సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా మహిమ ఎంతటిదో అర్థమయ్యేలా తెలియజేసిన అనుభవాలు.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు కమల. ముందుగా ఈ వెబ్‌సైట్ ద్వారా, వాట్సాప్ ద్వారా సాయిబంధువులందరినీ కలుపుతున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక అభినందనలు. మొదటిసారిగా నేను నా అనుభవాన్ని ఈమెయిల్ ద్వారా పంపి మీ అందరితో పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది.

నా చిన్నతనం నుండి మా కుటుంబంలోని వారంతా సాయినాథుడిని అందరి దేవుళ్ళతో పాటు పూజించేవాళ్ళు. నేనెప్పుడు ఇంటినుండి బయటకి వెళ్లినా నుదుటన కుంకుమతోపాటు బాబా ఊదీ ధరించకుండా వెళ్లేదాన్ని కాదు. నా భక్తి అంతవరకు మాత్రమే, బాబా గురించి నాకు ఏమీ తెలీదు. బహుశా నాకు అప్పట్లో అంత వయస్సు, జ్ఞానం లేవేమో! కానీ మొట్టమొదటిసారిగా 2008లో బాబా లీలను చవిచూశాను. అప్పుడు నేను నా ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాను. ఇంకో 15 రోజుల్లో నా సెమిస్టరు పరీక్షలు వ్రాయాల్సి ఉందనగా ఆ సమయంలో నాకు ఒళ్ళంతా చికెన్‌పాక్స్ వచ్చి, విపరీతమైన జ్వరంతో బాధపడ్డాను. పుస్తకం తెరచి చదువుదామంటే చదవలేని పరిస్థితి. ఏమి చేయాలో అర్థంకాక ఆందోళనపడేదాన్ని.అయినా సరే ధైర్యంచేసి ఆ స్థితిలోనే పరీక్షలకి వెళ్ళాను. అందరూ, "ఈ పరిస్థితుల్లో ఎందుకు వచ్చావు? సప్లిమెంటరీ వ్రాసుకోవచ్చు కదా!" అని అన్నారు. అయినా కూడా నేను అలాగే మొండిగా పరీక్షలన్నీ వ్రాసాను గాని, అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణురాలిని అవుతానన్న నమ్మకం నాకే లేదు. కానీ నేను చేసేది ఏమీ లేక ఫలితం ఏదైనా పరవాలేదు అనుకుని అక్కడితో ఆ విషయాన్ని వదిలేసాను. కొన్నిరోజులకి మా ఇంటిలో 'సాయి సచ్చరిత్ర' పుస్తకం దొరికింది. నేను ఏదో సరదాగా పారాయణ చేద్దామనుకుని మొదలుపెట్టాను. అసలు పారాయణ మొదలుపెట్టేముందు 'నాకు ఇది కావాలి' అని కూడా నేను బాబాని కోరుకోలేదు. గురువారం పారాయణ మొదలుపెట్టాను. అనుకోకుండా శుక్రవారమే నా పరీక్షాఫలితాలు వచ్చాయి. అన్ని సబ్జెక్టుల్లో నేను ఉత్తీర్ణురాలిని అయ్యానన్న మెసేజ్ చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అసలు నేను ఏం వ్రాసానో కూడా నాకు తెలీదు, అలాంటిది నేను అన్ని సబ్జెక్టులూ పాసయ్యానంటే అది బాబా దయవల్లే అని నాకర్థమై బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

రెండవ అనుభవం:

అదే సమయంలో మా అమ్మగారు యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. నేను సచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను కదా, అందులో బాబా ఊదీ మహిమలకు సంబంధించిన అధ్యాయాలు చదివి బాబాకి నమస్కరించుకుని, "బాబా! అమ్మ నెలరోజులనుండి ఈ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంది. నీ ఊదీలో మహిమ ఉండడం నిజమే అయితే, అమ్మ పడుతున్న బాధ తగ్గించండి" అని చెప్పుకుని బాబా ఊదీ నీళ్లలో కలిపి అమ్మ చేత త్రాగించాను. ఎంత అద్భుతమంటే, నెలరోజులుగా బాధపడుతున్న అమ్మకి ఒక్కసారిగా పెద్ద వాంతి అయిపోయి, నీరసంగా ఉన్న తను 15 నిమిషాల్లో లేచి ఆరోగ్యంగా తిరగడం చూసిన మాకు నోట మాట రాలేదు. అప్పటినుండి నాకు బాబా మహిమ ఎంతటిదో అర్థమైంది. ఈరోజుకీ నా సాయినాథుడు నా వెంట ఉండి చాలా విషయాల్లో చేయూత అందిస్తున్నారు. "బాబా! ఇదేవిధంగా జీవితాంతం నా చేయి వదలకుండా నాకు తోడుగా ఉండి, మాకు మీ మీద ఉండే భక్తి రెట్టింపవుతూ ఉండేలా ఆశీర్వదించండి బాబా!"

ఓం శ్రీ సాయినాథాయ నమః

3 comments:

  1. ఓం సాయి రామ్ 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo