ఈ భాగంలో అనుభవాలు:
1. శ్రీసాయి కృప
2. శిరిడీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించిన బాబా
3. అవే టిక్కెట్ల మీద ప్రయాణానికి అనుమతించేలా దయచూపిన బాబా
శ్రీసాయి కృప
శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. సాయిబంధువులకు వందనం. నా పేరు విజయశ్రీ. బాబా ప్రతి విషయంలో నాకు తోడుగా వుంటూ ముందుకు నడిపిస్తున్నారు. ఒకసారి మా బాబుకి శ్వాస తీసుకోవడం కష్టం అయింది. బాబుని డాక్టర్ దగ్గరకి తీసుకొని వెళ్తే, డాక్టర్ చెక్ చేసి, "ముక్కులో కండపెరుగుతుంది. మందుల ద్వారా తగ్గుంతుందేమో చూద్దామ"ని మందులు వ్రాసిచ్చారు. కానీ ఎన్ని రోజులు ఆ మందులు వాడినా బాబుకి తగ్గలేదు. అప్పుడు మేము బాబాను ఆశ్రయించి, "బాబుకి తగ్గేలా చూడు తండ్రి" అని వేడుకున్నాను. తర్వాత డాక్టర్లు చెక్ చేసి, ఆపరేషన్ చేయాలంటే, కొన్నిరోజుల తర్వాత ఆపరేషన్ చేయించాము. బాబా దయవల్ల బాబు ఇప్పుడు మంచిగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు. "ధన్యవదాలు సాయితండ్రీ".
ఒకసారి నాకు లోబీపీ వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. డాక్టర్లు, "MRI స్కాన్ చేయాలి. ఆపరేషన్ చేయాల్సి వస్తుంది" అన్నారు. నేను బాబాను, "తండ్రీ! నాకు ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గించు" అని ప్రార్థించాను. బాబా దయవల్ల డాక్టర్ స్కాన్ చేసి, "ఆపరేషన్ అక్కరలేదు. మందుల ద్వారా తగ్గుతుంది" అని చెప్పి మందులు వ్రాసిచ్చారు. "ధన్యవాదాలు సాయితండ్రి. మీ కృప ఎప్పుడూ మా మీద వుండాలని కోరుకుంటున్నాను తండ్రీ".
శిరిడీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించిన బాబా
ఓం సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. నా పేరు శ్రీలక్ష్మీ. మాది విజయవాడ. నేను నాకు ఊహ తెలిసినప్పటినుంచి బాబా గుడికి, భజనలకు వెళ్తుండేదాన్ని. అప్పట్లో టీ, రొట్టెల మీద బాబా దివ్య రూప దర్శనమయ్యేది. నేను కూడా ఒక భక్తురాలి ఇంట్లో రొట్టె మీద బాబాను దర్శించాను. మా ఇంటి దగ్గర్లో ఉన్న ఒక చిన్నపాప ఒంటిపైకి బాబా ప్రతి గురువారం వచ్చేవారు. ఒకసారి మేము అక్కడికి వెళ్ళి, "బాబా! శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. ఎప్పుడు రమ్మంటారు?" అని అడిగితే, "శిరిడీనా! ఎందుకు? వద్దు" అన్నారు. మేము, "మీ దర్శనం చేసుకోవాలి, వస్తాం" అని అంటే, "సరే, వస్తావా? రా. ఎలా వస్తావో, నేను చూస్తాను" అని అన్నారు బాబా. ఇది జరిగిన 15, 20 రోజుల తర్వాత మేం అనుకోకుండా మహారాష్ట్రలో ఉన్న మా పెద్దమ్మ వాళ్ళింటికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాము. అప్పుడు మా పెద్దమ్మ, "ఇక్కడిదాకా వచ్చారు కదా! శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోండి" అని చెప్పింది. అప్పటివరకు శిరిడీ వెళ్లాలన్న విషయమే మాకు గుర్తు లేదు. బాబానే మా పెద్దమ్మ ద్వారా గుర్తు చేసి మరీ తమ దగ్గరకు రప్పించుకొని తమ దర్శన భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. ఆ తండ్రికి వేల కోటి ప్రణామాలు. ఇది జరిగి 30 సంవత్సరాలవుతుంది. అయినా రద్దీ లేని ప్రశాంతమైన ఆ దివ్య దర్శనం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి అది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
అవే టిక్కెట్ల మీద ప్రయాణానికి అనుమతించేలా దయచూపిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. సాయిబాబా నాకు అనేకసార్లు అభయమిచ్చి ఆదుకున్నారు. పెద్ద-చిన్న అని తేడా లేకుండా ప్రతి సమస్యకు నేను వారినే ఆశ్రయిస్తాను. ఆయన చాలాసార్లు అనుగ్రహిస్తారు. అంతెందుకు ఏ భగవత్ స్వరూపాన్ని చూసినా నా నోట పలికేది, మనసున మెదిలేది 'బాబా' అన్న పదమే. 2024, జూలై 24 తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి నేను, మా కోడలు, మనుమరాలు కలసి చికాగోకు లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్లో ప్రయాణమయ్యాం. ఫ్రాంక్ఫర్ట్లో దిగి చికాగోకి వేరే ఫ్లైట్ తీసుకోవాల్సి ఉండగా హైదరాబాద్ నుండి ఫ్రాంక్ఫర్ట్ వెళ్లి ఫ్లైట్ ఆలస్యమైంది. అదీకాక సెక్యూరిటీ చెక్లో కూడా ఆలస్యమైంది. కాళ్ళనొప్పుల వల్ల నేను ఎక్కువ దూరం నడవలేను. వీల్ చైర్ బుక్ చేసుకున్నాను. కానీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్ పోర్ట్లో వీల్ చైర్ సకాలంలో అందకపోవడంతో చికాగో ఫ్లైట్ మిస్ అయ్యాం. అటువంటి క్లిష్ట పరిస్థితిలో బాబాని బాగా ప్రార్ధించుకున్నాను. మొదట, "మేము ఏమి చేయలేము. ఆలస్యానికి, ఫ్లైట్ మిస్ అవడానికి మేము బాధ్యులం కాము" అన్న ఎయిర్లైన్స్వాళ్ళు మర్నాటి ఫ్లైట్కి అవే టికెట్ల మీద అనుమతించారు. నేను ఇది బాబా దయగా భావిస్తూ వారికి ప్రణమిల్లుతున్నాను. "బాబా! నీ మహిమ అద్భుతం, అనంతం".
