ఈ భాగంలో అనుభవాలు:
1. అడిగిన వెంటనే కోరికలు నెరవేరుస్తున్న బాబా
2. బాబా రక్షణలో
3. నొప్పి తగ్గేలా అనుగ్రహిస్తున్న బాబా
అడిగిన వెంటనే కోరికలు నెరవేరుస్తున్న బాబా
సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. నేను ఒకసారి అన్నం తింటుంటే నోటిలో దంతాల మధ్య నోటిలోని చర్మం చిక్కి నొప్పి వచ్చింది. మరుసటిరోజుకి నొప్పి ఎక్కువైంది. నేను ఆ నొప్పి వలన సరిగా అన్నం తినలేకపోయేదాన్ని. 5, 6 రోజులైన నొప్పి తగ్గలేదు. పైగా రోజురోజుకి నొప్పి పెరుగుతుండటంతో మందులు వేసుకుని బాబాకి దణ్ణం పెట్టుకుని, "నొప్పి తగ్గేలా దయ చూపండి బాబా" అని వేడుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి కొంత నొప్పి తగ్గి, ఆ మరుసటిరోజుకి చాలావరకు తగ్గిపోయింది.
ఈమధ్య చాలారోజుల నుండి మా అక్కకి ఛాతి పక్కన ఒక గడ్డ ఉంది. మందులు వాడినా తగ్గలేదు. పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పారు. బాబా దయవల్ల ఆపరేషన్ మంచిగా జరిగింది. తరువాత అది ఏమి గడ్డో తెలుసుకోవడానికి ఆ గడ్డను టెస్టులకోసం ల్యాబ్కి పంపి, రిపోర్టు 10 రోజులలో వస్తుంది అన్నారు. మేము చాలా భయపడ్డాము. "రిపోర్ట్ నార్మల్ రావాలని, నార్మల్ రావాల"ని బాబాకి మొరపెట్టుకున్నాను. ఆ మరుసటిరోజు 2022, ఏప్రిల్ 24, ఉదయం మన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో "అల్లామాలిక్ మన తండ్రి. ఏ జ్వరమైనా, ఎటువంటి గడ్డ అయినా దానంతట అదే తగ్గిపోయి తప్పక హాయి కలుగుతుంది" అన్న సాయి వచనం వచ్చింది. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. సరిగా 10 రోజులుకి రిపోర్ట్ వచ్చింది. మా బావగారికి ఫోన్ చేస్తే, "రిపోర్ట్ నార్మల్ వచ్చింద"ని చెప్పారు. నాకు చాలా ఆనందమేసింది.
ఒకరోజు ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయంగా స్లాట్ బుక్ చేసుకోవటానికి పట్టా పాస్బుక్ అవసరమై వెతికితే కనబడలేదు. అప్పుడు నేను, 'శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని స్మరిస్తూ, "పాస్ బుక్ దొరికేలా చూడండి బాబా" అని అనుకున్నాను. బాబా దయవల్ల వెంటనే దొరికింది. "ధన్యవాదాలు బాబా. అడిగిన వెంటనే మీరు మా కోరికలు నెరవేరుస్తున్నారు బాబా. మమ్మల్ని ఎల్లప్పుడు రక్షించే బాధ్యత మీదే సాయినాథా. అన్నవదినలకి తరుచు గొడవలు వస్తున్నాయి బాబా. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎలాంటి గొడవలు లేకుండా అన్నవదిన, ఇంకా మా కుటుంబమంతా అన్యోన్యంగా, ప్రేమగా, కలిసిమెలిసి ఆనందంగా ఉండేలా చూడండి బాబా. భూ వివాదాలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సులభంగా సమస్యను పరిష్కారించండి బాబా. ప్లీజ్ బాబా. నేను పూర్తిగా మీ మీదనే ఆధారపడ్డాను. నాకు సర్వమూ మీరే సాయినాథా".
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
సర్వేజనా సుఖినోభవంతు!!!
బాబా రక్షణలో
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం చిన్నదే అయినా బాబా మీద పూర్తి నమ్మకముంచి మనం ఏ పని చేసినా అది పూర్తిగా సఫలీకృతమవుతుందని తెలియజేసే అనుభవం. కరోనా మొదటిసారి వచ్చినపుడు బాబా పారాయణ గ్రూపులోని ప్రతిఒక్కరూ 108సార్లు సాయి నామజపం చేసి, గోధుమపిండిని వాకిలి ముందు చల్లమని మెసేజ్ పెట్టారు. నేను బాబా మీద పూర్తి నమ్మకంతో వారం రోజులు సాయి నామజపం చేసి గోధుమపిండిని మా గుమ్మం ముందు చల్లాను. అలాగే రెండవసారి, మూడవసారి కరోనా విజృంభించినప్పుడు కూడా నేను గోధుమపిండిని గుమ్మం ముందు చల్లాను. మొదటి వేవ్లో మా అపార్ట్మెంట్లో ఎవ్వరికీ కరోనా రాలేదు కానీ, రెండో వెవ్లో మా ప్రక్క ఇంట్లో వాళ్లకి, పైన ఉన్న వాళ్లందరికీ కూడా కరోనా వచ్చింది. అసలే మావారు మెడికల్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నందువల్ల నాకు చాలా భయమేసింది. కానీ బాబా మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిజం చేశారు. మూడు వేవ్ల్లోనూ కరోనా మా ఇంటి దరిచేరకుండా చేసి బాబా మమ్మల్ని కాపాడారు. గోధుమపిండి చల్లి బాబా నామజపం చేయడం వల్లనే కరోనా నుండి మేము రక్షించబడ్డామని నా నమ్మకం. "ధన్యవాదాలు బాబా".
నేను రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఒకరోజు తరువాత నాకు బాగా జ్వరం వచ్చింది. వాసన కూడా తెలియలేదు. అప్పుడు నేను, "బాబా! మీరే నన్ను రక్షించాలి" అని అనుకుని సాయి సచ్చరిత్ర పుస్తకం దగ్గర పెట్టుకుని, బాబా ఊదీ నీళ్ళలో కలుపుకుని త్రాగి విడిగా ఒక గదిలో పడుకున్నాను. తెల్లవారుఝామున 3గంటలకి కూడా 103 డిగ్రీల జ్వరం, ఒళ్ళునొప్పులు అలాగే ఉన్నాయి. నేను 'సాయిరామ్ సాయిరామ్' అని బాబా నామజపం చేసుకుంటూ పడుకున్నాను. తెల్లవారేసరికి జ్వరం, ఒళ్ళునొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. అది బాబా దయేనని నా నమ్మకం. "ఇలాగే మా కుటుంబాన్నీ సదా మీ రక్షణలో ఉంచుకుని కాపాడు సాయి". చివరిగా చిన్న చిన్న అనుభవాలను కూడా ప్రచురిస్తూ బాబాపట్ల శ్రద్ధ, సబూరీలను పెంచుతున్న ఈ బ్లాగు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!
నొప్పి తగ్గేలా అనుగ్రహిస్తున్న బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయి పాదారవిందాలకు శతకోటి వందనాలు. నా పేరు శ్రీదేవి. ఒకరోజు గాలివాన ప్రారంభమై గాలికి తలుపులు కొట్టుకోసాగాయి. అమ్మ తలుపులు వేయడానికని వెళ్లి కింద పడిపోయి మోకాళ్ళ దగ్గర బాగా నొప్పి వచ్చింది. ఆ కారణంగా అమ్మ బాత్రూమ్కి వెళ్ళాలన్నా చాలా కష్టపడేది. ఆమె వయస్సు 75 సంవత్సరాలు. నేను అమ్మతో, "బాబా ఊదీ రాసుకో, నొప్పి తగ్గుతుంది" అని చెప్పాను. అమ్మ అలాగే చేసింది. బాబా దయవల్ల ఊదీ రాసిన తర్వాత అమ్మ కొంచెం కొంచంగా నడవగలిగింది. నేను, "బాబా! అమ్మకి ఎటువంటి ఫ్రాక్చర్ లేకుండా చూడండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత అమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళితే, డాక్టర్ ఎక్స్ రే తీసి ఎటువంటి ఫ్రాక్చర్ లేదని, కొన్ని మందులిచ్చి పంపించారు. వాటితో ఇంకాస్త నొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా. అమ్మకి పూర్తిగా నయమయ్యేలా అనుగ్రహించండి తండ్రి".
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!