1. ముందుగా నెలసరి వచ్చేలా దయచూపిన బాబా
2. గొంతునొప్పి తగ్గించిన బాబా
3. విపత్కర పరిస్థితిలో లభించిన బాబా సహాయం
ముందుగా నెలసరి వచ్చేలా దయచూపిన బాబా
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మన సాయితండ్రిని నమ్ముకుంటే అడుగడుగునా అద్భుతం చూపిస్తారని మన అందరికీ తెలిసిందే! అలాంటివి నాకు ఎన్నో జరిగాయి. మేము 2024, ఆగష్టు 14 & 15 తేదీల్లో కాశీ, అయోధ్య వెళదామని ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. అయితే 17వ తేదికి నా నెలసరి సమయం. ఒకవేళ అది రాకుండా ఉండాలంటే నేను 5 రోజులు టాబ్లెట్లు వాడాలి. ఇటువంటి పరిస్థితిలో నేను అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసే బాబాని తలుచుకొని, "నాకు నెలసరి ముందే వచ్చేలా చేసి టాబ్లెట్ వేసుకోకుండా చూడండి" అని చెప్పుకొని ఆయనకే వదిలేసాను. బాబా నా మాటలు విన్నారు. 11వ తేదీనే నాకు నెలసరి వచ్చింది. దాంతో 15వ తేదికి 5 రోజులు అయిపోతాయి కాబట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చని సంతోషించాను. అంతా బాబా దయ. ఆయనకి మనం సర్వస్యశరణాగతి చెందితే చాలు అన్నీ ఆయనే చూసుకుంటారు.
గొంతునొప్పి తగ్గించిన బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. నా జీవితంలో బాబా తప్ప ఎవరూ లేరు. నేను ఆయన చెప్పిన కొన్ని విషయాలు పాటిస్తూ వారి స్మరణలో నా జీవితాన్ని సాగిస్తున్నాను. ఒకరోజు బయట నుంచి చికెన్ బిర్యానీ తెచ్చుకుని నేను, మా అమ్మ తిన్నాం. తినేటప్పుడు ఏమీ అనిపించలేదు కానీ, మింగుతున్నప్పుడు ఏదో చిన్న దుమ్ము లోపలికి వెళ్తున్నట్లు అనిపించింది. సరే, చిన్నదే కదా! ఏమి కాదు అనుకున్నాను. తర్వాత నీళ్లు తాగుతుంటే నా గొంతులో ఏదో అడ్డంగా ఉన్నట్లు అనిపించింది. మరుసటిరోజు గొంతు నొప్పిగా కూడా అనిపించింది. మూడు రోజులయ్యేసరికి గొంతు నొప్పి బాగా ఎక్కువైంది. అప్పుడు నేను, "నాకు గొంతు నొప్పి లేకుండా, అలాగే ఏమీ జరగకుండా చూడండి బాబా" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి మామూలుగా అనిపించింది. నాకు చాలా సంతోషమేసింది. గొంతునొప్పిని తగ్గించిన నా తల్లి, తండ్రి అయిన బాబాకి శతకోటి ధన్యవాదాలు. ఎప్పుడూ నాతో, అందరితో బాధల్లో వెన్నంటుండి సహాయాన్ని అందించమని బాబాను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
విపత్కర పరిస్థితిలో లభించిన బాబా సహాయం
సాయి చరణం సర్వభయ హరణం. నా పేరు జగదీశ్వర్, కరీంనగర్ నివాసిని. మా పెద్దమ్మాయి, అల్లుడు యూరప్లోని పోలాండ్ దేశంలో క్రకౌలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు.
2024, మేలో మా అల్లుడి రెసిడెన్షియల్ పర్మిషన్ కార్డు వాలిడిటీ అయిపోయింది.
రెన్యువల్ కోసం అప్లై చేస్తే, అప్రూవ్డ్ అని సమాచారమైతే ఇచ్చారు కానీ, కార్డు ఇవ్వలేదు. కార్డు లేకుంటే అత్యవసర పరిస్థితిలో ఇండియా వస్తే తిరిగి పోలాండ్ వెళ్ళడం చాలా చాలా కష్టం. ఇమ్మిగ్రేషన్లో అనుమతించరు. ఇటువంటి పరిస్థితిలో దురదృష్టం కొద్ది మా అల్లుడి తండ్రి ఆగస్టు 14, ఉదయం స్వర్గస్థులయ్యారు. విషయం తెలియగానే మా అల్లుడువాళ్ళు ఇండియా రావడానికి అందుబాటులో ఉన్న రాత్రి 8 గంటల ఫ్లైట్కి బుక్ చేసుకున్నారు. కానీ పోలాండ్ రెసిడెన్షియల్ పర్మిషన్ కార్డు లేనందున చాలా ఆందోళనపడుతున్నట్లు మా అమ్మాయి మాకు ఫోన్ చేసి చెప్పింది. నేను ఎటువంటి విపత్కర పరిస్థితిలోనైనా అండగా నిలిచి ఆదుకొనే బాబాని మనస్ఫూర్తిగా, "ఎలాంటి సమస్య రాకుండా కాపాడమ"ని వేడుకున్నాను. అదే సమయంలో క్రకౌలో మా పెద్దమ్మాయి, అల్లుడు సంబంధిత కార్యాలయానికి వెళ్లి విషయం అంతా వివరించారు. వాళ్ళు వెంటనే స్పందించి మధ్యాహ్నం 2 గంటలకి వస్తే, కార్డు ఇస్తామన్నారు. చెప్పినట్టుగానే 2 గంటలకి కార్డు ఇచ్చారు కూడా. ఆ విషయం తెలిసి నేను పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. వాళ్ళు కార్డు తీసుకొని రాత్రి ఫ్లైట్కి బయలుదేరి ఆగస్టు 16 వేకువజామున హైదరాబాద్ చేరుకొని, మా వియ్యంకుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. విపత్కర పరిస్థితిలో బాబా అండగా ఉండి స్వాంతన చేకూర్చారు. బాబా సాయి చరణం. సర్వదా శరణం శరణం.
మా అల్లుడువాళ్ళు ఇండియా వచ్చిన 10 రోజుల తర్వాత మా మనవరాలికి కడుపునొప్పి, విపరీతమైన జ్వరం వచ్చాయి. నేను మా అమ్మాయిని పాపకి బాబా ఊదీ పెట్టమని చెప్పాను. తను అలాగే చేసింది. కానీ జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్లీ మళ్లీ వస్తుండేది. కరీంనగర్లో ఉన్న నేను మంగళవారంనాడు బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! రేపు సాయంత్రానికి మా మనవరాలి జ్వరం, కడుపునొప్పి తగ్గిపోవాలి. మా ఇంటికి దగ్గర్లో ఉన్న భాగ్యనగర్ సాయిబాబా గుడికి వెళ్లి 1,116/- దక్షిణ సమర్పించుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల మర్నాటికి పాప జ్వరం తగ్గి మామూలుగా అయింది. మరుసటిరోజు బాబా గుడికి వెళ్లి 1,116/- దక్షిణ హండిలో వేసి బాబాకి దణ్ణం పెట్టుకొని వచ్చాను.
సర్వం సాయిమయం.
