సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1274వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్న బాబా
2. రిపోర్టు మంచిగా వచ్చేలా అనుగ్రహించిన బాబా

ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్న బాబా

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

బ్లాగ్ నిర్వాహకులకు, సాయిబంధువులకు నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. విదేశాలలో ఉంటున్న మా అమ్మాయి ఈమధ్య సెలవులకి ఇండియా వచ్చింది. తనకి అలర్జీ మరియు వాతావరణ కాలుష్యం వల్ల విపరీతమైన దగ్గు వంటి సమస్యలున్నాయి. అందువలన నేను, "బాబా! ఇక్కడున్నన్ని రోజులు అమ్మాయికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకూడద"ని బాబాని ప్రార్థించాను. శ్రీసాయిలీలామృతం పారాయణ కూడా చేశాను. బాబా దయవలన మా అమ్మాయి ఇండియాలో ఉన్నన్ని రోజులూ క్షేమంగా ఉంది.

ఇప్పుడు శిరిడీలో బాబా మాకు ప్రసాదించిన ఆయన దర్శనభాగ్యం గురించి చెప్తాను. బాబా ఉనికిని, అనుగ్రహాన్ని నేను ఎంతగానో చవిచూసి ఉన్నప్పటికీ కరోనా ప్రభావం వల్ల హైదరాబాద్ నుండి శిరిడీకి రైలులో ప్రయాణమంటే ఏదో ఒక మూల కొంచెం భయపడ్డాను. ఆ సమయంలో ఒకరోజు బ్లాగులో అనుభవాలు చదువుతుంటే, అక్కడొక భక్తురాలు తమ శిరిడీ దర్శనభాగ్యాన్ని పంచుకున్నారు. అందులో ఆమె శిరిడీకి వెళ్లేముందు ఇన్‌స్టాగ్రామ్‌లో 'శిరిడీకి వచ్చేందుకు సిద్ధంగా ఉండు' అని బాబా ఒక మెసేజ్ ద్వారా తనకి చెప్పారని పంచుకున్నారు. అది చదివాక బాబా నాకు కూడా అలాగే చెప్తున్నారనిపించి కొండంత ధైర్యం వచ్చింది. ఇక శిరిడీకి బయలుదేరేరోజు మేము 2 గంటలు ముందుగానే ఇంటినుండి బయలుదేరాము. మామూలుగా అయితే మా ఇంటినుండి స్టేషన్ చేరుకోవడానికి ఒక గంట సమయమే సరిపోతుంది. కానీ మేముండే ప్రాంతంలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో ఒకసారి గోకర్ణయాత్రకు బయలుదేరినప్పుడు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ట్రైన్ మిస్ అయ్యాను. అందుచేత ఈసారి రెండు గంటల ముందు బయలుదేరాము. కానీ ఆరోజు ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంది. సమయానికి స్టేషన్ చేరుకోలేమనిపించి బాబాను స్మరించసాగాను. అప్పటినుండి ముందు వెళుతున్న వాహనాల మీద బాబా అభయహస్తంతో పలుమార్లు దర్శనమిస్తూ మేము రైలు అందుకునేలా చేశారు. తిరుగు ప్రయాణంలో కూడా అలానే జరిగింది.

మేము శిరిడిలో దిగిన వెంటనే మధ్యాహ్న ఆరతి సమయానికి ద్వారకామాయికి చేరుకోవాలని అనుకున్నాము. కానీ బస్సు ఆలస్యమై మేము ఎంతలా ప్రయత్నించినా ఆరతి సమయానికి ఖండోబా మందిరం వద్దకి మాత్రమే చేరుకోగలిగాము. సరేనని, అక్కడ దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళాము. అక్కడున్న సిబ్బంది, "ఆరతి మొదలవుతోంది, రండి, రండి" అని పిలిచి మేము లోపలికి వెళ్ళిన వెంటనే తలుపులు వేసేశారు. తరువాత ఎవరినీ లోపలికి రానీయలేదు. అక్కడ మా స్వహస్తాలతో ఖండోబా రూపంలో ఉన్న తమకి ఆరతి ఇచ్చేలా అనుగ్రహించారు బాబా. మర్నాడు గురువారం ఉదయం 6 గంటలకి మేము దర్శనానికి వెళ్ళినప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సెక్యూరిటీ సిబ్బంది అందరినీ తొందరచేస్తూ బయటకు పంపిస్తున్నారు. కానీ మమ్మల్ని ఏమీ అనలేదు. పరమపవిత్రమైన గురువారంనాడు మేము బాబాకు ఎదురుగా నిలబడి వారి దివ్యమంగళస్వరూపాన్ని కన్నులారా తృప్తిగా దర్శించుకున్నాము. తరువాత నందదీపం దగ్గర ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు మా చెల్లెలికి బాబా అనుగ్రహప్రసాదమైన ఊదీ ప్యాకెట్ దొరికింది. చావడిలో బాబాకు భక్తులు ఎర్రని వస్త్రాలు సమర్పిస్తారు కదా! ఆ వస్త్రమొకటి బాబా నాకు ప్రసాదంగా అనుగ్రహించారు. తరువాత నాసిక్ సమీపంలో ఉన్న శ్రీత్రయంబకేశ్వరుని దర్శించుకుని క్షేమంగా ఇల్లు చేరాము. వేసవికాలమే అయినప్పటికీ శిరిడీలో ఉన్న 3 రోజులూ మాకు ఎండ తీవ్రత అస్సలు తెలీలేదు.

ఇక మా అమ్మాయి విదేశాలకు తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు మేము ఎయిర్‌పోర్టుకి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకుంటే, ఆ క్యాబ్‌లో ఫోటో రూపంలో బాబా దర్శనమిచ్చారు. 'బాబా మా అమ్మాయి వెన్నంటి ఉన్నార'ని నాకు సంతోషంగా అనిపించింది. అమ్మాయి అక్కడికి చేరుకున్న తరువాత రెండురోజులకి తనకి దగ్గు, జలుబు, విపరీతమైన ఒళ్ళునొప్పులు వచ్చాయి. కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. అది తెలిసి నాకు ఆందోళనగా అనిపించినప్పటికీ, 'బాబా అమ్మాయి వెన్నంటి ఉన్నారు కదా!' అని ధైర్యం తెచ్చుకుని, భారం ఆయన మీద వేసి, "అమ్మాయి త్వరగా కోలుకుంటే సచ్చరిత్ర సప్తాహపారాయణ చేసి, అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయచూపారు. రెండవరోజుకే అమ్మాయికి దగ్గు తగ్గింది. మిగిలిన లక్షణాలు కూడా క్రమంగా తగ్గుతూ 5వ రోజుకి కరోనా నెగిటివ్ వచ్చింది. అక్కడ మా అమ్మాయితో సన్నిహితంగా ఉన్న మావారికి తీవ్రంగా జలుబు చేసినా 3 రోజులలో తగ్గిపోయింది. అలాగే మా అమ్మాయి స్నేహితురాలికి ఏ ఇబ్బందీ లేకుండా బాబా అనుగ్రహించారు.

ఒకరోజు మా అమ్మాయికి మెసేజ్ చేస్తే, తన దగ్గర నుంచి రిప్లై రాలేదు. నేను తను ఏదో బిజీలో ఉందేమో అనుకున్నాను. అయితే ఎంతసేపైనా రిప్లై రాకపోయేసరికి వాట్సాప్ చాట్ చూస్తే, ముందురోజు సాయంత్రం నుంచి (దాదాపు 24 గంటలు) తను తన ఫోన్ చూడలేదని అర్థమైంది. తన క్షేమసమాచారం గురించి వేరే ఎవరినైనా కాంటాక్ట్ చేద్దామంటే అక్కడ తెలిసిన వాళ్ళెవరూ లేరు. నాకు కొంచెం కంగారుగా అనిపించి వెంటనే బాబాను తలచుకుని, "బాబా! వెంటనే మా అమ్మాయి దగ్గర నుంచి నాకు మెసేజ్ వస్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. ఒక అరగంటలోపే మా అమ్మాయి కాల్ చేసి నాతో మాట్లాడింది. ఆ సమయంలో అక్కడ రాత్రి. ఒకవేళ తను ఫోన్ చూడకుండా అలానే నిద్రపోయుంటే మరో 8 గంటలసేపు నేను ఇక్కడ ఆందోళనపడాల్సి వచ్చేది. కానీ బాబా దయతో నా ఆందోళనను ఆలస్యం లేకుండా తొలగించారు. ఇది చాలా చిన్న విషయమే. కానీ మన ఆత్మీయులు ముఖ్యంగా దూరంగా ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, వాళ్ళ గురించి తెలియకపోయినా ఎంతో ఆందోళనగా ఉంటుంది. "ధన్యవాదాలు బాబా. తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించి అందరినీ చల్లగా చూడు తండ్రీ".

రిపోర్టు మంచిగా వచ్చేలా అనుగ్రహించిన బాబా

ఓం శ్రీసాయినాథాయ నమః!!! సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై! నమ్మినవారి కోర్కెలను తీర్చే సాయినాథునికి నా ప్రణామాలు. సాయిభక్తులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు శ్రీవాణి. నాకు ఏ బాధ వచ్చినా నేను సాయినాథునితోనే చెప్పుకుంటాను. ఆయన చాలా విషయాలలో నన్ను అనుగ్రహించారు. నేను ఒక సంవత్సరం నుండి గ్యాస్ట్రిక్ సమస్యతో చాలా ఇబ్బందిపడుతున్నాను. డాక్టరు దగ్గరికి వెళితే, ఆయన 15 రోజులకు మందులు ఇచ్చేవారు. ఆ మందులతో కొద్దిరోజులు సమస్య తగ్గి మళ్ళీ వచ్చేది. దాంతో మళ్ళీ టాబ్లెట్లు వాడేదాన్ని. అలా కంటిన్యూగా మందులు వాడుతూనే ఉన్నాను. చివరికి మావారు, "సంవత్సరం నుండి ఈ టాబ్లెట్లు వాడుతున్నా సమస్య తగ్గడం లేదు కదా. ఒకసారి హోమియోపతి మందులు వాడదాం. అవి నిదానంగా పనిచేసినా సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉంది" అని అన్నారు. ఆయన సలహామేరకు నేను హోమియోపతి డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. ఆయన, "కడుపును స్కానింగ్ తీయించండి. కిడ్నీలో రాళ్లు ఉన్నా గ్యాస్ సమస్య ఉండే అవకాశం ఉంది" అని అన్నారు. నాకు చాలా భయంగా అనిపించి, "బాబా! నా కడుపులో ఎలాంటి సమస్యా ఉండకూడదు. అంతా మంచిగా ఉండాలి. రిపోర్టులో అంతా మంచిగా ఉందని వస్తే, బ్లాగు ద్వారా నా అనుభవాన్ని తోటి భక్తులందరితో పంచుకుంటాను" అని సాయిని వేడుకున్నాను. స్కానింగ్ రిపోర్టులో, 'కిడ్నీలో రాళ్లు లేవు. కడుపులో అంతా మంచిగానే ఉంది' అని వచ్చింది. ఆ రిపోర్టు తీసుకుని మళ్ళీ హోమియోపతి డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. ఆయన, "ఏ ప్రాబ్లమ్ లేదుకాని, కరోనా వచ్చి తగ్గింది కదా! ఆ మందుల ప్రభావం వల్ల కరోనా తగ్గిన తరువాత కొందరకి గ్యాస్ సమస్య ఉంటుంది. కానీ ఇబ్బందేమీ లేదు. ఈ హోమియోపతి మందులు వాడండి. సమస్య పూర్తిగా నయమవుతుంది" అని చెప్పి మందులిచ్చారు. వాటివల్ల గ్యాస్ సమస్య పూర్తిగా తగ్గుతుందని బాబా మీద నమ్మకముంచి వేసుకుంటున్నాను. "ఈ మందులతో పూర్తిగా తగ్గి ఇక మందులు అవసరం లేకుండా చేయండి బాబా. మీ దయవల్ల పూర్తిగా తగ్గిపోతే మళ్ళీ బ్లాగులో పంచుకుంటాను సాయి. మమ్ము కరుణించి కాపాడు సాయి. మా కుటుంబానికి మీరే రక్ష. మమ్మల్ని ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించండి సాయి".

ఓం శ్రీసాయినాథాయ నమః!!!

7 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. సాయిరాం బాబా.. మీ కరుణా కటాక్షం తో మమ్ములను ఆరోగ్య వంతులుగా చేయండి మీకు మా జీవితాంతం రుణపడి ఉంటాము.. సాయిదేవా మా భారం అంతా మీపైనే వేసాము.. సాయిశ్వరా నీవే కలవు. నీవె తప్పా మాకెవరీ భువిలో.. మీ దివ్యమైన పాదాల మీద అమితమైన భక్తి శ్రద్దలు దిన దినాభివృద్ధి చెందేలా.. మా ఆరోగ్యం బాగుండేలా దీవెనలు అందించండి బాబా..

    ReplyDelete
  3. మా ఆరోగ్యం ఆర్ధిక ఇబ్బందులు మా భారం అంతా మీ పాద చరణాల పైనే వేసాము సాయిశ్వరా.. నీవె దిక్కు నీవే రక్షా నీవె తప్పా మాకెవరూ ఈ భువిలో...

    ReplyDelete
  4. Baba eroju na birthday ashruvadichandi swamy.. please na manasulo korikelu thirachnadi swamy ...

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Ome sri sai ram🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo