ఈ భాగంలో అనుభవం:
- బాబా దృష్టి మనపై ఎప్పుడూ ఉంటుంది
ఓం శ్రీసాయినాథాయ నమః. నా పేరు జగదీశ్వర్. 2024, అక్టోబర్ 5, ఉదయం 3.00 గంటలకు మా పెద్దమ్మాయి, అల్లుడు, మనవరాలు హైదరాబాద్ నుండి బయలుదేరి పోలాండ్లోని క్రకౌ వెళ్లారు. మరుసటిరోజు మా మనవరాలికి జ్వరం వచ్చి వీడియో కాల్లో పాప నిరుత్సాహంగా కనిపించింది. నేను వెంటనే కరీంనగర్లో మా ఇంటిలోని పూజ గదికి వెళ్లి బాబాకి దణ్ణం పెట్టుకొని, ఊదీ నా నుదుటిన రాసుకొని "జ్వరం తగ్గిపోవాల"ని వేడుకున్నాను. బాబా దయతో రెండు రోజుల్లో పాపకి జ్వరం తగ్గి ఎప్పటిలా ఉత్సాహంగా అయింది.
బాబా దృష్టి మనపై ఎప్పుడూ ఉంటుందని చెప్పడానికి ఒక సంఘటన చెప్తాను. మా చిన్నమ్మాయి చెన్నైలో మెడిసిన్ పీజీ 3వ సంవత్సరం చదువుతుంది. తనెప్పుడు కరీంనగర్లోని మా ఇంటికి వచ్చినా వరంగల్ వరకు ట్రైన్లో వచ్చి, అక్కడినుండి బస్సులో కరీంనగర్ వస్తుంది. తిరుగు ప్రయాణం మాత్రం పెద్దపల్లి వెళ్లి, అక్కడ సాయంత్రం 5 గంటలకు వచ్చే నవజీవన్ ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నై వెళ్తుంది. ఆ ట్రైన్ మర్నాడు ఉదయం 5:30కి చెన్నై చేరుతుంది కాబట్టి అమ్మాయి యూనివర్సిటీ హాస్పిటల్కి సమయానికి చేరుకునేందుకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మా అమ్మాయి 2024, అక్టోబర్ 10, గురువారం సాయంత్రం బయలుదేరి శుక్రవారం ఉదయం కరీంనగర్ వచ్చింది. దసరా పండగ అయిపోయిన తర్వాత 14వ తేదీ సోమవారం తను తిరిగి వెళ్ళలానుకుంది. ఎందుకంటే, తను మర్నాడు మంగళవారం ఉదయం 8 గంటలకల్లా హాస్పిటల్లో ఉండాలి. కానీ నవజీవన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ టిక్కెట్లు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ఆ ట్రైన్కి తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే, అది ఆదివారమే అహ్మదాబాద్లో బయలుదేరుతుంది. కాబట్టి శనివారమే టికెట్ బుక్ చేయాలి. అందుకని ఆరోజు ఉదయం 10కి తత్కాల్ థర్డ్ ఏసీ టికెట్ల బుకింగ్ ఓపెన్ అయ్యే సమయానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ అనుకోని కారణం వల్ల irctc సైట్ ఓపెన్ చేయడానికి రెండు నిమిషాలు ఆలస్యం అయింది. తీరా చూస్తే, తత్కాల్ టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. పోనీ స్లీపర్ క్లాస్ బుక్ చేద్దామంటే టికెట్ బుక్ అవ్వడం మరింత కష్టం. అందుకని తమిళనాడు ఎక్స్ప్రెస్కి చూస్తే థర్డ్ ఏసీ టిక్కెట్లు చాలా ఉన్నాయి. కానీ, ఆ ట్రైన్ ఎక్కాలంటే వరంగల్ వెళ్ళాలి. అయినా తప్పనిసరై ఆ ట్రైన్కి బుక్ చేసాను. తర్వాత సోమవారం వరంగల్లో అమ్మాయిని ట్రైన్ ఎక్కించాను. తను మర్నాడు ఉదయం హాస్పిటల్కి సమయానికి చేరుకుంది. ఇప్పుడు ఒక ముఖ్య విషయం చెప్తాను. ముందురోజు అమ్మాయిని ట్రైన్ ఎక్కించడానికి వరంగల్ వెళ్ళేటపుడు, 'వేర్ ఈజ్ మై ట్రైన్' యాప్లో నవజీవన్ ఎక్ష్ప్రెస్స్ రన్నింగ్ స్టేటస్ చూస్తే, దాదాపు ఆరున్నర గంటల ఆలస్యంగా నడుస్తుంది. ఆ ట్రైన్ మర్నాడు మధ్యాహ్నం 12:30కి చెన్నై చేరుకుంది. ఆ ట్రైన్ ఎక్కుంటే మా అమ్మాయి సమయానికి హాస్పిటల్కి వెళ్లలేకపోయేది. బాబా మనలను ఎంత నిశితంగా గమనిస్తుంటారో, రాబోయే ఇబ్బందిని ముందే గ్రహించి దాన్నుండి మనల్ని ఎలా కాపాడతారో ఇప్పుడు అందరికీ అర్థమైందనుకుంటాను.
నా భార్య చేతికి ఎప్పుడూ రెండు ఉంగరాలు ఉంటాయి. ఆమె అప్పుడప్పుడు ఆ రెండు ఉంగరాలు తీసి ఎక్కడో ఓ చోట పెడుతుంటుంది. అయితే ఆమెకి కొంచం మతిమరుపు ఉంది. ఆమె రెండు నెలల క్రితం ఒకరోజు రాత్రి ఆ రెండు ఉంగరాలు తీసి పడకగదిలో డ్రెస్సింగ్ టేబుల్కున్న అల్మారాలో పెట్టానని, తర్వాత చూస్తే, లక్ష్మీదేవి ఉంగరం లేదని చెప్పింది. దాంతో మేము ఇల్లంతా వెతికాము. కానీ ఆ ఉంగరం దొరకలేదు. ఇంకా నా భార్య, "ఇంట్లో పనిచేసే అతను తీసి ఉంటాడు" అని అంది. నేను, "చూడకుండా అలా అభాండాలు వేయొద్దు" అని చెప్పి, "ఉంగరం దొరికేలా అనుగ్రహించమ"ని బాబాని వేడుకున్నాను. కానీ ఉంగరం దొరకలేదు. రోజులు గడిచే కొద్దీ ఇంకా దొరుకుతుందన్న ఆశ లేకుండా పోయింది. చివరికి నేను కూడా పనిచేసే అతనే తీసుంటాడన్న నిర్ణయానికి వచ్చేసి అతన్ని అడిగితే, దేవుని మీద ఒట్టేసి తనకు తెలియదన్నాడు. ఇంక చేసేదిలేక కర్మ అని ఊరుకున్నాము. ఆ విషయం అలా ఉంచితే, 2024, అక్టోబర్ 26న మా తమ్ముడు గృహప్రవేశ కార్యక్రమం పెట్టుకున్నాడు. మేము 26న బయలుదేరి హైదరాబాద్ వెళ్లి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మర్నాడు 27వ తేదీ సాయంత్రం శిరిడీ వెళ్లదలచి ముందుగానే ట్రైన్ టిక్కెట్లు, ఆరతి టికెట్స్ బుక్ చేసుకున్నాము. 26వ తేదీన బయలుదేరే ముందు షాపులో పనివాళ్లకి డబ్బులు ఇవ్వడానికి నా భార్య తన డబ్బుల పర్స్ తెస్తే, రెండునె లల కిందట కనపడకుండా పోయిన లక్ష్మీదేవి ఉంగరం అందులో ఉంది. విచిత్రమేమిటంటే, ముందురోజు చిట్ డబ్బులు చెల్లించడానికి ఆ పర్సు తెరిచినప్పుడు ఆ ఉంగరం అందులో కనపడలేదు. శిరిడీ వెళ్లేందుకు బయలుదేరే ముందు దొరకడం నిజంగా బాబా మహిమ తప్ప వేరే ఏమీ కాదు. అన్యాయంగా పని మనిషి మీద అనుమానం పడినందుకు నాకు బాధేసి మనసులోనే అతనికి క్షమాపణ చెప్పుకొని, బాబాని క్షమించమని వేడుకున్నాను. బాబా దయవల్ల శిరిడీ దర్శనం చాలా బాగా అయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
2024, నవంబర్ నెల చివరిలో నా కుడిచేయి బొటనవేలు కొద్దిగా నొప్పి పెట్టడం మొదలైంది. నేను తగ్గిపోతుందిలే అనుకున్నాను. కానీ వారం రోజులకి నొప్పి ఎక్కువై 25వ తేదీన చూసుకుంటే, వాచినట్లు కొద్దిగా బుడిపెలా కనిపించింది. దాంతో నాకు భయమేసి ఆ వేలుని అలాగే గట్టిగా పట్టుకొని, "బాబా నొప్పి తగ్గించండి" అని బాబాను వేడుకున్నాను. నా ప్రార్థన ముగిసి ఒక్క క్షణం కూడా కాకముందే, బొడుపు కట్టిన ప్రాంతం నుండి కొద్దిగా చీము బయటకు వచ్చింది. నేను దాన్ని నీటితో కడిగి, అక్కడ బాబా ఊదీ రాసి, "మళ్ళీ చీము రావద్దు, నొప్పి రావద్దు బాబా" అని బాబాని వేడుకున్నాను. బాబా కరుణతో నొప్పి తగ్గిపోయి మామూలుగా అయింది. "ప్రణామాలు బాబా".
బాబా సాయి చరణం. సర్వదా శరణం శరణం.
