సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి పాదుకలు నెల్లూరు వచ్చిన వేళ - భక్తురాలికి కలిగిన చక్కని అనుభవం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నెల్లూరు నుండి ఒక సాయిబంధువు తమ అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.

ఈ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా దేశమంతటా ఒక్కొక్క ఊరికి భక్తుల సందర్శనార్ధం బాబా పాదుకలను తీసుకుని వస్తున్నారన్న విషయం అందరికీ తెలిసినదే. అందులో భాగంగానే మొన్న అంటే 2018 సెప్టెంబర్ 21, శుక్రవారం సాయంత్రం బాబా పాదుకలను నెల్లూరు పట్టణానికి తీసుకొని వచ్చారు. బాబా కృపావర్షమా అన్నట్లుగా పాదుకలు వచ్చేముందు నెల్లూరులో భారీ వర్షం కురిసింది. ఆ వానలో కూడా భక్తులు బాబా పాదుకల రాకకు ఎంతో ఆత్రంగా ఎదురుచూసారు. పాదుకలు అన్నమయ్య సర్కిల్ కి రాగానే భక్తులు బాబా పాదుకలకు నీరాజనాలు పట్టారు. కోలాటాలతో, సాయి నామస్మరణతో ప్రతి భక్తుని మనస్సు పులకరించిపోయింది. తరువాత భక్త జనసందోహం మధ్య వైభవంగా ఊరేగింపుగా పాదుకలను తీసుకొని వచ్చి నెల్లూరు గొలగమూడి రోడ్డులో ఉన్న వి.పి.ఆర్. కన్వెన్షన్ సెంటర్ లో భక్తుల దర్శనార్ధం ఉంచారు. సెప్టెంబర్ 22, 23 తేదీలలో బాబా పాదుకలను వేలాది భక్తులు దర్శించి తరించారు. ఆ దేవాదిదేవుడు, సద్గురు శ్రీ సాయినాథుని పాదుకల రాకతో మా నెల్లూరు పట్టణానికి ఒక కొత్త కళ వచ్చింది. ఏ మోము చూచినా ఆనంద దరహాసంతో ఒక పండుగ వాతావరణంలా అనిపించింది.

రెండవరోజు బాబా నాకిచ్చిన గొప్ప అనుభవం:

తేది. 22.09.2018 శనివారం సాయంత్రం నేను, మా బాబు, మా నాన్నగారు, మా ఫ్రెండ్ నలుగురం కలిసి బాబా పాదుకల దర్శనార్థం వెళ్లి పాదుకలను దర్శించి బాబా అశీస్సులు పొందాము. అయితే ఈ పాదుకలు ఉంచిన హాల్ పట్టణానికి దూరంగా ఉండటం వలన వాహన సౌకర్యం చాలా తక్కువగా ఉంది. పైగా పాదుకల దర్శనార్ధం చాలామంది భక్తులు రావడంతో చాలా రద్దీగా ఉంది. అప్పుడప్పుడు వస్తున్న ఆటోలలో దాదాపు 20 మంది దాకా ఇరికించి మరీ తీసుకుని పోతున్నారు. దర్శనానంతరం మేము తిరిగి వెళ్దామంటే ఆటోలో అంతేసి జనం చూసి చిన్నపిల్లాడితో ఎలా వెళ్తామని నాకు భయమేసింది. సరే క్యాబ్ బుక్ చేద్దామని ప్రయత్నించాను. నేను రెండు క్యాబ్ లను బుక్ చేసినా కూడా వాళ్ళు ఎందుచేతనో క్యాన్సిల్ చేసారు. ఇంక చేసిదిలేక ఆ దారిలో వస్తున్న కార్లని కూడా లిఫ్ట్ అడిగాను. వాళ్ళు కూడా ఎవరూ ఆపలేదు. మావాళ్ళు విసిగిపోయి దూరంగా కూర్చున్నారు. పరిస్థితి ఇలా ఉన్నా నా మనసుకు ఎందుకో, "బాబా ఉన్నారు, మాకు ఏ ఇబ్బందీ ఉండదు, చాలా సౌకర్యవంతంగా వెళ్తామ"ని అనిపిస్తూ ఉంది. అంతలో ఒక ఆటో వచ్చింది. దాని చుట్టూ దాదాపు ఒక 30 మంది చేరారు. ముందు ఆటోవాళ్ళలాగా ఇతను కూడా ఎక్కించుకుంటే ఎంత లేదన్నా ఒక 300 రూపాయలు వరకు వస్తుంది అతనికి. కానీ ఆ ఆటో అతను వాళ్ళందరినీ పట్టించుకోకుండా నావైపు చూసాడు. నేను, "బి.వి. నగర్ వస్తారా?" అని అడిగితే, అతను 150 రూపాయలు అడిగాడు. నేను 100 రూపాయలు ఇస్తానన్నాను. అతను సరేనన్నాడు. అయితే మేము ఇంటికి చేరుకున్నాక ఆటో దిగి, నేను 100 రూపాయలు ఇస్తే అతను ఇంకో 2 రూపాయలు అడిగాడు. "దేనికి ప్రత్యేకంగా రెండు రూపాయలు?" అని అడిగితే, "నాది కొత్త ఆటో అమ్మా, మొదట మీరే ఎక్కారు. మొదటి బోణి మీదే" అన్నాడు. నేను అతనికి రెండు రూపాయలు ఇచ్చి 'చాలా థాంక్స్ అండీ' అని చెప్పాను. కానీ నా మనసుకెంతో ఆనందంగా అనిపించింది, ఎందుకంటే అంత రష్ లో ఒకే ఆటోలో 20 మంది మధ్య ఇబ్బంది పడకుండా బాబా మమ్మల్ని కొత్త ఆటోలో సౌకర్యవంతంగా ఇంటికి చేర్చారు. పైగా ప్రత్యేకించి 2 రూపాయలు(శ్రద్ధ, సబూరీ) అడగడంతో అది తమ అనుగ్రహమే అని బాబా స్పష్టం చేశారు.

మరో ముఖ్య విషయం, బాబా పాదుకలు నెల్లూరు వస్తున్నాయని మా అన్నయ్య వాట్సాప్ గ్రూపులో షేర్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. కానీ, వెళ్లి దర్శించుకోవడానికి నాకు వీలవుతుందో, లేదోనని బాధపడ్డాను. కానీ బాబా నన్ను ఎంతలా అనుగ్రహించారంటే మూడు రోజులూ కూడా పాదుకలను దర్శించుకునే భాగ్యాన్ని నాకు కల్పించారు బాబా.  చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఎప్పటికీ మీ బిడ్డలపై మీ అనుగ్రహాన్ని ఇలాగే కురిపించండి బాబా.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo