సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా చిత్రపటం రూపంలో భక్తుని గృహానికి ఏతెంచిన లీల!


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నా పేరు రాయపాటి సాంబశివరావు, రామకృష్ణా అని కూడా అంటారు. మా ఊరు ఉలవపాడు మండలం, చాగల్లు. 1977 వ సంవత్సరం, మే నెలలో ఒకనాడు కేలండర్ సైజు ఫొటో ఒకటి మా ఇంటి పూజామందిరంలోకి గాలికి వచ్చి, వెల్లకిలా పడకుండా పటం నిలబెడితే ఎలా నిలబడుతుందో అలా పూజా మందిరంలోని పటాలవద్ద నిలబడింది. ఆ ఫొటోలో బాబా రూపం పెద్దగా ఉండగా, శివలింగం మాత్రం దానిపై సర్పము ఉన్నట్లు చిన్నగా ఉంది. అప్పటికి నాకు బాబా గురించి అస్సలు తెలియదు. శివలింగాన్ని పూజించుకుంటూ, తిరుపతి, శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాలు తిరిగాను కానీ శిరిడీ వెళ్ళలేదు.

మా ఇంటిలోకి బాబా ఫొటో వచ్చిన సమయంలోనే ఒంగోలులో సాయిబాబా మందిరం కడుతున్నారు. ఆ ఫొటో గురించి మా ఇంటి చుట్టుప్రక్కల వారిని "మీరేమైనా ఫొటో పోగొట్టుకున్నారా?" అని అడిగాను. వాళ్లంతా 'మాది కాద'ని చెప్పారు. బాబా గురించి చుట్టుప్రక్కల వారిని అడిగితే, కొందరు ఆయన ముస్లిమని, కొందరు హిందువని చెప్పారు. కొందరు మాత్రం భరద్వాజ మాష్టరుగారి దగ్గరకి వెళ్ళమని చెప్పారు.

సరేనని ఒంగోలు వెళ్లి మాష్టరుగారిని కలిశాను. ఆయన, "ఫొటో రూపంలో బాబానే నీ దగ్గరకు వచ్చారు. నువ్వు అదృష్టవంతుడివి. మేఘశ్యాముడు కూడా ఈశ్వరుడిని పూజించేవాడు. అతనికి శివలింగాన్ని ఇచ్చి బాబా ఆశీర్వదించారు. సద్గతి కలుగజేశారు" అని చెప్పి, సాయిలీలామృతం, గురుచరిత్ర పుస్తకాలు నాకిచ్చారు. తరువాత, "నువ్వు  శిరిడీకి వెళ్ళిరా!" అని ఆశీర్వదించారు. "నాకు హిందీ, మరాఠీ రాదు. నేను ఒక్కడినే పోలేను" అని నేనన్నాను. అందుకు ఆయన, "అన్నీ బాబా చూసుకుంటారు" అని చెప్పారు.

1987వ సంవత్సరంలో గురుపూర్ణిమకి శిరిడీ వెళ్ళడానికి బాబా ఆజ్ఞ లభించింది. నాతో పాటు మా తమ్ముడికి కూడా బాబా అవకాశం ఇచ్చారు. అలా నేను, మా తమ్ముడు మొదటిసారి శిరిడీ వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన లీల జరిగింది. ఉదయాన్నే హైదరాబాదులో మా తమ్ముడు మొహం కడుక్కుంటూ వాచీ వాష్‌బేసిన్ వద్ద పెట్టి మర్చిపోయాడు. కొంతసేపటికి గుర్తొచ్చి వెళ్లి చూస్తే అక్కడ వాచీ లేదు. కాసేపు దానిగురించి బాధపడినా, ఎవరో తీసుకుపోయి ఉంటారని ఊరుకున్నాము. తరువాత మేము రైలులో ప్రయాణిస్తుండగా ఒక సాధువు మా దగ్గరకు వచ్చి, "నీ వాచీ పోయిందా? ప్రక్కస్టేషన్‌లో కాలికి ఆరు వేళ్ళు ఉండే ఆయన్ను అడుగు, ఇస్తాడు" అని చెప్పి వెళ్ళిపోయాడు. మేము ఆశ్చర్యపోయాము. ఎందుకంటే మా వాచీ పోయిన సంగతి మేము ఎవరికీ చెప్పలేదు. వచ్చిన ఆ సాధువు ఎవరో కూడా మాకు తెలియదు. కొంతసేపటికి ప్రక్కస్టేషన్‌లో రైలు ఆగింది. సాధువు చెప్పినట్లు ఫ్లాట్‌ఫారం మీద చూడగా ఒకాయన కాలికి ఆరువేళ్ళు ఉన్నాయి. ఆయన దగ్గరకు పోయి, "వాచీ ఇవ్వండి" అని అడిగాము. ఆయన వాచీ ఇచ్చాడు. ఇంతలో ట్రైన్ కదిలింది. ఆయనతో మాట్లాడే టైము కూడా లేదు. ఆయన్ని చూస్తూ, నమస్కరిస్తూ, ఆయనలో బాబాను దర్శించాము. తరువాత శిరిడీ చేరుకుని మొదటిసారి బాబా దర్శనంతో పులకించిపోయాను. చెప్పలేనంత ఆనందాన్ని అనుభవించాను. 1977లో బాబా నా జీవితంలోకి వచ్చినప్పటినుండి ఇప్పటివరకు బాబానే నమ్ముకున్నాను. ఆయన్నే పూజిస్తున్నాను. ఆయన ద్వారా ఎన్నో లీలలను పొందాను.

- రామకృష్ణ ఉలవపాడు మండలం, చాగల్లు, ప్రకాశం జిల్లా.

మూలం: సద్గురులీల మాసపత్రిక, ఆగస్టు - 2007.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo