సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సమయగతి ఎఱుగని సమ్యమీంద్రుని 'సమయనియమాలు'! - శ్రీసాయిబాబా దినచర్య


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి


శ్రీసాయిబాబా దినచర్యకు సంబంధించిన ఈ వివరాలు 'సాయిపథం ప్రధమసంపుటం' నుండి స్వీకరించి ఈరోజు ప్రచురిస్తున్నాము. చదివి ఆనందించండి.

సమయగతి ఎఱుగని సమ్యమీంద్రుని 'సమయనియమాలు'! శ్రీసాయిబాబా దినచర్య.

“కాలగతి మనుగడకు మనసే గతి! కాలమనే గడియారానికి మనసు యొక్క బాహ్యప్రవృత్తి పెద్దముల్లయితే, అంతరప్రవృత్తి చిన్నముల్లు. మనోలయమైన మరుక్షణం ఆ కాలమనే గడియారానికి ‘మరోక్షణ’మనేదే వుండదు. దేశకాలాల పరిమితుల పరిధిలో, ‘నేను వేరు-జగత్తు వేరు’ అనే అన్యత్వభావనలో వేళ్ళూనికొని వున్న మనసుయొక్క అనుభవమే కాలగతి. తలపులుడిగిన తన్మయత్వమే తానైన శ్రీసాయికి ‘కాలగతి’ యొక్క స్ఫురణ వుండదు. అందుకే ఆయన “నా వయసు లక్షల సంవత్సరాల”ని అన్నారు. అంతేకాదు. మరో సందర్భంలో, “నేను పుట్టినప్పుడు నా తల్లి తనకు కుమారుడు కలిగినందుకు యెంతో సంబరపడింది. నా మటుకు నాకు, ‘అసలు నేను జన్మించిందెప్పుడు? అంతకుముందు మాత్రం నేను లేనా?’ అని అనుకొన్నాను” అని అన్నారు. ఒకవైపు ‘నేను పుట్టినప్పుడు’ అంటూ, తమ ప్రాకృతిక దేహం యొక్క సాపేక్షిక వాస్తవాన్ని ముచ్చటిస్తూనే, మరోవైపు, ‘అసలు నేనెప్పుడు పుట్టాను?’ అన్న తమ స్వానుభవాన్ని తెలియజేస్తున్నారు. తత్త్వబోధనలో అది బాబా యొక్క విలక్షణ శైలి! పుట్టగానే తల్లికి, ఆపైన తన స్వరూపమేయైన యీ జగత్తుకు ఆనందాన్నిస్తూ, ఆ ఆనందాన్నే గుర్తిస్తూ, తరుగులేని ఆనందమే తానని తెలియజేస్తూ వున్న ఆనందస్వరూపం ఆయన. దేశకాలపరిమితులకు అతీతమైన అనుభవమనే నీలాకాశపు నేపథ్యంలో, మమతానుబంధాల వర్షపుజల్లుల వెనుక, జ్ఞానవైరాగ్యాల వెలుగులో మనోహరంగా ప్రకాశించే ఇంద్రధనస్సు--శ్రీ సాయిరూపం!” అంటారు శ్రీ బాబూజీ.

కాలగతికి అతీతుడైన శ్రీసాయిని దైనందిక కార్యకలాపాల పరిధిలో ఇమిడ్చి, ఆయన దినచర్యను వర్ణించడం అవివేకమే అయినా, మానవదేహం ధరించి శిరిడీలో చరిస్తున్నప్పటి ఆయన రోజువారి కార్యక్రమాల్ని గురించి మన పరిమితులలోనే చెప్పుకునే ప్రయత్నంచేద్దాం!


తూర్పున వెలుగురేఖలు విచ్చుకోకమునుపే తమ పడక నుండి లేచి, ధుని దగ్గరున్న స్తంభానికానుకుని కూర్చుని కొద్దిసేపు ధ్యాననిమగ్నులయ్యేవారు బాబా. ఆ సమయంలో ఆయన ఏమిచేసేవారో గమనించడానికి ఇతరులకు అవకాశం వుండేది కాదు. ఆయనను సమీపించడానికే కాదు, ఆయనకు యాభై అడుగుల దూరంలో వుండటానికి కూడా అనుమతించేవారు కాదు. తరువాత కొద్దిసేపటికి “యాదేహక్, అల్లావలీ హై!, అల్లామాలిక్ హై!” వంటి పదాలను మెల్లగా ఉచ్ఛరిస్తూ, మధ్య మధ్యన ఏవో యోగభంగిమలు చేసేవారు. ‘అబ్దుల్ బాబా, మాధవ్ ఫస్లే’లు మాత్రం మసీదులో ప్రవేశించి అక్కడంతా చిమ్మి శుభ్రపరచటం, దీపాలలో వత్తులు సరిచేసి నూనె పోసి వుంచటం, ధుని దగ్గర కట్టెలు సర్దటం వంటి పనులను నిశ్శబ్దంగా చేస్తుండేవారు. క్రమంగా లోకం తెల్లబడుతూండగా, నెమ్మదిగా భాగోజీషిండే మసీదు(ద్వారకామాయి)లో అడుగుపెట్టేవాడు. ముందు మృదువుగా బాబా కాళ్ళు చేతులు పట్టేవాడు. తరువాత, (1910లో) ఒక పాపను రక్షించేందుకై ధునిలో చేయి పెట్టినప్పుడు కాలిన బాబా చేతికి, ముందురోజు తాను కట్టిన కట్టువిప్పి, నేయి మర్దన చేసి, మరో కొత్తకట్టు కట్టేవాడు. బాబా మహాసమాధి వరకు, అంటే, సుమారు ఎనిమిదేళ్ళపాటు రోజూ అతనా సేవ చేసుకున్నాడు. గాయం కొన్ని రోజుల్లోనే మానిపోయినా, బహుశా, అతని భక్తిశ్రద్ధలు బాబానలా ఆ కట్టుకు కట్టిపడేశాయేమో? ఏమైనా భాగోజీ ధన్యుడు. ఆ తర్వాత అతను చిలిం సిద్ధంచేసి బాబాకందించేవాడు. బాబా ఒకటి రెండుసార్లు పీల్చి, ఆ చిలిం భాగోజీకే తిరిగి ఇచ్చేవారు. ఇదంతా పూర్తయ్యేసరికి సమయం ఏడు-ఏడున్నరయ్యేది. బాబా దర్శనార్థం భక్తులు మసీదు చేరేవారు. వారితో సుదూరప్రాంతాలలో వున్న తన భక్తులను క్రిందటి రాత్రి తానెలా కాపాడింది, మరణించినవారి ఆత్మలను ఊర్ధ్వలోకాలకు తానెలా తీసుకెళ్ళిందీ వివరించేవారు బాబా. ఆయన చెప్పినవన్నీ యదార్థాలని, ఆ తరువాత ఆయా ప్రాంతాలనుండి వచ్చిన భక్తుల ద్వారా తెలిసేది.

ఇదంతా అవుతూండగా మాధవ్ ఫస్లే, తుకారాం వంటి సేవకులు బకెట్ల నిండుగా నీరు సిద్ధం చేసేవారు. బాబా ఎన్నడూ పళ్ళు తోముకునేవారు కాదు. నోరు పుక్కిలించి ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కునేవారు. ఆయన ముఖం కడుక్కునే పద్ధతి ఎంతో సుతారంగా వుండి చూడముచ్చటగొలిపేది. బాబా పుక్కిలించి వుమ్మేసిన నీటిని కుష్టురోగులు భక్తి, శ్రద్ధలతో తమ శరీరాలకు రాసుకునేవారు. వారి విశ్వాసానికి తగ్గ ఫలితము వారు పొందేవారు.

అలా ముఖప్రక్షాళనమవుతూండగానే, భక్తులు కాకడఆరతి కోసమని ఛత్రచామరాలతో సందడిగా సాయివద్దకు చేరేవారు. పొద్దున్నే తన దగ్గరకు వచ్చినవారిని పరుగెత్తుకుంటూ వచ్చిన చిన్నారుల్ని ఆదరించే తల్లిలా, ప్రసన్నంగా ఆదరించేవారు బాబా. ఆపైన, భక్తులంతా బాబా దగ్గర ఊదీ తీసుకుని తమ తమ విధులకోసమని వెళ్ళేవారు (కాకడ ఆరతి, శేజ్ ఆరతి చావడిలో మాత్రమే, అంటే రోజు మార్చి రోజు జరిగేవి).

ఫకీరు నియమాలననుసరించి బాబా రోజూ స్నానం చేసేవారుకాదు. మొదట మొదట్లో ఆయన లెండీ తోటలోనో, లేక వూరి బయటవున్న తుప్పలు, పొదల దగ్గరో స్నానం చేసేవారు. తరువాత మసీదులోనే స్నానం చేయసాగారు. రెండు రాగి అండాలతో వేడినీళ్లు, రెండుబిందెల చన్నీళ్ళు మసీదులో పెట్టి చుట్టూ తెరలు దింపేవారు. బాబా ఆ నీరు కలుపుకొని సుమారు గంటన్నరసేపు స్నానం చేసేవారు. ఆ తరువాత ధుని దగ్గర కొంతసేపు నిలబడేవారు. సన్నిహిత భక్తులు వీపు, మెడ, తల తుడిచేవారు. బాబా స్నానం చేసిన తరువాత ఆ నీళ్ళను భక్తులు ఎంతో పవిత్రంగా భావించి, తీర్థంగా స్వీకరించేవారు. నాసిక్‌‌కు చెందిన రాంబాజీ అనే వ్యక్తి మతిస్థిమితంలేని స్థితిలో శిరిడీ వచ్చాడు. బాబా స్నానం చేసిన నీటిని తాగిన తర్వాత అతను ఆరోగ్యవంతుడయ్యాడు. అందుకు కృతజ్ఞతతో అతను బాబా స్నానం చేసేందుకు ఒక రాయిని సమర్పించుకున్నాడు. ఆ రాయి మొదట్లో మసీదులో ఉండేది. ప్రస్తుతం దానిని మనం మ్యూజియంలో చూడవచ్చు. 

Baba's bathing stone
బాబా ఏడెనిమిది రోజులకొకసారి స్నానం చేసేవారు. అరుదుగా ఐదారువారాలపాటు కూడా స్నానం మాటే ఎత్తేవారు కాదు. స్నానం గురించి ఏ భక్తుడైనా ప్రశ్నిస్తే “ఇప్పుడేగా గంగాస్నానం చేసి వచ్చింది. మళ్ళీ స్నానం ఎందుకు?” అనేవారు. సంకల్పమాత్రాన తమ కాలిగోటినుండి పవిత్రజలాలను ప్రవహింపజేయగల పరమపావనునికి స్నానంతో పనేముంటుంది? రోజూ స్నానం చేయకపోయినా, ఆయన ఎంతో పరిశుభ్రంగా కనిపించేవారు.

సరిక్రొత్త సాయి అంబరం-‘పేదసాధు’లకానాడు సంబరం!

బాబా ఏడెనిమిది రోజులకొకసారి స్నానం చేసేవారు. అరుదుగా ఐదారువారాలపాటు కూడా స్నానం మాటే ఎత్తేవారు కాదు. స్నానం గురించి ఏ భక్తుడైనా ప్రశ్నిస్తే “ఇప్పుడేగా గంగాస్నానం చేసి వచ్చింది. మళ్ళీ స్నానం ఎందుకు?” అనేవారు. సంకల్పమాత్రాన తమ కాలిగోటినుండి పవిత్రజలాలను ప్రవహింపజేయగల పరమపావనునికి స్నానంతో పనేముంటుంది? రోజూ స్నానం చేయకపోయినా, ఆయన ఎంతో పరిశుభ్రంగా కనిపించేవారు. బాబా, స్నానానంతరం ఆకుపచ్చని లుంగీ కట్టుకుని, విడిచిన కఫ్నీని నీటిలో పిండి ధునిపై ఆరబెట్టి వేసుకునేవారు. స్నానం చేసే ఆ సమయంలో తప్ప ఆయనెపుడూ కఫ్నీ లేకుండా వుండేవారుకాదు. బాబా ఎప్పుడూ ముతక కారికం గుడ్డతో కుట్టిన కఫ్నీలనే ధరించేవారు. ఆ కఫ్నీకూడా బాగా చిరుగులుపడి మరీ పాతదైతే, భక్తుల బలవంతంపై కొత్త కఫ్నీని ధరించేవారు. ఆయన వంటినున్న పాతచిరుగుల కఫ్నీని ఎలాగైనా మార్పించాలని తాత్యా ఆయన దగ్గర చేరి ఏదో మాట్లాడుతున్నట్లు నటిస్తూ, “బాబా ఏమిటిది, కఫ్నీ బాగా చిరిగిపోయినట్లున్నదే!” అంటూ ఆ చిరుగులలో వేలుపెట్టి, వాటినింకా పెద్దవిచేసి, ఇక కుట్టుకునేందుకు కూడా వీలు లేకుండా చేసేవాడు. ఆపై, “కఫ్నీ బాగా చిరిగిపోయింది. ఏమైనా సరే కఫ్నీ మార్చాల్సిందే!” అని పట్టుపట్టేవాడు. బాబాకింక తప్పేది కాదు. కఫ్నీ మార్చదలుచుకున్నపుడు కాశీనాథ్ షింపీ అనే బట్టల వ్యాపారిని పిలిచి, “కాశీనాథ్, కఫ్నీ లావ్!” అని పురమాయించేవారు. కఫ్నీ తెచ్చిన ‘కాశీనాథ్’కు దాని ఖరీదు కంటే ఎంతో ఎక్కువ డబ్బులిచ్చేవారు. కొత్త కఫ్నీ వేసుకుని పాతదానిని ధునిలో పడేసేవారు. సామాన్యంగా బాబా తాము కఫ్నీ మార్చినప్పుడు అప్పుడక్కడున్న పేదఫకీర్లకు, సాధువులకు కూడా క్రొత్త కఫ్నీలను పంచేవారు. అలా బాబా తమ కఫ్నీ మార్చిన దినం ఆ పేదసాధువులకు ఒక పండుగే! 1914 లో ఒకసారలాగే బాబా క్రొత్త కఫ్నీలను పంచుతుండగా, అక్కడున్న నార్కే అను భక్తుడు తనకూ ఒక కఫ్నీ ఇస్తే బాగుండుననుకొన్నాడు. అతని మనసులో ఆ ఆలోచన మెదలగానే, బాబా నార్కే వైపు తిరిగి, అతని తలపై మెల్లగా తడుతూ, “ఊహు! నీకు కఫ్నీ ఇచ్చేందుకు ఆ పైనున్న ఫకీరు అంగీకరించటంలేదు. నేనేం చేసేది?” అని అన్నారు. అప్పుడప్పుడు బాలానాయీ అనే మంగలిని పిలిపించి నున్నగా గుండు చేయించుకునేవారు, మీసాలను కోసుగా కత్తిరించుకునేవారు. అతనికి బాబా నుంచి బాగా ప్రతిఫలం దక్కేది.

భక్తభారభృతుడు భిక్షకేగిన ‘భంగి’!


ఉదయం ఎనిమిదిగంటల ప్రాంతంలో బాబా భిక్షకు బయలుదేరేవారు. గణపతి కోతే పాటిల్ (బయజాబాయి), అప్పాజీ పాటిల్, సఖారాం షెల్కే, వామన్ గోండ్కర్, నందూరాం మార్వాడీల ఇళ్ళు, సకలలోకాలకు జీవప్రదాత అయిన సాయినాథునికి భిక్షనిచ్చే భాగ్యానికి నోచుకున్న పుణ్యలోగిళ్ళు! బాబా ఒక్కో ఇంటిదగ్గర నిలుచుని ఒక్కోరకంగా పిలిచేవారు. “ఆబాదే ఆబాద్, అల్లా భలాకరేగా!” అని ముందు ఆ ఇంటి ఇల్లాలిని దీవించేవారు. “బయజా మా! జెవన్ దే! రోటీ లావ్!” (అన్నం పెట్టు, రొట్టె తే!) అని బయజాబాయి ఇంటివద్ద అడిగేవారు. అప్పాజీ పాటిల్, వామన్ గోండ్కర్‌‌ల ఇళ్ళముందు వాళ్ళ పేర్లు పిలుస్తూ, “భాక్రీ దే” (రొట్టె ఇవ్వు!) అనేవారు. సఖారాం ఇంటిదగ్గర ‘ఇత్లాయీ బాయీ, రోటీ లావ్!’, అని కేకవేసి భిక్ష అడిగేవారు. ఐదిళ్ళలో చివరగా నందూరాం మార్వాడీ ఇంటికి వెళ్ళేవారు. “నందూరాం భాక్రీ దే!” అనో, లేకపోతే అతని భార్య రాధాబాయిని ఉద్దేశించి, “బోపిడీబాయి భాక్రీ దే!” అనో అరిచేవారు. మరాఠీలో “బోపిడీ” అంటే నత్తి అని అర్థం. ఆమె కొద్దిగా నత్తిగా మాట్లాడేదని బాబా ఆమెనలా పిలిచేవారు. ఆమె భిక్ష తేవటం కనుక కొద్దిగా ఆలస్యమైతే, “ఏమిటంత ఆలస్యం?” అని ఒక్కోసారి కేకలేసేవారు. ఇక అప్పుడప్పుడు పండుగ, సందర్భము ఏమీ లేకుండానే “బోపిడీబాయ్, మీఠాలావ్!” అనేవారు. ఆమె కూడా తనకెన్ని పనులున్నాసరే, బాబా అడిగినవెంటనే ఆయనకిష్టమని పూరన్ పోళీలు (బొబ్బట్లు) చేసి బాబాకు తెచ్చిపెట్టేది. అందులోంచి ఒక ముక్క తమ నోటిలో వేసుకుని, మిగిలినదంతా అక్కడున్న భక్తులకు పంచేసేవారు బాబా. బాబా భిక్షకు వెళ్ళే ఇళ్ళను ఏనాడూ మార్చలేదు; భిక్షకు వెళ్ళే ఇళ్ళ క్రమమూ మార్చలేదు. కానీ భిక్ష చేసే సమయాలకు మాత్రం ఏ నియమాలూ వుండేవికావు. ఒక్కోసారి, ఆయన ఒకేరోజున ఏడెనిమిదిసార్లు కూడా భిక్షకు వెళ్ళిన సందర్భాలున్నాయి. శ్రీ బయ్యాజీ అప్పాకోతే పాటిల్ చెప్పిన వివరాల ప్రకారం: “బాబా మొదటి మూడు సంవత్సరాలు రోజుకి ఎనిమిదిసార్లు, తరువాత మూడు సంవత్సరాలు రోజుకి నాలుగుసార్లు, ఆ తరువాత పన్నెండు సంవత్సరాలపాటు రోజూ రెండుసార్లు భిక్షకు వెళ్ళేవారు. చివరి రోజులలో రోజుకి ఒక్కసారి మాత్రమే భిక్షచేసేవారు.”


బయజాబాయి ఇంటికి భిక్షకు వెళ్ళినపుడల్లా, ఆమె బాబాను లోపలకు వచ్చి కూర్చుని తన కళ్ళముందు రెండు ముద్దలన్నా తిని వెళ్ళమని బ్రతిమలాడుకునేది. గడప అవతలే తప్ప, ఏనాడూ ఎవరింటి లోపలికీ వెళ్ళి కూర్చుని భిక్ష స్వీకరించని బాబా, ఆ మాతృమూర్తి ప్రేమతో చేసిన అభ్యర్ధనను కాదనలేక ఎప్పుడైనా అరుదుగా వారి ఇంటి అరుగు మీద కొద్దిసేపు కూర్చునేవారు. వరుసగా వాళ్ళింటికి ఎన్నిసార్లు వెళ్ళినాసరే, ఆ తల్లి ఆయననెన్నడూ ఒట్టిచేతులతో పంపేదికాదు. పరుగున వచ్చి బాబా జోలెలో కనీసం ఇంత ఊరగాయో, అప్పడమో తెచ్చిపెట్టేది. బాబా ఆమెను తన సోదరి అనేవారంటే, మరి ఆమె ఎంతటి అదృష్టవంతురాలో! బాబా మహిమను లోకమింకా గుర్తించని రోజుల్లోనే, ఆయనలోని మహనీయతను గుర్తించి, రోజూ ఆయనకు ఆహారం పెట్టికానీ తాను తినకూడదన్న నియమం పెట్టుకుందంటే బయజాబాయి పూర్వజన్మ సంస్కారమెంతటిదో కదా! గొప్ప గొప్ప చదువులు, వింత వింత నాగరికపోకడలు లేకపోతేనేం? భక్తి మమతలతో నిండిన ఆనాటి శిరిడీ గ్రామంలోని గృహిణుల సంస్కారానికి చేయెత్తి మొక్కవలసిందే!

బాబా శిరిడీచేరిన రెండు సంవత్సరాల తర్వాత (1876 సంవత్సరంలో) అహ్మద్ నగర్ జిల్లా అంతటా పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు రోజుల్లో అప్పుడు ధనికులైన నందూరాం, బయజాబాయి ఇళ్ళవద్దకు మాత్రమే బాబా భిక్షకు వెళ్ళేవారు. అప్పుడు ఆయనకు ఒక్కొక్క ఇంటిదగ్గర సగం రొట్టెముక్క లభించేదట!


బాబాను దైవస్వరూపంగా కనుగొన్న భక్తులు ప్రవాహంలా శిరిడీకి రావడం మొదలై, ధనికులైన భక్తులు ఖరీదైన మధురపదార్థాలను నైవేద్యంగా ఆయన ముందు పెడుతున్నా, ఆయన మాత్రం భిక్షాటనతోనే జీవించారు. తమచుట్టూ రోజురోజుకు పెరుగుతున్న ఆడంబరాలపై ఏమాత్రం దృష్టిపెట్టలేదు. లోకానికి ఒక ఫకీరుగా ప్రకటమైన ఆయన, చివరి వరకు ఆ ఫకీరుగానే జీవించారు. తనకోసం వంటచేసుకోవటం కానీ, మరుసటిరోజు కోసం ఏదీ దాచుకోవడంగానీ ఆయనెన్నడూ చేయలేదు. చివరి రోజులలో అనారోగ్యం వల్ల నడవలేని పరిస్థితులలో కూడా, తనకు మారుగా మరెవరినైనా భిక్షాటనకు పంపేవారు.


బాబా అప్పుడప్పుడు మలబద్ధకం, జీర్ణకోశవ్యాధులతో బాధపడేవారు. వాటి నివారణకు గాను సోనాముఖి ఆకును మరికొన్ని మూలికలను కలిపి కషాయం తయారుచేసేవారు. తాము కషాయం తీసుకునేటప్పుడు ఆ కషాయాన్ని పక్కనున్న భక్తులకీ ఇచ్చేవారు! కండ్లకలక లాంటివి వచ్చినప్పుడు మిరియాలను ముద్దగా నూరి, దానిని కండ్లలో వుంచుకునేవారు. ఇక ఆయనెక్కువగా బాధపడింది ఉబ్బసంతో. ఉబ్బసం మరీ ఎక్కువైనప్పుడు ఆయన పడుతున్న బాధను చూడలేక సన్నిహితభక్తులు కంటతడి పెట్టుకునేవారు. అలాంటి సందర్భంలోనే ఒకసారి, ఆయన్ని చూసి పురందరే పెద్దగా ఏడుస్తుంటే, “భావూ, ఏమైందని నాకిపుడు? తగ్గిపోతుందిలే, ఊరుకో!” అని బాబాయే అతన్ని ఓదార్చవలసివచ్చింది. అంత అనారోగ్యంలో కూడా బాబా తన భిక్షాటనను మానేవారే కాదు. ఆయన నడవలేని స్థితిలో వుంటే ఒక్కోసారి భక్తులే ఆయనను నడిపిస్తూ భిక్షకు తీసుకెళ్ళేవారు! అలా బాబా ఒకసారి తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు ఒక భక్తుడు బాబాకు ఒక చక్రాలకుర్చీని సమర్పించాడు (ఇప్పటికీ ఆ కుర్చీని చావడిలో చూడవచ్చు). బాబా దాన్నొకసారి తాకి పక్కన పెట్టేశారే కానీ, ఎన్నడూ ఆ కుర్చీని ఉపయోగించలేదు.

బాబా అనారోగ్యంగా వున్నపుడు ఆయన ప్రతినిధులుగా భిక్షకు వెళ్లిన భాగ్యాన్ని పొందిన భక్తులలో శ్రీ మాధవరావు దేశ్ పాండే (షామా), శ్రీ బాలక్ రామ్, శ్రీ వామన్ రావ్ పటేల్ (శ్రీ సాయి శరణానంద), ప్రొఫెసర్ జి.జి.నార్కే మొదలైనవారున్నారు.

శ్రీసాయిశరణానంద తమ స్మృతులలో ఇలా రాసుకున్నారు: “ఒకసారి బాలక్ రామ్ ఊర్లో లేనందువల్ల, బాబా కోసం మధ్యాహ్నంపూట భిక్ష చేసే అవకాశం నాకు చాలారోజులు లభించింది. నేను శ్రీజోగ్ ఇంటినుండి భిక్షను, మరొకరి ఇంటినుండి పాలను తెచ్చేవాడిని”. శ్రీసాయిశరణానందకు లభించిన అవకాశం చూసిన నార్కే తనకు ఆ సేవ లభిస్తే బాగుండునని మనసులో తలిచాడు. ఒకరోజు దుస్తులు మార్చుకునే వ్యవధిలేక సూటు-బూటు-హేటులతో మసీదు చేరిన నార్కేనుద్దేశించి బాబా, “ఈరోజు ఇతను భిక్షకు వెళతాడు” అని అన్నారు. ఆనందంతో అతను అప్పటికప్పుడు, ఆ దుస్తులతోనే భిక్షకు వెళ్ళివచ్చాడు. అలా బాబా కొరకు భిక్షచేసే అరుదైన అవకాశం నార్కేకు నాలుగునెలలపాటు లభించింది.

భిక్షకు వెళ్ళేటప్పుడు బాబా భుజాన ఒక జోలె, చేతిలో ఒక రేకుడబ్బా తీసుకువెళ్ళేవారు. అన్నము, రొట్టె, కూరలు మొదలైన ఘనపదార్థాలు జోలెలోనూ, పులుసు, పాలు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలను రేకుడబ్బాలోనూ పోయించుకొనేవారు. ఆయనెన్నడూ రుచుల కోసం చూడలేదు. తన భక్తులకూ “రుచులకు పోవద్దు!” అని చెప్పేవారు.

బాబా భిక్షకు వెళ్ళేమార్గం ఎప్పుడూ ఒకేతీరుగా వుండేది. మసీదు నుండి చావడి దాటిన తరువాత ఎదురెదురుగా వుండే సఖారాం షెల్కే, వామన్ రావ్ గోండ్కర్‌‌ల ఇళ్ళ దగ్గర మొదట భిక్షనడిగేవారు. తరువాత కొద్దిదూరంలో, పక్కపక్కన వుండే బయ్యాజీ పాటిల్ మరియు తాత్యాకోతే పాటిల్ (బయజాబాయి) ఇళ్ళదగ్గర భిక్ష తీసుకుని చివరగా నందూరాం ఇంటికి వెళ్ళేవారు. బయ్యాజీపాటిల్ ఇంటినుంచి వచ్చేదారిలో అప్పట్లో ఒక చిన్నగుట్ట వుండేది. భిక్ష తీసుకుని వస్తూ బాబా అక్కడ నిలబడి వీధిలో కుక్కలకూ, కాకులకూ ఆహారాన్ని పెట్టేవారు. ఇప్పుడు ఆ స్థలంలో బాబా పాదుకలను ప్రతిష్ఠించి వున్నారు. భిక్షాటన నుంచి మసీదుకి రాగానే, కొంత పదార్ధాన్ని ముందు ధునికి సమర్పించేవారు. తరువాత మసీదులో ఒకమూలవుండే కొలంబా (మూకుడు)లో మిగిలిన పదార్ధాలన్నింటినీ వేసేవారు. దానికి పైన మూత వుండేదికాదు. కుక్కలు, పిల్లులు, చీమలు, ఈగలు వంటి ప్రాణులకు అది సిద్ధాన్నం. ఎవరైనా సరే అందులోంచి ఆహారాన్ని యధేచ్ఛగా తీసుకోవచ్చు. వేటినీ తరమటంగానీ, ఎవరినీ వారించటం కానీ జరిగేదికాదు. మసీదు శుభ్రం చేసే స్త్రీ స్వతంత్రంగా దానిలో నుంచి రోజూ ఏడెనిమిది రొట్టెలదాకా తీసుకెళ్ళేది.

బాబా ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర మధ్య లెండీకి వెళ్ళివచ్చేవారు. లెండీకి వెళ్ళేటప్పుడు మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు, అదికూడా ప్రతిసారీ కాదు. ముందు మసీదు బయటకు వచ్చి, కొద్దిసేపు అక్కడ గోడకు ఆనుకుని నిలబడేవారు. తర్వాత మారుతి ఆలయం ఎదురుగా నిలుచుని తీక్షణమైన వీక్షణాలతో ఏవో సంజ్ఞలు చేసేవారు. తర్వాత గురుస్థానం దగ్గర అన్నివీధుల కూడలిలో నిలుచుని కొద్దిసేపు ఎవరికో ఏదో చెబుతున్నట్లు సైగలు చేసి, ముందుకు కదిలేవారు. వాడాలో వున్న భక్తులు, కొత్తగా దర్శనార్థం వచ్చినవారూ బాబాను అక్కడ దర్శించుకునేవారు. వారంతా బాబా రాకకై ఎదురుచూస్తూ ఆ ప్రదేశంలో బారులు తీరి నిలుచుని వుండేవారు. బాబా వారిని ఆప్యాయంగా పేరుపేరునా పలుకరిస్తూ, చిరునవ్వుతో మెల్లగా నడిచేవారు. ఆ తర్వాత ఎడమవైపుకి తిరిగి కానిఫ్ నాథ్ మందిరం దిశగా నడిచేవారు(పోస్టాఫీసు ఎదురుగా కానిఫ్ నాథ్ మందిరం వుంది). కొంతదూరం ముందుకు వెళ్ళి కుడివైపుకి తిరిగి లెండీలో ప్రవేశించేవారు. అలా లెండీకి చేరిన బాబా అక్కడ తమ నిత్యకృత్యాలు తీర్చుకునేవారు. లెండీలో యిపుడు వేప, రావి చెట్లు వున్నచోటే చిన్నగుంటలో ఓ దీపం (నందదీపం) వుండేది. దానిచుట్టూ గోనెపట్టాలతో తెరలు కట్టబడి వుండేవి. బాబా కొద్దిసేపు అక్కడ కూర్చునేవారు. బాబా అక్కడ కూర్చున్నపుడు దానికి వీపుతిప్పి కూర్చునేవారు. దానివంక చూసేవారు కాదు. అబ్దుల్ బాబా ఆ ప్రదేశమంతా శుభ్రంగా చిమ్మటం, దీపాలలో నూనె పోయటం వంటి పనులు చేస్తుండేవాడు. బాబా రాగానే అతనక్కడ రెండుకుండలతో నీరు తెచ్చిపెట్టేవాడు. బాబా ఆ కుండలలోని నీటిని అన్ని దిక్కులకు చల్లుతూ ఏవో సైగలు చేసేవారు. అప్పుడు వేరెవ్వరూ అక్కడ వుండటానికి బాబా అంగీకరించేవారు కాదు. అబ్దుల్ బాబా కూడా ఆ సమయంలో దూరంగానే ఉండేవాడు. లెండీదాకా బాబాతో వచ్చిన భక్తులు కూడా, లెండీ బయటే బాబాకోసం ఎదురుచూస్తూ నిలుచునేవారు. అక్కడున్న వేప, రావి మొక్కలను బాబానే స్వయంగా నాటారు. అందులో ఒక మొక్క మొదట బలహీనంగా వుండి సరిగా ఎదగకుండా వుంటే బాబా రోజూ దాన్ని అటు ఇటూ వూపి వంచేవారు. బాబా అమృత హస్తస్పర్శతో బలం పుంజుకుని కొద్దిరోజుల్లోనే ఏపుగా పెరిగిందది. అక్కడలా కొద్దిసేపు గడిపిన తర్వాత లెండీనుంచి మసీదుకు మళ్ళీ వెళ్ళినదారినే తిరిగివచ్చేవారు. ఈ రాకపోకల దారిని ఆయన ఒక్కరోజున కూడా మార్చలేదు. నియమానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చే బాబా ఏ ఒక్క పనైనా, అది చిన్నదేకావచ్చు పెద్దదేకావచ్చు, నియమం తప్పటానికి ఒప్పుకునేవారు కాదు. బాబా సన్నిధికి అసంఖ్యాకంగా భక్తులు రావడం మొదలైన తర్వాత, బాబా లెండీయాత్ర చిన్నతరహా ఉత్సవంలాగా జరగసాగింది. బాబా లెండీ వెళ్ళడానికి మసీదు బయటకు రాగానే, ఆయన వెనుక నడుస్తూ, భాగోజి ఛత్రాన్ని పట్టేవాడు. నాణ్యమైన కుట్టుపని, అల్లికలు, కుచ్చులతో ఆ ఛత్రం చూడముచ్చటగా వుండేది. ఇక బాబాకు కుడి ఎడమలుగా నానాసాహెబ్ నిమోన్‌‌కర్, బూటీలు నడిచేవారు. వీరందరూ కలిసి లెండీకి నడుస్తున్న ఒరిజినల్ ఫోటో మనకు లభ్యమవుతుంది.



కాలాతీతుని దినచర్య

బాబా లెండీనుంచి మసీదు తిరిగి వచ్చేసరికి ఉదయం పదిగంటలయ్యేది. అప్పటినుండి పదకొండున్నర వరకు సాయిదర్బారు జరిగేది. అపుడు బాబా వద్దకు వెళ్ళే భక్తులు కొందరు తమ బాధలు చెప్పుకునేవారు. కొందరు సలహాలు అడిగేవారు. మరికొందరు తమ కోర్కెలు తీర్చమని ప్రార్థించేవారు. వీళ్ళందరితో పాటు గాయకులు, నర్తకులు, గారడీవాళ్ళు వచ్చి తమ విద్యలు ప్రదర్శించి బాబా యిచ్చే బహుమానం పుచ్చుకుని వెళ్ళేవారు. సామాన్యంగా, వారికి బాబా రెండు రూపాయలు ఇచ్చేవారు. కొందరు బాబాకు నైవేద్యాలు సమర్పించుకునేవారు. సాధారణంగా, బాబా వాటిని తమ చేత్తో తాకి, తిరిగి వారికే ఇచ్చేసేవారు. లేదా, ప్రసాదంగా అక్కడున్న భక్తులందరికీ పంచమనేవారు. చాలా అరుదుగా మాత్రమే ఆ పళ్ళాలనుంచి కొద్దిగా తీసుకుని నోటిలో వేసుకునేవారు. ఎవరి పళ్ళెంలోంచి బాబా స్వీకరించారో వారు ఎంతో ఉప్పొంగిపోయేవారు. మామిడిపళ్ళ కాలంలో బాబా ప్రతిరోజూ ఒక పండుని తీసుకుని దానిని కొద్దిగా రుచిచూసి మిగిలినవారికి పంచేవారు. ఒక్కోసారి స్వయంగా ఆయనే పండ్లుకొని అందరికీ పంచమనేవారు. బాబా తమకు నైవేద్యంగా తెచ్చిన మధురపదార్థాలను పిల్లలకు ఎక్కువగా పెట్టేవారు. తన దగ్గరకు ఎప్పుడూవచ్చే పిల్లలకైతే ఒకవేళ వారప్పుడు లేకున్నా, వారికోసమని తినుబండారాలను తీసి పక్కన పెట్టేవారు. పిల్లలంటే బాబాకు ఎంతోప్రీతి. వారితో ప్రేమగా లాలిస్తూ మాట్లాడేవారు. ఎవరైనా పిల్లలను అదిలించటం, కొట్టటం ఆయన సహించేవారు కాదు.


పిల్లలంటే అలా మక్కువచూపే బాబా పెద్దవారితోనుండేటపుడు ఎక్కువగా మితభాషిగానే వుండేవారు. నవ్వినా చిరునవ్వేకానీ, పెద్దగా నవ్వేవారుకాదు. ప్రసన్నంగా వున్నపుడు మాత్రం చిన్నచిన్న కథలు చెప్పేవారు. ఆ సమయానికి అక్కడున్న భక్తబృందంలో ఎవరికో ఒకరికది మొత్తం తమ జీవితకథ అని తెలుసుకొని అబ్బురపడేవారు. ఒక్కోసారి వాటిలోనే మందలింపులూ వుండేవి. ఆ పరిభాష దానికి సంబంధించినవారికి మాత్రమే అర్ధమయ్యేది. మిగిలినవారు అవి ఎవరికో సంబంధించిన కథో లేక పూర్వజన్మవృత్తాంతమో అనుకునేవారు. ఒక్కోసారి బాబా చెప్పిన కథలు విన్న భక్తులందరూ వాటిని పూర్తిగా మర్చిపోయేవారు. అందరూ కలిసి గుర్తుచేసుకుందామన్నా గుర్తుకువచ్చేవికావు. అది చాలా వింతగా అనిపించేది.

ఇక పదకొండున్నరకి మసీదు ముందున్న గంటను వాయించేవారు. అది ఆరతికి వేళయిందన్న దానికి సంకేతం. ఆ ఘంటానాదం విని యెక్కడున్నవారూ ఆరతికి హాజరయ్యేందుకు వడివడిగా మసీదుకు చేరేవారు. పన్నెండుగంటలకు ఆరతి మొదలయ్యేది. బాబానపుడు గంధపుష్పాదులతో పూజించేవారు. స్త్రీలు బాబాకు ముందు మసీదులో నిల్చునేవారు. పురుషులంతా మసీదు బయటనున్న ఖాళీజాగాలో నిలబడేవారు.

ఆరతివేళలలో బాబాలో కనబడే దివ్యతేజస్సు, వర్ఛస్సు, అలౌకికసౌందర్యం చూచేందుకు రెండుకనులూ చాలేవి కావని ఆ ఆరతుల మహత్తర దృశ్యాలను చూసిన ఆనాటి భక్తులు తమ డైరీలలో పొందుపరచుకొన్నారంటే (ఉదా.. శ్రీఖాపర్డే డైరీ) అవెంత మనోహరంగా ఉండేవో మనమూహించుకోవచ్చు!

మధ్యాహ్నఆరతి అయ్యాక బాబా అందరికీ ఊదీ ఇచ్చి ఆశీర్వదించి ఇళ్ళకు పంపేవారు. భక్తులను ప్రేమగా పలకరించి భోంచేసి రమ్మని చెప్పేవారు. ఆ తరువాత తాను తెచ్చిన భిక్షాన్నానికి కొంత నైవేద్యాలను కలిపి పది పన్నెండుమంది భక్తులతో కలిసి భోజనం చేసేవారు. బాబాకు ఎడంవైపు తాత్యాపాటిల్, రామచంద్రపాటిల్, బయ్యాజీపాటిల్ కూర్చునేవారు. కుడివైపున మాలేగాంఫకీర్ (బడేబాబా), షామా, బూటీ, కాకాసాహెబ్ దీక్షిత్ కూర్చునేవారు. తాత్యా, రామచంద్రపాటిల్, బయ్యాజీపాటిల్ ఒక కంచంలోనూ, బాబా, మాలేగాంఫకీర్ లు కలిసి మరోకంచంలోనూ భోంచేసేవారు. బాబా తమ మధ్యాహ్నభోజనం ఎప్పుడూ ఒంటరిగా చేసేవారుకాదు. బడేబాబా లేకుండా భోజనానికి కూర్చునేవారు కారు. భోజనానికి కూర్చున్న తర్వాత మసీదు ముందు పరదాలు దించేవారు. పరదాలు వేసిన తరువాత మసీదు లోపలికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. భక్తులు కాళ్ళు చేతులు కడుక్కుని బాబాకు ఇరువైపులా వరుసగా భోజనానికి కూర్చోగానే, బాబాకు నైవేద్యంగా సమర్పించుకొన్న పదార్థాలన్నింటినీ కలిపి బాబా ముందుంచేవారు. బాబా దాన్ని ముందు దైవానికి నివేదించి, కొంతభాగాన్ని ప్రసాదంగా మసీదు బయటవున్న వారికి పంచమని పంపేవారు. మిగిలినదానిలో ఒకభాగం పాలు, ఒకభాగం పంచదార, ఒకభాగం రొట్టె ఒకగిన్నెలో వేసి బాగా పిసికి దానిని అందరికీ పంచేవారు. తరువాత మసీదులో భోజనానికి కూర్చున్నవారందరికీ నిమోన్కర్, షామా వడ్డన చేసేవారు. ఎవరికైనా వారికిష్టమైన పదార్ధం వుంటే బాబా దాన్ని వారికెక్కువ వడ్డించమనేవారు. షామాకు ఎక్కువగా పాయసం వడ్డించమనేవారు. యం. డబ్ల్యు. ప్రధాన్ మసీదులో భోజనకార్యక్రమం గురించి ఇలా చెప్పారు: “బాబాతో మసీదులో నేను భోజనం చేసేవాడిని. బాబా తమ స్వహస్తాలతో మా పళ్ళాలనిండుగా ఆహారాన్నుంచేవారు. దానిలో కొంతభాగాన్ని ఇంటికి పంపేవాడిని. అదే ఇంటిల్లిపాదికీ సరిపోయేది. బాబా భోజనం చివరిలో అందరికీ ఒక పండు ఇచ్చేవారు. మా అబ్బాయి బాబుకు వండిన పదార్ధాలంటే ఇష్టంలేదని గమనించి వాడికి భోజనం బదులుగా పండ్లను ఇచ్చేవారు.”

ఒక్కోసారి బాబా భక్తులకు స్వయంగా వంటచేసి విందుచేసేవారు. ఆయన దగ్గర యాభై మరియు వందమందికి వండడానికి సరిపడే రెండు పాత్రలుండేవి. వంట చేయాలనుకున్న రోజు అంగడికి వెళ్ళి కావలసిన సరుకులన్నీ తెచ్చుకోవడం, పొయ్యివెలిగించి ఎసరుపెట్టటం, దినుసులు నూరడంలాంటి పనులన్నీ ఆయనే స్వయంగా చేసుకునేవారు (బాబా ఉపయోగించిన ఆ పొయ్యిని మనమీనాటికీ మసీదులో చూడవచ్చు). చక్కెరపొంగలి, పరమాన్నం లేదా మాంసపుపలావు వండేవారు. ఉడుకుతున్న గుండిగలో గరిటె బదులు చేత్తోనే బాగా కలిపేవారు. కానీ, ఆశ్చర్యంగా ఆయన చేయి ఏమాత్రం కాలేదికాదు. పులుసు కాచి, గోధుమరొట్టెలు వేసేవారు. అంబలికాచి మజ్జిగ కలిపిచ్చేవారు. లేదా, గోధుమలు తానే విసరి ఆ పిండితో పెద్ద పెద్ద చపాతీలు చేసి ధునిపై కాల్చేవారు. పొరలు పొరలు వుండే అంత పెద్ద చపాతీ ఎవరికైనా ఒక్కటి తింటేనే కడుపునిండిపోయేది. మాంసాహారాన్ని వండుతుంటే శాఖాహారులను అటు రానిచ్చేవారుకాదు. వంట పూర్తవగానే మౌల్వీచేత నివేదన చేయించి అందులో మొదట కొంత మహల్సాపతికి, కొంత తాత్యా యింటికి పంపి ఆ తరువాత అందరికీ పంచేవారు. 1910 తర్వాత భక్తులరాక ఎక్కువై, నైవేద్యాలు కూడా ఎక్కువవటంతో బాబా వంట చేయటం ఆపేసారు. భక్తులు బాబాకు సమర్పించే నైవేద్యాలతో సుమారు 150-200 మంది భోజనం చేసేవారు.

బాబా ఉపయోగించిన పొయ్యి


అందరి భోజనమూ అయిన తరువాత, సగుణమేరునాయక్ ఆ ప్రదేశమంతా శుభ్రం చేసేవాడు. బాబా తన స్థానంలో ఆశీనులవగానే అతనే తాంబూలము, నీళ్ళగ్లాసుతో పాటు రెండు రూపాయలు దక్షిణ సమర్పించుకునేవాడు.

భోజన కార్యక్రమమయ్యాక మసీదులో ఎవరూ వుండేవారు కాదు. అందరినీ ఇళ్ళకు పంపించి బాబా ఒక్కరే ఒంటిగంట నుంచి రెండున్నరదాకా ఏకాంతంగా వుండేవారు. బాబా ఒక ఇటుకరాయిని ఎప్పుడూ తనతో వుంచుకుని ఎంతో అపురూపంగా చూసుకునేవారు. అది తన గురుప్రసాదమని చెప్పేవారు. కూర్చున్నప్పుడు, తన కుడిచేతిని ఆ రాయిమీద పెట్టుకునేవారు. బాబా పగలు నిద్రించేవారు కాదు. కూర్చున్నప్పుడు గోడకు ఆనుకునేవారు కాదు. ఆ సమయంలో ఎవరికీ కనిపించని విధంగా ఒంటరిగా కూర్చుని ఒక చిన్న పాతగుడ్డసంచిని బయటకు తీసేవారు. అందులో అరిగిపోయిన పాత నాణాలుండేవి. పావలాలు, అర్థలు, అణాలు, పైసలు ఇలా వుండే ఆ నాణాలను బాబా చేత్తో బాగా రుద్దుతూ, “ఇది నానాది, ఇది కాకాది, ఇది సోమ్యాది, ఇది దామ్యాది” అని అంటూ వుండేవారు. అప్పుడు పొరపాటున ఎవరివైనా అడుగులచప్పుడు వినిపించినట్లనిపిస్తే, చప్పున వాటిని సంచీలో వేసి దాచేసేవారు. ఆ కాసులేమిటో, ఎందుకలా బాబా వాటిని అరగదీస్తుండేవారో ఎవరికీ తెలియదు. బాబా ఎన్నడూ వాటి గురించి ఎవ్వరికీ చెప్పలేదు. అప్పుడపుడు ఆ ఏకాంత సమయంలోనే తన పాత కఫ్నీకి చిరుగులుంటే వాటిని నేర్పుగా కుట్టుకుంటుండేవారు.

మధ్యాహ్నం రెండున్నరకు మళ్ళీ ఒకసారి లెండీబాగుకు వెళ్ళివచ్చేవారు. లెండీ నుండి వచ్చిన తరువాత మరొకసారి సాయిదర్బారు వుండేది. అదయ్యాక సాయంత్రం బాబా మసీదు ముంగిట్లో అటూ, ఇటూ పచార్లు చేస్తుండేవారు. ఆ సమయంలోనే మసీదు ప్రహరీగోడనానుకుని ఆ వీధిలో అటూ ఇటూ పోయేవారితో సావకాశంగా మాట్లాడేవారు. ఒక్కోసారి తమకు మాత్రమే అర్థమయ్యే పరిభాషలో మాట్లాడుతుండేవారు. “పదిపాములు వెళ్ళిపోయాయి, ఇంకా చాలా వస్తాయి”; “ఇక్కడ జనం చీమల్లా గుమికూడతారు”; “వణి (వ్యాపారస్థులు) తేలీ (నూనెవర్తకులు), నన్ను చాలా ఇబ్బందిపెట్టారు. నేనీ మసీదులో ఎక్కువ కాలం వుండను. నేనిక్కడనుండి వెళ్ళిపోతాను” అనేవారు. ఒక్కొక్కసారి మసీదు విడిచి నిజంగానే బయలుదేరేసేవారు. బాబా బయలుదేరుతున్నారన్న విషయం చెవినపడిన వెంటనే తాత్యా ఒక్క పరుగున బాబా వద్దకు వచ్చి “మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవాళ్ళను నేను దండిస్తాను. నేను మిమ్మల్ని శిరిడీ వదిలి వెళ్ళనివ్వను. ఈ రోజు వద్దు బాబా, మరోరోజు వెళదాము” అంటూ బుజ్జగించేవాడు. బాబా ఒక్కోసారి ఎందుకలా చేసేవారో ఆయనకే ఎరుక. తాత్యా సముదాయించిన తరువాత, బాబా మరలా యధాస్థానంలో కూర్చుని ఏమీ జరగనట్లే భక్తులతో మాట్లాడేవారు. మసీదు ప్రహరీ గోడనానుకుని వారు నిలుచున్నచోట యిపుడు చిన్న పాదుకలు ప్రతిష్ఠించి ఉన్నారు. గోడపై మోచేయి ఆనించుకొనే చోట కూడా పాదుకలు ప్రతిష్ఠింపబడివున్నాయి. ఆ స్థానంలో నిలబడి బాబా ఒక్కొక్కసారి సూర్యోదయాన్ని గమనిస్తుండేవారట.



సాయంత్రాలు తరచుగా మసీదుకు పక్కనున్న వీధిలో అటూఇటూ నడిచేవారు. అపుడు ఆ వీధిలో జనం బారులు తీరి నిలుచునేవారు. బాబా వారందరితో కుశల సమాచారాలు మాట్లాడుతూ మెల్లగా నడిచేవారు.

ఆరు ఆరున్నర మధ్య బాబాకు సంధ్యారతి ఇచ్చేవారు. ఆరతి తరువాత జరిగే సాయిదర్బారులో మళ్ళీ భక్తులంతా బాబా దగ్గర చేరి వారి కష్టసుఖాలు చెప్పుకుని ఆశీర్వాదాలు పొందేవారు.

బాబా, భక్తులను దక్షిణ అడిగి తీసుకునేవారు. సుమారు రాత్రి ఎనిమిదిగంటల సమయంలో బాబా దక్షిణరూపంలో ఆరోజు వచ్చిన డబ్బునంతా పంచేసేవారు. బాబా జీవితపర్యంతం ఆ దానయజ్ఞం కొనసాగింది. ప్రతిరోజూ బాబా ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క నిర్ణీతమొత్తం చొప్పున కొందరు భక్తులకు పైకం ఇచ్చేవారు. భక్తులు దీన్ని బత్యం అనేవారు. బడేబాబాకు 55 రూ/-, తాత్యాకు 35 రూ/-, జంతేముసల్మానుకు 7 రూ/-, బయ్యాజీపాటిల్ కోతేకు 4 రూ/-, భాగోజీకి 4 రూ/-, రామచంద్రపాటిలుకు 4 రూ/- ఇచ్చేవారు. బాబా వద్దనుండి ప్రతిరోజూ డబ్బు తీసుకునేవారిలో రామచంద్రపాటిల్ తాను తీసుకున్న 4 రూపాయలకు బదులు నాలుగు కలకండ పలుకులను బాబాకు సమర్పించేవాడు. నూతన వధూవరులు తమ ఆశీస్సుల కోసం వచ్చినపుడు బాబా వారికి చెరొక రూపాయి ఇచ్చేవారు. రామనవమి లాంటి ఉత్సవాలు జరిగినపుడు దాదాకేల్కరుకు, బడేబాబాకు రెండుకట్టల రూపాయినోట్లు యిచ్చి పంచమనేవారు. బాబాకు వచ్చే నైవేద్యం మీద ఆధారపడి ఎందరో ఫకీర్లు, బైరాగులు జీవించేవారు. వారికి ఒక్కొక్కరికి బాబా రోజూ 25 పైసలు ఇచ్చేవారు. సాయంత్రం హరిదాసులు, పౌరాణికులు, వివిధ కళాకారులు, సర్కస్ వాళ్ళు తమతమ కళలను బాబా ముందు ప్రదర్శించేవారు. బాబా వారికి ఒక్కొక్కరికి రెండు రూపాయలు ఇచ్చేవారు.

ఇదంతా అయిన తరువాత ప్రతిరోజూ రాత్రి తాత్యా రొట్టెలు, పాలు నైవేద్యంగా తెచ్చేవాడు. బాబా అందులోనుంచి కొంత స్వల్పంగా తీసుకున్నాక, తక్కినది ప్రసాదంగా అందరికీ పంచేవారు. ఆ సమయంలో ప్రతిరోజూ బాబా తాత్యాకు 35 రూ/- ఇచ్చేవారు. అది బాబా మసీదులోనే నిదురించే రోజైతే అందరూ బాబా వద్ద ఊదీ తీసుకుని ఇళ్ళకు వెళ్ళిపోయేవారు. మహల్సాపతి, తాత్యాలను తప్ప మరెవ్వరినీ రాత్రిళ్ళు మసీదులో నిద్రించటానికి బాబా అనుమతించేవారు కాదు.

ఒకనాడు శిరిడీలో కుంభవృష్టి కురిసింది. శిధిలావస్థలోనున్న మసీదు పరిస్థితిని గమనించి అతి చేరువలోనున్న చావడిలో ఆ రాత్రి తలదాచుకోమని భక్తులు ప్రార్థించారు, ఒత్తిడిచేశారు. మసీదు నుండి కదిలేందుకు బాబా ససేమిరా అంగీకరించలేదు. అప్పుడు నారాయణతేలి అనే ఒక భక్తుడు చొరవ తీసుకుని శ్రీసాయి వద్దని కేకలేస్తున్నా లక్ష్యపెట్టకుండా, ఆయనను భుజాలపై మోసుకుని వెళ్ళాడు. అలా ఒకరాత్రి చావడిలో గడిచింది. ఆనాటినుండి మిగిలిన జీవితపర్యంతం రోజుమార్చిరోజు చావడిలో నిద్రించారు బాబా.

బాబా చావడిలో కుడిభాగంలో పడుకునేవారు. ఇప్పుడు ఆ భాగాన్ని రైలింగుతో వేరుచేసి వున్నారు. ఎడమవైపు భాగంలో మరికొందరు భక్తులు పడుకునేవారు. బాబా చావడిలో నిద్రించేరోజు గొప్పగా చావడిఉత్సవం జరిగేది. రాధాకృష్ణమాయి, అబ్దుల్ మసీదునుండి చావడి వరకు గల రోడ్డును చిమ్మేవారు. దుమ్ము పైకిలేవకుండా నీళ్ళుచల్లేవారు. రంగురంగుల ముగ్గులుపెట్టేవారు. దారిపొడవునా బాబా నడిచేందుకు గుడ్డపరిచేవారు. తరువాత తాత్యా బాబా వద్దకు వచ్చి చావడికి బయలుదేరటానికి సిద్ధంగావుండమని చెప్పేవాడు. కానీ బాబా కదిలేవారు కాదు. తాత్యా అప్పుడు చంకలో చేయివేసి లేవదీసేవాడు. బాబా బయలుదేరగానే ఒక జలతారు శాలువాను ఆయన భుజాలపై వేసేవాడు. బాబాకు ఎడమవైపు తాత్యా, కుడివైపున మహల్సాపతి నిలుచుని బాబాను మసీదునుంచి చావడివైపుకి నడిపించేవారు. చావడికి వెళ్లేముందు, బాబా కుడికాలిపాదంతో ధునిలోని కట్టెలు సవరించి, కుడిచేత్తో అక్కడున్న దీపాన్ని ఆర్పి బయలుదేరేవారు. బాబా ఎడమచేతిని తాత్యా, కుడిచేతిని మహల్సాపతి పట్టుకుని బాబాను మసీదునుండి చావడికి నడిపించి తీసుకెళ్ళేవారు.

బాబా మసీదుమెట్లు దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పిలాజీగురవే షహనాయి వాయించేవాడు. భక్తులు భజనచేసేవారు. ఉత్సవానికి ముందు చక్కగా అలంకరించబడిన శ్యామకర్ణ, సాయిపాదుకలున్న పల్లకీ కదిలేవి. రకరకాల దీపాలంకరణలతో కన్నులపండువగా సాగేదా ఉత్సవం. ఒకవంక సంగీతవాయిద్యాల హోరు, మరొకవంక భజన, ‘సాయినాథ్ మహరాజ్ కీ జై!’ అన్న జయజయ ధ్వానాలు మిన్నుముట్టేవి. మధ్యమధ్య భక్తులు బాబాపై పువ్వులు, గులాల్ చల్లేవారు. బాబా ప్రసన్నంగా అడుగులో అడుగులేస్తున్నట్లు మెల్లగా కదులుతూ ముందుకుసాగేవారు. బాబాకు అందంగా అలంకరించిన గొడుగును జోగ్ పట్టేవాడు. బాబా మసీదు చివరకు వచ్చింతరువాత మారుతి ఆలయం వైపుకు తిరిగి కొన్ని భంగిమలు చేసేవారు.


బాబా రాకను స్వాగతిస్తూ చావడిని అద్దాలు, దీపతోరణాలతో అలంకరించి సిద్ధంగా ఉంచేవారు. బాబా చావడి చేరగానే తాత్యా ముందు లోపలికి వెళ్ళి బాబాకు ఆసనం, ఆనుకోవటానికి చెక్క అమర్చి, బాబాను దానిమీద కూర్చోబెట్టి ఆయనకు ఒక అందమైన కోటు తొడిగేవాడు. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరిగే ఛత్రం పట్టేవాడు. బాబా ద్వారానికెదురుగా ఆసీనులయాక జోగ్ వెండిపళ్ళెంలో బాబా పాదాలు కడిగి, గంధం రాసి తాంబూలం సమర్పించేవాడు. భక్తులు బాబాకు పాదనమస్కారాలు చేసుకునేవారు. అంతలో షామా చిలిం తయారుచేసి బాబాకు అందించేవాడు. తరువాత అది భక్తులందరకూ చేరేది. కోండ్యా కిళ్ళీలను సిద్ధంచేసి బాబాకిచ్చేవాడు. బాబా కొన్ని తాము వేసుకుని, మిగిలినవి భక్తులపై విసిరేవారు. తరువాత శేజారతి జరిగేది. శేజారతి అయ్యాక భక్తులంతా ఇళ్ళకు వెళ్ళేందుకు శలవు తీసుకుంటూండగా బాబా అందరినీ పంపించి తాత్యాతో మాత్రం “వెళితే వెళ్ళావు కానీ, మధ్యమధ్యలో వచ్చి నన్ను గమనించి పోతూండు” అని చెప్పి సెలవిచ్చిపంపేవారు. తాత్యా అలాగేనని చెప్పి వెళ్ళేవాడు.

జగద్రక్షకుడైన శ్రీసాయి లోకధర్మాన్ననుసరించి పవళిస్తున్నట్లు అలా కనులు మూసుకున్నా, వారి కనుదోయినుంచి కరుణాదృక్కులు మనపై సదా ప్రసరిస్తూనేవుంటాయి! ఆయన తన బిడ్డలమైన మనందరినీ చల్లగా గమనించుకుంటూ, కాపాడుకుంటూనే వుంటారు!

సమాప్తం.....

మూలం: సాయిపథం ప్రధమ సంపుటం.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo