- నమ్మకంతో ప్రార్థిస్తే ఎలాంటి ఇబ్బందినైనా తొలగిస్తారు బాబా
- సాయి ప్రసాదించిన పండుగ ఆనందం - ఆరోగ్యం
నమ్మకంతో ప్రార్థిస్తే ఎలాంటి ఇబ్బందినైనా తొలగిస్తారు బాబా
సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు అరుణ. 2021, జనవరి 18న ఆరేళ్ళ వయసున్న మా పాపతో కలిసి నేను, మావారు బయటికి వెళ్ళాము. అక్కడ ఉన్నంతసేపు పాప ఆడుకుంటూ బాగానే ఎంజాయ్ చేసింది. తిరుగు ప్రయాణంలో ఉన్నట్టుండి “నా పన్ను బాగా నొప్పిపెడుతోంది” అంటూ విపరీతంగా ఏడ్చింది. పాప ఎంతలా ఏడ్చిందంటే తను పుట్టిన తరువాత అంతలా ఏడవటం అదే మొదటిసారి. దాంతో నాకు, మావారికి చాలా భయమేసింది. వచ్చే దారిలో ఏదైనా క్లినిక్ ఉంటుందేమోనని చాలా వెతికాము, కానీ మాకు ఏ క్లినిక్ కనిపించలేదు. నేను మనసులోనే పాపకు నొప్పి తగ్గించమని బాబాను ప్రార్థిస్తూ నామస్మరణ చేసుకుంటూ ఉండగా ఒక మెడికల్ షాపు కనిపిస్తే, ఒక పెయిన్ కిల్లర్ సిరప్ తీసుకున్నాము. ఆ సిరప్ పాపకు వేసిన 5 నిమిషాలలోనే పాప ఏడవటం తగ్గించింది. ఇంటికి వెళ్ళేలోపు తను చాలా నార్మల్ అయిపోయింది. ఏ మెడిసిన్ అయినా పనిచేయడానికి కనీసం 20 నుండి 30 నిమిషాల సమయం పడుతుంది. అలాంటిది పాపకు 5 నిమిషాలలోనే పంటినొప్పి తగ్గిపోయింది. అంతా బాబా దయ. ఇంటికి వచ్చిన తరువాత పాపకు బాబా ఊదీ పెట్టాను. రాత్రంతా పాప హాయిగా నిద్రపోయింది. మళ్ళీ ఈరోజు వరకు పాపకు పంటినొప్పి రాలేదు. నమ్మకంతో బాబాను ప్రార్థించండి, ఎలాంటి ఇబ్బంది ఉన్నా బాబానే తొలగిస్తారు. “బాబా! మీ ఆశీస్సులు సదా మాపై ఉండాలి”.
పోస్ట్ కోవిడ్ ప్రభావం వల్ల మా మావయ్యగారికి ‘లంగ్స్ ఫైబ్రోసిస్’(Lungs Fibrosis) అనే సమస్య ప్రారంభమైంది. అది చాలా తీవ్రమైన సమస్య. దానికి సరైన చికిత్స లేదు. మొదట మావయ్యకి సీటీ స్కాన్ చేయించినప్పుడు ఆ రిపోర్టును పరిశీలించిన డాక్టర్, “సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంది” అని చెప్పి మెడిసిన్ ఇచ్చి 3 నెలల పాటు వాడమని చెప్పారు. అంతేకాదు, ఈ మూడు నెలలలో సమస్య తగ్గకపోతే జీవితాంతం మెడిసిన్ వాడాల్సి ఉంటుందని కూడా చెప్పారు. అయితే మా మావయ్య మెడిసిన్స్ ఎక్కువగా వాడలేరు. అందువల్ల నేను, మావారు చాలా భయపడ్డాము. నేను బాబాను ప్రార్థించి ప్రతిరోజూ మెడిసిన్తో పాటు మావయ్య త్రాగే నీళ్ళలో బాబా ఊదీ వేసి ఇస్తుండేదాన్ని. 3 నెలల తరువాత మళ్ళీ మావయ్యకి సీటీ స్కాన్ చేయిస్తే, “ఇంకా కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, మరో నెలరోజుల పాటు మెడిసిన్ వాడండి, సరిపోతుంది” అని డాక్టర్ చెప్పారు. ఎంతో తీవ్రమైన ఆరోగ్య సమస్య కూడా బాబా దయవల్ల తగ్గింది. ఇదంతా కేవలం బాబా దయవల్ల మాత్రమే జరిగింది. ఆయన దయవల్ల మావయ్య ఈమధ్య చాలా చురుకుగా ఉంటున్నారు. “మావయ్యపై మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలానే ఉండాలి బాబా. త్వరలో మా కుటుంబమంతా కలిసి శిరిడీ రావాలని కోరుకుంటున్నాము. త్వరగా మమ్మల్ని శిరిడీ రప్పించుకుని నీ దర్శనభాగ్యాన్ని కల్పించు సాయి తండ్రీ!”
సాయి ప్రసాదించిన పండుగ ఆనందం - ఆరోగ్యం
నా పేరు పద్మావతి. 2021, జనవరి 12, 13, 14 తేదీలలో మా కుటుంబమంతా కలిసి సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకున్నాము. ఆ సందర్భంగా మేము సాయిపూజను ఘనంగా చేసుకున్నాము. ముందుగా గణేశపూజ చేసిన తరువాత బాబాకు అభిషేకం చేసి, అష్టోత్తర పూజ నిర్వహించాము. తరువాత పూజలో భాగంగా సాయిలీలలను చెప్పుకున్నాము. బాబా మా అందరిపై తమ అనుగ్రహాన్ని కురిపించి మమ్మల్ని ఆశీర్వదించారు. సాయంకాలం బాబాకు ఆరతి ఇచ్చి, భోగిపళ్లతో బాబాను అభిషేకించాము. ఆరోజు మా మనుమలకు భోగిపళ్లు పోసి ఫోటోలు కూడా తీసుకున్నాము. ఈ విధంగా ఆరోజు మేమంతా చాలా ఆనందంగా గడిపాము. ఎన్నో సంవత్సరాల నుండి ఈ పండుగను ఇలా జరుపుకోవాలనే నా కోరికను నెరవేర్చడంలో బాబా మాకెంతో సహాయం చేశారు. ఇలా ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నిజానికి ఆ సమయంలో జ్వరంతో, నీరసంతో నా ఆరోగ్యం బాగాలేదు. సరిగ్గా ఆ మూడు రోజులు బాబా నా ఆరోగ్యాన్ని కాస్త కుదుటపరిచారు. నాకు చాలా నీరసంగా ఉన్నప్పటికీ మా అత్తమామల సంవత్సరీకం కూడా జరుపుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఏదో కారణం చేత నా ఆరోగ్యం బాగోలేదు. బాబా దయవలన వైద్యుడైన మా అబ్బాయి నాకు మందులిస్తూ చక్కగా చికిత్స చేస్తున్నాడు. బాబా ఆశీస్సులతో తొందరగా నాకు పూర్తి ఆరోగ్యం చేకూరుతుందని ఆశిస్తున్నాను. "ధన్యవాదాలు బాబా! సదా మాతో ఉండి మమ్మల్ని ఆశీర్వదించండి బాబా!".
2021లో నేను చర్మ సంబంధిత సమస్య వలన చాలా నొప్పిని అనుభవిస్తూ ఎంతో బాధపడ్డాను. దానికి మందులు వాడుతున్నప్పటికీ నయం కాలేదు. అప్పుడు నేను బాబాకు చెప్పుకొని, కొద్దిగా ఊదీని నీళ్లలో కలిపి ప్రతిరోజూ త్రాగడం మొదలుపెట్టాను. ఆ ఊదీనీళ్లతో నా చర్మ సమస్యలు మాయమయ్యాయి. నా ఆరోగ్య సమస్యలను నయం చేసి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబాకు నా ధన్యవాదాలు. "బాబా! మమ్మల్ని ఆశీర్వదించి మాకు తోడుగా ఉండండి".
