- బాబా ఉండగా దేనికి చింతించాల్సిన అవసరం లేదు
శ్రీసాయిభక్త జనావళికి ప్రత్యేక నమస్కారములు. నా పేరు సాయిఅవినాష్. నేను విజయవాడ నివాసిని. నేను చిన్ననాటినుండి సాయి భక్తుడను. ఆయన ఎన్నో రకాలుగా నన్ను, నా కుటుంబసభ్యులను రక్షిస్తూ ఉన్నారు. నేను ఒక ఫ్రెండ్స్ ఫంక్షన్ కోసం 19.04.24న బెంగళూరు వెళ్లాను. అక్కడ ఫంక్షన్ బాగా జరిగింది. మా బ్యాచ్మేట్స్ అందరం కలుసుకొని ఒక రోజంతా రిసార్ట్లో చాలా సంతోషంగా గడిపాము. 21వ తేదీ మధ్యాహ్నం నుండి నేను ఒక ఫ్రెండ్ ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాను. ఆ రోజు రాత్రి 9 గంటలకు బయలుదేరి 11:30 గంటలకి ఎస్ఎంవిటి బెంగళూరు స్టేషన్లో నేను రైలు ఎక్కాల్సి ఉండగా అది స్పెషల్ ట్రైన్ అయినందున మరుసటిరోజు అనగా 22వ తేదీ ఉదయం 6.00 గంటలకు బయలుదేరనున్నాట్లు రీషెడ్యూలై నాకు మెసేజ్ వచ్చింది. అందుచేత నేను ఆ రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లోనే పడుకుని ఉదయాన్నే నిద్రలేచాను. మా ఫ్రెండ్ ఎస్ఎంవిటి బెంగళూరు స్టేషన్కు బదులుగా కేఆర్పురం స్టేషన్కి క్యాబ్ బుక్ చేసి, ఎస్ఎంవిటి బెంగళూరులో బయలుదేరే ట్రైన్లన్నీ కేఆర్పురంలో ఖచ్చితంగా ఆగుతాయని చెప్పాడు. నేను అక్కడికి వెళ్లిన కాసేపటికి ఆ ట్రైన్ ఆ స్టేషన్లో ఆగదని తెలిసింది(బాబానే సమయానికి తెలిసేలా చేసారు). నేను చాలా కంగారుపడ్డాను. ఎందుకంటే, ఆ ట్రైన్ తప్పితే టికెట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉండదు, 1500 రూపాయలు పూర్తిగా వృధాగా పోతాయి, మరో ట్రైన్ కూడా లేదు. కాబట్టి మరుసటిరోజు నేను ఆఫీసుకి వెళ్ళలేను, చాలా ఇబ్బందవుతుంది. అదీకాక నా దగ్గర డబ్బులు కూడా తగినంత లేవు. నాకు ఏం చేయాలో ఏమీ అర్థంకాక, "బాబా! ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మీరే దారి చూపి, ఎలా అయినా ట్రైన్ తప్పిపోకుండా చేయండి" అని మనసులో అనుకుంటూనే స్టేషన్ బయటకు వెళ్లి, ఆ ట్రైన్ బయలుదేరే ఎస్ఎంవిటి బెంగళూరు స్టేషన్ ఎంత దూరమని ఆటోవాళ్ళని అడిగితే, 9 కిలోమీటర్లు ఉంటుదన్నారు. సమయం చూస్తే, కేవలం 5 నిమిషాలే ఉంది. అంత తక్కువ సమయంలో అక్కడికి చేరుకోవడం ఏ రకంగానూ సాధ్యం కాదు. నాకు దుఃఖం పొంగుకొచ్చింది. ఒక ఆటో అతను, "నేను తీసుకెళ్తాను. 300 రూపాయలు ఇవ్వండి" అన్నాడు. నేను, "బాబూ! నా దగ్గర అంత లేవు. 200 ఉన్నాయి, తీసుకెళ్ళు?" అని అడిగాను. అతను, "౩౦౦/- రూపాయలకి రూపాయి తక్కువైనా రాను. అసలు ఎవరూ రారు" అని ఖచ్చితంగా చెప్పాడు. అప్పటికే నా కళ్ళమ్మట నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆ ఆటో అతను ఏమనుకున్నాడో కానీ, మరో మాట మాటాడకుండా 200 రూపాయలకే నన్ను ఆటో ఎక్కుమని, నాకన్నా ఎక్కువ టెన్షన్ పడుతూ నన్ను ఎలాగైనా ట్రైన్ ఎక్కించాలని చాలా వేగంగా ఆటో తోలాడు. నేను ఆటో ఎక్కిన దగ్గర నుండి " 'బాబా బాబా' ట్రైన్ తప్పిపోకుండా చూడండి" అంటూ వేడుకుంటూనే ఉన్నాను. అక్కడికి చేరుకునేసరికి 6:10 అయింది. ట్రైన్ రెండవ ఫ్లాట్ఫార్మ్ మీద ఉన్నట్టుగా బోర్డులో చూపిస్తుంది. నేను ఆటో అతనికి డబ్బులిచ్చి, థాంక్స్ చెప్పి ఎలా పరుగెత్తానో నాకే తెలియదు. కానీ తీరా చూస్తే, ఆ ఫ్లాట్ఫార్మ్ ఖాళీగా ఉంది, ట్రైన్ లేదు. నాకు ఏడుపు ఆగలేదు. 'బాబా బాబా' అంటూనే వచ్చాను, అయినా ఇలా అయిందని తట్టుకోలేక బాధ, భయంతో ఏడ్చేసాను. అయితే ఫ్లాట్ఫార్మ్ మీద డిస్ప్లే బోర్డులో ఇంకా ట్రైన్ నెంబర్ కనిపిస్తుంది. జనం కూడా ఉన్నారు. అనుమానమొచ్చి అక్కడున్న ఒక రైల్వే టీసీ ఉంటే, నేను ఎక్కాల్సిన ట్రైన్ నెంబర్ చెప్పి, వచ్చిందా అని అడిగితే, "ఇంకా రాలేదు. ఆలస్యమవుతుంది. ఎప్పుడు వస్తుందో తెలీదు" అన్నాడతను. నేను, 'హమ్మయ్య...' అనుకొని కాసేపు అలాగే కూర్చున్నాక "మధ్యాహ్నం 12.45 గంటలకి రీషెడ్యూలు అయింద"ని పక్కనున్నవాళ్ళు అన్నారు. ట్రాకింగ్లో కూడా మధ్యాహ్నం 12:45 గంటలకి అని చూపించింది. నా గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే, ఆ సమయానికి బయలుదేరితే నేను విజయవాడ చేరుకునేసరికి ఖచ్చితంగా అర్ధరాత్రి 2 గంటలైపోతుంది. పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళాలి. ఇప్పుడెలా అని, మళ్ళీ బాబాను, "త్వరగా వెళ్ళాలి బాబా. ప్లీజ్.. మీరే ఏదో ఒకటి చేయండి" అని బాబాని వేడుకోసాగాను. సుమారు ఒక గంటకి అంటే ఉదయం 7:30 గంటలకి, 'ట్రైన్ ఉదయం 8.00 గంటలకి బయలుదేరుతుంద'ని అనౌన్స్ చేసారు. కానీ 8.45కి బయలుదేరి రాత్రి 8:30కి విజయవాడలో దిగి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాను. నిజానికి ప్రత్యేక రైళ్లు ఎప్పుడూ ఆలస్యంగా నడుస్తాయి. అలాంటిది బాబా నన్ను సరైన సమయానికి విజయవాడ చేర్చి, తగినంత విశ్రాంతి తీసుకుని మర్నాడు ఆఫీసుకి వెళ్లేట్టు అనుగ్రహించారు. శ్రీసాయిబాబా తమను నమ్మినవాళ్ళకి ఎప్పుడూ ఏ సమస్యా రానివ్వరు. ఒకవేళ వచ్చినా దాన్ని ఆయనే పరిష్కారిస్తారు. ఆయన ఉండగా దేనికి చింతించాల్సిన అవసరం లేదు. ఆయన్ని గట్టిగా తలుచుకుంటే చాలు. "ధన్యవాదాలు బాబా. నేను మిమ్మల్ని ఒక కోరిక ఎప్పటినుండో కోరుతున్నాను. దాన్ని త్వరలో అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాను. అందరినీ చల్లగా చూడండి".
సర్వం సాయినాథార్పణమస్తు

