సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1269వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్మినవారి ప్రార్థనలను మన్నించే బాబా
2. తోటి భక్తుల అనుభవాల ద్వారా పొందిన బాబా అనుగ్రహం
3. కోరుకున్నట్లే ఏ ప్రమాదమూ లేదని చెప్పించిన బాబా

నమ్మినవారి ప్రార్థనలను మన్నించే బాబా


ముందుగా బాబాకి నా ప్రణామాలు. తోటి సాయిభక్తులకు నమస్కారం. నా పేరు శ్రీనివాసబాబు. మాది హైదరాబాద్. మా అమ్మకి బిపి, షుగర్ ఉన్నాయి. 2022, జూన్ 25 ఉదయం అమ్మ టాబ్లెట్లు వేసుకున్న తక్షణమే  అనారోగ్యం పాలైంది. ఆమె నాకు ఫోన్ చేసి, "కళ్ళు తిరుగుతున్నాయ"ని చెప్పి బాధపడింది. నేను వెంటనే బాబాకి దణ్ణం పెట్టుకుని, "అమ్మ ఆరోగ్యం వెంటనే కుదుటపడేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. 30 నిమిషాల తరువాత అమ్మ ఫోన్ చేసి, "ఆరోగ్యం మంచిగా ఉంది" అని చెప్పింది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మమ్మల్ని చల్లగా చూడు స్వామీ".

 

మా బావగారు తిరుపతి, శిరిడీ వెళ్లొచ్చి 2022, జులై 18 ఉదయం యు.కే.కి ప్రయాణమయ్యారు. అతను యు.కే. వెళ్ళటం అదే మొదటిసారి. ఇంగ్లీష్ భాష రాని అతను హైదరాబాదులో ఎక్కిన ఫ్లైట్ దుబాయిలో దిగి కొంత సమయం తరువాత మరో ఫ్లైట్ ఎక్కాలి. అక్కడ టెర్మినల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందువలన, "అతనికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూడమ"ని నేను సాయిబాబాకి దణ్ణం పెట్టుకుని, "బావ క్షేమంగా యు.కే. చేరుకోవాలి" అని బాబాకి మొరపెట్టుకున్నాను. బాబా దయవల్ల 2022, జులై 19 ఉదయం మా బావ క్షేమంగా యు.కే. చేరుకున్నారు. "సాయినాథా! మీకు వందనాలు. నా మనసులో కోరికలు మీకు తెలుసు కదా సాయీ. మా బాబు ఫస్ట్ సెమిస్టర్‌లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. ఆ సబ్జెక్టుతోపాటు సెకండ్ సెమిస్టర్ పరీక్షలు అన్నీ ఒకేసారి పాస్ అవ్వాలి స్వామీ. వాడి మనసు మార్చి చదువు మీద శ్రద్ధ ఉండేటట్లు చూడు స్వామీ. వాడి గురించి మేము ఎంతో బాధపడుతున్నాం. నా మనసులోని బాధని అర్థం చేసుకుని దయచూపు తండ్రీ. నా కోరిక తీరిన వెంటనే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. నమ్మినవారిని మీరు ఎప్పుడూ మరచిపోరు బాబా. నా తప్పులు ఏవైనా ఉంటే మన్నించు తండ్రీ"


2022, జులై 23, శనివారం మేము గాణుగాపూర్ మరియు అక్కల్‌కోట వెళ్ళాము. అక్కడికి వెళ్లేముందు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! ప్రయాణంలో నాకు ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా చూడండి. నాకు అక్కడి భాష రాదు. మీ దయతో యాత్ర మంచిగా జరగాలి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల గాణుగాపుర్‌లో శ్రీనృసింహసరస్వతిస్వామి మరియు అక్కల్‌కోటలో స్వామిసమర్థుని దర్శనం చాలా మంచిగా జరిగాయి. అక్కల్‌కోట నుంచి వచ్చేటప్పుడు ట్రైన్ ఆలస్యమైంది. దాంతో నేను, 'డ్యూటీ ఉంది, కంపెనీ బస్సు అందుకోగలనో, లేదో' అని కంగారుపడి, "బాబా! కంపెనీలో ఆడిట్ ఉన్నందువల్ల నేను డ్యూటీకి ఖచ్చితంగా వెళ్ళాలి. కాబట్టి కంపెనీ బస్ వచ్చే సమయానికి నేను చేరుకోగలిగేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. ఆయన దయవల్ల నేను కంపెనీ బస్సు అందుకున్నాను. "సాయి మహరాజ్‌కు వందనాలు. నేను గాణుగాపూర్‌లో ఒక తప్పు చేశాను. నా తప్పుని మన్నించండి బాబా".


తోటి భక్తుల అనుభవాల ద్వారా పొందిన బాబా అనుగ్రహం


నా పేరు సావిత్రి. మేము హైదరాబాదులో ఉంటాము. సాయిభక్తులకు నా నమస్కారాలు. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. అందులోనుండి ఒక అనుభవాన్ని మీ ముందుంచుతున్నాను. 2022, ఫిబ్రవరిలో నేను నా భర్తను కోల్పోయాను. ఎంతటి అనారోగ్యంతో ఉన్న భర్త అయినా కూడా ఆయన పోయాక ఆయన తలంపులతో చెప్పలేనంత దుఃఖం, ఒంటరితనాలతో కుమిలిపోతున్న నాకు ప్రసాద్ సాయి ఫోన్ చేసి ఈ బ్లాగుకి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో జాయిన్ చేశారు. అప్పటినుండి 'నీకు నేనున్నాను' అని బాబా హామీ ఇస్తున్నట్లు నాకు చెప్పలేనంత ధైర్యం వచ్చింది. నాకెవరూ లేరన్న భావన నాకిప్పుడు లేదు. ఈ అనుభూతికి కారణమైన అందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ బ్లాగులో నన్ను జాయిన్ చేసిన ప్రసాద్, శైలజలకు నేను ఋణపడి ఉంటాను.


నేను విపరీతమైన కాళ్లపిక్కల నొప్పులతో  రెండు, మూడు నెలలు బాధపడ్డాను. డాక్టరుని సంప్రదిస్తే, ఎక్స్-రే తీసి మందులిచ్చారు. కానీ ఫలితం కనిపించలేదు. ఆ నొప్పులతో తట్టుకోలేనంత బాధను అనుభవిస్తూ చివరకు ఒకరోజు బాబాకి చెప్పుకుని రోజూ ఊదీని నీళ్లలో వేసుకుని త్రాగడం మొదలుపెట్టాను. బాబా దయవల్ల కొద్దిగా మార్పు కనిపించింది. ఇటువంటి స్థితిలో 2022, జూన్ 28న నేను 'సాయి మహరాజ్ సన్నిధి' వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయ్యాను. తోటి భక్తులందరి అనుభవాలు చదువుతున్నప్పుడు 'నా నొప్పులు కూడా తగ్గుతాయ'ని నేను అనుకునేదాన్ని. అదే నిజమైంది. ఇప్పుడు నా పిక్కల నొప్పులు పూర్తిగా తగ్గి, నేను నా కాళ్లు ముడుచుకోగలుగుతున్నాను. నాకు చాలా ఉపశమనంగా ఉంది. "ధన్యవాదాలు బాబా".


కోరుకున్నట్లే ఏ ప్రమాదమూ లేదని చెప్పించిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా తోటి సాయిభక్తులకు, గురుబంధువులకు నమస్కారాలు. నేను సాయిభక్తుడిని. నేను ఈమధ్యనే ఈ  'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును చూశాను. గతంలో నాకు బాబా అనేక అనుభవాలు ప్రసాదించినప్పటికీ ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2022, జులై నెల మొదటివారంలో ఒక స్నేహితుని ఆహ్వానం మేరకు నేను అనంతపురం జిల్లాలోని కసాపురంలో వెలసిన శ్రీఆంజనేయస్వామి దర్శనార్థం వెళ్ళాను. బాబా దయవలన వెళ్ళేటప్పుడు నాకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు, అలాగే స్వామి దర్శనం బాగా జరిగింది. దర్శనానంతరం నేను గుంతకల్లులో ఉన్న నా స్నేహితుని ఇంట్లో బసచేశాను. అక్కడొకరోజు రాత్రి నాకొక దుస్స్వప్నం వచ్చింది. ఆ కలలో ఏదో దుష్టశక్తి నాపైబడి నన్ను చంపడానికి ప్రయత్నిస్తుండగా నాకు మెలకువ వచ్చింది. మరుసటిరోజు నాకు తీవ్రమైన ఛాతీనొప్పి వచ్చింది. నా స్నేహితునితో చెప్తే తను నన్ను ఒక కార్డియాలజిస్ట్ దగ్గరకి తీసుకుని వెళ్ళాడు. డాక్టరు దగ్గరకి వెళ్లేముందు నేను, "బాబా! నాకు ఏ ప్రమాదమూ లేదని డాక్టర్ చెప్పేలా అనుగ్రహించండి" అని బాబాకి విన్నవించుకున్నాను. డాక్టరు అన్ని పరీక్షలు చేసిన మీదట "మీ గుండెకు ఏ ప్రమాదమూ లేదు" అని చెప్పారు. బాబాకు ధన్యవాదాలు తెలుపుకుని ఇంటికి వచ్చాను. "సాయితండ్రీ! మీకు అనేక ధన్యవాదాలు. ఇలాగే ప్రతిఒక్కరినీ కాపాడు తండ్రీ".


శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo