడిగా లేచి హాస్పిటల్కి బయలుదేరింది. తన మనసులో, 'రిపోర్టులో ఏమొస్తుందో? ప్లేట్లెట్ కౌంట్ 30,000 కంటే తగ్గిపోతాయా? మాట్లాడలేని స్థితిలో ఉన్న నా భర్త పరిస్థితి ఇంకా దిగజారిందా?' అని రకరకాల ఆలోచనలతో, భయాలతో తాను హాస్పిటల్కి చేరుకుంది. అయితే రాత్రంతా నిద్రపోకుండా చదివిన సాయి రక్షా స్తోత్రం అద్భుతం చేసింది. 30,000 మాత్రమే ఉన్న ప్లేట్లెట్ కౌంట్ ఒక లక్షకి పెరిగింది. తద్వారా తన భర్తకి ఏమీ కాదని సాయి అభయం ఇచ్చారు. నా స్నేహితురాలి ఆనందానికి అవధులు లేవు. నమ్మినవాళ్లని సాయి ఎన్నడూ విడిచిపెట్టారు. అందుకే ఆయనని పిలిస్తే పలికే దైవం అంటారు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా”.
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!