సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1875వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • అడుగడుగునా అండగా ఉంటూ క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా

నేను సాయికి అనన్య భక్తురాలిని. ఆయన పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టుగా నన్ను తమ చెంతకు లాక్కున్నారు. సుమారు 30 సంవత్సరాలగా మేము సాయి ఆరాధనలో ఉన్నాము. మాకు చిన్న, పెద్ద ఏ కష్టమొచ్చినా సాయికి చెప్పుకుంటాం. ఆయన దాన్ని చిటికలో పరిష్కరిస్తారు. ఆయన మాదాకా సమస్యను రానివ్వరు. ఒకవేళ వచ్చినా ఆయనే తీర్చేస్తారు. అలా మా జీవితాన్ని ఆయనే నడిపిస్తున్నారు. ఒక కుటుంబ పెద్దలాగా మమ్మల్ని కంటికిరెప్పలా చూసుకుంటున్నారు. 2024, మే 14న మేము తిరుపతి వెళ్ళాము. అప్పుడు మాకు ఆర్ఏసీ టిక్కెట్లు వచ్చాయి. ఆర్ఏసీ అంటే అందరికీ తెలిసిందే కదా! ఒక బెర్త్ ఇద్దరికి ఇస్తారు. అందువల్ల ట్రైన్ ఎక్కాక గుంటూరు నుండి తిరుపతి వెళ్లేసరికి మేము చాలా ఇబ్బందిపడాల్సి వస్తుందని గ్రహించాము. కానీ ఏం చేయడానికి పాలు పోలేదు. ఆ విషయం అలా ఉంచితే నేను టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు మా చెల్లి పేరు, మా మేనత్త పేరు తప్పుగా పడ్డాయి. కుమారి అని ఉండాల్సి ఉండగా కుమార్ అనే పడింది. అది టీసీ గమనించి, "వెంటనే ఆధారాలు చూపించండి. లేకపోతే మీరు ట్రైన్ దిగిపోవాల్సి వస్తుంది" అని చాలా కటువుగా మాట్లాడింది. మాకు చాలా భయమేసింది. నేను వెంటనే సాయిని [ప్రార్థించి ఆధార్ కార్డు చూపించాను. టీసీ ముఖం కాస్త చిరాగ్గా పెట్టినప్పటికీ బాబా దయవల్ల ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయింది.

 

ఇకపోతే, నా ఆరోగ్యం కాస్త బాగోకపోవడం వలన మా చెల్లి నన్ను పడుకోమని తను అర్థరాత్రి వరకు అలానే కూర్చుంది. నేను పడుకున్నానన్న మాటేగాని అస్సలు నిద్రపట్టలేదు. చెల్లి అలానే కూర్చొని అలిసిపోతుందని మనసులో ఒకటే బాధ. అందువల్ల ఆ అర్థరాత్రి సాయికి మొరపెట్టుకోవటం మొదలుపెట్టాను. ఆ వెంటనే టీసీ వచ్చి, "ఒక సీట్ ఖాళీ అయింది. మీరు ఇక్కడ పడుకోండి" అని మా చెల్లితో చెప్పి వెళ్ళింది. అలా రెండు క్లిష్టకరమైన పరిస్థితుల నుంచి సాయి మమ్మల్ని బయటపడేశారు. అయితే తిరుపతి చేరుకున్నాక మాకు మరో కఠిన పరిస్థితి ఎదురైంది. తిరుమలలో జనం తండోపతండాలుగా ఉన్నారు. ఎక్కడపడితే అక్కడ క్యూలైన్లు నిలిచిపోయి ఉన్నాయి. అది చూసి మాకు కాళ్ళుచేతులు ఆడలేదు. అయినా క్యూలైన్‌లోకి వెళ్లి ఎంతో కష్టపడి నడకసాగిస్తే సరిగ్గా రాత్రి 9:30 ప్రాంతంలో క్యూలైన్ సుమారు రెండు గంటలపాటు ఆపేసారు. నేను పేరుకి ఉన్నదే తిరుమలలోనే అయినా సాయికి మొరపెట్టుకుంటూ ఉన్నాను. ఎందుకంటే, మాతోపాటు పెద్దవాళ్ళు వచ్చారు. భయంకరమైన ఎండలకు వాళ్లంతా ఆ క్యూలైన్లో అంత దూరం నడిచేసరికి అనారోగ్యానికి గురయ్యారు. అందరూ బాగా నీరసించిపోయారు. ఎవరికీ ఒంట్లో శక్తి లేదు. ఇలా ఉండగా మరో ఐదు నిమిషాలలో క్యూలైన్ కదులుతుందనగా అంత జనంలో నా ముందు సుమారు 7, 8 అడుగుల ఎత్తులో సాయి ద్వారకామాయి ఫోటో ఒక సెకనుపాటు కనిపించి మాయమైంది. నేను షాకయ్యాను. తిరుపతికి బయలుదేరి ముందు సాయి "నువ్వు ఎక్కడ ఉంటే, నేను అక్కడే ఉంటాను" అని సందేశమిచ్చారు. అలాగే తిరుమలలో దర్శనమిచ్చి తమ మాట నిలబెట్టుకున్నారు. సరే, కాసేపట్లో క్యూలైన్ కదిలింది. అది చాలా వేగంగా కదులుతూ మేము వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అడుగుపెట్టాము. అక్కడ ఒక బోర్డు మీద రెండు రోజుల తర్వాత దర్శనమని వ్రాసుంది. అది చూసి నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, మా అత్తయ్య టాబ్లెట్లు తెచ్చుకోవడం మరిచిపోయారు. పాస్ తీసుకొని బయటికి వెళ్లి టాబ్లెట్లు తీసుకొని వద్దామంటే అందరి ఓపిక అయిపోయింది. ఇప్పుడు ఎలా? ఏంటి? అని ఆందోళనపడుతూ మళ్ళీ సాయి జపం మొదలుపెట్టాను. కొద్దిసేపట్లో మళ్ళీ సాయి ద్వారకామాయి ఫోటో నా కంటపడింది. అంతే, ఇంకొద్దిసేపట్లో దర్శనానికి గేట్లు తెరిచారు. బాబా దయవల్ల సరిగా  12 గంటలపాటు క్యూలైన్‌లో నడిచాక మరే ఆటంకాలు లేకుండా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. తర్వాత సరిగా ఆహారం, నిద్రలేకపోవడం వల్ల నాకు బాగా నీరసమొచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను. దాంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. బాబా దయవల్ల ఏమీ కాలేదు. నిజానికి మేము మొదట చీటిల ద్వారా అడిగినప్పుడు సాయి మమ్మల్ని మే నెలలో తిరుపతి వెళ్ళొద్దని హెచ్చరించారు. కానీ మేము మా చుట్టాల మాటలు పట్టుకొని తిరుమలలో దర్శనం టికెట్లు బుక్ చేసుకోకుండా దర్శనానికి వెళ్లి ఇలా ఇబ్బందిపడ్డాం. అయినప్పటికీ బాబానే అడుగడుగునా అండగా ఉంటూ మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు.


మా ఇంట్లో ఎవరికైనా ఏదైనా అనారోగ్యం చేస్తే మా చేతులు టాబ్లెట్ల బాక్స్ దగ్గరకు వెళ్ళవు, ఊదీ దగ్గరికి వెళ్తాయి. ఎందుకంటే, ఊదీ సర్వరోగ నివారిణి. ఒకసారి నాకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. అప్పుడు టాబ్లెట్ వేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. చిటికెడు ఊదీ నోట్లో వేసుకుని, కొంచెం కడుపుకు రాసుకున్నాను. నిమిషాల్లో కడుపునొప్పి మాయమైంది. దానికన్న ముందు మా బాబాయి కళ్ళు బాగా ఎర్రబడిపోయి జ్వరమొచ్చినట్లు ఆయన ఒళ్లంతా బాగా కాలిపోతుంటే మా చెల్లి ఊదీ నీళ్లలో కలిపి ఇచ్చింది. అప్పటిదాకా వాడిపోయిన ఆయన ముఖం, వెచ్చబడిన శరీరం ముములుగా అయిపోయి కొన్ని గంటల్లోనే లేచి హుషారుగా తిరిగారు. అది చూసి మేము ఆశ్చర్యానికి గురయ్యాము. ఇలా ప్రతిసారీ సాయి మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. సాయితో ఇన్ని సంవత్సరాలు ప్రయాణించిన మాకు 'ఎన్నో వేల కోట్లమంది భక్తుల్ని పరిపాలించే ఆయన మన ఇంట్లో చిన్న సమస్యను కూడా ఎలా గుర్తించి నయం చేస్తున్నారో!' అనే విషయం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo