కెప్టెన్ జహంగీర్ ఎఫ్.దారువాలా
మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో కెప్టెన్ జహంగీర్ ఎఫ్.దారువాలా తన నౌకాదళంతో నడిసముద్రంలో ఉండగా తన మూడు నౌకలు తప్ప మిగతా నౌకలన్నిటిపై శత్రువులు దాడి చేసారు. ఆ నౌకలు త్వరితగతిన నీట మునిగిపోవడం చూసిన అతను తొందరలోనే తనకు, తన మూడు నౌకలలోని ఉన్న ప్రయాణికులకు అదేగతి పట్టనున్నదని గ్రహించి పూర్తిగా నిరాశకు గురయ్యాడు. అయినప్పటికీ అతను ఒక మంచి కెప్టెన్గా తన నౌకలను అక్కడినుండి సురక్షితంగా తీసుకెళ్లాలని ఆశపడ్డాడు. వెంటనే అతను తన జేబులో ఉన్న బాబా ఫోటో బయటకి తీసి తమని కాపాడమని ఆర్తిగా వేడుకున్నాడు. అదే సమయంలో ద్వారకామాయిలో కూర్చొని ఉన్న బాబా 'హాక్ హాక్' అని కేకలేశారు. ఆయన తల నుంచి పాదాల వరకు పూర్తిగా తడిసిపోయారు. వరద ప్రవాహంతో ద్వారకామాయి నీటి మడుగైంది. అది చూసి అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్యపోయారు. వాళ్లలో ఒక భక్తుడు ఆ నీటిని తీర్థంగా సేవించి అవి చాలా ఉప్పగా ఉండటంతో విస్మితుడై మౌనంగా ఉండిపోయాడు. దాదాపు ఒక గంటపాటు భక్తులు బకెట్లతో నీటిని బయట పారబోశాక ధరించడానికి బాబాకు పొడి బట్టలు ఇచ్చారు. బాబా తాము అలా తడిసిపోవడానికి కారణమేమిటో చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. ఇక్కడ ఇదంతా జరిగిన సమయంలోనే అక్కడ జహింగీర్ నడి సమద్రంలో బాబాను ప్రత్యేక్షంగా చూసాడు. ఆయన అతని ఓడలను లాగి సురక్షితమైన చోటుకు చేర్చారు. ఇది జరిగిన మూడవ రోజున తమని కాపాడినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జహంగీర్ వద్ద నుండి బాబాకి టెలిగ్రామ్ వచ్చింది. తర్వాత అతను అక్కడినుండి వచ్చిన వెంటనే శిరిడీ వచ్చి బాబా పాదాలపై వాలిపోయి తన ప్రార్థనను మన్నించి తక్షణమే తన సిబ్బందిని, ప్రయాణికులను కాపాడినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అతను గొప్ప భక్తుడు. బాబాకు సంబంధించిన విషయాలపట్ల ఆసక్తి కనబరచి సభా మండపం మరమ్మత్తులకు కృతజ్ఞతాపూర్వకంగా రెండు విడతలలో 2,220 రూపాయలు విరాళంగా ఇచ్చాడు.
ఫిరోజ్షా హోర్మాజ్జీ పుడుమ్జీ
1917వ సంవత్సరంలో ఫిరోజ్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు అతని తల్లిదండ్రులు శిరిడీ వెళ్లి బాబాను దర్శించారు. వాళ్ళు శిరిడీ నుండి తిరిగి ప్రయాణమయ్యేటప్పుడు బాబా ఫోటో ఒకటి, వారి ప్రసాదంగా తీసుకున్నారు. వాళ్ళు తమ ఇల్లు చేరుకొన్న తర్వాత బాబా ఫోటోని డైనింగ్ టేబుల్ మీద పెట్టి కుటుంబసభ్యులతో అత్యంత ఉత్సాహంతో బాబా దివ్యత్వం గురించి ఎంతో గొప్పగా వర్ణించి చెప్పారు. అదంతా విన్న ఫిరోజ్ ఆశ్చర్యపోతూ, “వీళ్ళు ఈ బాబాలు, సాధువుల వెంట పరుగెత్తుతున్నారు. ఈ సాయిబాబా వీళ్ళకి ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేస్తాడా?" అని అనుకున్నాడు. అంతేకాదు, "బాబా దైవమైతే, అందుకు తగిన సంకేతం ఆయన నాకు ఇస్తారు" అని బాబాకు ఒక పరీక్ష పెట్టి అదే ఆలోచనతో నిద్రలోకి జారుకున్నాడు. ఆ రాత్రి బాబా అతనికి స్వప్నదర్శనమిచ్చి, "నా దైవత్వానికి సంబంధించి నేను నిజంగా దైవమా, కాదా అని నీకు ఋజువు కావాలా? మీ నాన్న నా ఫోటో టేబుల్పై ఉంచాడు. నువ్వు ఉదయం నిద్ర లేవగానే ఆ ఫోటోను పైకెత్తడానికి ప్రయత్నించు. నువ్వు దాన్ని పైకెత్తగలిగినట్లైతే నేను నకిలీ, నువ్వు ఆ ఫోటోను పైకెత్తలేకపోయినట్లైతే నేను ఖచ్చితంగా నిజమని తెలుసుకో" అని అన్నారు. మరుక్షణం అతనికి మెలుకువ వచ్చి తెల్లారేవరకు వేచి ఉండలేకపోయాడు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసి ఉదయాన్నే డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్లి బాబా ఫోటో పైకెత్తడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఫోటో చాలా బరువుగా ఉంది. అతను ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే, అది అంత బరువు పెరిగిపోసాగింది. చివరికి నేల మీద నుండి టేబుల్ పైకి లేచింది, కానీ ఫోటో కదలలేదు. దాంతో అతను బాబా నిజంగా దైవమని గ్రహించాడు.
తరువాత కొంతకాలానికి అతను తన తండ్రి మిల్లులో పనిచేయడం ప్రారంభించాడు. అందుకు అతను జీతం ఏమీ తీసుకునేవాడు కాదు. కొంతకాలం తర్వాత ఒకరోజు అతనికి బాబా కలలో కనిపించి, “నువ్వు ఇంతకాలంగా మీ నాన్న మిల్లులో పనిచేస్తున్నావు. నీకు జీతం అందాలి" అని అన్నారు. మరుసటిరోజు అతని మామయ్య అతనిని, "నువ్వు చేస్తున్న పనులన్నింటికీ జీతం ఇస్తున్నారా?" అని అడిగాడు. అందుకతను చెప్పిన ప్రతికూలమైన సమాధానం విన్న అతని మామయ్య నెలకు రెండు వందల రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టాడు.
ఫిరోజ్ బాబాను ప్రత్యేక్షంగా దర్శించలేదు కానీ, ఆయనపట్ల అంకితభావంతో ఉండేవాడు. అతను శిరిడీ ఎలా ఉండేదో అని అబ్బురపడుతుండేవాడు. అలా ఉండగా ఒకరోజు అతను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు శాంతాక్రజ్లోని సాయిబాబా లైన్ మీదగా వెళ్ళాడు. అప్పుడతనికి తనకి అక్కడ సమాధానం దొరుకుతుందనిపించి ఆ లైన్లో ఉన్న బాబాకు అత్యంత సన్నిహిత భక్తుడైన మోరేశ్వర్ ప్రధాన్ని కలిశాడు. ప్రధాన్ ఎంతో ప్రేమతో ఓర్పుగా అతని ప్రశ్నలన్నింటికీ, అతను సంతృప్తి చెందేవరకు చాలా వివరంగా సమాధానమిచ్చాడు. అంతా విన్న ఫిరోజ్ ఆనందంతో కన్నీటిపర్యంతమయ్యాడు.
రిఫరెన్స్: సాయిలీల, 1928 ఏప్రిల్(చైత్ర).
సోర్స్: బాబా'స్ ఋణానుబంధ్(రచన: విన్నీ చిట్లూరి)

