- జీవితంలో వెలుగులు నింపిన శిరిడీ సాయినాథుడు
సాయి వచనం:-
|
|
సాయిభక్తుల అనుభవమాలిక 1864వ భాగం....
సాయిభక్తుల అనుభవమాలిక 1863వ భాగం....
1. బాబా అనుగ్రహముంటే కానిదేముంది?
2. సాయి కరుణ
సాయి కరుణ
కెప్టెన్ జహంగీర్ ఎఫ్.దారువాలా & ఫిరోజ్షా హోర్మాజ్జీ పుడుమ్జీ
కెప్టెన్ జహంగీర్ ఎఫ్.దారువాలా
మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో కెప్టెన్ జహంగీర్ ఎఫ్.దారువాలా తన నౌకాదళంతో నడిసముద్రంలో ఉండగా తన మూడు నౌకలు తప్ప మిగతా నౌకలన్నిటిపై శత్రువులు దాడి చేసారు. ఆ నౌకలు త్వరితగతిన నీట మునిగిపోవడం చూసిన అతను తొందరలోనే తనకు, తన మూడు నౌకలలోని ఉన్న ప్రయాణికులకు అదేగతి పట్టనున్నదని గ్రహించి పూర్తిగా నిరాశకు గురయ్యాడు. అయినప్పటికీ అతను ఒక మంచి కెప్టెన్గా తన నౌకలను అక్కడినుండి సురక్షితంగా తీసుకెళ్లాలని ఆశపడ్డాడు. వెంటనే అతను తన జేబులో ఉన్న బాబా ఫోటో బయటకి తీసి తమని కాపాడమని ఆర్తిగా వేడుకున్నాడు. అదే సమయంలో ద్వారకామాయిలో కూర్చొని ఉన్న బాబా 'హాక్ హాక్' అని కేకలేశారు. ఆయన తల నుంచి పాదాల వరకు పూర్తిగా తడిసిపోయారు. వరద ప్రవాహంతో ద్వారకామాయి నీటి మడుగైంది. అది చూసి అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్యపోయారు. వాళ్లలో ఒక భక్తుడు ఆ నీటిని తీర్థంగా సేవించి అవి చాలా ఉప్పగా ఉండటంతో విస్మితుడై మౌనంగా ఉండిపోయాడు. దాదాపు ఒక గంటపాటు భక్తులు బకెట్లతో నీటిని బయట పారబోశాక ధరించడానికి బాబాకు పొడి బట్టలు ఇచ్చారు. బాబా తాము అలా తడిసిపోవడానికి కారణమేమిటో చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. ఇక్కడ ఇదంతా జరిగిన సమయంలోనే అక్కడ జహింగీర్ నడి సమద్రంలో బాబాను ప్రత్యేక్షంగా చూసాడు. ఆయన అతని ఓడలను లాగి సురక్షితమైన చోటుకు చేర్చారు. ఇది జరిగిన మూడవ రోజున తమని కాపాడినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జహంగీర్ వద్ద నుండి బాబాకి టెలిగ్రామ్ వచ్చింది. తర్వాత అతను అక్కడినుండి వచ్చిన వెంటనే శిరిడీ వచ్చి బాబా పాదాలపై వాలిపోయి తన ప్రార్థనను మన్నించి తక్షణమే తన సిబ్బందిని, ప్రయాణికులను కాపాడినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అతను గొప్ప భక్తుడు. బాబాకు సంబంధించిన విషయాలపట్ల ఆసక్తి కనబరచి సభా మండపం మరమ్మత్తులకు కృతజ్ఞతాపూర్వకంగా రెండు విడతలలో 2,220 రూపాయలు విరాళంగా ఇచ్చాడు.
ఫిరోజ్షా హోర్మాజ్జీ పుడుమ్జీ
1917వ సంవత్సరంలో ఫిరోజ్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు అతని తల్లిదండ్రులు శిరిడీ వెళ్లి బాబాను దర్శించారు. వాళ్ళు శిరిడీ నుండి తిరిగి ప్రయాణమయ్యేటప్పుడు బాబా ఫోటో ఒకటి, వారి ప్రసాదంగా తీసుకున్నారు. వాళ్ళు తమ ఇల్లు చేరుకొన్న తర్వాత బాబా ఫోటోని డైనింగ్ టేబుల్ మీద పెట్టి కుటుంబసభ్యులతో అత్యంత ఉత్సాహంతో బాబా దివ్యత్వం గురించి ఎంతో గొప్పగా వర్ణించి చెప్పారు. అదంతా విన్న ఫిరోజ్ ఆశ్చర్యపోతూ, “వీళ్ళు ఈ బాబాలు, సాధువుల వెంట పరుగెత్తుతున్నారు. ఈ సాయిబాబా వీళ్ళకి ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేస్తాడా?" అని అనుకున్నాడు. అంతేకాదు, "బాబా దైవమైతే, అందుకు తగిన సంకేతం ఆయన నాకు ఇస్తారు" అని బాబాకు ఒక పరీక్ష పెట్టి అదే ఆలోచనతో నిద్రలోకి జారుకున్నాడు. ఆ రాత్రి బాబా అతనికి స్వప్నదర్శనమిచ్చి, "నా దైవత్వానికి సంబంధించి నేను నిజంగా దైవమా, కాదా అని నీకు ఋజువు కావాలా? మీ నాన్న నా ఫోటో టేబుల్పై ఉంచాడు. నువ్వు ఉదయం నిద్ర లేవగానే ఆ ఫోటోను పైకెత్తడానికి ప్రయత్నించు. నువ్వు దాన్ని పైకెత్తగలిగినట్లైతే నేను నకిలీ, నువ్వు ఆ ఫోటోను పైకెత్తలేకపోయినట్లైతే నేను ఖచ్చితంగా నిజమని తెలుసుకో" అని అన్నారు. మరుక్షణం అతనికి మెలుకువ వచ్చి తెల్లారేవరకు వేచి ఉండలేకపోయాడు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసి ఉదయాన్నే డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్లి బాబా ఫోటో పైకెత్తడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఫోటో చాలా బరువుగా ఉంది. అతను ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే, అది అంత బరువు పెరిగిపోసాగింది. చివరికి నేల మీద నుండి టేబుల్ పైకి లేచింది, కానీ ఫోటో కదలలేదు. దాంతో అతను బాబా నిజంగా దైవమని గ్రహించాడు.
తరువాత కొంతకాలానికి అతను తన తండ్రి మిల్లులో పనిచేయడం ప్రారంభించాడు. అందుకు అతను జీతం ఏమీ తీసుకునేవాడు కాదు. కొంతకాలం తర్వాత ఒకరోజు అతనికి బాబా కలలో కనిపించి, “నువ్వు ఇంతకాలంగా మీ నాన్న మిల్లులో పనిచేస్తున్నావు. నీకు జీతం అందాలి" అని అన్నారు. మరుసటిరోజు అతని మామయ్య అతనిని, "నువ్వు చేస్తున్న పనులన్నింటికీ జీతం ఇస్తున్నారా?" అని అడిగాడు. అందుకతను చెప్పిన ప్రతికూలమైన సమాధానం విన్న అతని మామయ్య నెలకు రెండు వందల రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టాడు.
ఫిరోజ్ బాబాను ప్రత్యేక్షంగా దర్శించలేదు కానీ, ఆయనపట్ల అంకితభావంతో ఉండేవాడు. అతను శిరిడీ ఎలా ఉండేదో అని అబ్బురపడుతుండేవాడు. అలా ఉండగా ఒకరోజు అతను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు శాంతాక్రజ్లోని సాయిబాబా లైన్ మీదగా వెళ్ళాడు. అప్పుడతనికి తనకి అక్కడ సమాధానం దొరుకుతుందనిపించి ఆ లైన్లో ఉన్న బాబాకు అత్యంత సన్నిహిత భక్తుడైన మోరేశ్వర్ ప్రధాన్ని కలిశాడు. ప్రధాన్ ఎంతో ప్రేమతో ఓర్పుగా అతని ప్రశ్నలన్నింటికీ, అతను సంతృప్తి చెందేవరకు చాలా వివరంగా సమాధానమిచ్చాడు. అంతా విన్న ఫిరోజ్ ఆనందంతో కన్నీటిపర్యంతమయ్యాడు.
రిఫరెన్స్: సాయిలీల, 1928 ఏప్రిల్(చైత్ర).
సోర్స్: బాబా'స్ ఋణానుబంధ్(రచన: విన్నీ చిట్లూరి)
రావ్బహాదుర్ దివాడ్కర్
- రావ్బహాదుర్ దివాడ్కర్
ముంబాయిలోని దాదర్ నివాసి శంకర్రావు నెరూర్కర్ ఇలా చెప్తున్నారు: "నేను బాబాకు పూర్తిగా అంకితమైన కుటుంబంలో పెరిగిన చాలా అదృష్టవంతుడిని. 94 సంవత్సరాల వయసులో 2003లో మరణించిన మా నాన్నగారు బాబాకు పరమ భక్తుడు. అతనికి తెలిసిన ఒకేఒక దైవం బాబా. అతను తన రోజును బాబా ఆరాధనతో ప్రారంభించి రోజంతా బాబా నామాన్ని జపిస్తూ, శ్రీసాయి సచ్చరిత్ర చదువుతూ, మిగిలిన సమయమంతా కూడా బాబా గురించే సంభాషిస్తుండేవారు. ఆవిధంగా మా ఇల్లు ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయింది. నాకు పిల్లనిచ్చి పెళ్ళి చేసిన మా మావయ్య మనోహర్ దివాడ్కర్ కూడా బాబా భక్తుడు. అతను తనకి సుమారు 4 సంవత్సరాల వయస్సున్నప్పుడు బాబాను దర్శించారు. అతని తండ్రి రావ్బహాదుర్ దివాడ్కర్ కూడా బాబాకు అత్యంత భక్తుడు. అతను దయార్థహృదయాడు, పరోపకార స్వభావం గలవాడు, మృదువుగా మాట్లాడేవాడు. బాబానే అతని సద్గురువు, అతనికి వేరే గురువు, దైవం తెలియదు. అతని రోజు పెదవులపై బాబా పేరుతో ప్రారంభమై బాబాకు 'కృతజ్ఞతలు' తెలపడంతో ముగిసేది. 1910-1918 మధ్యకాలంలో అతను బాబాతో సన్నిహితంగా గడిపారు. ఆ కాలంలో అతను తరచుగా శిరిడీ వెళ్లి బాబాకు తాను చేయగలిగిన సేవను సంతోషంగా చేసుకుంటుండేవారు. అతను తన జీవితాన్ని బాబాకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా జీవించాడు.
ఒకసారి రావ్బహాదుర్ శిరిడీలో ఉన్నప్పుడు ఒక ఆసక్తికరమైన లీల జరిగింది. ఆ రోజుల్లో మసీదు పురాతనమైన శిథిలావస్థలో ఉన్న భవనం. మట్టి నేలపై ఆవు పేడతో అలికి ఉండేది. ఒకరోజు బాబా తమ సాధారణ స్థలంలో కట్టడా వద్ద కూర్చొని ఉండగా ఆయన పక్కన షామా, మహల్సాపతి, దీక్షిత్, నిమోన్కర్, డెంగ్లే వంటి ఇతర భక్తులు ఆయన ముందు కూర్చున్నారు. ఒక భక్తుడు బాబా పాదాలు ప్రేమతో మర్దన చేస్తుండగా మరో భక్తుడు ఆయన వీపు మర్దన చేస్తున్నాడు. ఆ సమయంలో రావ్బహాదుర్ మశీదుకు వెళ్లి, తన కొడుకు మనోహర్ని ఒడిలో పెట్టుకొని బాబాకి ఎదురుగా కూర్చున్నాడు. బాబా భక్తులతో కబుర్లు చెప్తుండగా షామా చిలుము సిద్ధం చేసి ఆయనకి ఇచ్చాడు. బాబా ఒకసారి పొగ పీల్చి చిలుము గొట్టాన్ని ఒక భక్తునికి అందించారు. అతను ఒకసారి పొగ పీల్చిన మీదట వినయంగా చిలుము గొట్టాన్ని తిరిగి బాబాకి ఇచ్చాడు. అప్పుడు బాబా ఇంకోసారి పొగ పీల్చి చుట్టూ ఉన్న భక్తులకు ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత బాబాకు తీవ్రంగా దగ్గు వచ్చింది. ఆయన కఫం తెగక దగ్గుతో ఇబ్బందిపడుతుంటే రావ్బహాదుర్ ఆందోళన చెందాడు. బాబా మాత్రం ఒక పక్క చిలుము పిలుస్తూ, అదే సమయంలో మరోపక్క దగ్గుతూ ఉన్నారు. ఇక రావ్బహాదుర్ తనని తాను నిగ్రహించుకోలేక చాలా భయపడుతూ, "బాబా! మీరు చాలా ఎక్కువగా పొగ తాగుతున్నారు. మీకు కడుపునొప్పి రావట్లేదా?" అని అడిగి, ఆపై తన మాటలకి బాబా కోప్పడతారని అనుకున్నాడు. కానీ బాబా నవ్వుతూ, "అరె! నువ్వు కూడా నా చిలుము తాగు. ఇదిగో ఈ చిలుము తీసుకుని పొగ పీల్చు" అని అన్నారు. మునుపెన్నడూ పొగ తాగిన అలవాటులేని రావ్బహాదుర్ సంకోచిస్తూనే, "బాబా! నేను ఇంతకు ముందెన్నడూ పొగ తాగలేదు. కాబట్టి నేను మీరు ఇచ్చే చిలుము తాగలేను" అని అన్నాడు. అయినప్పటికీ బాబా అతను ఎలాగైనా ఒకటి, రెండుసార్లు పొగ పీల్చాల్సిందేనని నిశ్చయించుకున్నందున బలవంతంగా చిలుము అతని చేతిలో పెట్టి, "కానివ్వు, ఒకటి, రెండుసార్లు చిలుము పీల్చి ఏమి జరుగుతుందో చూడు!" అని అన్నారు. ఇక అతనికి వేరే దారి లేకుండా పోయింది. గురు ఆజ్ఞను పాటించకపోతే ఘోర పాపానికి పూనుకున్నట్లే! కాబట్టి గురువు చెప్పినట్లు చేయాలని లేదంటే సంపాదించినా ఆధ్యాత్మిక సంపదనంతా కోల్పోతానని అతనికి తెలుసు. అందుచేత అతను బలవంతంగా చిలుము పెదవుల దగ్గర పెట్టుకొని ఒకసారి పొగ పీల్చాడు. తర్వాత మరోసారి కూడా పీల్చాడు. తర్వాత కూడా బాబా అతనిని ఇంకా ఇంకా పీల్చమని ప్రోత్సహించారు. అతను ఆయన మాటకి తలొగ్గాడు. కొద్దిసేపటి తర్వాత అతను మరోసారి పొగ పీలిస్తే, ఆ చిలుము గొట్టం నుండి అమృతం స్రవించనారంభించింది. చిలుము గొట్టం గుండా కారుతున్న ఆ అమృతం చిక్కగా, మధురంగా, సువాసనభరితంగా ఉంది. దాని రుచి చూసిన రావ్బహాదుర్ పరమానందభరితుడయ్యాడు. బాబా అతని వైపు చూసి నవ్వారు. అమృతం ఇంకా స్రవిస్తూ ఉండడంతో దాన్ని బాబా ఆశీర్వాదంగా భావించి అతను తన కొడుకుకి కొద్దిగా పట్టి, ఆపై చుట్టూవున్న భక్తులందరికీ ఇచ్చాడు. అందరూ బాబా అమృతాన్ని స్వీకరించారు. బాబా పెదవులపై చిరునవ్వుతో ఆ దృశ్యాన్నంతా చూసి పైకి చూసి, "అల్లా మాలిక్. అల్లా మాలిక్" అన్నారు.
(రిఫ్: సాయి ప్రసాద్ మ్యాగజైన్; 2004; దత్తజయంతి సంచిక
సోర్స్: ఏ డివైన్ జర్నీ విత్ బాబా బై విన్నీ చిట్లూరి.)
సాయిభక్తుల అనుభవమాలిక 1862వ భాగం....
1. సదా వర్షించే సాయి కృపకు నిదర్శనం
2. పదేళ్లనాటి నొప్పిని పూటలో మాయం చేసిన బాబా
సదా వర్షించే సాయి కృపకు నిదర్శనం
సాయిభక్తులకు శతకోటి ప్రణామాలు. నా పేరు మణిమాల. నేను ఒక ఉపాధ్యాయురాలిని. సాయి పిలిస్తే పలుకుతాడు, అడగకుండానే ఇచ్చేస్తాడు. ఎన్ని జన్మల పుణ్యమో ఈ అదృష్టం నాకు దక్కింది. ఇక నా అనుభవం విషయానికి వస్తే, మావారి పుట్టినరోజు 2024, మే 10న వచ్చింది. నాటితో ఆయనకి 60వ సంవత్సరాలు. అందుచేత మా అమ్మాయిలు షష్టిపూర్తి వేడుక చేయాలనుకున్నారు. కానీ నా మనసెరిగిన మావారు నాకు తెలియకుండానే మా కుటుంబం(నేను, నా భర్త, మా ఇద్దరమ్మాయిలు, అల్లుళ్ళు, ముగ్గురు మనవళ్లు, ఒక మనవరాలు) అందరికీ శిరిడీ వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేశారు. అది తెలిసి నా ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే, సాయి సన్నిధిలో ఉండటం కంటే ఫంక్షన్ గొప్పది కాదు. అయితే అనుకోకుండా నాకు ఎలక్షన్ డ్యూటీ పడింది. శిరిడీ వెళ్తామంటే నాకు వేసిన డ్యూటీ రద్దు చేయరు. అందుకని ఎలాగూ ఆరోగ్యం బాగుండట్లేదు కదా అని ఆఫీసర్లకి డాక్టర్ సర్టిఫికెట్లు చూపించాను. కానీ ఆఫీసర్లు వాటిని ఆమోదించలేదు, నా డ్యూటీ రద్దు కాలేదు. నేను పడిన వేదన అంతాఇంతా కాదు. ఎంత ప్రయత్నించినా వృధా అయిందని బాధపడ్డాను. ఇంకా బాబా మీదే భారమేసి ఏమైనా పర్వాలేదని ధైర్యంగా 9వ తేదీన ట్రైన్ ఎక్కాను. 10వ తేదీన బాబా సమక్షంలో నాకు కలిగిన అనుభూతి వర్ణించనలవికానిది. అప్పుడు నాకు కలిగిన గగూర్పాటు, ఆనందభాష్పాలు చూసిన అక్కడి సిబ్బంది 'రుక్ జా' అని నన్నోక్కదాన్నే చాలాసేపు ఉండనిచ్చారు. అది మరపురాని మధుర స్మృతి. మరునాటి ఉదయం సాయి పూర్తిగా కనిపించేలా ఆయన ముందర కూర్చుని కాకడ ఆరతి చూసాను. ఎలక్షన్ డ్యూటీ గురించి నా మదిలో ఆలోచనే లేదు. సాయిపై భారం వేస్తే ఆదుకోకుండా ఉంటారా? నేను శిరిడీ వచ్చేముందు ఎందుకైనా మంచిదని మా బ్రదర్(టీచర్)కి ఒక లెటర్ తోపాటు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చి వచ్చాను. అతను నేను శిరిడీలో ఉండగా ఫోన్ చేసి "మీ డ్యూటీ కాన్సల్ అయింది. హాయిగా దర్శనం చేసుకోండి" అని చెప్పాడు. నాకు చాలా ఆనందమేసింది. ఆఫీసరుకి కాల్ చేసి ధన్యవాదాలు చెప్పాను. ఎవ్వరికీ కాన్సల్ కానీ డ్యూటీ నాకు మాత్రమే కావడం సాయి దయకాక మరేమిటి? నాపై సదా సాయి కృప ఉందనడానికి ఇంకొక నిదర్శనం. నేను సప్తశృంగేరిదేవి దర్శనం కలిగించమని సాయితండ్రిని వేడుకున్నాను. మొదట ఆలోచించిన నా కుటుంబం చివరికి సరే అన్నారు. అది కూడా అద్భుత దర్శనం. హారతి ఇచ్చే సమయానికి మేము అమ్మవారి ముందు వున్నాము. మరువలేని దర్శనమని మా కుటుంబమంతా ఆనందపడ్డారు. సాయి దయతో ఆ మర్నాడు మూడుసార్లు సాయిని దర్శించుకొని తిరుగు ప్రయాణమై మా ఇల్లు చేరుకున్నాము. ఈ అనుభవం మీతో పంచుకుంటుంటే నా కళ్ళల్లో నీళ్లు కమ్ముకుంటున్నాయి. సాయి భక్తులకు ఏది శ్రేయస్కరమో అది తప్పక చేస్తారు. సదా సాయినామం, ధ్యానం ఇవే మనకు దారి చూపుతాయి, రక్షణనిస్తాయి. "ధ్యన్యవాదాలు బాబా".
పదేళ్లనాటి నొప్పిని పూటలో మాయం చేసిన బాబా
సాయిభక్తులకు నమస్కారాలు. నా పేరు స్వాతి. బాబా నా జీవితంలో మర్చిపోలేని అద్భుతం చేశారు. దాదాపు 10 ఏళ్ల నుంచి నా కుడిభుజం నొప్పిగా ఉంటుంది. కుడి వైపు తిరిగి పడుకున్నా, పని ఎక్కువైనా భుజం చాలా నొప్పి పెట్టేది. డాక్టర్కి చూపిస్తే, "అంతా నార్మల్గా ఉంది" అని చెప్పారు. ఫిజియోథెరపీ చేయించుకుంటే, చేయించినన్నీ రోజులు బాగుండేదిగాని తరువాత మళ్ళీ అదే పరిస్థితి. చివరికి నేను విసుగు చెంది బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఫిజియోథెరపీకి అంతంత డబ్బులు ఖర్చు పెట్టలేను బాబా. ఇక మీదే భారం" అని చెప్పుకొని భుజానికి ఊదీ రాసుకొని పడుకున్నాను. మరుసటిరోజు నుంచి నా చేయి నొప్పి మాయమైపోయింది. నన్ను నేనే నమ్మలేకపోయాను. కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న నొప్పిని ఒక్క పూటలో తీసేసారు బాబా. పూర్వజన్మలో ఎంతో అదృష్టం ఉంటే కానీ, ఈ జన్మలో సాయి పాదాల చెంత మనం ఉండలేం. కనుక మనందరం ఈ అదృష్టాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ బాబాకి నచ్చిన పనులు చేస్తూ ఆయన సేవలో గడుపుతూ ఉండాలి. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు సదా మాపై ఇలాగే కురిపించండి బాబా".
ఓం శ్రీ సాయినాథాయ నమః.
సాయిభక్తుల అనుభవమాలిక 1861వ భాగం....
1. బాబా కరుణ
2. బాబా దయ
3. దయతో మర్నాటికి నొప్పి తగ్గించిన బాబా
బాబా దయ
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు అన్నపూర్ణ. ఒకరోజు మావారు హైదరాబాదు వెళ్లాలని కారులో బయలుదేరారు. సూర్యాపేట దగ్గరకు వెళ్లిన తర్వాత హఠాత్తుగా కారు ఆగిపోయింది. మా కారు కొత్తదే అయినప్పటికీ ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవ్వలేదు. మావారు నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. నేను, "ఇలా అయిందేమిటి సాయీ? తొందరగా ఆ సమస్యను పరిష్కరించు" అని బాబాకి మొరపెట్టుకున్నాను. బాబా దయవల్ల మెకానిక్ వచ్చి కారు స్టార్ట్ చేసి, "ఏమీ లేదు, బ్యాటరీ డౌన్ అయింది. మరేం పర్వాలేదు మీరు బయలుదేరండి" అని అన్నారు. అప్పుడు మావారు కారు స్టార్ట్ చేస్తే వెంటనే స్టార్ట్ అయింది. ఆయన క్షేమంగా వెళ్లొచ్చారు.
దయతో మర్నాటికి నొప్పి తగ్గించిన బాబా
నా పేరు తేజశ్రీ. 2024, ఏప్రిల్ లేదా మేలో ఒకరోజు రాత్రి సంవత్సరంన్నర వయసున్న మా బాబుకి నోటిలో నొప్పి వచ్చి చాలా బాధపడ్డాడు. పాలు కూడా తాగలేకపోయాడు. రాత్రంతా ఏడుస్తూ పడుకోలేదు. నాకు చాలా భయమేసి, "బాబా! మీ దయవల్ల బాబుకి నొప్పి తగ్గిపోవాలి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయ చూపారు. మరుసటిరోజుకి నొప్పి తగ్గింది. "థాంక్యూ బాబా. మమ్మల్ని అన్ని వైపుల నుంచి కాపాడుతున్నందుకు థాంక్యూ వెరీ మచ్ బాబా. మేము మీకు సదా ఋణపడి ఉంటాము సాయీ".
సాయిభక్తుల అనుభవమాలిక 1860వ భాగం....
- బాబా ఆశీస్సులు
సాయిభక్తుల అనుభవమాలిక 1859వ భాగం....
- చివరి నిముషంలో గట్టెక్కించిన బాబా
సాయిభక్తుల అనుభవమాలిక 1858వ భాగం....
- శ్రీసాయి మహావైద్యుడు
నా పేరు సాయీశ్వర్. నాకు ఊహ సరిగా తెలియక ముందు నుంచే నేను శ్రీ శిరిడీ సాయిబాబా భక్తుడిని, శిష్యుణ్ణి, బిడ్డని. ఏ జన్మబంధమో తెలియదు కానీ, నా చిన్ననాటి నుండి ఆయన ప్రేమలో నన్ను నిలుపుకున్నారు. నా చిన్ననాటి నుండి ఇప్పటివరకు నా జీవితం ఆయన లీలలతో, మహిమలతో నిండిపోయింది. అనుక్షణం ఆయన మార్గదర్శకత్వం నన్ను నడిపిస్తూ ఉంది. నేనిప్పుడు ఈ మధ్యకాలంలో నా జీవితంలో సాయినాథుడు చేసిన ఒక పెద్ద లీలను మీతో పంచుకుంటున్నాను. 2024, ఏప్రిల్లో నాకు బ్యాక్ పెయిన్ వస్తే, ఒకసారి చూపించుకుందామని హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించమంటే, చేయించుకొని రిపోర్టు తీసుకొని మళ్ళీ డాక్టర్ వద్దకి వెళ్ళాను. అప్పుడొక ఊహించని విషయం బయటపడింది. డాక్టరు, "మీ గాల్ బ్లాడర్(పిత్తాశయం)లో 9mm గడ్డ(పాలిప్) ఉంది. సర్జరీ చేసి గాల్ బ్లాడర్ తొలగించాల"ని చెప్పారు. ఇంకా 'గాల్బ్లాడర్లో ఏర్పడే రాళ్లకి, కణతలకి మందులతో చికిత్స ఉండదని, సర్జరీనే మార్గమని' తెలియజేశారు. నేను నిర్ఘాంతపోయి వేరే డాక్టర్ దగ్గరకి వెళ్లాను. ఆ డాక్టరు కూడా అదే చెప్పి, "సర్జరీ చేస్తేనే మంచిది. లేకపోతే ఆ గడ్డ పరిమాణం నిదానంగా పెరిగి పగిలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, గడ్డని అలాగే వదిలేస్తే క్యాన్సర్గా పరిణమించే అవకాశాలు కూడా ఉన్నాయ"ని చెప్పారు. నేను ఇంటికి వచ్చి అనుకోని సమస్య తలెత్తిందని చాలా బాధపడ్డాను. బాబా దగ్గరికి వెళ్లి, "ఏమిటి బాబా ఇది? పెద్దపెద్ద పాపాలు చేసినవాళ్ళు కూడా ఈ కలియుగంలో ఆయురారోగ్యాలతో జీవిస్తున్నారే! నాకు తెలిసి నేను ఈ జన్మలో ఎవరినీ ఇబ్బందిపెట్టలేదే! అంత పాపకార్యాలు కూడా ఏమీ చేయలేదు. గత జన్మలో ఏమి చేశానో నాకు తెలియదు. కనీసం మందులకి కూడా నయమవదంటున్నారే! ఏకంగా పిత్తాశయం తీసేయాలంటున్నారు. భగవంతుడు మానవదేహంలో ఏ అవయవమూ ఊరకనే పెట్టలేదు కదా! ఆ అవయవం తొలగిస్తే తరువాత వచ్చే సమస్యలను జీవితాంతం ఎదుర్కోవాలి కదా! నాకేమిటి బాబా చిన్న వయసులో ఈ సమస్య?" అని దీనంగా నా ప్రియతమ గురుదేవుడైన సాయికి, నా ఆరాధ్య దైవాలైనా శివశక్తులకు, నా ఇంటి దైవమైన ఆంజనేయస్వామికి చెప్పుకున్నాను. ఇంకా, "మీరే ఈసారి ఏదో పెద్ద మహిమ చేయాలి బాబా. ఆ గడ్డ మాయం చేసేయడం తప్ప వేరే ఏ ప్రత్యామ్నాయం లేదు" అని బాబాని వేడుకున్నాను. నాకు సాయినాథుడు ఏదో పెద్ద మహిమ చేస్తారని 30% నమ్మకమున్నప్పటికీ నాకొచ్చిన సమస్యకి మందులతో చికిత్స లేకపోవడం వల్ల 70 శాతం అసాధ్యం అనిపించింది. మా అమ్మకి మాత్రం సాయినాథుడు ఏదో మహిమ చేస్తారని 100% నమ్మకం ఉండింది. కారణం అదివరకే ఇంతకంటే పెద్ద అనారోగ్య సమస్యతో చివరి దశ వరకు వెళ్లిన నన్ను ఆ సాయీశ్వరుడు విచిత్రంగా బయటపడేసారు(ఆ అనుభవాన్ని మరోసారి పంచుకుంటాను). అందువల్ల మునపటిలాగే నన్ను సమస్య నుండి సాయినాథుడు బయటపడేస్తారని మా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. నేను కూడా మొదట కాస్త బాధకి గురైన నా మనసుని సాయీశ్వరుడు ప్రసాదించిన ఆధ్యాత్మిక జ్ఞానంతో దృడం చేసుకోసాగాను. ఆ సమయంలో ఫేస్బుక్లో పదేపదే "నా చరిత్ర పారాయణం చేస్తూ ఊదీ రాస్తూ ఉండు. నీ రోగం నయం అవుతుంది", "నేను ఉండగా నీకు భయమేలా? నీ అనారోగ్యం నయం అవుతుంది" అని రకరకాలుగా బాబా నాకు అభయ ప్రదానం చేస్తూ వచ్చారు. మరో వైపు మా అమ్మకి, "నా బిడ్డలని రకరకాల మిషలతో శిరిడీ రప్పించుకుంటాను", "మీరు శిరిడీ రావడానికి అన్ని ఏర్పాట్లు చేసాన"ని సందేశాలు వస్తుండేవి. దాంతో అమ్మ బాబాతో, "మా అబ్బాయికి నయమైపోతే శిరిడీ వస్తామ"ని చెప్పుకుంది. నేను ప్రతిరోజూ సాయిలీలామృతం కొంచెం కొంచెం చదువుతూ శిరిడీ ఊదీ చేతిలో పట్టుకుని సాయి నామం, మృత్యుంజయ మంత్రం స్మరించి సాయిని ధ్యానించి కొద్దిగా నుదుటన పెట్టుకొని, కొద్దిగా గాల్ బ్లాడర్ వద్ద రాసుకొని, మరికొంత ఊదీ గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగుతూ ఉండేవాడిని. అలా పదిరోజులు చేసిన తరువాత మా ఊరికి కాస్త సమీపంలో ఉన్న మెడికల్ కాలేజీతో కూడుకున్న ఒక పెద్ద హాస్పటల్లో లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారనే సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్దామని నిర్ణయించుకున్నాము. నా మనసులో బాబా ఏదో పెద్ద మహిమ చేయబోతున్నారన్న ఆలోచన ఉండబట్టి హాస్పటల్కి వెళ్లేముందు మా ఇంట్లో ఉన్న పెద్ద బాబా పటం వద్దకి వెళ్లి, "బాబా! హాస్పిటల్లో టెస్టులు చేయవచ్చు. వాటిలో ఆ గడ్డ మాయం చేసేయ్ బాబా. రిపోర్టులో అంతా బాగానే వచ్చేటట్లు అనుగ్రహించు తండ్రీ. లేదు నాకు ఆపరేషన్ జరగడమే మంచిదని నీవు తలస్తే అలాగే జరగనివ్వు" అని బాబాను వేడుకున్నాను. తర్వాత పార్వతీపరమేశ్వరులకి, ఆంజనేయస్వామికి కూడా నమస్కారం చేసుకుని బస్సులో హాస్పటల్కి బయలుదేరాను.
నేను ఈ మధ్యకాలంలో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ని అనుసరిస్తున్నాను. అందులో చాలామంది అనుభవాలు చదివినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించేది. కొన్ని కొన్ని అనుభవాలలో 'బాబా కనపడని వస్తువు కనపడితే' లేదా మరీ చిన్నచిన్న వాటికి కూడా 'అలా జరిగితే బ్లాగులో అనుభవం పంచుకుంటాన'ని బాబాకి మ్రొక్కే మొక్కులు చూసి, 'ఎందుకు చిన్నచిన్న విషయాలకు కూడా బాబాని ఇబ్బందిపెడుతున్నారు? మనకి బాబా చేసే ఉపకారం బ్లాగ్ ద్వారా పదిమందికి పంచుకుని ఆయన కీర్తిప్రతిష్టలను, శక్తిసామర్థ్యాలను, ఘనతను నలుదిక్కుల చాటి కష్టాలలో కృంగిపోతున్న సాయి భక్తుల హృదయాలలో బాబా మమ్మల్ని కాపాడి తీరుతారనే ఆశాజ్యోతిని ప్రతిష్టించాలని, వారిలో ధైర్యం నింపాలనే సద్భావన ప్రతి సాయి భక్తునికి ఉండాలి కానీ, కేవలం వ్యాపార ధోరణితో అది, ఇది జరిగితే నీ గురించి బ్లాగులో చెప్పుకుంటానని భావించడం నిజమైన సాయి భక్తుని లక్షణం కాదని, సాయిని తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా తలచి ప్రేమబంధాన్ని పెనవేసుకొని తమని శరణుజొచ్చిన వారిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించడం, ప్రాపంచికంగా కష్టాలలో నష్టాలలో వెంట నిలబడడం తండ్రిగా సాయి కర్తవ్యం అవుతుంది గాని, కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం సాయిని ఒక యంత్రంలా వాడుకోవడం సరి అయిన పద్ధతి కాదని' నాకు అనిపిస్తుండేది. ఇది నా అభిప్రాయం. ఎవరినైనా బాధిస్తే నన్ను క్షమించండి.
ఇక విషయానికి వస్తే.. నేను బస్సులో ప్రయాణిస్తూ ధ్యానంలో బాబాని, "గడ్డ మాయం చేయమ"ని ఇంకా, "బాబా! ఈ గడ్డను మాయం చేస్తావని నాకనిపిస్తుంది. ఒకవేళ నిజంగా మాయం చేస్తే, ఇది చాలా గొప్ప మహిమ. అదే జరిగితే, కేవలం ఈ మహిమనే కాదు, నా జీవితంలో ఇప్పటివరకు మీరు చేసిన గొప్ప మహిమలన్నీ మీ బ్లాగులో పంచుకుంటాను. అనారోగ్యం తగ్గిస్తే, పంచుకుంటానని బేరాలు ఆడడం కాదు. ఇంతటి గొప్ప మహిమలను పంచుకోవడం ద్వారా సాయి భక్తులందరికీ ఊరట కలుగుతుంది. మీ ఘనతను నలుదిశలా విస్తరింపజేసి చిన్న సేవ చేసుకునే భాగ్యం నాకు లభిస్తుంది" అని బాబాకి విన్నవించుకున్నాను. హాస్పటల్కి చేరుకున్న తర్వాత డాక్టర్లు నా రిపోర్టు చూసి సర్జరీ చేయడానికి ముందు మరోసారి స్కాన్ చేయాలని స్కానింగ్ రాశారు. సరేనని స్కాన్ చేయించుకుంటే స్కాన్ చేసే డాక్టర్కి ఏమీ అర్థం కాలేదు. కారణం మునపటి రిపోర్టులో స్పష్టంగా కనపడుతున్న గడ్డ అప్పుడు కనపడలేదు. దాంతో ఆ డాక్టరు, "ఇదేంటి?" అని వెళ్లి ఇంకో డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆ డాక్టరు కూడా గడ్డ కనపడలేదన్నారు. తర్వాత వాళ్లిద్దరూ వెళ్లి ఇంకో పెద్ద డాక్టర్ని తీసుకొచ్చారు. ఆ డాక్టరుకి కూడా గడ్డ కనపడలేదు. దాంతో, "ఏ హాస్పిటల్లో స్కాన్ చేయించుకున్నార"ని నన్ను ప్రశ్నించి, వాళ్లలో వాళ్ళు, "గడ్డ ఏమీ కనపడట్లేదు. మరీ వాళ్ళు 9 mm గడ్డ ఉందని ఎలా వ్రాస్తార"ని చర్చించుకున్నారు. కొద్దిసేపట్లో ఆ ముగ్గురి నేతృత్వంలో స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. అది తీసుకొని వెళ్ళి ప్రధాన డాక్టర్ని కలిసాము. ఆ డాక్టరు, "గడ్డ ఏమీ లేదుగాని గాల్బ్లాడర్ మాత్రం కొద్దిగా వాచింది. అది దానంతటదే తగ్గిపోతుంద"ని చెప్పారు. నేను, "సర్జరీ అవసరం లేదా?" అని అడిగితే డాక్టరు, "అసలు గడ్డే లేకపోతే సర్జరీ అవసరం ఏముంది? మీకు ఇంకా స్పష్టంగా తెలియాలంటే ఖాళీ కడుపుతో స్కాన్ చేయించుకోవాలి" అని అన్నారు. నేను, "ఖాళీ కడుపుతోనే ఉన్నాన"ని చెప్పాను. డాక్టరు, "అయితే గడ్డ లేనట్లే. మీకు ఇంకా అనుమానం ఉన్నట్లయితే పెద్ద(MRI) స్కాన్ చేయించుకొండి. కానీ అది అవసరం లేద"ని చెప్పారు. నా జీవితంలో బాబా చేసిన అతి పెద్ద లీలకి మేము మరోసారి ఆనందాశ్చర్యాలకు గురయ్యాము. బాబాపై ప్రేమ ఉప్పొంగగా ఆనందాశ్రువులు నా కళ్ళనుండి ప్రవహించాయి. పెద్ద గండం నుంచి సాయి, ఈశ్వరులు మమ్మల్ని బయటకు లాగారని ఆనందంగా ఇంటికి వచ్చాము. తర్వాత ఆలోచిస్తే, ముందు స్కాన్ చేసే రేడియాలజిస్ట్ పొరపడ్డారని తలవడానికి కూడా లేకుండా కొత్త రిపోర్టులో గాల్బ్లాడర్కి కొద్దిగా వాపు ఉందని, అది లేకుంటే డాక్టరు పొరబడ్డారని తలచేవాడినని, అందుకే బాబా ఆ వాపు ఉంచారనిపించి అంతా బాబా మహిమ అనుకున్నాను. అయితే సాయంత్రం మళ్ళీ నా కోతి మనసు భయానికి గురై డాక్టర్లు ఏమైనా పొరబడి గడ్డ లేదన్నారేమోననిపించింది. అప్పుడు మా అమ్మ, "ఈ రెండు రిపోర్టులు తీసుకొని వెళ్లి రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదించు. వాళ్ళు మంచి అనుభవం ఉన్నవారు కదా!" అంది. నేను సరేనని, మరుసటిరోజు గవర్నమెంట్ డాక్టర్ని కలిస్తే, "పెద్ద స్కాన్ తీయించమ"ని సూచించారు. దాంతో MRI స్కాన్ చేయించుకున్నాను. ఆ రిపోర్టు చూసిన డాక్టరు, "గడ్డ లేదు. నిన్నటి రిపోర్టులో ఉన్న వాపు కూడా లేదు. అంతా నార్మల్గా ఉంది. నీకు ఏ సమస్యా లేదు. ఇక ఏ హాస్పటల్కి వెళ్ళనవసరం లేద"ని అని అన్నారు. సాయినాథుని ఋణం ఏమిచ్చినా, ఏమి చేసినా తీర్చుకోలేము. ఆ గడ్డని కేవలం ఆయన అనుగ్రహంతో ఎటువంటి మందులు వాడకుండానే మాయం చేసారు. సాయిలాంటి గొప్ప గురువు, పిలిస్తే పలికే దైవం లేరని ఎప్పుడూ బలంగా అనిపిస్తుంటుంది. సాయినాథుడు, ఆ పరమేశ్వరుడు తోడుంటే విశ్వమంతా ఎదురు తిరిగినా ఒంటి చేతితో పోరాడవచ్చు అనే భావన నిరంతరం నాలో కలుగుతుంటుంది. ఆ పరమేశ్వరుని కలియుగ గురుస్వరూపమైన శ్రీసాయికి ధన్యవాదాలు.