సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1864వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • జీవితంలో వెలుగులు నింపిన శిరిడీ సాయినాథుడు

సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు జానకిరామ్. నేను, నా భార్య సాయిబాబా భక్తులం. 2021, మే నెలలో నేను ఒక వింతైన అనారోగ్యం పాలయ్యాను. దానివల్ల బుర్ర తిరగటం, వాంతులవడం, చెవిలో పెద్దపెద్ద శబ్దాలు నిరంతరాయంగా వినిపిస్తూ వినికిడి తగట్టం వంటివి జరుగుతుండేవి. స్థానిక ENT డాక్టరు దగ్గరకి వెళితే, ఒక నెల రోజులు వాడమని మందులిచ్చారు. కానీ ఉపయోగం లేదు. అప్పుడు మందులు మార్చారు. అయినా పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. అప్పుడు నా స్నేహితుని తోడుగా తీసుకొని హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడ MRI స్కాన్ తీసి నా చెవిలో లిక్విడ్ ఎక్కువగా తయారవుతుందని, మరేం పర్వాలేదని 45 రోజులు వాడమని మందులిచ్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నా భార్య, తన అన్నయ్యని తీసుకొని మళ్ళీ అదే డాక్టరుని సంప్రదిస్తే, ఏదో ఇంజక్షన్ నా చెవిలో చేసి, "ఈ సమస్య ఇక తగ్గదు. ఇక ఇంతే" అని అన్నారు. నాకు చాలా బాధేసి ఏడ్చేసాను. అప్పుడు అదృష్టంకొద్దీ యశోద హాస్పిటల్‌కి ఎదురుగా ఉన్న మరో ఆసుపత్రిలో నా బావమరిది స్నేహితుడు పని చేస్తున్నాడు. నిజానికి అతను జూబ్లీహిల్స్ బ్రాంచ్‌లో పని చేస్తాడు. బాబా దయవల్ల ఆ రోజు ఆ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నాడు. అతన్ని కలిసి సమస్య గురించి చెప్తే అతను, "పంజాగుట్ట దగ్గరలో ఒక డాక్టర్ ఉన్నారు. అతని దగ్గరకి వెళ్ళండి" అని చెప్పాడు. మరుసటిరోజు అతను చెప్పిన డాక్టర్ దగ్గరకు వెళ్లేందుకు ఆటో బుక్ చేసుకుని వెళ్ళాము. ఆ హాస్పిటల్ వున్న ఏరియా పేరు ద్వారకాపురి. అక్కడ ఒక సాయిబాబా గుడి వుంది. మా బావమరిది బాబా భక్తుడు. అతను, "ఒకసారి గుడికి వెళ్లి దణ్ణం పెట్టుకుని వెళ్దాం" అని అన్నాడు. నేను దేవుడిని నమ్ముతాను కానీ, సాయి గురించి నాకు అంతగా తెలీదు. మేము కొబ్బరికాయ కొని గుడి లోపలికి వెళ్ళాము. అక్కడ శ్రద్ధ, సబూరీలతో పాటు "నేను ఉండగా భయమేలా?" అని వ్రాసి వుంది. అది చూసి నాకు ఏడుపు ఆగలేదు. బాబాకి దణ్ణం పెట్టుకుని హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్ అప్పోయింట్మెంట్ తీసుకుని కూర్చున్నాము. రెండు గంటల తర్వాత నా పేరు పిలిచారు. ఆ డాక్టర్ పేరు కూడా నా పేరే, 'జానకిరామ్'. ఆయన, "ఏంటి నీ సమస్య?" అని అడిగితే అంత వివరంగా చెప్పాను. ఆయన ఫలానా వ్యాధి అని చెప్పి, "ఏం ఇబ్బంది లేదు. తల తిరగడం, వాంతులు అవటం తగ్గుతాయి. కానీ వినికిడి మాత్రం తిరిగి రాదు" అని అన్నారు. వినికిడి విషయం పక్కన పెట్టిన మిగిలిన సమస్యలు తగ్గుతాయని చాలా సంతోషించాను. డాక్టరు నాలుగు నెలలకి చాలా పవర్‌ఫుల్ మందులిచ్చారు. వాటిని అక్టోబర్ 1న నేను వాడటం మొదలుపెట్టాను. రెండు రోజులకి నాకు చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది. అక్టోబర్ 3 ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దగా వాంతులు, విరోచనాలు అవుతూనే ఉన్నాయి. నేను ఇంకా బ్రతుకుతానని అనుకోలేదు. మావాళ్లు నన్ను దగ్గర్లో వున్న హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. ఆ రాత్రి నన్ను హాస్పిటల్‌లో ఉంచి మర్నాడు ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చాక మళ్ళీ హైదరాబాద్ డాక్టరు ఇచ్చిన మందులు వాడటం ప్రారంభించాను. మునుపటిలా ఇబ్బందిపడుతూనే ఉన్నప్పటికీ మందులు వేసుకుంటూ ఉండేవాడిని. ఆ సమయంలో నరకం అంటే ఏంటో నేను స్వయంగా చూసాను. 2022, జనవరితో ఆ మందులు అయిపోయాయి. కానీ సమస్య అలానే ఉంది. నా  తల అస్సలు పని చేయలేదు. ఫోన్‌లో నా వ్యాధి గురించి సెర్చ్ చేస్తుంటే ఒక హోమియోపతి డాక్టర్ నా వ్యాధి గురించి చెప్పటం చూసాను. మచిలీపట్నంలో ఉండే ఆ డాక్టర్‌కి ఫోన్ చేసి నా వ్యాధి గురించి అంతా వివరంగా చెప్పాను. అతను, "సరే, ఏం ఇబ్బంది లేదు. నువ్వు బాధపడుకు. అది ఇంగ్లీష్ మందులతో కంటే హోమియోపతితో తగ్గుతుంది" అని చెప్పారు. 2022, ఫిబ్రవరి 16న మేము మచిలీపట్నం వెళ్లి ఆ డాక్టర్ని సంప్రదించాము. అతను ఒక నెల రోజులకి మందులిచ్చాడు. అవి వాడటం మొదలుపెట్టాక నా చెవిలో శబ్దాలు ఇంకా ఎక్కువయ్యాయి. నేను భరించలేక ఏడ్చేసాను. ఆ స్థితిలో నన్ను చూసిన మా బావమరిది చెన్నైలోని వందలూరు సాయిబాబా గుడిలో ఉండే ఒక గురువుగారి కాంటాక్ట్ నెంబర్ తెలుసుకొని అతనికి ఫోన్ చేసాడు. ఆ గురువుగారు సాయంత్రం 6కి  వీడీయో కాల్ చేసి, "నేను చెప్పినట్లు చేయి" అని అన్నారు. నేను ఆయన చెప్పినట్లు మా ఇంట్లో వున్న సాయిబాబా ఫోటో ఒకటి నా ముందు పెట్టుకుని, ఒక గ్లాసు నీళ్లు కూడా పెట్టుకొని ఆ నీటిలో ఊదీ వేసాను. ఆ గురువుగారు 5 నిమషాలు ప్రార్థన చేసి, "ఏం భయపడకు. ఆ ఊదీ నీళ్లు తాగు,  తగ్గుతుంది" అని చెప్పారు. ఇకపోతే నేను వాడుతున్న హోమియోపతి మందు ప్రతినెలా మారుస్తూ ఉండేవారు. అవి వాడుతూ ఉంటే కొంచం కొంచం మార్పు వస్తూ ఇప్పుడు చాలావరకు బాగుంది. వినికిడి విషయంలో కూడా చాలా మార్పు వచ్చింది. 

ఒక సంవత్సరంపాటు నేను చాలా బాదపడ్డ ఆ సమయంలో ఖాళీగా ఉంటూ నాకు ఏం చేయాలో తోచేదికాదు. మా నాన్నవాళ్ళ ఇల్లు వదిలి వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 లక్షల రూపాయలలో 3 లక్షల వరకు నా అనారోగ్యానికి, మా పిల్లోడికి ఖర్చు అయ్యాయి. కేవలం 3 లక్షలు మాత్రమే మిగిలాయి. వ్యాపారం చేయాలంటే చాలా డబ్బు అవసరం. అయినా ఒక పక్క నా ఆరోగ్యం చూసుకుంటూ, మరో పక్క సంపాదనకోసం చాలా ప్రణాళికలు చేశాను. కానీ అన్ని విఫలమయ్యాయి. నేను చాలా అంటే చాలా సమస్యలు ఎదురుకున్నాను.. నాకంటూ నా భార్య, తన అన్నయ్య, వాళ్ళ తల్లిదండ్రులు తప్ప ఎవరూ లేరు. మా అత్తగారింట్లోనే ఉంటుండేవాళ్ళము. వాళ్ళింటో ఒక సాయిబాబా పుస్తకం వుంది. వాళ్ళు దాన్ని నాకిచ్చి చదవమంటుంటే చదవటం మొద్దలుపెట్టాను. సాయిబాబా పారాయణ చేసే మా అక్కవాళ్ళు కూడా కొన్నిసార్లు తమకి చదువటం కుదరక నన్ను చదవమనేవారు. అలా నేను చదువుతూ ఉండటం వల్ల అనుకోకుండా నా ఆరోగ్యం కుదుటపడటం మొదలై మా జీవితాలలో అద్భుతాలు జరగనారభించాయి. మా వదినవాళ్ళు 'సాయి దివ్యపూజ' చేసుకోమంటే 2022, జూలైలో మొదలుపెట్టాం. కానీ ఆటంకమొచ్చి 3వ వారం తరువాత మధ్యలోనే ఆపివేయవలసి వచ్చి ముడుపు దగ్గరలో వున్న బాబా గుడిలో సమర్పించాం. అప్పుడు ఉద్యోగం చేస్తున్న నా భార్య స్నేహితులు కొంతమంది సలహా మీద నేను కూడా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ 5, 6 ఇంటర్వ్యూలకి వెళ్ళాను. కానీ అవి రిజెక్ట్ అయ్యాయి. కానీ అనుకోకుండా ఒక అద్భుతం జరిగి మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది. 2022, ఆగస్టు 25, గురువారంకి జాయినింగ్ డేట్ ఇచ్చారు. సరిగ్గా పూజ మొదలుపెట్టిన ఒక నెలకి నేను అడగకుండానే బాబా నాకు మంచి వరం ఇచ్చారు. మా సంతోషానికి అవధులు లేవు. బాబా దయతో ఆ ఉద్యోగం చేసుకుంటూ చాలా అంటే చాలా సంతోషంగా వున్నామనుకుంటే 2022, నవంబర్ 27, ఆదివారం సాయంత్రం రోజులాగే సరదాగా నేను బైక్ మీద టీ తాగటానికి బయటకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుంటే, ఇంటికి దగ్గరలో ఒక చికెన్ షాప్ వద్ద హఠాత్తుగా ఒక కుక్క అడ్డం వచ్చింది. నేను ఆ సమయంలో నెమ్మదిగానే వస్తున్నందువల్ల మాములుగానే కింద పడ్డాను. కొంచం కూడా దెబ్బ తగలలేదు. కానీ కుడికాలు చాలా నొప్పి పెట్టింది. అదే సమయంలో అక్కడికి దగ్గరలో ఉండే మా బావ ఒకరు చికెన్ కొనటానికని వచ్చి నేను పడిపోవటం చూసి, వెంటనే నా దగ్గరకు వచ్చి లేపితే నేను లేవలేకపోయాను. మా బాబాయ్ RMP డాక్టర్. అతని వద్దకు నన్ను తీసుకెళితే, పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇచ్చారు. కానీ నొప్పి తగ్గకపోవడంతో దగ్గరలో వున్న పెద్ద హాస్పిటల్‌కి వెళితే, అక్కడ ఎక్స్‌రే తీసి కుడికాలు బాల్ దగ్గర(తుంటి) కొద్దిగా క్రాక్ అయిందని చెప్పారు. నాకు ఏడుపొచ్చి, "బాబా! నిన్ను నమ్ముకుంటే మళ్ళీ ఇలా చేసావు ఏంటి?" అని అనుకున్నాను. అ రోజు ఆదివారం అవటం వల పెద్ద డాక్టర్లు లేరు. అందుకని ఆ హాస్పిటల్ నుంచి కాకినాడ అపోలో హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ డాక్టర్లు ఆపరేషన్ చేయాలని, సోమవారం రాత్రి అన్ని టెస్టులు చేసి 7:30కి ఆపరేషన్ చేసి, "3 నెలలు విశ్రాంతి తీసుకోవాలి" అని అన్నారు. అప్పటికి నేను ఉద్యోగంలో చేరి మూడు నెలలే అయింది. అయినా తప్పనిసరై మూడు వారాలు సెలువు పెట్టాను. కానీ ఒక వారం తర్వాత నేను హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి సిస్టం ఆన్ చేసి వర్క్ చేస్తానని మా మేనేజర్‌తో చెప్పాను. తను, "ఒకే గుడ్" అంది కానీ, మా క్లయింట్ ఒప్పుకోలేదు. "నువ్వు విశ్రాంతి తీసుకో! వర్క్ ఏముందిలే" అన్నాడు. అందువల్ల నేను డిసెంబర్ నెలంతా సెలవులో వున్నాను. కానీ మా మేనేజర్ చాలా మంచిది. ఆమె ఒక వారం మాత్రమే సెలువు అని వేసి, మిగతా రోజులన్నీ ప్రెజెంట్ అని వేసి నా టైం షీట్ అప్రూవ్ చేసి నాకు చాలా సహాయం చేసింది. అంతా బాబా దయ. తరువాత 2023, జనవరి నెల రెండో వారంలో మా మేనేజర్ నాకు ఫోన్ చేసి, "నిన్ను, ఇంకా కొంతమందిని ప్రాజెక్ట్‌లో నుంచి తీసేసారు" అని చెప్పారు. నేను చాలా బ్రతిమిలాడాను కానీ, ఏమీ ఉపయోగం లేకపోయింది. క్లయింట్‌తో కూడా మాట్లాడాను. అతను కూడా నా చేతిలో ఏమీ లేదని అన్నాడు. మళ్ళీ సమస్య వచ్చిందేంటి అని అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము కదా! 2023, ఫిబ్రవరి 26న క్లయింట్ లాప్టాప్ కొరియర్ చేద్దామని అనుకుంటూ తిరుగుతుండగా అద్భుతం జరిగింది. మా కంపనీలోని వేరే ప్రాజెక్ట్‌కి చెందిన ఒకతను నాకు కాల్ చేసి, "నువ్వు బెంచ్ మీద ఉన్నావా?" అని అడిగారు. నేను "అవును సార్" అన్నాను. అప్పుడు అతను, "సరే, మా ప్రాజెక్ట్‌లో చాలామంది అవసరం వుంది. నువ్వు చేస్తావా?" అని అన్నాడు. నేను సరేనన్నాను. అది ఇంటి దగ్గర నుంచే చేసే ప్రాజెక్ట్ అవ్వడంతో నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బాబా లీలలు మహా అద్భుతం. నేను కోల్పోయిన దానికంటే 90 రేట్లు మంచి ప్రాజెక్ట్, మంచి టీం ఇచ్చారు ఆయన. వెంటనే బాబాకి కొబ్బరికాయలు కొట్టాను. అయితే ఆ ప్రాజెక్ట్ 2023, డిసెంబర్ 31తో పూర్తవడంతో మళ్ళీ నేను బెంచ్ మీదకి వచ్చాను. తర్వాత 2024, మే 10న నన్ను ఉద్యోగం నుంచి తీసేసారు. మళ్ళీ నా జీవితం ఏంటో అర్ధంకానీ ప్రశ్నలా అయింది. కానీ బాబా నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నా జీవితంలో చాలా మంచి మార్పు వచ్చింది.  నేను ఇప్పుడు ఏదైతే కోల్పోయానో అది కూడా బాబా లీలే. నాకు తెలిసి వారు నాకు ఇంకా మంచిదేదో ఇవ్వబోతున్నారు. అందుచేత బాబా నామస్మరణ చేస్తూ వారి కృపకోసం ఎదురుచూస్తున్నాను. నేను ఎప్పుడూ వారి పాదాలు పట్టుకునే వుంటాను.

2019, జూలై 16, గురుపౌర్ణిమినాడు బాబా మాకు బాబుని ప్రసాదించారు. చిన్నప్పటి నుంచి వాడి ఆరోగ్యం మంచిగానే ఉండేది కానీ, నిమ్ము ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉంటే దగ్గు విపరీతంగా వస్తుండేది. ఏదైనా తీపి, చల్లనివి తిన్నా విపరీతమైన దగ్గుతోపాటు వాంతులు అవుతుండేవి. మేము బాబాని ఎప్పుడైతే నముకున్నామో మా జీవితాలలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. బాబాతో చెపుకున్నాక కొంచం కొంచంగా వాడి ఆరోగ్యంలో మంచి మార్పు రావటం జరిగింది. ఇప్పుడైతే చలికాలంలోనే కొంచం ఇబ్బంది పెడుతుంది. బాబా చాలావరకు వాడికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు.

2023, ఆగస్టులో బాబుకి జ్వరమొస్తే మా దగ్గరున్న మందు వేసాము. కానీ జ్వరం ఎంతకీ తగ్గలేదు. ఆరోజు ఆదివారం అవ్వటం వల్ల హాస్పిటల్ ఉండదని సోమవారంనాడు హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాము. డాక్టరు టెస్టులు చేయించి డెంగ్యూ అన్నారు, మాకు చాలా భయమేసింది. డాక్టర్, "ప్లేట్లెట్స్ బాగానే వున్నాయి, ఏం సమస్య లేదు" అని మూడు రోజులకి మందులిచ్చి, "వెళ్ళండి, ఏమైనా ఇబ్బంది వుంటే రండి. అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది" అన్నారు. అప్పుడు బాబుకి 105 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత వుంది. నేను, "బాబా! మా బాబుకి జ్వరం తగ్గేలా చేయండి" అని సాయిబాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజులకి బాబుకి జ్వరం తగ్గుంది. అయితే మరుసటి నెల మళ్ళీ అదే సమయానికి జ్వరం వచ్చింది. మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్తే టెస్టులు చేయించి మళ్ళీ డెంగ్యూ అన్నారు. మేము, "మళ్లీ ఇదేంటి బాబా?" అని అనుకున్నాము. డాక్టరు వేరే మందులు వ్రాశారు. ఆ మందులు వాడుతున్నా రెండురోజుల వరకు జ్వరం తగ్గలేదు, 105, 106 డిగ్రీలు ఉంటుండేది. వాంతులు కూడా అవుతుండేవి. భయమేసి నా భార్య, మా బావ బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పుడు ప్లేట్లట్లు చెక్ చేసి, కొంచం తగ్గాయని, బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని అన్నారు. సరేనని అడ్మిట్ చేస్తే, సెలైన్లు పెట్టి, ఇంజెక్షన్లు చేశారు. అప్పుడు నేను, "బాబా! బాబుకి జ్వరం తగ్గాలి" అని బాబాకి చెప్పుకున్నాను. అంతే, మరుసటరోజుకల్లా జ్వరం తగ్గటం మొదలుపెట్టి రెండు, మూడు రోజులకి బాబు పూర్తిగా కోలుకున్నాడు. బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇలా బాబా మాకు చాలా అంటే చాలా చేస్తూ మా జీవితాల్లో వెలుగులు నింపారు. బాబాని నమ్ముకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది. బాబా లీలలు అనంతం. నేను మీ అందరికి ఒకటి చెప్తాను, 'మనల్ని బాబా ఎన్నుకున్నారు. ఆయన మొదట పాప కర్మలు నుంచి మనల్ని విముక్తులను చేస్తారు. మనం ఎప్పుడూ బాబా మీద నమ్మకంతో ఉండాలి, అధికంగా ప్రేమించాలి. ఆయన మనం ఏ స్థితిలో వున్నా మనతోనే వుంటారు. మనకి ఏమీ కాదు'. "అనంతకోటి ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1863వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహముంటే కానిదేముంది?
2. సాయి కరుణ

బాబా అనుగ్రహముంటే కానిదేముంది?

సాయి బంధువులకు నమస్కారం.  నా పేరు విజయలక్ష్మి. 2024, మార్చ్ 30న నాకు కడుపునొప్పి వచ్చింది. నేను వేడి వల్లనేమోనని భావించి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, సగ్గుబియ్యం జావా ఇలా ఎన్నో తాగటం మొదలుపెట్టాను. అయితే ఎన్ని చేసినా నొప్పి తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! ఎన్ని చేసినా నొప్పి తగ్గటం లేదు. ఏ డాక్టర్ దగ్గరకి వెళ్ళమంటారు" అని బాబాను ప్రార్థించాను. బాబా హోమియో డాక్టర్ దగ్గరకి వెళ్ళమన్నారు. సరేనని ఆ డాక్టర్ దగ్గరకి వెళితే, చూసి ఐదు రోజులకు మందులిచ్చి, "తగ్గకపోతే, యూరిన్ టెస్ట్ చేయించుకొని రమ్మ"ని అన్నారు. అయితే మందులు వాడుతున్నా తగ్గలేదు. ఇంకా నాలుగు టాబ్లెట్లు మాత్రమే మిగిలాయి. అప్పుడు నేను, "బాబా! చివరి నాలుగు టాబ్లెట్లు ఉన్నాయి. ఇంకా తగ్గలేదు. నన్ను టెస్టు చేయించుకోమంటారా? అని బాబాని అడిగాను. బాబా వద్దని సమాధానమిచ్చారు. దాంతో నేను మిగిలిన ఆ టాబ్లెట్లు వేసుకుంటూ వాటితోపాటు బాబా ఊదీ కొంచం నీళ్లల్లో వేసుకొని తాగాను. అప్పుడు నొప్పి తగ్గటం మొదలై క్రమంగా పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. మీ దయవల్ల నొప్పి పూర్తిగా తగ్గింది తండ్రీ. ఇలాగే కరుణ చూపు తండ్రీ".

అలాగే ఒకసారి నాకు గొంతునొప్పి చాలా ఎక్కువగా వచ్చింది. గుటక కూడా వేయలేక చాలా ఇబ్బందిపడ్డాను. టాబ్లెట్లు వాడినా మూడు రోజులు వరకు తగ్గలేదు. అప్పుడు బాబా దగ్గర చాలా ఏడ్చి, "బాబా! ఇంకా ఒక టాబ్లెట్ ఉంది. దానికి కూడా తగ్గకపోతే నేను ఏం చేయాలి తండ్రీ?" అని వేడుకొని ఊదీ వేడినీళ్ళలో కలిపి తాగడం మొదలుపెట్టాను. దాంతో నొప్పి తగ్గింది. "ధన్యవాదాలు బాబా".

మేము లారీ కొనుక్కొని మూడు సంవత్సరాలైంది. ఆ లారీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక ఇబ్బంది వచ్చేది. కానీ ఇబ్బంది వచ్చినప్పుడల్లా బాబా మమ్మల్ని ఆదుకుంటుండేవారు. ఒకసారి లారీ కరెంటు స్తంభానికి గుద్దింది. బాబా పెద్ద విపత్తు నుండి కాపాడారు. కానీ కరెంటువాళ్ళు లక్ష రూపాయలు కట్టమన్నారు. బాబాని వేడుకుంటే 50 వేల రూపాయలు కట్టేందుకు కరెంట్ వాళ్ళు ఒప్పుకునేలా అనుగ్రహించారు. లారీ రెండుసార్లు కారుని ఢీకొట్టింది. ఆయా సందర్భాలలో బాబా ఎవరికీ ఏమీ కాకుండా చూసి కేవలం డబ్బుతో సమస్య లేకుండా సరి చేశారు. మేము, "బాబా! ఎందుకిలా ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుంద"ని చాలా టెన్షన్ పడేవాళ్ళం. అప్పుడొకసారి "మొక్కులు తీర్చనందుకే" అని  బాబా సందేశం వచ్చింది. నిజమే, ఆ లారీ విషయంలో అమ్మవారి మొక్కు వుంది. దాన్ని ఎప్పుడు తీరుద్దామన్నా ఏవో ఆటంకాలు వస్తుండేవి. అందువల్ల బాబాని, "ఏదో ఒక విధంగా మొక్కులు వెంటనే చెల్లించేలా చేయండి బాబా" అని ప్రార్థించి బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటున్న మా పిల్లల్ని, "మొక్కు చెల్లిద్దాం. రండి" అంటే వచ్చారు. కానీ మావారు సమయానికి డ్యూటీ నుండి రాలేకపోయారు. అలా 15 రోజులు గడిచిపోయాయి. నేను, "ఏంటి బాబా? ఈ మొక్కు తీర్చడం అవ్వదా తండ్రీ? ఆయన రాలేదు. పిల్లలు వెళ్ళిపోతామంటున్నారు" అని చాలా బాధపడ్డాను. అంతలో మరల లారీ ఒక కారుని ఢీ కొట్టింది. మళ్ళీ జరిమానా కట్టాము. వెళ్ళిపోదామనుకున్న మా అమ్మాయి తన మనసు మార్చుకొని, "ఈ వారం అయినా మొక్కు తీర్చుకుందాం డాడీ. వస్తారా?" అని అడిగింది. బాబా దయవల్ల మావారు రావడం, పోతును కొనడం, 2024, ఏప్రిల్ 21న మొక్కు చెల్లిద్దామని అనుకోవడం జరిగింది. కానీ నాకు నెలసరి సమయం కాకపోయినా హఠాత్తుగా కడుపునొప్పి రాసాగింది. నాకు భయమేసి, "తండ్రీ! ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకు, అమ్మవారి గుడిలో మొక్కు తీర్చుకొని భోజనాలు పెట్టుకునే వరకు నాకు, మా పాపకు ఎవరికీ ఏ ఆటంకాలు రాకుండా అనుగ్రహించు తండ్రీ" అని బాబాను పదేపదే వేడుకున్నాను. బాబా తలుచుకుంటే కానిదేముంది? ఆ తండ్రి దయవలన ఏ ఆటంకాలు లేకుండా అంతా సవ్యంగా జరిగేలా అనుగ్రహించారు. "సాయీ! మీకు శతకోటి ధన్యవాదాలు. ఇలాగే మమ్మల్ని సదా ఆశీర్వదించండి. మా తప్పులు ఏమైనా ఉంటే ఉంటే క్షమించు సాయితండ్రీ".

సాయి కరుణ
సాయి భక్తులలందరికి నమస్కారం. నా పేరు సాహితి. 2024, ఫిబ్రవరిలో రెండురోజులపాటు  మా అమ్మ గుండెల్లో నొప్పిగా ఉందని అంటుంటే ఎందుకైనా మంచిదని ఈసీజీ టెస్టు చేయించాము. రిపోర్టు అబ్ నార్మల్ అని వచ్చింది. అప్పుడు నేను, "బాబా! అమ్మని ఈ సమస్య నుండి రక్షించండి" అని వేడుకున్నాను. గురువారంనాడు నా సోదరి అమ్మను డాక్టర్ దగ్గరకి తీసుకొని వెళ్ళింది. అప్పుడు నేను, "తండ్రీ! డాక్టరు అమ్మని చూసి మరల టెస్టు చేసి, ఏ సమస్య లేదని చెప్పాలి" అని బాబాని ప్రార్థించి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించాను. డాక్టరు ఏదో టెస్టు చేసి, "వయసుతోపాటు వచ్చిన సమస్య. బ్లడ్ తక్కువగా ఉంది. మందులతో తగ్గుతుంది" అని చెప్పారు. "ధన్యవాదాలు బాబా. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే కాపాడు సాయితండ్రీ".

కెప్టెన్ జహంగీర్ ఎఫ్.దారువాలా & ఫిరోజ్‌షా హోర్మాజ్‌జీ పుడుమ్‌జీ



కెప్టెన్ జహంగీర్ ఎఫ్.దారువాలా


మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో కెప్టెన్ జహంగీర్ ఎఫ్.దారువాలా తన నౌకాదళంతో నడిసముద్రంలో ఉండగా తన మూడు నౌకలు తప్ప మిగతా నౌకలన్నిటిపై శత్రువులు దాడి చేసారు. ఆ నౌకలు త్వరితగతిన నీట మునిగిపోవడం చూసిన అతను తొందరలోనే తనకు, తన మూడు నౌకలలోని ఉన్న ప్రయాణికులకు అదేగతి పట్టనున్నదని గ్రహించి పూర్తిగా నిరాశకు గురయ్యాడు. అయినప్పటికీ అతను ఒక మంచి కెప్టెన్గా తన నౌకలను అక్కడినుండి సురక్షితంగా తీసుకెళ్లాలని ఆశపడ్డాడు. వెంటనే అతను తన జేబులో ఉన్న బాబా ఫోటో బయటకి తీసి తమని కాపాడమని ఆర్తిగా వేడుకున్నాడు. అదే సమయంలో ద్వారకామాయిలో కూర్చొని ఉన్న బాబా 'హాక్ హాక్' అని కేకలేశారు. ఆయన తల నుంచి పాదాల వరకు పూర్తిగా తడిసిపోయారు. వరద ప్రవాహంతో ద్వారకామాయి నీటి మడుగైంది. అది చూసి అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్యపోయారు. వాళ్లలో ఒక భక్తుడు ఆ నీటిని తీర్థంగా సేవించి అవి చాలా ఉప్పగా ఉండటంతో విస్మితుడై మౌనంగా ఉండిపోయాడు. దాదాపు ఒక గంటపాటు భక్తులు బకెట్లతో నీటిని బయట పారబోశాక ధరించడానికి బాబాకు పొడి బట్టలు ఇచ్చారు. బాబా తాము అలా తడిసిపోవడానికి కారణమేమిటో చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. ఇక్కడ ఇదంతా జరిగిన సమయంలోనే అక్కడ జహింగీర్ నడి సమద్రంలో బాబాను ప్రత్యేక్షంగా చూసాడు. ఆయన అతని ఓడలను లాగి సురక్షితమైన చోటుకు చేర్చారు. ఇది జరిగిన మూడవ రోజున తమని కాపాడినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జహంగీర్ వద్ద నుండి బాబాకి టెలిగ్రామ్ వచ్చింది. తర్వాత అతను అక్కడినుండి వచ్చిన వెంటనే శిరిడీ వచ్చి బాబా పాదాలపై వాలిపోయి తన ప్రార్థనను మన్నించి తక్షణమే తన సిబ్బందిని, ప్రయాణికులను కాపాడినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అతను గొప్ప భక్తుడు. బాబాకు సంబంధించిన విషయాలపట్ల ఆసక్తి కనబరచి సభా మండపం మరమ్మత్తులకు కృతజ్ఞతాపూర్వకంగా రెండు విడతలలో 2,220 రూపాయలు విరాళంగా ఇచ్చాడు.


సోర్స్: అంబ్రోసియా ఇన్ శిరిడీ - పార్ట్ 2, 1918కి ముందు బాబా లీలలు బై విన్నీ చిట్లూరి.

ఫిరోజ్‌షా హోర్మాజ్‌జీ పుడుమ్‌జీ


1917వ సంవత్సరంలో ఫిరోజ్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు అతని తల్లిదండ్రులు శిరిడీ వెళ్లి బాబాను దర్శించారు. వాళ్ళు శిరిడీ నుండి తిరిగి ప్రయాణమయ్యేటప్పుడు బాబా ఫోటో ఒకటి, వారి ప్రసాదంగా తీసుకున్నారు. వాళ్ళు తమ ఇల్లు చేరుకొన్న తర్వాత బాబా ఫోటోని డైనింగ్ టేబుల్ మీద పెట్టి కుటుంబసభ్యులతో అత్యంత ఉత్సాహంతో బాబా దివ్యత్వం గురించి ఎంతో గొప్పగా  వర్ణించి చెప్పారు. అదంతా విన్న ఫిరోజ్ ఆశ్చర్యపోతూ, “వీళ్ళు ఈ బాబాలు, సాధువుల వెంట పరుగెత్తుతున్నారు. ఈ సాయిబాబా వీళ్ళకి ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేస్తాడా?" అని అనుకున్నాడు. అంతేకాదు, "బాబా దైవమైతే, అందుకు తగిన సంకేతం ఆయన నాకు ఇస్తారు" అని బాబాకు ఒక పరీక్ష పెట్టి అదే ఆలోచనతో నిద్రలోకి జారుకున్నాడు. ఆ రాత్రి బాబా అతనికి స్వప్నదర్శనమిచ్చి, "నా దైవత్వానికి సంబంధించి నేను నిజంగా దైవమా, కాదా అని నీకు ఋజువు కావాలా? మీ నాన్న నా ఫోటో టేబుల్‌పై ఉంచాడు. నువ్వు ఉదయం నిద్ర లేవగానే ఆ ఫోటోను పైకెత్తడానికి ప్రయత్నించు. నువ్వు దాన్ని పైకెత్తగలిగినట్లైతే నేను నకిలీ, నువ్వు ఆ ఫోటోను పైకెత్తలేకపోయినట్లైతే నేను ఖచ్చితంగా నిజమని తెలుసుకో" అని అన్నారు. మరుక్షణం అతనికి మెలుకువ వచ్చి తెల్లారేవరకు వేచి ఉండలేకపోయాడు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసి ఉదయాన్నే డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్లి బాబా ఫోటో పైకెత్తడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఫోటో చాలా బరువుగా ఉంది. అతను ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే, అది అంత బరువు పెరిగిపోసాగింది. చివరికి నేల మీద నుండి టేబుల్ పైకి లేచింది, కానీ ఫోటో కదలలేదు. దాంతో అతను బాబా నిజంగా దైవమని గ్రహించాడు.


తరువాత కొంతకాలానికి అతను తన తండ్రి మిల్లులో పనిచేయడం ప్రారంభించాడు. అందుకు అతను జీతం ఏమీ తీసుకునేవాడు కాదు. కొంతకాలం తర్వాత ఒకరోజు అతనికి బాబా కలలో కనిపించి, “నువ్వు ఇంతకాలంగా మీ నాన్న మిల్లులో పనిచేస్తున్నావు. నీకు జీతం అందాలి" అని అన్నారు. మరుసటిరోజు అతని మామయ్య అతనిని, "నువ్వు చేస్తున్న పనులన్నింటికీ జీతం ఇస్తున్నారా?" అని అడిగాడు. అందుకతను చెప్పిన ప్రతికూలమైన సమాధానం విన్న అతని మామయ్య నెలకు రెండు వందల రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టాడు.


ఫిరోజ్ బాబాను ప్రత్యేక్షంగా దర్శించలేదు కానీ, ఆయనపట్ల అంకితభావంతో ఉండేవాడు. అతను శిరిడీ ఎలా ఉండేదో అని అబ్బురపడుతుండేవాడు. అలా ఉండగా ఒకరోజు అతను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు శాంతాక్రజ్‌లోని సాయిబాబా లైన్ మీదగా వెళ్ళాడు. అప్పుడతనికి తనకి అక్కడ సమాధానం దొరుకుతుందనిపించి ఆ లైన్లో ఉన్న బాబాకు అత్యంత సన్నిహిత భక్తుడైన మోరేశ్వర్ ప్రధాన్‌ని కలిశాడు. ప్రధాన్ ఎంతో ప్రేమతో ఓర్పుగా అతని ప్రశ్నలన్నింటికీ, అతను సంతృప్తి చెందేవరకు చాలా వివరంగా సమాధానమిచ్చాడు. అంతా విన్న ఫిరోజ్ ఆనందంతో కన్నీటిపర్యంతమయ్యాడు.  


రిఫరెన్స్: సాయిలీల, 1928 ఏప్రిల్(చైత్ర).

సోర్స్: బాబా'స్ ఋణానుబంధ్(రచన: విన్నీ చిట్లూరి)


రావ్‌బహాదుర్ దివాడ్కర్



  • రావ్‌బహాదుర్ దివాడ్కర్

ముంబాయిలోని దాదర్ నివాసి శంకర్రావు నెరూర్కర్ ఇలా చెప్తున్నారు: "నేను బాబాకు పూర్తిగా అంకితమైన కుటుంబంలో పెరిగిన చాలా అదృష్టవంతుడిని. 94 సంవత్సరాల వయసులో 2003లో మరణించిన మా నాన్నగారు బాబాకు పరమ భక్తుడు. అతనికి తెలిసిన ఒకేఒక దైవం బాబా. అతను తన రోజును బాబా ఆరాధనతో ప్రారంభించి రోజంతా బాబా నామాన్ని జపిస్తూ, శ్రీసాయి సచ్చరిత్ర చదువుతూ, మిగిలిన సమయమంతా కూడా బాబా గురించే సంభాషిస్తుండేవారు. ఆవిధంగా మా ఇల్లు ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయింది. నాకు పిల్లనిచ్చి పెళ్ళి చేసిన మా మావయ్య మనోహర్ దివాడ్కర్ కూడా బాబా భక్తుడు. అతను తనకి సుమారు 4 సంవత్సరాల వయస్సున్నప్పుడు బాబాను దర్శించారు. అతని తండ్రి రావ్‌బహాదుర్ దివాడ్కర్ కూడా బాబాకు అత్యంత భక్తుడు. అతను దయార్థహృదయాడు, పరోపకార స్వభావం గలవాడు, మృదువుగా మాట్లాడేవాడు. బాబానే అతని సద్గురువు, అతనికి వేరే గురువు, దైవం తెలియదు. అతని రోజు పెదవులపై బాబా పేరుతో ప్రారంభమై బాబాకు 'కృతజ్ఞతలు' తెలపడంతో ముగిసేది. 1910-1918 మధ్యకాలంలో అతను బాబాతో సన్నిహితంగా గడిపారు. ఆ కాలంలో అతను తరచుగా శిరిడీ వెళ్లి బాబాకు తాను చేయగలిగిన సేవను సంతోషంగా చేసుకుంటుండేవారు. అతను తన జీవితాన్ని బాబాకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా జీవించాడు.

ఒకసారి రావ్‌బహాదుర్ శిరిడీలో ఉన్నప్పుడు ఒక ఆసక్తికరమైన లీల జరిగింది. ఆ రోజుల్లో మసీదు పురాతనమైన శిథిలావస్థలో ఉన్న భవనం. మట్టి నేలపై ఆవు పేడతో అలికి ఉండేది. ఒకరోజు బాబా తమ సాధారణ స్థలంలో కట్టడా వద్ద కూర్చొని ఉండగా ఆయన పక్కన షామా, మహల్సాపతి, దీక్షిత్, నిమోన్కర్, డెంగ్లే వంటి ఇతర భక్తులు ఆయన ముందు కూర్చున్నారు. ఒక భక్తుడు బాబా పాదాలు ప్రేమతో మర్దన చేస్తుండగా మరో భక్తుడు ఆయన వీపు మర్దన చేస్తున్నాడు. ఆ సమయంలో రావ్‌బహాదుర్ మశీదుకు వెళ్లి, తన కొడుకు మనోహర్‌ని ఒడిలో పెట్టుకొని బాబాకి ఎదురుగా కూర్చున్నాడు. బాబా భక్తులతో కబుర్లు చెప్తుండగా షామా చిలుము సిద్ధం చేసి ఆయనకి ఇచ్చాడు. బాబా ఒకసారి పొగ పీల్చి చిలుము గొట్టాన్ని ఒక భక్తునికి అందించారు. అతను ఒకసారి పొగ పీల్చిన మీదట వినయంగా చిలుము గొట్టాన్ని తిరిగి బాబాకి ఇచ్చాడు. అప్పుడు బాబా ఇంకోసారి పొగ పీల్చి చుట్టూ ఉన్న భక్తులకు ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత బాబాకు తీవ్రంగా దగ్గు వచ్చింది. ఆయన కఫం తెగక దగ్గుతో ఇబ్బందిపడుతుంటే రావ్‌బహాదుర్ ఆందోళన చెందాడు. బాబా మాత్రం ఒక పక్క చిలుము పిలుస్తూ, అదే సమయంలో మరోపక్క దగ్గుతూ ఉన్నారు. ఇక రావ్‌బహాదుర్ తనని తాను నిగ్రహించుకోలేక చాలా భయపడుతూ, "బాబా! మీరు చాలా ఎక్కువగా పొగ తాగుతున్నారు. మీకు కడుపునొప్పి రావట్లేదా?" అని అడిగి, ఆపై తన మాటలకి బాబా కోప్పడతారని అనుకున్నాడు. కానీ బాబా నవ్వుతూ, "అరె! నువ్వు కూడా నా చిలుము తాగు. ఇదిగో ఈ చిలుము తీసుకుని పొగ పీల్చు" అని అన్నారు. మునుపెన్నడూ పొగ తాగిన అలవాటులేని రావ్‌బహాదుర్ సంకోచిస్తూనే, "బాబా! నేను ఇంతకు ముందెన్నడూ పొగ తాగలేదు. కాబట్టి నేను మీరు ఇచ్చే చిలుము తాగలేను" అని అన్నాడు. అయినప్పటికీ బాబా అతను ఎలాగైనా ఒకటి, రెండుసార్లు పొగ పీల్చాల్సిందేనని నిశ్చయించుకున్నందున బలవంతంగా చిలుము అతని చేతిలో పెట్టి, "కానివ్వు, ఒకటి, రెండుసార్లు చిలుము పీల్చి ఏమి జరుగుతుందో చూడు!" అని అన్నారు. ఇక అతనికి వేరే దారి లేకుండా పోయింది. గురు ఆజ్ఞను పాటించకపోతే ఘోర పాపానికి పూనుకున్నట్లే! కాబట్టి గురువు చెప్పినట్లు చేయాలని లేదంటే సంపాదించినా ఆధ్యాత్మిక సంపదనంతా కోల్పోతానని అతనికి తెలుసు. అందుచేత అతను బలవంతంగా చిలుము పెదవుల దగ్గర పెట్టుకొని ఒకసారి పొగ పీల్చాడు. తర్వాత మరోసారి కూడా పీల్చాడు. తర్వాత కూడా బాబా అతనిని ఇంకా ఇంకా పీల్చమని  ప్రోత్సహించారు. అతను ఆయన మాటకి తలొగ్గాడు. కొద్దిసేపటి తర్వాత అతను మరోసారి పొగ పీలిస్తే, ఆ చిలుము గొట్టం నుండి అమృతం స్రవించనారంభించింది. చిలుము గొట్టం గుండా కారుతున్న ఆ అమృతం చిక్కగా, మధురంగా, సువాసనభరితంగా ఉంది. దాని రుచి చూసిన రావ్‌బహాదుర్ పరమానందభరితుడయ్యాడు. బాబా అతని వైపు చూసి నవ్వారు. అమృతం ఇంకా స్రవిస్తూ ఉండడంతో దాన్ని బాబా ఆశీర్వాదంగా భావించి అతను తన కొడుకుకి కొద్దిగా పట్టి, ఆపై చుట్టూవున్న భక్తులందరికీ ఇచ్చాడు. అందరూ బాబా అమృతాన్ని స్వీకరించారు. బాబా పెదవులపై చిరునవ్వుతో ఆ దృశ్యాన్నంతా చూసి పైకి చూసి, "అల్లా మాలిక్. అల్లా మాలిక్" అన్నారు.


(రిఫ్: సాయి ప్రసాద్ మ్యాగజైన్; 2004; దత్తజయంతి సంచిక

సోర్స్: ఏ డివైన్ జర్నీ విత్ బాబా బై విన్నీ చిట్లూరి.)


సాయిభక్తుల అనుభవమాలిక 1862వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సదా వర్షించే సాయి కృపకు నిదర్శనం
2. పదేళ్లనాటి నొప్పిని పూటలో మాయం చేసిన బాబా

సదా వర్షించే సాయి కృపకు నిదర్శనం


సాయిభక్తులకు శతకోటి ప్రణామాలు. నా పేరు మణిమాల. నేను ఒక ఉపాధ్యాయురాలిని. సాయి పిలిస్తే పలుకుతాడు, అడగకుండానే ఇచ్చేస్తాడు. ఎన్ని జన్మల పుణ్యమో ఈ అదృష్టం నాకు దక్కింది. ఇక నా అనుభవం విషయానికి వస్తే, మావారి పుట్టినరోజు 2024, మే 10న వచ్చింది. నాటితో ఆయనకి 60వ సంవత్సరాలు. అందుచేత మా అమ్మాయిలు షష్టిపూర్తి వేడుక చేయాలనుకున్నారు. కానీ నా మనసెరిగిన  మావారు నాకు తెలియకుండానే మా కుటుంబం(నేను, నా భర్త, మా ఇద్దరమ్మాయిలు, అల్లుళ్ళు, ముగ్గురు మనవళ్లు, ఒక మనవరాలు) అందరికీ శిరిడీ వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేశారు. అది తెలిసి నా ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే, సాయి సన్నిధిలో ఉండటం కంటే ఫంక్షన్ గొప్పది కాదు. అయితే అనుకోకుండా నాకు ఎలక్షన్ డ్యూటీ పడింది. శిరిడీ వెళ్తామంటే నాకు వేసిన డ్యూటీ రద్దు చేయరు. అందుకని ఎలాగూ ఆరోగ్యం బాగుండట్లేదు కదా అని ఆఫీసర్లకి డాక్టర్ సర్టిఫికెట్లు చూపించాను. కానీ ఆఫీసర్లు వాటిని ఆమోదించలేదు, నా డ్యూటీ రద్దు కాలేదు. నేను పడిన వేదన అంతాఇంతా కాదు. ఎంత ప్రయత్నించినా వృధా అయిందని బాధపడ్డాను. ఇంకా బాబా మీదే భారమేసి ఏమైనా పర్వాలేదని ధైర్యంగా 9వ తేదీన ట్రైన్ ఎక్కాను. 10వ తేదీన బాబా సమక్షంలో నాకు కలిగిన అనుభూతి వర్ణించనలవికానిది. అప్పుడు నాకు కలిగిన గగూర్పాటు, ఆనందభాష్పాలు చూసిన అక్కడి సిబ్బంది 'రుక్ జా' అని నన్నోక్కదాన్నే చాలాసేపు ఉండనిచ్చారు. అది మరపురాని మధుర స్మృతి. మరునాటి ఉదయం సాయి పూర్తిగా కనిపించేలా ఆయన ముందర కూర్చుని కాకడ ఆరతి చూసాను. ఎలక్షన్ డ్యూటీ గురించి నా మదిలో ఆలోచనే లేదు. సాయిపై భారం వేస్తే ఆదుకోకుండా ఉంటారా? నేను శిరిడీ వచ్చేముందు ఎందుకైనా మంచిదని మా బ్రదర్(టీచర్)కి ఒక లెటర్ తోపాటు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చి వచ్చాను. అతను నేను శిరిడీలో ఉండగా ఫోన్ చేసి "మీ డ్యూటీ కాన్సల్ అయింది. హాయిగా దర్శనం చేసుకోండి" అని చెప్పాడు. నాకు చాలా ఆనందమేసింది. ఆఫీసరుకి కాల్ చేసి ధన్యవాదాలు చెప్పాను. ఎవ్వరికీ కాన్సల్ కానీ డ్యూటీ నాకు మాత్రమే కావడం సాయి దయకాక మరేమిటి? నాపై సదా సాయి కృప ఉందనడానికి ఇంకొక నిదర్శనం. నేను సప్తశృంగేరిదేవి దర్శనం కలిగించమని సాయితండ్రిని వేడుకున్నాను. మొదట ఆలోచించిన నా కుటుంబం చివరికి సరే అన్నారు. అది కూడా అద్భుత దర్శనం. హారతి ఇచ్చే సమయానికి మేము అమ్మవారి ముందు వున్నాము. మరువలేని దర్శనమని మా కుటుంబమంతా ఆనందపడ్డారు. సాయి దయతో ఆ మర్నాడు మూడుసార్లు సాయిని దర్శించుకొని తిరుగు ప్రయాణమై మా ఇల్లు చేరుకున్నాము. ఈ అనుభవం మీతో పంచుకుంటుంటే నా కళ్ళల్లో నీళ్లు కమ్ముకుంటున్నాయి. సాయి భక్తులకు ఏది శ్రేయస్కరమో అది తప్పక చేస్తారు. సదా సాయినామం, ధ్యానం ఇవే మనకు దారి  చూపుతాయి, రక్షణనిస్తాయి. "ధ్యన్యవాదాలు బాబా".



పదేళ్లనాటి నొప్పిని పూటలో మాయం చేసిన బాబా


సాయిభక్తులకు నమస్కారాలు. నా పేరు స్వాతి. బాబా నా జీవితంలో మర్చిపోలేని అద్భుతం చేశారు. దాదాపు 10 ఏళ్ల నుంచి నా కుడిభుజం నొప్పిగా ఉంటుంది. కుడి వైపు తిరిగి పడుకున్నా, పని ఎక్కువైనా భుజం చాలా నొప్పి పెట్టేది. డాక్టర్‌కి చూపిస్తే, "అంతా నార్మల్‌గా ఉంది" అని చెప్పారు. ఫిజియోథెరపీ చేయించుకుంటే, చేయించినన్నీ రోజులు బాగుండేదిగాని తరువాత మళ్ళీ అదే పరిస్థితి. చివరికి నేను విసుగు చెంది బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఫిజియోథెరపీకి అంతంత డబ్బులు ఖర్చు పెట్టలేను బాబా. ఇక మీదే భారం" అని చెప్పుకొని భుజానికి ఊదీ రాసుకొని పడుకున్నాను. మరుసటిరోజు నుంచి నా చేయి నొప్పి మాయమైపోయింది. నన్ను నేనే నమ్మలేకపోయాను. కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న నొప్పిని ఒక్క పూటలో తీసేసారు బాబా. పూర్వజన్మలో ఎంతో అదృష్టం ఉంటే కానీ, ఈ జన్మలో సాయి పాదాల చెంత మనం ఉండలేం. కనుక మనందరం ఈ అదృష్టాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ బాబాకి నచ్చిన పనులు చేస్తూ ఆయన సేవలో గడుపుతూ ఉండాలి. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు సదా మాపై ఇలాగే కురిపించండి బాబా".


ఓం శ్రీ సాయినాథాయ నమః.


సాయిభక్తుల అనుభవమాలిక 1861వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కరుణ
2. బాబా దయ
3. దయతో మర్నాటికి నొప్పి తగ్గించిన బాబా

బాబా కరుణ

నేను ఒక సాయి భక్తురాలిని. ప్రతిరోజు ఈ బ్లాగులో వచ్చే అనుభవాలు చదవడం వల్ల చాలా ధైర్యం, నమ్మకం కలుగుతున్నాయి. బాబా దయవల్ల 2023, ఆగస్టు 20న నా వివాహం జరిగింది. నాకు గుండె సమస్య ఉన్నందున నేను చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. నాకు ఎలాంటి భర్త వస్తాడో అనుకున్నాను. కానీ బాబా దయతో నన్ను అర్థం చేసుకునే వ్యక్తిని నాకు భాగస్వామిగా ఇచ్చారు. ఇప్పుడు నా జీవితం బాగుంది. పెళ్లయ్యాక నాలుగు నెలలకు ప్రెగ్నెన్సీ కోసంగా నేను ప్రతిరోజు ఊదీ నీళ్ళు రెండు నెలలపాటు తీసుకున్నాను. అలా చేయడం వల్ల బాబా దయతో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మేము చాలా సంతోషించాము. 500 రూపాయలు బాబా గుడిలో అన్నదానికి ఇచ్చాము. ఇకపోతే ప్రెగ్నెన్సీలో చాలా సమస్యలు వస్తుంటాయి. నాకు చాలా కడుపునొప్పి ఉంటుండేది. హాస్పిటల్‌కి వెళ్లి టెస్టులు, స్కానింగ్లు చేయించి కడుపునొప్పి తగ్గడానికి చాలా టాబ్లెట్లు వాడినా ఉపయోగం లేకుండా పోయింది. ఇంతలో నాకు ఐదవ నెల వచ్చింది. అప్పుడు ఇంకా నొప్పి తగ్గకపోతే ఇతర సమస్యలు వస్తాయని ఒక గురువారంనాడు నేను బాబాకి పూజచేసి, "వారం రోజుల్లో నొప్పి తగ్గితే, మరుసటిరోజు మీరు నాకు చేసిన మేలును బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. అంతే, చాలావరకు నొప్పి తగ్గింది. "ప్లీజ్ బాబా, మిగిలిన నొప్పిని కూడా తగ్గించి కాన్పు సక్రమంగా జరిగేలా చూడండి. నాకున్న గుండె సమస్య వల్ల చివరి వరకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసి బిడ్డ ఆరోగ్యంగా పుట్టేలా దీవించండి. త్వరలో మేము ఇల్లు కొనుక్కునేలా చూడండి. ఎల్లప్పుడూ నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి".

బాబా దయ

సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు అన్నపూర్ణ. ఒకరోజు మావారు హైదరాబాదు వెళ్లాలని కారులో బయలుదేరారు. సూర్యాపేట దగ్గరకు వెళ్లిన తర్వాత హఠాత్తుగా కారు ఆగిపోయింది. మా కారు కొత్తదే అయినప్పటికీ ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవ్వలేదు. మావారు నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. నేను, "ఇలా అయిందేమిటి సాయీ? తొందరగా ఆ సమస్యను పరిష్కరించు" అని బాబాకి మొరపెట్టుకున్నాను. బాబా దయవల్ల మెకానిక్ వచ్చి కారు స్టార్ట్ చేసి, "ఏమీ లేదు, బ్యాటరీ డౌన్ అయింది. మరేం పర్వాలేదు మీరు బయలుదేరండి" అని అన్నారు. అప్పుడు మావారు కారు స్టార్ట్ చేస్తే వెంటనే స్టార్ట్ అయింది. ఆయన క్షేమంగా వెళ్లొచ్చారు.


ఈమధ్య మా పాపవాళ్ళు యుఎస్‌లో ఇల్లు కొనుక్కున్నారు. అయితే మే నెల నుండి మూఢాలు ఉన్నందువల్ల వెంటనే పాలు పొంగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అది మా అమ్మాయికి నెలసరి వచ్చే సమయం. అందువల్ల తను, "ఇప్పుడెలా అమ్మా?" అని అంది. నేను, "బాబా చూస్తారులే" అన్నాను. మరుసటిరోజు తెల్లారి మా అమ్మాయి ఫోన్ చేసి, "నాకు నెలసరి వచ్చిందమ్మా" అని చెప్పింది. నేను బాబా ఉన్నారని చాలా సంతోషపడ్డాను. ఆయన ఏ సమస్యా లేకుండా వారం ముందే నెలసరి వచ్చేలా అనుగ్రహించారు. ఇలాంటి అనుభవమే ఒకసారి నేను చదివి, "ఇలాంటివి కూడానా" అని మనసులో అనుకున్నాను. నా వరకు వచ్చినప్పుడు తెలిసింది, "అది బాబా దయ" అని. ఇలా నా నిజ జీవితంలో బాబా ప్రతి క్షణం కాపాడుతూ ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".

దయతో మర్నాటికి నొప్పి తగ్గించిన బాబా


నా పేరు తేజశ్రీ. 2024, ఏప్రిల్ లేదా మేలో ఒకరోజు రాత్రి సంవత్సరంన్నర వయసున్న మా బాబుకి నోటిలో నొప్పి వచ్చి చాలా బాధపడ్డాడు. పాలు కూడా తాగలేకపోయాడు. రాత్రంతా ఏడుస్తూ పడుకోలేదు. నాకు చాలా భయమేసి, "బాబా! మీ దయవల్ల బాబుకి నొప్పి తగ్గిపోవాలి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయ చూపారు. మరుసటిరోజుకి నొప్పి తగ్గింది. "థాంక్యూ బాబా. మమ్మల్ని అన్ని వైపుల నుంచి కాపాడుతున్నందుకు థాంక్యూ వెరీ మచ్ బాబా. మేము మీకు సదా ఋణపడి ఉంటాము సాయీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1860వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా ఆశీస్సులు

నేను ఒక సాయి భక్తురాలిని. మేము యుఎస్‌లో ఉంటున్నాము. నేను చాలా సంవత్సరాలుగా భారతదేశం వెళ్ళలేదు. అందువల్ల నాకు ఇంటి మీద దిగులు ఉంది. అదీకాక వేసవి గురించి కొంచం భయపడ్డాను. ఎందుకంటే, నా స్నేహితులందరూ వేసవిలో భారతదేశానికి వెళ్లారు. కాబట్టి నేను ఒంటరినైపోతాను. పోనీ నేనూ భారతదేశం వెళదామంటే కొన్ని కారణాల వల్ల ఈ  సంవత్సరం వెళ్లలేని పరిస్థితి. అందుకు నేను చాలా బాధపడి నా దుఃఖాన్ని బాబా పాదాల వద్ద విన్నవించుకున్నాను. బాబా దయతో ఒకరోజు నా భర్త నాతో, "నువ్వెందుకు నీ తల్లిదండ్రులను ఇక్కడకు వచ్చి, నీతో కొంత సమయం గడపమని అడగకూడదు" అని అన్నారు. అది విని నేను చాలా సంతోషించాను. కానీ 'నాన్నకు వీసా లేదు, ఆయనెలా వస్తారు? ఆయన వృత్తిరీత్యా కూడా చాలా అనుమతులు పొందాలి. ఒకవేళ అమ్మ ఒక్కతే వస్తే, డయాబెటిక్ ఉన్న నాన్నని ఎవరు చూసుకుంటారు?' అని నా మదిలో ఆలోచనలు సాగాయి. చివరికి ఎలాగోలా కాస్త ధైర్యం తెచ్చుకొని మా అమ్మని యుఎస్ రావడం గురించి అడిగితే, అమ్మ సంతోషించింది కానీ, నాన్న గురించి ఆందోళన చెందింది. కాబట్టి మేమంతా ఏం చేయాలో ఆలోచించాము. మా అమ్మమ్మవాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ ఆమె వచ్చి నాన్నకు వండిపెట్టడానికి అంగీకరించదని తెలిసినందున చాలా ఆందోళన చెందాము. చివరికి ఎలాగో మా అమ్మ వాళ్ళని అడిగితే, అమ్మమ్మ రావడానికి ఒప్పుకుంది. అది మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతా బాబా అనుగ్రహం వల్లే జరిగింది. ఆయనే ఏదో ఒక అద్భుతం చేసి ఆమె మనసు మార్చారు. ఎందుకంటే, చాలా సందర్భాలలో మా అమ్మమ్మ, తత్తయ్యలు కాస్త మద్దతు ఇవ్వడానికి కూడా అంగీకరించలేదు. ఇది నిజంగా అద్భుతాలలోకెల్లా అద్భుతం. "చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి ఆ సమయంలో మా నాన్నను జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ బాబా".

ఇకపోతే, అమ్మ జూన్లో యుఎస్ రావడానికి టిక్కెట్లు బుక్ చేసాము. అమ్మ తను యుఎస్ వస్తే, పనిమనిషి ఉంటే నాన్న, అమ్మమ్మలకు ఇంటి పనులు చేయడంలో సహాయకారిగా ఉంటుందని పనిమనిషి కోసం వెతికింది. కానీ అదృష్టం లేకపోయింది. కొన్ని కారణాలు వల్ల అమ్మవాళ్ళు ఉండే ప్రాంతంలో పనిమనిషిని వెతకడం చాలా కష్టమని అందరూ చెప్పారు. అందువల్ల నేను బాబాను, "దయచేసి సహాయం చేయండి బాబా. నాన్న, అమ్మమ్మలకు సహాయం చేసే మనిషిని చూపించండి" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు నేను మా అమ్మకు ఫోన్ చేసిన సమయానికి ఒక పనిమనిషి వచ్చింది. వాళ్ళు ఆమెతో మాట్లాడుతున్నారు. "చాలా ధన్యవాదాలు బాబా. మీరు మాకు ఏ సహాయమైన చేస్తున్నారు. కోటి కోటి ప్రణామాలు బాబా".

ఇకపోతే, నాన్న యుఎస్ రావడానికి వీసా కోసం దరఖాస్తు చేస్తే, ఇంటర్వ్యూ స్లాట్ ఆగస్ట్‌లో బుక్ అయింది. దానికన్నా ముందు ఇంటర్వ్యూలో చూపించడానికి నాన్న NOC సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంది. కానీ నాన్న ఆరోగ్య శాఖలో పని చేస్తున్నందున సెలవు ఆమోదం పొందడం చాలా కష్టం. ఒక రోజు నేను బాబాని, "బాబా! మా నాన్నని యుఎస్కి తీసుకురావడం సాధ్యమేనా?" అని అడిగి క్వశ్చన్&ఆన్సర్ సైట్లో సమాధానం కోసం చూస్తే, "అతను ప్రయత్నిస్తే చాలు. అంతా బాగుంటుంది" అని వచ్చింది. అది చూసి నేను చాలా సంతోషించి మా అమ్మతో చెప్పాను. మర్నాడు మా నాన్న మీటింగ్‌కి వెళ్లి 2 నెలల సెలవు కోసం తనపై అధికారిని అడిగారు. ఆశ్చర్యకరంగా ఆ అధికారి సరేనన్నారు. "ఎంత అద్భుతమైన లీల బాబా. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. దయచేసి అమ్మానాన్న ఇక్కడ ఉండేలా చేయండి బాబా. నేను వాళ్ళకి ఇక్కడ అన్నీ చూపించి ఈ వయసులో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళకి నా సేవ చేసుకోనివ్వండి. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి బాబా".

ఒకసారి నా భర్త సంవత్సరానికి ఒకసారి చేయించుకొనే హెల్త్ చెకప్కి వెళ్లి బ్లడ్ టెస్టులు చేయించుకున్నారు. రిపోర్టులో ట్రైగ్లిజరైడ్స్(రక్తంలో ఫాట్) లెవల్ చాలా ఎక్కువగా ఉందని వచ్చింది. డాక్టర్ కూడా ఫోన్ చేసి కార్బోహైడ్రేట్లు తీసుకోవడం తగ్గించమని చెప్పారు. నాకు బాధ, భయం కలిగాయి. నాకు ఎప్పుడు బాధ కలిగినా నేను సాయిబాబా ప్రత్యక్ష దర్శనం చూస్తాను. అలాగే ఆరోజు కూడా చూస్తున్నప్పుడు నా మనసులో, "రానున్న 15 నిమిషాలలో పూజారి ఏ బిడ్డనైనా ఆశీర్వదించినట్లైతే నా భర్త గురించి చింతించాల్సిన అవసరం లేదు" అని ఆలోచన వచ్చింది. అయితే 14వ నిమిషం చివరివరకు పూజారి ఏ బిడ్డని ఆశీర్వదించలేదు. దాంతో నేను చాలా భయపడ్డాను,  ఆందోళన చెందాను. కానీ చివరి నిమిషంలో నిముషంలో పూజారి ఒక బిడ్డని అందుకొని, ఆ బిడ్డ తలపై తన చేయి ఉంచారు. అది చూసి నేను చాలా ఆశీర్వాదపూర్వకంగా భావించాను. నిజానికి ఆ బిడ్డ ముందుకు వెళ్లిపోవడం నేను చూసాను. కానీ ఎలాగో మళ్ళీ వెనక్కి వచ్చి పూజారి ఆశీర్వాదం తీసుకున్నాడు. అది నాకు చాలా ప్రత్యేకంగా, సంతోషంగా అనిపించింది. నా భర్తను బాబా చూసుకుంటారని భావిస్తున్నాను. "చాలా ధన్యవాదాలు బాబా, కోటి కోటి ప్రణామాలు బాబా".

సాయి స్మరణం సంకట హరణం|
బాబా శరణం భవభయ హరణం||

సాయిభక్తుల అనుభవమాలిక 1859వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

    • చివరి నిముషంలో గట్టెక్కించిన బాబా

నా పేరు రాంప్రసాద్. నేను హైదరాబాదులో నివాసం ఉంటున్నాను. నేను ప్రెషర్గా ఐటి ఉద్యోగంలో జాయినయ్యాను. ఆరు నెలలైనా నేను నేర్చుకున్న డొమైన్ ప్రాజెక్టు నాకు కేటాయించకుండా వేరే డొమైన్ ప్రాజెక్టులో నన్ను వేసి, ఆ డొమైన్ నేర్చుకోమని అన్నారు. సరేనని, నేను ఆ డొమైన్ నేర్చుకుంటూ ఉండగా హఠాత్తుగా 2024, జనవరి 19, శుక్రవారంనాడు నాకు రిఫరెన్స్ ఇచ్చినతను నాకు ఫోన్ చేసి నన్ను టాలెండ్(TALEND) అనే ఒక ETL టూల్ ప్రాజెక్టులో వేశానని చెప్పి, నాకు తెలియకుండానే క్లయింట్‌తో ప్రతిరోజూ సాయంత్రం 7 నుండి 8 గంటలకి కాల్ షెడ్యూల్ చేసారు. దానికి తోడు నన్ను క్లయింట్‌తో నాకు 1.5 సంవత్సరాల అనుభవముందని పరిచయం చేసుకోమన్నారు. దాంతో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, నాకు ఆ టూల్‌కి సంబంధించి అస్సలు నాలెడ్జ్ లేదు. పైగా ఫోన్లో నన్ను నేను పరిచయం చేసుకోగానే కేటీ(knowledge transfer) ఇవ్వడం మొదలుపెట్టింది ఆ క్లయింట్. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. పక్కనే ఉన్న ఆ డొమైన్‌లో సీనియర్స్‌కి కూడా అర్థం అవ్వలేదు. నేను భయంతో ఆ సమయమంతా బాబాని తలుచుకున్నాను. బాబా దయవల్ల ఎలాగో ఆ రోజుకి గండం గడిచింది. ఆ తర్వాత జనవరి 21, సోమవారం అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన జరిగిన రోజు కూడా బాబాని, రాముడిని తలుచుకుంటూ గట్టెక్కాను. ఇంకో నాలుగు రోజులు యాక్సిస్సులు రాలేదని క్లయింట్‌ని మేనేజ్ చేశాను. అయినప్పటికీ ఆ క్లయింట్ నాకు కొన్ని వర్క్స్ ఇచ్చేది. నేను అవి చేయలేక చాలా టెన్షన్ పడేవాడిని. ఆ క్లయింట్ కాల్ నడుస్తున్నంతసేపు నేను, "నాకు సహాయం చేయమ"ని బాబాని, రాముడిని తలుచుకుంటూ ఉండేవాడిని. ఇలా ఉండగా మా సీనియర్స్ నన్ను మా లీడ్‌తో మాట్లాడి, "నేను ఈ ప్రాజెక్టు చేయలేన"ని చెప్పమని, వాళ్లు కూడా మా లీడ్‌తో మాట్లాడారు. దాంతో సోమవారంనాడు నన్ను ఆ ప్రాజెక్ట్ నుండి తీసి వేరే ప్రాజెక్టులోని ఒక సీనియర్‌‌తో కలిపారు. ఆ ప్రాజెక్ట్‌లో నాతో కలిపి మొత్తం ముగ్గురం ఉండటం వల్ల నాకు కాస్త ఉపశమనంగా అనిపించింది. హమ్మయ్య బతికాననుకొని ఆ టూల్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. అయితే ఆ కొత్త ప్రాజెక్టు కేవలం ఒక నెలరోజులే ఉంటుంది. ఫిబ్రవరి 29కి డెంప్లోయిమెంట్‌కి వెళ్ళిపోవాలి. ఆ ప్రాజెక్టు మీటింగ్ ప్రతిరోజు మధ్యాహ్నం 12కి ఉండేది. ఒక పది రోజులయ్యాక క్లయింట్ మేము డెవలప్ చేసిన జాబ్స్‌కి యూనిట్ టెస్టింగ్, డాక్యుమెంటేషన్ ఫిబ్రవరి 15, గురువారం సాయంత్రంకల్లా సబ్మిట్ చేయాలని చెప్పింది. అయితే ఆ కొత్త ప్రాజెక్టులోని సీనియర్ ఆ వర్క్ ఎలా చేయాలో నాకు చెప్పలేదు. కేవలం యూనిట్ టెస్టింగ్ ఎలా చేయాలో నేర్పారు. అదీకాక యూనిట్ టెస్టింగ్, డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాల్సిన తేదికి మూడురోజుల ముందు నుండి అతను సెలువు తీసుకొని వెళ్లిపోయారు. ఇంకా నాకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే, క్లయింట్ కాల్ చేస్తే ఏం మాట్లాడాలో నాకు తెలీదు. ఆమె టెస్టింగ్ స్టేటస్ కూడా అడుగుతుంది. అందువల్ల నాకు చాలా భయంగా ఉండేది. ఏం చేయాలో తెలియకపోయినా మా సీనియర్ నేర్పిన టెస్టింగ్ ప్రాసెస్ చేస్తే, డెవలప్ చేసిన జాబ్స్‌లో కొన్ని విజయవంతంగా రన్ అయ్యాయి. కానీ కొన్ని అవ్వలేదు, కొన్ని ఎర్రర్స్ వచ్చి ఆగిపోయాయి. క్లయింట్‌ని డౌట్స్ అడుగుదామంటే ఏం అడగాలో నాకు అస్సలు తెలీదు. మా సీనియర్ కాకుండా ప్రాజెక్టులో ఉన్న ఇంకో అతను అస్సలు నాకు సపోర్ట్ చేసేవాడు కాదు. పైగా నాకు ఏమీ రాదని తెలిసి కూడా నన్నే క్లయింట్‌ని సంప్రదించమన్నాడు. దానికి తోడు క్లయింట్, "సుపీరియర్ కాల్ చేసే లోపు డాక్యుమెంటేషన్ స్టేటస్ తప్పనిసరి" అని చెప్పసాగింది. నేను చాలా టెన్షన్ పడ్డాను. రెండు రోజులు రాత్రి రెండు, మూడు గంటల వరకు మేల్కొని చాలా ప్రయత్నం చేశాను. ఇంకా గురువారం సబ్మిట్ చేయాలనగా ఆరోజు బాబా నాపై దయ చూపారు.

కొద్దిరోజులు ముందు ఒక ఇద్దరు సీనియర్లు కొత్తగా ఆఫీసులో జాయినయ్యారు. వాళ్ళు నా సమస్య చూసి తమకున్న అనుభవంతో పరిష్కారం చూపారు. దాంతో మూడు జాబ్స్ విజయవంతంగా రన్ అయ్యాయి. ఇంకా ఒకటి మిగిలింది. దానికి కొత్త సినారియో ఉండటం వల్ల అది ఎవరికీ అర్థం అవ్వలేదు. క్లయింట్‌ని అడుగుదామంటే, ఆమెకు అప్పటికే నా మీద అనుమానమొచ్చి నా ప్రాజెక్ట్‌లో ఉన్న అతనిని సంప్రదించి, 'నాకు ఎంత అనుభవం ఉందని, ఊరికే డౌట్స్ అడుగుతున్నారు' అని అడిగిందట. అయినప్పటికీ నేను చేయగలిగిందేమీలేక బాబా మీద భారమేసి నా సమస్యను క్లయింట్‌తో చెప్తే, తను ఒక ఫైల్ ఇచ్చి రన్ చేయమంది. అది రన్ చేస్తే మిగిలిన ఆ ఒక్క జాబ్ కూడా విజయవంతంగా రన్ అయింది. అలా మొత్తానికి బాబా దయతో సాయంత్రం 7 గంటలకల్లా జాబ్స్ అన్ని రన్ అయి, డాక్యుమెంటేషన్ కూడా పూర్తైంది.

నేను కాసేపు, "అరే.. అసలు అలా ఎలా జరిగింది? ఇంతసేపు ఏం చేయలేకపోయాము కదా! హఠాత్తుగా ఎలా పూర్తి చేయగలిగాను' అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక దృశ్యం కనపడింది. మా ఆఫీసులో నేను కూర్చొనే చోట దగ్గర ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ క్యాబిన్ ఉంది. నేను అలా అటు తల తిప్పి ఆ కేబిన్ వైపు చూసాను. ఆ క్యాబిన్ తలుపు తెరిచి ఉంది. అందులో బాబా కళ్ళు ఉన్న ఫోటో ఫ్రేమ్ ఉంది. అది నా కనపడింది. వెంటనే, 'బాబా నన్ను గమనిస్తున్నారని, ఆయన నా కష్టం, టెన్షన్ చూసి చివరి నిముషంలో సహాయం చేసి నన్ను ఆ క్లిష్ట పరిస్థితి నుండి గట్టించార'ని అనిపించింది. వాస్తవానికి నేను మొదటినుండి నా వల్ల ఎస్కలేషన్ వచ్చి ప్రాజెక్టు పోతుందని చాలా భయపడ్డాను. ఎందుకంటే, అది రియల్ టైం డేటా. ఏ చిన్న తేడా వచ్చినా కంపెనీపై చాలా ప్రభావం చూపుతుంది. ఎలాగో ముందుకు సాగినా ఆ నాలుగు జాబ్స్ రన్ అవ్వక అక్కడ ఆగిపోయి డాక్యుమెంటేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేయగలనని నేను అస్సలు అనుకోలేదు. చివరికి ఏం చేయాలో తెలియక చేతులెత్తేద్దామనుకున్న సమయంలో, గురువారం సాయంత్రం చివరి నిమిషంలో సాయిబాబా మిరాకిల్ చేయడంతో ఆ జాబ్స్ అన్ని రన్ అయి డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయగలిగాను. నేను ఆ యూనిట్ టెస్టింగ్ వర్క్ చేస్తున్నంతసేపూ, "నన్ను ఈ ప్రాజెక్టు నుండి రిలీవ్ చేసినా లేదా ఈ ప్రాజెక్టులో ఏ సమస్యా లేకుండా పని చేసి, నాకిచ్చిన టెస్టింగ్ నేను విజయవంతంగా పూర్తి చేసినా మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన్నని మనసులో బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల నేను ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నేను ఏ తప్పటడుగు వేయకుండా నన్ను కాపాడండి బాబా. నేను ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లి చేయండి బాబా. నా మనసులో ఉన్న బాధలన్నీ తీసేయండి. నాకు అండగా ఉండండి బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1858వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి మహావైద్యుడు

నా పేరు సాయీశ్వర్. నాకు ఊహ సరిగా తెలియక ముందు నుంచే నేను శ్రీ శిరిడీ సాయిబాబా భక్తుడిని, శిష్యుణ్ణి, బిడ్డని. ఏ జన్మబంధమో తెలియదు కానీ, నా చిన్ననాటి నుండి ఆయన ప్రేమలో నన్ను నిలుపుకున్నారు. నా చిన్ననాటి నుండి ఇప్పటివరకు నా జీవితం ఆయన లీలలతో, మహిమలతో నిండిపోయింది. అనుక్షణం ఆయన మార్గదర్శకత్వం నన్ను నడిపిస్తూ ఉంది. నేనిప్పుడు ఈ మధ్యకాలంలో నా జీవితంలో సాయినాథుడు చేసిన ఒక పెద్ద లీలను మీతో పంచుకుంటున్నాను. 2024, ఏప్రిల్లో నాకు బ్యాక్ పెయిన్ వస్తే, ఒకసారి చూపించుకుందామని హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించమంటే, చేయించుకొని రిపోర్టు తీసుకొని మళ్ళీ డాక్టర్ వద్దకి వెళ్ళాను. అప్పుడొక ఊహించని విషయం బయటపడింది. డాక్టరు, "మీ గాల్ బ్లాడర్(పిత్తాశయం)లో 9mm గడ్డ(పాలిప్) ఉంది. సర్జరీ చేసి గాల్ బ్లాడర్ తొలగించాల"ని చెప్పారు. ఇంకా 'గాల్‌బ్లాడర్‌లో ఏర్పడే రాళ్లకి, కణతలకి మందులతో చికిత్స ఉండదని, సర్జరీనే మార్గమని' తెలియజేశారు. నేను నిర్ఘాంతపోయి వేరే డాక్టర్ దగ్గరకి వెళ్లాను. ఆ డాక్టరు కూడా అదే చెప్పి, "సర్జరీ చేస్తేనే మంచిది. లేకపోతే ఆ గడ్డ పరిమాణం నిదానంగా పెరిగి పగిలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, గడ్డని అలాగే వదిలేస్తే క్యాన్సర్‌గా పరిణమించే అవకాశాలు కూడా ఉన్నాయ"ని చెప్పారు. నేను ఇంటికి వచ్చి అనుకోని సమస్య తలెత్తిందని చాలా బాధపడ్డాను. బాబా దగ్గరికి వెళ్లి, "ఏమిటి బాబా ఇది? పెద్దపెద్ద పాపాలు చేసినవాళ్ళు కూడా ఈ కలియుగంలో ఆయురారోగ్యాలతో జీవిస్తున్నారే! నాకు తెలిసి నేను ఈ జన్మలో ఎవరినీ ఇబ్బందిపెట్టలేదే! అంత పాపకార్యాలు కూడా ఏమీ చేయలేదు. గత జన్మలో ఏమి చేశానో నాకు తెలియదు. కనీసం మందులకి కూడా నయమవదంటున్నారే! ఏకంగా పిత్తాశయం తీసేయాలంటున్నారు. భగవంతుడు మానవదేహంలో ఏ అవయవమూ ఊరకనే పెట్టలేదు కదా! ఆ అవయవం తొలగిస్తే తరువాత వచ్చే సమస్యలను జీవితాంతం ఎదుర్కోవాలి కదా! నాకేమిటి బాబా చిన్న వయసులో ఈ సమస్య?" అని దీనంగా నా ప్రియతమ గురుదేవుడైన సాయికి, నా ఆరాధ్య దైవాలైనా శివశక్తులకు, నా ఇంటి దైవమైన ఆంజనేయస్వామికి చెప్పుకున్నాను. ఇంకా, "మీరే ఈసారి ఏదో పెద్ద మహిమ చేయాలి బాబా. ఆ గడ్డ మాయం చేసేయడం తప్ప వేరే ఏ ప్రత్యామ్నాయం లేదు" అని బాబాని వేడుకున్నాను. నాకు సాయినాథుడు ఏదో పెద్ద మహిమ చేస్తారని 30% నమ్మకమున్నప్పటికీ నాకొచ్చిన సమస్యకి మందులతో చికిత్స లేకపోవడం వల్ల 70 శాతం అసాధ్యం అనిపించింది. మా అమ్మకి మాత్రం సాయినాథుడు ఏదో మహిమ చేస్తారని 100% నమ్మకం ఉండింది. కారణం అదివరకే ఇంతకంటే పెద్ద అనారోగ్య సమస్యతో చివరి దశ వరకు వెళ్లిన నన్ను ఆ సాయీశ్వరుడు విచిత్రంగా బయటపడేసారు(ఆ అనుభవాన్ని మరోసారి పంచుకుంటాను). అందువల్ల మునపటిలాగే నన్ను సమస్య నుండి సాయినాథుడు బయటపడేస్తారని మా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. నేను కూడా మొదట కాస్త బాధకి గురైన నా మనసుని సాయీశ్వరుడు ప్రసాదించిన ఆధ్యాత్మిక జ్ఞానంతో దృడం చేసుకోసాగాను. ఆ సమయంలో ఫేస్బుక్లో పదేపదే "నా చరిత్ర పారాయణం చేస్తూ ఊదీ రాస్తూ ఉండు. నీ రోగం నయం అవుతుంది", "నేను ఉండగా నీకు భయమేలా? నీ అనారోగ్యం నయం అవుతుంది" అని రకరకాలుగా బాబా నాకు అభయ ప్రదానం చేస్తూ వచ్చారు. మరో వైపు మా అమ్మకి, "నా బిడ్డలని రకరకాల మిషలతో శిరిడీ రప్పించుకుంటాను", "మీరు శిరిడీ రావడానికి అన్ని ఏర్పాట్లు చేసాన"ని సందేశాలు వస్తుండేవి. దాంతో అమ్మ బాబాతో, "మా అబ్బాయికి నయమైపోతే శిరిడీ వస్తామ"ని చెప్పుకుంది. నేను ప్రతిరోజూ సాయిలీలామృతం కొంచెం కొంచెం చదువుతూ శిరిడీ ఊదీ చేతిలో పట్టుకుని సాయి నామం, మృత్యుంజయ మంత్రం స్మరించి సాయిని ధ్యానించి కొద్దిగా నుదుటన పెట్టుకొని, కొద్దిగా గాల్ బ్లాడర్ వద్ద రాసుకొని, మరికొంత ఊదీ గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగుతూ ఉండేవాడిని. అలా పదిరోజులు చేసిన తరువాత మా ఊరికి కాస్త సమీపంలో ఉన్న మెడికల్ కాలేజీతో కూడుకున్న ఒక పెద్ద హాస్పటల్లో లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారనే సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్దామని నిర్ణయించుకున్నాము. నా మనసులో బాబా ఏదో పెద్ద మహిమ చేయబోతున్నారన్న ఆలోచన ఉండబట్టి హాస్పటల్‌కి వెళ్లేముందు మా ఇంట్లో ఉన్న పెద్ద బాబా పటం వద్దకి వెళ్లి, "బాబా! హాస్పిటల్లో టెస్టులు చేయవచ్చు. వాటిలో ఆ గడ్డ మాయం చేసేయ్ బాబా. రిపోర్టులో అంతా బాగానే వచ్చేటట్లు అనుగ్రహించు తండ్రీ. లేదు నాకు ఆపరేషన్ జరగడమే మంచిదని నీవు తలస్తే అలాగే జరగనివ్వు" అని బాబాను వేడుకున్నాను. తర్వాత పార్వతీపరమేశ్వరులకి, ఆంజనేయస్వామికి కూడా నమస్కారం చేసుకుని బస్సులో హాస్పటల్‌కి బయలుదేరాను.


నేను ఈ మధ్యకాలంలో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ని అనుసరిస్తున్నాను. అందులో చాలామంది అనుభవాలు చదివినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించేది. కొన్ని కొన్ని అనుభవాలలో 'బాబా కనపడని వస్తువు కనపడితే' లేదా మరీ చిన్నచిన్న వాటికి కూడా 'అలా జరిగితే బ్లాగులో అనుభవం పంచుకుంటాన'ని బాబాకి మ్రొక్కే మొక్కులు చూసి, 'ఎందుకు చిన్నచిన్న విషయాలకు కూడా బాబాని ఇబ్బందిపెడుతున్నారు? మనకి బాబా చేసే ఉపకారం బ్లాగ్ ద్వారా పదిమందికి పంచుకుని ఆయన కీర్తిప్రతిష్టలను, శక్తిసామర్థ్యాలను, ఘనతను నలుదిక్కుల చాటి కష్టాలలో కృంగిపోతున్న సాయి భక్తుల హృదయాలలో బాబా మమ్మల్ని కాపాడి తీరుతారనే ఆశాజ్యోతిని ప్రతిష్టించాలని, వారిలో ధైర్యం నింపాలనే సద్భావన ప్రతి సాయి భక్తునికి ఉండాలి కానీ, కేవలం వ్యాపార ధోరణితో అది, ఇది జరిగితే నీ గురించి బ్లాగులో చెప్పుకుంటానని భావించడం నిజమైన సాయి భక్తుని లక్షణం కాదని, సాయిని తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా తలచి ప్రేమబంధాన్ని పెనవేసుకొని తమని శరణుజొచ్చిన వారిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించడం, ప్రాపంచికంగా కష్టాలలో నష్టాలలో వెంట నిలబడడం తండ్రిగా సాయి కర్తవ్యం అవుతుంది గాని, కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం సాయిని ఒక యంత్రంలా వాడుకోవడం సరి అయిన పద్ధతి కాదని' నాకు అనిపిస్తుండేది. ఇది నా అభిప్రాయం. ఎవరినైనా బాధిస్తే నన్ను క్షమించండి.


ఇక విషయానికి వస్తే..  నేను బస్సులో ప్రయాణిస్తూ ధ్యానంలో బాబాని, "గడ్డ మాయం చేయమ"ని ఇంకా, "బాబా! ఈ గడ్డను మాయం చేస్తావని నాకనిపిస్తుంది. ఒకవేళ నిజంగా మాయం చేస్తే, ఇది చాలా గొప్ప మహిమ. అదే జరిగితే, కేవలం ఈ మహిమనే కాదు, నా జీవితంలో ఇప్పటివరకు మీరు చేసిన గొప్ప మహిమలన్నీ మీ బ్లాగులో పంచుకుంటాను. అనారోగ్యం తగ్గిస్తే, పంచుకుంటానని బేరాలు ఆడడం కాదు. ఇంతటి గొప్ప మహిమలను పంచుకోవడం ద్వారా సాయి భక్తులందరికీ ఊరట కలుగుతుంది. మీ ఘనతను నలుదిశలా విస్తరింపజేసి చిన్న సేవ చేసుకునే భాగ్యం నాకు లభిస్తుంది" అని బాబాకి విన్నవించుకున్నాను. హాస్పటల్కి చేరుకున్న తర్వాత డాక్టర్లు నా రిపోర్టు చూసి సర్జరీ చేయడానికి ముందు మరోసారి స్కాన్ చేయాలని స్కానింగ్ రాశారు. సరేనని స్కాన్ చేయించుకుంటే స్కాన్ చేసే డాక్టర్కి ఏమీ అర్థం కాలేదు. కారణం మునపటి రిపోర్టులో స్పష్టంగా కనపడుతున్న గడ్డ అప్పుడు కనపడలేదు. దాంతో ఆ డాక్టరు, "ఇదేంటి?" అని వెళ్లి ఇంకో డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆ డాక్టరు కూడా గడ్డ కనపడలేదన్నారు. తర్వాత వాళ్లిద్దరూ వెళ్లి ఇంకో పెద్ద డాక్టర్ని తీసుకొచ్చారు. ఆ డాక్టరుకి కూడా గడ్డ కనపడలేదు. దాంతో, "ఏ హాస్పిటల్లో స్కాన్ చేయించుకున్నార"ని నన్ను ప్రశ్నించి, వాళ్లలో వాళ్ళు, "గడ్డ ఏమీ కనపడట్లేదు. మరీ వాళ్ళు 9 mm గడ్డ ఉందని ఎలా వ్రాస్తార"ని చర్చించుకున్నారు. కొద్దిసేపట్లో ఆ ముగ్గురి నేతృత్వంలో స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. అది తీసుకొని వెళ్ళి ప్రధాన డాక్టర్ని కలిసాము. ఆ డాక్టరు, "గడ్డ ఏమీ లేదుగాని గాల్‌బ్లాడర్ మాత్రం కొద్దిగా వాచింది. అది దానంతటదే తగ్గిపోతుంద"ని చెప్పారు. నేను, "సర్జరీ అవసరం లేదా?" అని అడిగితే డాక్టరు, "అసలు గడ్డే లేకపోతే సర్జరీ అవసరం ఏముంది? మీకు ఇంకా స్పష్టంగా తెలియాలంటే ఖాళీ కడుపుతో స్కాన్ చేయించుకోవాలి" అని అన్నారు. నేను, "ఖాళీ కడుపుతోనే ఉన్నాన"ని చెప్పాను. డాక్టరు, "అయితే గడ్డ లేనట్లే. మీకు ఇంకా అనుమానం ఉన్నట్లయితే పెద్ద(MRI) స్కాన్ చేయించుకొండి. కానీ అది అవసరం లేద"ని చెప్పారు. నా జీవితంలో బాబా చేసిన అతి పెద్ద లీలకి మేము మరోసారి ఆనందాశ్చర్యాలకు గురయ్యాము. బాబాపై ప్రేమ ఉప్పొంగగా ఆనందాశ్రువులు నా కళ్ళనుండి ప్రవహించాయి. పెద్ద గండం నుంచి సాయి, ఈశ్వరులు మమ్మల్ని బయటకు లాగారని ఆనందంగా ఇంటికి వచ్చాము. తర్వాత ఆలోచిస్తే, ముందు స్కాన్ చేసే రేడియాలజిస్ట్ పొరపడ్డారని తలవడానికి కూడా లేకుండా కొత్త రిపోర్టులో గాల్‌బ్లాడర్కి కొద్దిగా వాపు ఉందని, అది లేకుంటే డాక్టరు పొరబడ్డారని తలచేవాడినని, అందుకే బాబా ఆ వాపు ఉంచారనిపించి అంతా బాబా మహిమ అనుకున్నాను. అయితే సాయంత్రం మళ్ళీ నా కోతి మనసు భయానికి గురై డాక్టర్లు ఏమైనా పొరబడి గడ్డ లేదన్నారేమోననిపించింది. అప్పుడు మా అమ్మ, "ఈ రెండు రిపోర్టులు తీసుకొని వెళ్లి రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదించు. వాళ్ళు మంచి అనుభవం ఉన్నవారు కదా!" అంది. నేను సరేనని, మరుసటిరోజు గవర్నమెంట్ డాక్టర్ని కలిస్తే, "పెద్ద స్కాన్ తీయించమ"ని సూచించారు. దాంతో MRI స్కాన్ చేయించుకున్నాను. ఆ రిపోర్టు చూసిన డాక్టరు, "గడ్డ లేదు. నిన్నటి రిపోర్టులో ఉన్న వాపు కూడా లేదు. అంతా నార్మల్‌గా ఉంది. నీకు ఏ సమస్యా లేదు. ఇక ఏ హాస్పటల్కి వెళ్ళనవసరం లేద"ని అని అన్నారు. సాయినాథుని ఋణం ఏమిచ్చినా, ఏమి చేసినా తీర్చుకోలేము. ఆ గడ్డని కేవలం ఆయన అనుగ్రహంతో ఎటువంటి మందులు వాడకుండానే మాయం చేసారు. సాయిలాంటి గొప్ప గురువు, పిలిస్తే పలికే దైవం లేరని ఎప్పుడూ బలంగా అనిపిస్తుంటుంది. సాయినాథుడు, ఆ పరమేశ్వరుడు తోడుంటే విశ్వమంతా ఎదురు తిరిగినా ఒంటి చేతితో పోరాడవచ్చు అనే భావన నిరంతరం నాలో కలుగుతుంటుంది. ఆ పరమేశ్వరుని కలియుగ గురుస్వరూపమైన శ్రీసాయికి ధన్యవాదాలు.


 అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo