సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

షిర్డీ సాయి ఆరతుల గురించి సమగ్ర సమాచారం - 1వ భాగం.....


షిర్డిలో ఆరతుల తేది 10. 12. 1910న ప్రారంభం:

ఈ హారతులు ఎప్పటి నుండి ప్రారంభించినది, ఏవిధంగా ఇచ్చేది సరియైన తేది. సమాచారం తెలియుటలేదు. సాయి సచ్చరిత్రననుసరించి తేది 10. 12. 1910న చావడిలో హారతులు పారంభామైనవని తెలియుచున్నది. దాదాసాహెబ్ ఖపర్డే గారు మొదటిసారిగా తేది 05. 12. 1910న షిర్డీ వచ్చి తేది 12. 12. 1910 వరకు ఉన్నారు. అప్పుడు షిర్డీ లో ఉన్నప్పటి తన దినచర్య డైరీలలో వ్రాసుకున్నారు. దానిలో తేది 06. 12. 1910న బాబా చావడికి వెళ్ళినట్లు, అలా వెళ్ళినప్పుడు ఊరేగింపుతో గొడుగు, వెండికర్ర చామరములు మొదలగు వాటితో వెళ్ళారని, రాధాకృష్ణమాయి దీపములతో వచ్చినదని, ఆమెను కొంచం దూరంలో తాను చూచానని, చావడి బాగా అందంగా అలంకరించబదినదని” వ్రాసియున్నారు. కనుక అప్పటికి చావడి ఉత్సవం, బాబా రోజు విడిచి రోజు చావడిలో నిద్రించుట జరుగుచున్నట్లు స్పష్టమైనది. కాని అక్కడ రాత్రి, ఉదయం హరతి జరిగినట్లులేదు. అతను డైరీ లో తేది 10. 12. 1910న చావడిలో హారతులు పారంభామైనట్లు ప్రస్తావించలేదు. కనుక ఈ ఆరతులు ఆ తేది తరువాతనే ప్రారంభమయియుండాలి. మళ్ళి తేది 06. 12. 1911న ఖపర్డే షిర్డీ వచ్చినప్పుడు తేది 07. 12. 1911 రాత్రి శేజారతి, తేది 08. 12. 1911 ఉదయం కాకడారతి పాల్గొన్నట్లు వ్రాసియున్నారు.

బాబాకు ప్రధమముగా ఆరతి ఇచ్చినవారు తాత్యాసాహేబ్ నూల్కర్:

తాత్యాసాహేబ్ నూల్కర్ 1909లో మొదటిసారి షిర్డీ వచ్చారు. బాబా సముఖములో మొట్టమొదటి ఆరతి ఇచ్చినది నూల్కరే. ఈ విషయం శ్రీ సాయి శరణానంద ఇలా చెప్పారు. “మహాల్సాపతి, నానాసాహేబ్ చందోర్కర్ కుమారడు మహాదేవ్ మాత్రమే బాబాను పూజించేవారు. తరువాత ఆరతి ఇచ్చు పద్దతి ప్రారంభమైనది.  ఉదయం కాకడ హారతి, రాత్రి శేజ ఆరతి చావడిలో నిర్వహించబడేవి. ద్వారకామాయిలో మధ్యాహ్న ఆరతి మాత్రం ఇవ్వబడుచుండేది. నూల్కర్ గారు మొట్ట మొదటగా ఈ అరతులను ఇచ్చుట ప్రారంభించిరి.”  అదేవిధంగా దీక్షిత్ గారు కూడా “తాత్యాసాహెబ్ నూల్కర్ మొదటిసారి బాబాకు ఆరతి ఇచ్చారు. అంతకు ముందు ఎవరు ఇవ్వలేదు” అని చెప్పిరి. కనుక షిర్డిలో బాబా సముఖములో మొదటగా ఆరతి ఇచ్చినది తాత్యాసాహెబ్ నూల్కర్ అనునది స్పష్టం. ఇతను ఎంతో భక్తీ ప్రపత్తులతో ఆరతి ఇచ్చేవారు.

బాబా సముఖంలో ఆరతులు ఇచ్చినవారు:-

1.  తాత్యాసాహెబ్ నూల్కర్:- సరియేనా తేది తెలియనప్పటికీ 10.12.1910 తరువాతనే తాత్యాసాహెబ్ నూల్కర్ మొదటగా అరతులను ప్రారంభించారు. 1911 మార్చిలో ఆయన చనిపోయేవరకు ఈ ఆరతులు కొనసాగించారు.

2. మేఘ శ్యాముడు:- నూల్కర్ మరణానంతరం ఇతను బాబా సముఖంలో ఆరతులు ఇవ్వడం ప్రారభించాడు. 19.03.1911 నుండి అతను దేహత్యాగం చేసిన 1912 జనవరి 19 కి మూడు రోజుల ముందు వరకు ఇచ్చాడు. ఇతను ఆరతి ఇచ్చే సమయమున ఒంటి కాలుపై నుంచుని, తల కదలించకుండా ఆరతి ఇచ్చేవాడు. 19.01.1912న తెల్లవారుజామున 4 గంటలకు మేఘుడు చనిపోయాడు. మూడు రోజుల ముందు మేఘుడు ఆరతి ఇస్తుంటే ఇదే మేఘుని చివరి ఆరతి అని బాబా చెప్పారు.

17.01.1912న కాకడ ఆరతి బాపుసాహేబ్ జోగ్ ఇచ్చాడు.

18.01.1912న మధ్యాహ్న ఆరతి సీతారామ్ ఇచ్చాడు. అదేరోజు శేజ ఆరతి కూడా సీతారామ్ ఇచ్చాడు.

3.    19.01.1912న కాకడ ఆరతి బాపుసాహేబ్ జోగ్ ఇచ్చాడు. ఆరోజు జోగ్ ఆరతి ఇవ్వటం ప్రారంభించి బాబా         దేహనంతరం వరకు ఇతనే ఆరతులు ఇస్తూ ఉండేవాడు.

4.   బాబా 15.10.1918 మంగళవారం దేహత్యాగం చేసిరి. బుధవారం ఉదయం షిర్డీ నివాసి శ్యామా మేనమామయగు లక్ష్మణమామాజోషి కి బాబా స్వప్న దర్శనమిచ్చి చేయిపట్టుకొని లాగి “త్వరగా లెమ్ము జోగ్ నేను మరణించానని అనుకుంటున్నాడు. అందుకే ఆరతి ఇవ్వడానికి రాదు. అందువలన నీవు వచ్చి పూజచేసి కాకడ అరతినిమ్ము” అని చెప్పిరి. వెంటనే లక్ష్మణమామాజోషి బాబా చెప్పినట్లు పూజ ద్రవ్యములతో మశీదుకు వచ్చి అక్కడ ఎవరు అడ్డు చెప్పిన లెక్కించక బాబా దేహానికి పూజ, ఆరతి చేసినాడు. ఆరోజు మధ్యాహ్న ఆరతి ఎప్పటి వలె జోగ్ పూజ ద్రవ్యములతో అందరితో కలిసి వచ్చి ఆరతి ఇచ్చినాడు.

ఇచ్చట గుర్తించవలసినది ఏమిటంటే, ఆయన తన దేహం త్యజించుట వలన తమ అవతార సమాప్తి కాదని అది ఇంకా కొనసాగించబడుచునే ఉన్నాడని, అరతులను ఆపవలసిన పని లేదని గుర్తింపు చేసి ఆచటి వారి అనుమానములను తొలగించిరి.

బాబా దేహదారిగా ఉన్నంతవరకు ద్వారకామాయిలో మధ్యాహ్న ఆరతి ఒక్కటే జరుగుచుండేడిది. ముందుగా మశీదులో గంట మ్రోగేడిది. అప్పుడు భక్తులందరూ మశీదులో చేరేడివారు మొదటగా బాబాను గంధాక్షతలతో పుజించేడివారు. బాబా తమ ఆసనంపై చిలుం గొట్టంతో కూర్చొని యుండేడివారు. మశీదు లోపల స్త్రీలు నిలిచి యుండేడివారు. పురుషులు మశీదు ముందు ఖాళీ స్థలంలో నిలిచేడివారు. అప్పుడు జోగ్ బాబా ఎదుట నిల్చుని భక్తీ ప్రపత్తులతో కుడి చేతిలో ఐదు వత్తుల అరతిని పట్టుకొని ఆరతి ఇచ్చుచు, ఎడమ చేతిలో ఒక గంటను పట్టుకొని మ్రోగించు చుండేడివాడు. ఆరతి పాటలను పాల్గొన్న భక్తులందరూ పెద్దగా క్రమపద్దతిలో కలిసి పాడెడివారు. ఆరతి పూర్తీ అగు సమయమున పాల్గొన్న వారందరూ ఉచ్చ స్వరంతో “శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహారాజ్ కీ జై” అని ఎలుగెత్తి చాటేవారు. చివరిగా జోగ్ బాబాకు కర్పూర ఆరతి ఇచ్చి బాబాకు పటిక బెల్లమును నైవేద్యంగా పెట్టేవారు. బాబా చేయి చాపగా జోగ్ ఆ పటిక బెల్లంలో కొంత భాగం బాబా చేతిలో పెట్టి, మిగిలినది అచట ఉన్న వారందరికి ప్రసాదముగా పంచి పెట్టవాడు.

మధ్యహ్న ఆరతి అయిన పిమ్మట బాబా మశీదు బయటకు వచ్చి మశీదు ముందు గోడ ప్రక్కన నిలబడి ప్రేమతో భక్తులకు ఊధి ప్రసాదము పంచి పెట్టేడివారు. బాబా భక్తుల చేతులలో పిడికెళ్ళతో ఊధి పోయుచు, వారి నుదుట తమ చేతులతో ఊధి ని పెట్టిడివారు. “అన్నా! మధ్యాహ్న భోజనమునకు పొమ్ము!”, “బాబా! బసకుపో!” “బాపూ! భోజనము చేయుము” అని ప్రతి భక్తుని సాయి ఆదరముతో పలుకరించి ఇంటికి పంపేవారు. బాబా గోడ పక్కన నిల్చున్న స్థానములో ఇప్పుడు గుర్తుగా క్రింద మరియు 4 అడుగుల ఎత్తుగా గోడ కట్టి ఆగోడపై చిన్న బాబా పాదుకలు భక్తులు నమస్కరించుకోవడానికి అనువుగా అమర్చారు.

ఈ మధ్యాహ్న ఆరతి జరుగుచున్నప్పుడు మశీదు ముందు ఇప్పుడు కూర్మ చిహ్నం ఉన్న చోట అందంగా అలంకరించబడిన శ్యామ కర్ణ గుఱ్ఱం కాళ్ళకు గజ్జలతో నిలబడి ఆరతి పాటకు అనుగుణంగా లయానుసారముగా శిరస్సు నూపుచు కాళ్ళను అడించేడిది. ఆరతి పూర్తీ కాగానే ద్వారకామాయి మెట్లపై తన ముందు కళ్ళు యుంచి బాబాకు వంగి నమస్కరించేది. బాబా ముందుగా దాని నొసటన ఊధి పెట్టి దీవించిన తరువాతనే ఇతరులకు బాబా ఊధి ఇచ్చేవారు. ఈవిధంగా అప్పటి ఆరతులు జరుగుచుండేవి. దీనిని గురించి చదువుతుంటేనే ఒళ్ళు గగుర్పోడుచుచుంటే అప్పుడు అందులో పాల్గొన్న భక్తుల ఆనందం వర్ణనాతీతము కదా!

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo