ఈ భాగంలో అనుభవం:
- బాబా తమ భక్తుల కష్టాలు తీరుస్తారన్నది నిజం
సాయిబందువులకి నమస్కారం. నా పేరు భవాని. కొన్నిరోజుల క్రితం మావారికి చాలా దగ్గు వచ్చి చాలా ఇబ్బందిపడ్డారు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఏమైనా తిన్నా, తాగినా కూడా దగ్గు బాగా ఎక్కువగా వచ్చేది. అప్పుడు మేము ఈఎన్టి డాక్టర్ దగ్గరకి వెళితే, ఆయన కొన్ని మందులిచ్చి, "వీటిని వాడండి. తగ్గకపోతే కొన్ని టెస్టులు చేయాలి" అన్నారు. ఆ మందులు వాడినా దగ్గు తగ్గలేదు. దాంతో డాక్టర్ CT స్కాన్ చేయించమన్నారు. స్కాన్లో ఏ సమస్యా లేదని వచ్చింది. కానీ మావారికి దగ్గు తగ్గలేదు అదీకాక మావారికి ఛాతీ నొప్పి కూడా వచ్చింది. డాక్టర్, "పల్మనాలజిస్ట్కి చూపించండి. ఊపిరితిత్తుల సమస్య ఉండి ఉంటుంది" అన్నారు. అప్పుడు నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, కోవిడ్ సెకండ్ వేవ్లో మావారికి కోవిడ్ అటాక్ అయి బాగా సీరియస్ అయింది. ఒక వారం హాస్పిటల్లోనే ఉన్నారు. దాని ప్రభావమేమోనని నాకు చాలా భయమేసి, "బాబా! మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆయనకి దగ్గు తగ్గాలి" అని బాబాతో చెప్పుకున్నాను. డాక్టర్ ఒక వారానికి మందులిచ్చి, ఇది వాడండి. ఊపిరితిత్తుల సమస్యలా లేదు కానీ, ఒక వారంలో తగ్గకపోతే పరీక్షలు చేద్దాం" అని అన్నారు. ఆ మందులు వాడినా తగ్గలేదు. పైగా ఇంకా ఎక్కువ ఐపోయింది. అప్పటికి దగ్గు చాలా ఎక్కువగా వస్తు రెండు నెలలు అయింది. నేను, "ఏంటి బాబా, ఇలా చేస్తున్నారు?" అని బాధపడ్డాను. హఠాత్తుగా మావారు "నేను ఈ మందులు వాడను. దగ్గు తగ్గకపోయిన పర్లేదు. నేను ఈ మందులు వాడలేకపోతున్నాను" అని మందులు వాడటం మానేశారు. రెండు రోజుల్లో మందులు వాడకుండానే మావారికి దగ్గు తగ్గి, మామూలు అయిపోయారు. అలా ఎలా తగ్గిందని మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పటికీ మావారు "అన్ని మందులు వాడినా తగ్గనిది మందులు వాడకుండా ఎలా తగ్గింది?" అని అంటుంటారు. అంతా బాబా దయ. "మీకు శతకోటి వందనాలు తండ్రీ".
మేము చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున నేను కూడా ఉద్యోగం చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. కానీ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. తెలుగు తప్పా వేరే భాష రాదు. కాబట్టి నేను ఏ ఉద్యోగం చేయలేననుకున్నాను. కానీ మన బాబా ఉన్నారు కదా! ఆయన్ని ఒక మాట అడుగుదామనుకొని, "బాబా! మీరు నిజంగా మా కష్టాలు విని తీరుస్తారనేది నిజమైతే, నాకొక ఉద్యోగం వచ్చేలా చేయగలరా?" అని అడిగాను. అలా అడిగిన తర్వాత బాబా చేయకుండా ఉంటారా! కానీ నేను మాత్రం నాకు ఉద్యోగం రాదని నిశ్చయానికి వచ్చేసాను. అందుకే నేను ఎక్కడా ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టలేదు. ఏ ప్రయత్నాలూ చేయలేదు. ఒక 5 రోజులు గడిచాయి. నేను 'నాకు ఉద్యోగం ఎందుకు వస్తుంది? నాకు తెలుగు తప్పా మరో భాష రాదు. పైగా ఎక్కడా ప్రయతించట్లేదు' అని అనుకున్నాను. అయితే ఒకరోజు ఉదయం మావారు గుడిలో నుండి నాకు ఫోన్ చేసారు. ఆయన గుడిలో వుండగా ఒక ఆమె వచ్చి గుడికి ఎదురుగా వున్నా బిల్డింగ్ చూపించి, "అందులో కొత్తగా స్కూల్ ఓపెన్ చేసాము. మీకు ఎవరైనా తెలిసినవాళ్ళు వుంటే చెప్పండి" అని అన్నారట. మావారు ఆమెతో నా శ్రీమతి ఎమ్.కామ్ చేసింది అని చెప్పారట. అప్పుడు ఆమె, ఆమెని తీసుకొని మధ్యాహ్నం రండి అని చెప్పి ఆమె ఫోన్ నెంబర్ మావారికి ఇచ్చి, మావారి నెంబర్ ఆమె తీసుకున్నారట. ఆ వివరాలు అన్నీ మావారు నాకు చెప్పారు. ఆరోజు మధ్యాహ్నం ఆమెనే కాల్ చేసి, "వస్తున్నారా?" అని అడిగారు. అప్పుడు మేము వెళ్లి ఆమెని కలిసాం. నేను ఆమెతో "నాకు ఏమీ రాదు. నాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది" అని చెప్పాను. ఆమె "మరేం పర్వాలేదు. నేను చూసుకుంటాను. మీరు వచ్చి ఉద్యోగంలో చేరండి" అని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఆ ఉద్యోగంలో వెంటనే చేరలేదు. తర్వాత వేరేవాళ్లు అకౌంటెంట్గా జాయిన్ అయ్యారని నాకు తెలిసింది. దాంతో నేను ఇంకా నాకు ఉద్యోగం రాదులే అని వదిలేశాను. 15రోజులు తర్వాత ప్రిన్సిపాల్ మేడం కాల్ చేసి, "ఇంకా రాలేదు ఏంటి?" అని అడిగారు. నేను, "మేడం! మీరు వేరేవాళ్లకి జాబ్ ఇచ్చారని ఎవరో చెప్పారు" అని అంటే, "లేదు. అది మీ ఉద్యోగం. మీకోసం మాత్రేమే, వచ్చి జాయిన్ అవ్వండి" అని అన్నారు. నేను షాకయ్యాను. ఇంకా విచిత్రమేమిటంటే, ప్రిన్సిపాల్ మేడం తర్వాత అత్యధిక జీతం నాదే. ఇప్పుడు ఆ స్కూల్లో సెకండ్ హయ్యర్ అధారిటీ నేనే. నాకు ఏదైన సమస్య ఉంటే ప్రిన్సిపాల్ మేడమే చూసుకుంటున్నారు. ఆమెనే నాకు అన్నీ నేర్పుతున్నారు. ఇంకో విషయమేమిటంటే, నా తర్వాత ఉద్యోగంలో చేరిన వాళ్లందరికీ జీతాలు తక్కువ, పైగా కమ్యూనికేషన్ తప్పనిసరి. ఒకరోజు నేను ప్రిన్సిపాల్ మేడంని, "నాలో ఏం ప్రత్యేకత ఉంది. నాకు ఉద్యోగం ఇచ్చారు" అని అడిగాను. అందుకామె, "ఏమో నాకు తెలియదు. మిమ్మల్ని చూడగానే ఈ ఉద్యోగం మీదే అనిపించింది" అని అన్నారు. ఆమె నేను ఆ ఉద్యోగంలో చేరే లోపు ఒక 10, 15 సార్లు నాకు ఫోన్ చేసారు. ఒక నెల రోజులు వేచి చూసారు. నాకు తర్వాత తెలిసింది ఏమిటంటే, ఆ ఉద్యోగం కోసం చాలామంది వచ్చారని, వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అనుభవం ఉన్న కూడా వాళ్లలో ఎవరికీ ఆ ఉద్యోగం ఇవ్వాలనిపించలేదని, ఆ విషయమై ఎందుకో నాకు కూడా తెలీదంటారు మేడం. నాకు మాత్రం ఇదంతా బాబా దయ అని అర్దమైంది. "బాబా! మీరు ఉన్నారు. మా కష్టాలు వింటున్నారు, పరిష్కారం చూపిస్తున్నారని అర్దమైంది. చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఇన్ని చేసిన బాబా ఒక విషయంలో మాత్రం నన్ను బాధపెట్టారు. నేను రోజూ మా నాన్నతో ఫోన్లో మాట్లాడతాను. ఒక్కరోజు మాట్లాడకపోయినా ఫోన్ చేసి నువ్వు నాతో ఈరోజు మాట్లాడలేదని చిన్నపిల్లాడిలా అలుగుతారు నాన్న. ఇంట్లో జరిగే ఏదన్నా ఫంక్షన్కి వెళ్లకపోతే ఫోన్ చేసి, 'నీకు నేను అంటే ఇష్టం లేదా? నన్ను చూడటానికి రావా?' అని కోప్పడతారు. అలాంటిది మా వూరి గుడిలో అమ్మవారి ప్రతిష్ట కోసం మా అత్తయ్యలు అందరూ వస్తుంటే నాన్న నాకు ఫోన్ చేసి, 'ఇప్పుడు నువ్వు రాకు. నువ్వు, పిల్లలు ఇబ్బందిపడతారు. వేసవి సెలవుల్లో వచ్చి నా దగ్గర ఒక నెల రోజులు వుండాలి' అని అన్నారు. నేను సరేనన్నాను. తర్వాత నాన్న గుడి కార్యక్రమాల్లో బిజీగా ఉండి నాకు ఫోన్ చేయలేదు. నేను చేస్తే లిఫ్ట్ చేసి, "బిజీగా ఉన్నాను" అని 4 రోజులు నాతో మాట్లాడలేదు. నా పెళ్ళైన తర్వాత 10 ఏళ్లలో నాన్న ఎప్పుడూ నాతో మాట్లాడకుండా అన్నిరోజులు ఉండలేదు. తర్వాత రోజు ఉదయం నాన్నకి జ్వరం వస్తే, ఇంజక్షన్ చేసారు. తర్వాత నాన్న నీరసంగా ఉందంటే డాక్టరు సెలైన్ పెట్టారు. అప్పుడు నాన్న పడుకొని మాట్లాడుతూ ఉంటే అమ్మ, "అమ్మాయికి ఫోన్ చేయనా? మాట్లాడతారా" అని అడిగితే, "వద్దు. నేను నీరసంగా మాట్లాడితే అది కనిపెట్టేస్తుంది, కంగారుపడుతుంది. నాకేమీ లేదు కదా! నీరసం అంతే! రేపు ఉదయం మాట్లాడతాను" అని అన్నారట. అలా అన్న కాసేపటికి ఎక్కిళ్లు వచ్చినట్టు అయి నాన్న 63 సంవత్సరాలకే చనిపోయారు. డాక్టరు కార్డియాక్ అరెస్ట్(గుండె ఆగిపోయింది) అని అన్నారు. నాన్న చివరి 5 రోజులు నాతో మాట్లాడలేదు. అందుకు ఆరోజు నేను ఎంతో ఏడ్చి, "నిన్ను ఇంత నమ్మాను. ఎందుకిలా చేసారు బాబా" అని అనుకున్నాను. కొన్ని రోజులకి ఫేస్బుక్లో "అతని ఆయుస్సు తీరిపోయింది. నేనేమి చెయ్యగలను?' అని బాబా సందేశం వచ్చింది. కానీ అది నాకు ఇప్పటికీ తీరని బాధ. అందువల్ల ఒకసారి "బాబా! నేను ప్రతిష్టకు వెళ్లుంటే మా నాన్నని కలిసేదాన్ని, మాట్లాడేదాన్ని. నాకు ఆ అవకాశం లేకుండా పోయింద"ని అని అనుకున్నాను. తర్వాత నాకు మరో బాబా సందేశం వచ్చింది, "నేను నీ తండ్రిని. ఇక్కడే వున్నాను. ఎందుకు అంత బాధపడుతున్నావు?" అని. అప్పుడు, "బాబా! నా తండ్రి ఎక్కడ వున్నా బాగుండాలి. ఇక నుండి మీరే నా తండ్రి" అని అనుకున్నాను.
సమర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.

